ప్రధాన మంత్రి కార్యాలయం
ఆపరేషన్ సిందూర్కు ఏడాది.. సాయుధ దళాలకు ప్రధానమంత్రి వందనం
సాయుధ బలగాల పట్ల గౌరవ సూచకంగా సామాజిక మాధ్యమాల్లో
డిస్ప్లే పిక్చరును మార్చుకోవాల్సిందిగా పౌరులకు విజ్ఞప్తి చేసిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
07 MAY 2026 10:23AM by PIB Hyderabad
ఆపరేషన్ సిందూర్ను నిర్వహించి ఈ రోజుకు ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా, సాయుధ దళాల ధైర్య సాహసాలకీ, కచ్చితత్వానికీ, దృఢసంకల్పానికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివాదం చేశారు.
పహల్గాంలో సామాన్య పౌరులపై దాడికి తెగబడిన వారికి సాయుధ దళాలు దీటైన జవాబును ఇచ్చాయని ప్రధానమంత్రి అన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అనుసరిస్తున్న దృఢ వైఖరికీ, దేశ భద్రతను పరిరక్షించడంలో భారత్ తిరుగులేని నిబద్ధతకీ ఆపరేషన్ సిందూర్ అద్దంపట్టిందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సాయుధ బలగాల నైపుణ్యాన్నీ, సన్నద్ధతనీ, సమన్వయ శక్తినీ ఆపరేషన్ సిందూర్ చాటిచెప్పిందని ప్రధాని అన్నారు. ఇది త్రివిధ దళాల మధ్య సమష్టిభావాన్ని ప్రతిబింబించిందనీ, రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధనకు భారత్ చేస్తున్న కృషి దేశ భద్రతకు మరింత దన్నుగా నిలుస్తోందనీ ఆయన అన్నారు.
ఉగ్రవాదాన్ని అణచేయడంతో పాటు ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్న వర్గాల్ని ధ్వంసం చేసే సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి భారత్ దృఢ వైఖరిని కనబరుస్తూనే ఉంటుందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
ఆపరేషన్ సిందూర్ కాలంలో, సాయుధ దళాలు తమ పరాక్రమాన్ని రుజువు చేశాయనీ, భారతీయులపై దాడి చేసిన వారికి దీటైన జవాబిచ్చాయనీ శ్రీ మోదీ స్పష్టం చేశారు. సాయుధ బలగాలను చూసి దేశంలో ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని ఆయన అన్నారు.
ఆపరేషన్ సిందూరులో సాయుధ దళాలు సాధించిన విజయంతో పాటు సాయుధ దళాల గౌరవార్థం పౌరులంతా ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సహా వివిధ సామాజిక మాధ్యమాల్లో తమ డిస్ప్లే పిక్చర్ (డీపీ)ను తాను పంచుకొంటున్న ఈ కింది చిత్రంతో మార్చుకోవాల్సిందిగా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘ఏడాది కిందట.. మన సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ లో సాటి లేని తమ పరాక్రమాన్నీ, కచ్చితత్వాన్నీ, సంకల్పాన్నీ చాటిచెప్పాయి. పహల్గాంలో సామాన్యులపై దాడికి తెగబడిన వారికి దీటుగా బదులిచ్చాయి. మన సాయుధ బలగాలు ప్రదర్శించిన పరాక్రమానికి పూర్తి దేశం సాయుధ బలగాలకు నమస్కరిస్తోంది.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తిరుగులేని ప్రతిస్పందనకీ, దేశ భద్రతను పరిరక్షించే విషయంలో తిరుగులేని నిబద్ధతకీ ప్రతీకగా ఆపరేషన్ సిందూర్ నిలిచింది. మన సాయుధ దళాల నైపుణ్యాన్నీ, సర్వసన్నద్ధతనీ, సమన్విత శక్తినీ ఆపరేషన్ సిందూర్ చాటిచెప్పింది. ఇది మన బలగాల మధ్య అంతకంతకూ పెరుగుతున్న సమష్టితత్వాన్ని ప్రతిబింబించింది. రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధన దిశగా భారత్ వేగంగా పయనిస్తున్న తీరు దేశ భద్రతకు మరింత శక్తిని జోడిస్తోంది.
ఈ రోజు, ఒక సంవత్సరం గడిచాక కూడా.. ఉగ్రవాదాన్ని జయించడంతో పాటు దానికి ఆశ్రయమిచ్చే వ్యవస్థల్ని ధ్వంస చేయాలన్న మన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మనం ఎప్పటి మాదిరే దృఢంగా నిలబడదాం’’.
***
(రిలీజ్ ఐడి: 2258629)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4