వయోవృద్ధుల కోసం ‘‘జీవన్’’ (జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్వర్క్) మొబైల అప్లికేషన్నూ, ‘‘శతాయు’’ (సీనియర్ హోలిస్టిక్ కేర్ అసిస్టెన్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ యువర్ యుటిలిటీ) వృద్ధుల ఆరోగ్య సంరక్షకుల డ్యాష్బోర్డునూ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
ఇది సాంకేతిక ఆధారిత సంరక్షణ సహకారంతో వృద్ధులకు భద్రత, సేవ, గౌరవం, సాధికారతను అందించడంతో పాటు వృద్ధుల ఆరోగ్య సేవల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చేపట్టిన చర్యను సూచిస్తుంది.
దేశవ్యాప్తంగా ఉన్న వృద్ధులకు తోడ్పాటును అందించే వ్యవస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఈ రోజు జీవన్ (జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్వర్క్) మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు. ఇది భారతదేశంలో ఉన్న సీనియర్ సిటిజన్లకు భద్రత, సంక్షేమం, ఆరోగ్య సేవలు, సామాజిక సమ్మిళిత్వాన్ని అందించే ఒక ప్రత్యేకమైన డిజిటల్ వేదిక.
ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అత్యవసర సహాయం, మద్దతు సేవలు, సామాజిక న్యాయం, సాధికారత విభాగం తోడ్పాటు అందిస్తున్న వృద్ధాశ్రమాలకు సంబంధించిన సమాచారంతో సహా సీనియర్ సిటిజన్ల అవసరాలు, సమస్యలను పరిష్కరించే అనేక సౌకర్యాలను ఈ యాప్ అందిస్తుంది. వృద్ధుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారు ఉపయోగించడానికి సులువుగా ఉండే ఇంటర్ఫేస్, సరళమైన నేవిగేషన్, ఫీచర్లతో దీనిని రూపొందించారు.
దేశవ్యాప్తంగా వృద్ధుల సంరక్షణ సేవలకు తోడ్పాటును అందించి వాటిని బలోపేతం చేయడానికి అభివృద్ధి చేసిన ‘‘శతాయు’’ (సీనియర్ హోలిస్టిక్ కేర్ అసిస్టెన్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ యువర్ యుటిలిటీ) అనే డ్యాష్ బోర్డును ‘‘క్రియేటింగ్ ఎ వెల్ ఫంక్షనింగ్ కేర్ ఎకానమీ’’ పేరుతో నిర్వహించిన జాతీయ వర్కుషాపులో ప్రారంభించారు.
వృద్ధులకు నిర్ధిష్టమైన జిల్లాలో, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వృద్ధుల ఆరోగ్య సంరక్షకుల సమాచారాన్ని అందించే ఫీచర్లు దీనిలో ఉన్నాయి.
సులభంగా వినియోగించుకోవడానికి, సేవలను సమర్థంగా అందించడానికి వీలుగా సరళమైన ఫీచర్లు, సులభమైన ఇంటర్ఫేస్తో ఈ వేదికను రూపొందించారు.
***