యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
20 MAY 2026 6:57PM by PIB Hyderabad
ఈ సంవత్సరం బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల్ని భారత్ నిర్వహిస్తున్న వేళ, ‘బ్రిక్స్ యూత్ కౌన్సిల్ అంత్రప్రన్యూర్షిప్ వర్కింగ్ గ్రూపు’ సమావేశం ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో కొనసాగుతోంది. ఈ సమావేశంలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు, విధాన రూపకర్తలు, బ్రిక్స్ దేశాలకు చెందిన ఆసక్తిదారులు కలిసి, ఔత్సాహిక పారిశ్రామికత్వ సహకారాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు నూతన ఆవిష్కరణలు చోదక శక్తిగా నిలిచే సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడంపై చర్చిస్తున్నారు.

‘‘ఆటుపోట్లకు తట్టుకొని నిలిచే ధీరత్వం, నూతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత్వాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణ ప్రక్రియ కొనసాగింపు’’ను ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని ఈ సమావేశాన్ని భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన యువజన వ్యవహారాల విభాగం నిర్వహిస్తోంది.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ కార్యక్రమంలో దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మంత్రి తన ప్రసంగంలో, బ్రిక్స్ దేశాలకు జనాభాపరంగా ఉన్న శక్తే రాబోయే కాలంలో అమలు చేయాల్సిన పనులకు నిర్దిష్ట రూపాన్ని ఇచ్చే దిశగా ఒక అవకాశాన్ని అందిస్తోందన్నారు.
శ్రీ మాండవియా మాట్లాడుతూ, ‘‘ప్రపంచ జనాభాలో దాదాపు సగం జనాభా మన బ్రిక్స్ దేశాల్లోనే నివసిస్తున్నారు. బ్రిక్స్లోని అనేక దేశాల జనాభాలో, 35 ఏళ్ల లోపు వయసు వారే సగానికి పైగా ఉన్నారు. ఒక్క భారత్లోనే ఇంచుమించు 65 శాతం జనాభా వయసు 35 ఏళ్ల లోపే ఉంది. జనాభా పరంగా ఉన్న ఈ శక్తి బ్రిక్స్ దేశాలకు భవిష్యత్తులో ఏయే పనులు పూర్తి చేసుకోవాలో నిర్ణయించుకోవడానికి ఒక అవకాశాన్ని అందిస్తోంది. బ్రిక్స్ దేశాలన్నింటా యువత ఇప్పటికే మార్పుల్ని తీసుకువస్తున్నారు’’ అని వివరించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, నైపుణ్యాల శిక్షణ, డిజిటల్ సేవలను అందరి చెంతకూ చేర్చడం, వాణిజ్య వ్యవస్థల సారథ్యంలో అభివృద్ధి సాధన పట్ల భారత్ దృష్టిని కేంద్రీకరిస్తూ ఉపాధి కల్పన అవకాశాల్ని విస్తరిస్తోందని శ్రీ మాండవియా తెలిపారు. ప్రపంచంలో చైతన్యం అత్యంత ఎక్కువ స్థాయిలో ఉట్టిపడుతున్న అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థను కూడా భారత్ ఆవిష్కరిస్తోందని మంత్రి అన్నారు.
‘‘స్థానిక నూతన ఆవిష్కరణల నుంచి ప్రపంచ వ్యాప్త ప్రభావాన్ని ఏర్పరిచే దిశగా.. యువత నేతృత్వంలో అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థ నిర్మాణానికి బ్రిక్స్ సహకారం’’ అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రిక్స్ దేశాలన్నీ పాల్గొని, ఔత్సాహిక పారిశ్రామికత్వ రంగంలో తమ అనుభవాల్నీ, తాము అమలు చేస్తున్న కార్యక్రమాల్నీ, అత్యుత్తమ పద్ధతుల్నీ ఇతర దేశాల దృష్టికి తీసుకువస్తున్నాయి. అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఆలోచనలను పంచుకోవడానికీ, చర్చించడానికీ ఒక చక్కని వేదికను ఈ కార్యక్రమం అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే ప్రసంగిస్తూ, ‘‘బ్రిక్స్ దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తే, ఒక దేశం నుంచి మరొక దేశం పాఠాలను నేర్చుకుంటే స్థానిక నూతన ఆవిష్కరణల దన్నుతో ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రభావాన్ని ప్రసరింప చేయవచ్చు’’ అని స్పష్టం చేశారు.
భారత్లో అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థ శరవేగంగా దూసుకుపోతోందని కూడా శ్రీమతి రక్షా ఖడ్సే అన్నారు. విజయవంతమైన వాణిజ్య సంస్థల్ని చిన్న చిన్న పట్టణాలు, రెండో అంచె నగరాలు, మూడో అంచె నగరాలే ఏర్పాటు చేస్తున్నాయనీ, ఇది సమ్మిళిత, యువత సారథ్యంలోని నూతన ఆవిష్కరణల దిశగా భారత్ ఎంత నిబద్దతతో పనిచేస్తోందో నిరూపిస్తోందనీ ఆమె చెప్పారు.
సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి యువజన వ్యవహారాల విభాగ కార్యదర్శి డాక్టర్ పల్లవీ జైన్ గోవిల్ ప్రసంగించారు. నూతన ఆవిష్కరణలతో పాటు సమ్మిళిత అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రాముఖ్యం అంతకంతకూ పెరుగుతోందని ఆమె అన్నారు. ‘‘వాణిజ్య సంస్థలకు నాయకత్వ బాధ్యతల్ని యువతే స్వీకరిస్తున్న పరిణామం నూతన ఆవిష్కరణలకు కీలకంగా మారుతోంది. మన దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు మార్పులకు లోనవుతున్న క్రమంలో, స్థానిక అవసరాల్ని తీర్చగలిగే, ప్రపంచవ్యాప్తంగా అనుసరించగలిగే సేవలకు రూపురేఖలు కల్పించడంలో ఓ ముఖ్య పాత్రను యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పోషిస్తున్నారు’’ అని డాక్టర్ గోవిల్ అన్నారు.
బ్రిక్స్ ఔత్సాహిక పారిశ్రామికత్వ సంబంధిత వర్కింగ్ గ్రూపు సభ్యదేశాలకు ఒక ముఖ్య వేదిక. ఇది ఆయా దేశాలు అభివృద్ధి ప్రధాన అనుభవాల్ని పంచుకోవడానికీ, విభిన్న ఆర్థిక సందర్భాల్లో ధీరత్వంతో కూడిన, రాబోయే కాలం అవసరాలను తీర్చగలిగిన ఔత్సాహిక పారిశ్రామికత్వ సంబంధిత అనుబంధ విస్తారిత వ్యవస్థల్ని పటిష్ఠపరుచుకోవడానికి ఆచరణీయ, విస్తరణ యోగ్య విధానాలను ఎంపిక చేసుకోవడానికీ ఉపయోగపడుతుందని డాక్టర్ పల్లవీ జైన్ గోవిల్ అన్నారు. మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వ క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ విశ్వాస్ కైలాస్ సారంగ్, కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి శ్రీ నితేశ్ కుమార్ మిశ్రా, బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, యువ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికత్వ, నూతన ఆవిష్కరణల సంబంధిత అనుబంధ విస్తారిత వ్యవస్థల ఆసక్తిదారులు ఉన్నారు.
సాంకేతికత, సుస్థిరత, సామాజిక వాణిజ్య సంస్థలు సహా వివిధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికత్వ సంబంధిత కార్యక్రమాల్ని కళ్లకు కట్టే ప్రదర్శనను ప్రారంభించి, కార్యక్రమానికి శ్రీకారాన్ని చుట్టారు. బ్రిక్స్ దేశాల్లో యువత సారథ్యంలోని ఔత్సాహిక పారిశ్రామికత్వ అనుబంధ విస్తారిత వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టిని కేంద్రీకరించిన సర్వసభ్య చర్చాకార్యక్రమాలతో పాటు సంభాషణ ప్రధాన కార్యక్రమాల్ని కూడా నిర్వహించారు.
ఈ సమావేశంలో.. డిజిటల్ నూతన ఆవిష్కరణలు, సాంకేతికత ఆధారిత ఔత్సాహిక పారిశ్రామికత్వం, సామాజిక - సమ్మిళిత ఔత్సాహిక పారిశ్రామికత్వం, హరిత ప్రధాన ఔత్సాహిక పారిశ్రామికత్వం, వాతావరణానుకూల వ్యాపార నమూనాలపై ప్రధానంగా బృంద చర్చల్ని చేపట్టారు. చర్చల్లో కృత్రిమ మేధ (ఏఐ), ఫిన్టెక్, అగ్రిటెక్, సుస్థిరత్వం, స్వచ్ఛ శక్తి వంటి రంగాల్లో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందుకోవడానికి వీలుగా ఉన్న అవకాశాల్ని గుర్తించారు. దీంతోపాటు సమ్మిళిత వృద్ధి, సమాజమే చోదకంగా నిలిచే వాణిజ్య సంస్థలకు ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని గమనించారు.
బృంద చర్చలకు తోడు, ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి మధ్య చర్చలనూ, ఆయా దేశాల మధ్య జ్ఞాన మార్పిడినీ, సహకారాన్నీ ప్రోత్సహించే లక్ష్యాలతో ఇంటరాక్టివ్ నెట్వర్కింగ్ సమావేశాలనూ, యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఇష్టాగోష్ఠులనూ ఏర్పాటు చేశారు.
ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకొనేందుకూ, అత్యుత్తమ పద్ధతుల్ని ఇచ్చిపుచ్చుకునేందుకు, బ్రిక్స్ దేశాల్లో ఔత్సాహిక పారిశ్రామికత్వం, నూతన ఆవిష్కరణ రంగాల్లో సహకారాన్ని ప్రస్తుతం ఉన్న స్థాయి కన్నా మరింతగా పెంచుకొనేందుకూ ఉన్న మార్గాల్ని వెతికేందుకూ ఒక అవకాశాన్ని ఈ సమావేశం అందించింది.
కార్యశాలలు, చర్చలతో పాటు సంభాషణ ప్రధాన కార్యక్రమాలను దీనిలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. బ్రిక్స్ దేశాల యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నడుమ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, సహకారాన్ని పటిష్ఠపరచడం వీటి లక్ష్యం.
బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తున్న కాలంలో యువత సారథ్యంలో నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికత్వం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఇండియా నిరంతర నిబద్ధతతో పనిచేస్తుందని ‘బ్రిక్స్ యూత్ కౌన్సిల్ ఆంత్రప్రన్యోర్షిప్ వర్కింగ్ గ్రూపు సమావేశం’ చాటిచెబుతోంది.
****