ఢిల్లీ ఎన్సీటీలోని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్సీడీ) ప్రాంతాల్లో ప్రస్తుతం స్వీయ గణన జరుగుతోంది. నివాసితులు 2026 మే 1 నుంచి మే 15 వరకు ప్రకటించిన కాలంలో అధికారిక సెన్సస్ పోర్టల్ (https://se.census.gov.in) ద్వారా స్వీయ గణన ద్వారా వారి వివరాలను సమర్పించవచ్చు. దీని తర్వాత మే 16 నుంచి జూన్ 14 వరకు గణన సిబ్బంది ఇంటింటికీ వెళ్లి గృహ జాబితా కార్యకలాపాలను పూర్తి చేస్తారు.
స్వీయ గణన పూర్తి చేసిన నివాసితులు వారి స్వీయ గణన ఐడీని భద్రంగా ఉంచుకోవాలి. హెచ్ఎల్వో ప్రక్రియను పూర్తి చేయడానికి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఇంటికి వచ్చే గణన సిబ్బందికి ఆ ఐడీని అందించాలి.
2027 జన గణనలో తొలిసారిగా ప్రవేశపెట్టిన 'స్వీయ గణన' సదుపాయానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. 23 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఇప్పటివరకు సుమారు 92 లక్షల కుటుంబాలు అధికారిక పోర్టల్ ద్వారా తమ స్వీయ గణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశాయి.
2027 జన గణనలోని హెచ్ఎల్వో దశలో ప్రధానంగా ఇంటికి సంబంధించిన వివరాలు, నివాస పరిస్థితులు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, కుటుంబాలు కలిగి ఉన్న వస్తువులకు సంబంధించిన 33 నిర్దేశిత ప్రశ్నలతో రూపొందించిన ఒక క్రమబద్ధమైన ప్రశ్నావళి ద్వారా కుటుంబాల సమాచారాన్ని సేకరిస్తారు. ఈ విధంగా సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వ ప్రణాళికలు, పాలసీల రూపకల్పనలో... ప్రజా సేవలను సమర్థంగా అందించేందుకు కీలక ప్రాతిపదికగా మాత్రమే వినియోగిస్తారు.
ఉత్తరప్రదేశ్లో ఈ రోజు గృహాల జాబితా రూపకల్పన-గృహ గణన దశ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్ నివాసితులు 2026 మే 7 నుంచి మే 21 వరకు నిర్దేశించిన కాలంలో, అధికారిక పోర్టల్ ద్వారా 'స్వీయ గణన' ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆ తరువాత మే 22 నుంచి జూన్ 20 వరకు గణన సిబ్బంది నేరుగా ఇంటింటికీ వెళ్లి గృహ గణన ప్రక్రియను పూర్తి చేస్తారు.
తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ (ఎమ్సీడీ), మహారాష్ట్ర, మేఘాలయ, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం హెచ్ఎల్వో స్వీయ గణన ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం... ప్రస్తుతం అండమాన్-నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా-నగర్ హవేలి, డామన్-డయ్యూ, ఢిల్లీ (ఎన్ఎమ్డీసీ, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాలు), గోవా, హర్యానా, కర్ణాటక, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మిజోరం, ఒడిశా, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గణన సిబ్బంది ఇంటింటి సందర్శన కొనసాగుతోంది.
1948 జనగణన చట్టం ప్రకారం... జనగణన ద్వారా సేకరించిన సమాచారమంతా గోప్యంగా ఉంచుతారు. కేవలం గణాంక ప్రయోజనాల కోసం, అభివృద్ధి ప్రణాళికల కోసం మాత్రమే దీనిని వినియోగిస్తారు. నోటిఫై చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నివాసితులంతా ఇళ్ల జాబితా రూపకల్పన కార్యకలాపాల సమయంలో గణన సిబ్బందికి పూర్తి సహకారం అందించాలనీ, ఈ ముఖ్యమైన జాతీయ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని కోరడమైనది.
***