పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో అంతర-మంత్రిత్వశాఖల తాజా సమాచారం
· ఎల్పీజీ దారి మళ్లింపు నివారణ దిశగా ‘సరఫరా నిర్ధారణ కోడ్’ ఆధారిత పంపిణీతో సిలిండర్ల చేరవేత 95 శాతానికి పెరుగుదల
· ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లు 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరాపై 10,400కు పైగా అవగాహన శిబిరాలు నిర్వహించి, ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 1,84,000కు పైగా సిలిండర్లను విక్రయించాయి
· ఔషధ... రసాయన... పెయింట్ రంగంలోని కంపెనీల కోసం ‘ఎల్పీజీ’ నిల్వ నుంచి రూపొందించిన సి3-సి4 మాలిక్యూల్స్ కోసం రోజుకు 1120 టన్నుల కేటాయింపు
· పశ్చిమాసియాలోని భారతీయ నావికులందరూ సురక్షితం... గడచిన 48 గంటల్లో భారతీయ పతాకంగల నౌకలకు ఎలాంటి ఇబ్బందులూ కలగలేదు
· టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భూ సరిహద్దు మార్గాల ద్వారా ఇరాన్ నుంచి వెళ్లేందుకు 2,520 మంది ప్రవాస భారతీయులకు సౌకర్యం కల్పించింది
నాడు పోస్టు చేయడమైనది:
06 MAY 2026 4:45PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా దేశ పౌరులకు కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా తాజా సమాచారం తెలియజేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జాతీయ మీడియా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఇందులో పెట్రోలియం-సహజ వాయువు, ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు తమతమ శాఖల సంబంధిత వివరాలను వెల్లడించారు.
విద్యుత్ సరఫరా... ఇంధన లభ్యత
పశ్చిమాసియాలో నానాటికీ పరిస్థితులు మారుతున్న దృష్ట్యా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయ సరఫరా దిశగా చేపట్టిన చర్యలను వివరిస్తూ- ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా సమాచారం కిందివిధంగా ఉంది:
ప్రభుత్వ సూచనలు... పౌరులకు అవగాహన
· పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ లభ్యతకు భరోసా ఇస్తూ ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్న నేపథ్యంలో పౌరులు భయాందోళనలకు లోనై, వీటి కొనుగోలు కోసం ఆదుర్దా పడవద్దని సూచన జారీ చేసింది.
· వదంతులను విశ్వసించవద్దని, కచ్చితమైన సమాచారం కోసం అధికార మార్గాల్లోనే అన్వేషించాలని సలహా ఇచ్చింది.
· ఎల్పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ వేదికలను ఉపయోగించాలి తప్ప సరఫరాదారులను ఆశ్రయించవద్దని సూచించింది.
· పీఎన్జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించాల్సిందిగా కోరింది.
· ప్రస్తుత పరిస్థితులలో పౌరులంతా తమ రోజువారీ ఇంధన వినియోగంలో పొదుపు పాటించేందుకు తగినవిధంగా కృషి చేయాలని అభ్యర్థించింది.
ప్రభుత్వ సంసిద్ధత... సరఫరా నిర్వహణ
· ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితులలో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ దేశీయ ఎల్పీజీ, గృహ వినియోగ పీఎన్జీ, సీఎన్జీల 100 శాతం సరఫరా (రవాణా)కు ప్రభుత్వం హామీ ఇచ్చింది.
· వాణిజ్య ఎల్పీజీ సరఫరాకు సంబంధించి ఆస్పత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే ఔషద, ఉక్కు, ఆటోమొబైల్, విత్తన, వ్యవసాయ తదితర రంగాలకూ ప్రాధాన్యం లభిస్తోంది. దీనికితోడు 2026 మార్చి 2, 3 తేదీల నాటి సగటు రోజువారీ సరఫరా ప్రాతిపదికన వలస కార్మికులకు 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేశారు.
· శుద్ధి కర్మాగారల్లో ఉత్పత్తి పెంపు, పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచడం సహా అటు సరఫరా... ఇటు డిమాండ్ వైపు ఆయా రంగాలకు ప్రాధాన్యత వంటి పలు హేతుబద్ధ చర్యలను ప్రభుత్వం అమలు చేస్తోంది.
· ఎల్పీజీ కోసం డిమాండ్ ఒత్తిడి తగ్గించే దిశగా కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చింది.
· చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గు సరఫరా చేయాల్సిందిగా కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ సంస్థలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
· గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం కొత్త పీఎన్జీ కనెక్షన్ల సౌలభ్యాన్ని వేగిరపరచాలని రాష్ట్రాలకు సూచించింది.
రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు.. సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ కృషి
· నిత్యవసరాల చట్టం-1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు-2000 ప్రకారం సరఫరాపై పర్యవేక్షణతోపాటు అక్రమ నిల్వ-విక్రయాలపై చర్యలు చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.
· పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ సహా నిత్యావసర వస్తువుల సరఫరా స్థితిగతుల పర్యవేక్షణ, నియంత్రణలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషించాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రభుత్వాలకు పలుమార్లు లేఖ రాయడంతోపాటు వీడియో కాన్ఫరెన్స్ మార్గంలోనూ ఈ అంశాన్ని పునరుద్ఘాటించింది.
· కేంద్ర ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 తేదీల్లో రెండు లేఖల ద్వారా తగినంత ఇంధన లభ్యతపై పౌరులకు భరోసా ఇస్తూ నిరంతర ప్రభుత్వ సమాచార ప్రదాన ఆవశ్యకతను స్పష్టం చేసింది. తదనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్ష కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 02.04.2026న (మంత్రిత్వశాఖలోని పీఎన్జీ విభాగ కార్యదర్శి అధ్యక్షత), 06.04.2026న (పీఎన్జీ కార్యదర్శి అధ్యక్షతన సమాచార-ప్రసార శాఖ, వినియోగదారు వ్యవహారాల విభాగం కార్యదర్శులతో) అధికారులు సమావేశమయ్యారు. అనంతరం కింద పేర్కొన్న అంశాలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.
o రోజువారీ విలేకరుల సమావేశం నిర్వహణ... క్రమం తప్పకుండా ప్రజలకు సలహాలు జారీ.
o సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే సమాచారం, బూటకపు వార్తలపై నిశిత పర్యవేక్షణ, నిరోధం.
o జిల్లా యంత్రాంగాల ద్వారా దైనందిన చర్యలు ముమ్మరం సహా ‘ఓఎంసీ’ల సమన్వయంతో తనిఖీ-దాడుల కొనసాగింపు.
o వాణిజ్య ఎల్పీజీ కేటాయింపుపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల పరిధిలో ఉత్తర్వుల జారీ.
o రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు ‘ఎస్కేఓ'ల కోసం సంబంధిత ఉత్తర్వులు జారీ.
o పీఎన్జీ సహా ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగానికి ప్రోత్సాహం.
o ప్రత్యేకించి గృహావసరాల కోసం ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యంతోపాటు సరఫరా స్థిరత్వం కొనసాగించేలా 5 కిలోల ఎప్టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ.
o అక్రమ నిల్వ-విక్రయాల నిరోధంపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కంట్రోల్ రూములు, జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.
o అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు రోజువారీ విలేకరుల సమావేశం ద్వారా తాజా సమాచారం ప్రకటిస్తున్నాయి.
అమలు... పర్యవేక్షణ చర్యలు
· ఎల్పీజీ నిల్వల నిర్వహణతోపాటు అక్రమ నిల్వ-విక్రయాల నిరోధానికి దేశవ్యాప్తంగా పటిష్ఠ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న 2,100కు పైగా దాడులు నిర్వహించారు.
· దేశమంతటా ఆకస్మిక తనిఖీ ప్రక్రియను ‘ఓఎంసీ’లు బలోపేతం చేయడంతోపాటు నిరంతరం కొనసాగిస్తున్నాయి. ఈ మేరకు 366 ఎల్పీజీ సరఫరా కేంద్రాలకు జరిమానా విధింపు సహా నిన్నటిదాకా 75 ఎల్పీజీ పంపిణీ కేంద్రాల కార్యకలాపాలను నిలిపివేశారు.
ఎల్పీజీ సరఫరా
గృహోపయోగ వంటగ్యాస్ తాజా స్థితి:
· ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల వల్ల ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కొనసాగుతోంది.
· గృహ వినియోగదారులకు వంటగ్యాస్ సరఫరాకు ప్రాధాన్యం లభిస్తోంది.
· దేశంలో ఎక్కడా ఎల్పీజీ సరఫరా కేంద్రాల వద్ద పంపిణీ ఆగిన సమాచారమేదీ లేదు.
· పరిశ్రమల ప్రాతిపదికన నిన్న ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ 99 శాతంగా నమోదైంది.
· దారి మళ్లింపు నిరోధం, సరఫరా నిర్ధారణ కోడ్ (డీఏసీ) ఆధారిత సరఫరా దాదాపు 95 శాతానికి పెరిగింది. ప్రతి వినియోగదారు నమోదిత మొబైల్ నంబరుకు డీఏసీ వెళ్తుంది.
· దేశంలోని ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు గడచిన రెండు రోజులుగా సుమారు 88.82 లక్షల బుకింగ్లపై 87.28 లక్షలకుపైగా సిలిండర్లను సరఫరా చేశాయి.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా... కేటాయింపు చర్యలు
· సంస్కరణ-అనుసంధానిత 10 శాతం కేటాయింపు సహా మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును సంక్షోభానికి మునుపటికి స్థాయిలో సుమారు 70 శాతానికి పెంచారు.
· వలస కార్మికులకు 2026 మార్చి 2-3 తేదీల నాటి సగటు రోజువారీ సరఫరా (సిలిండర్ల సంఖ్య) ప్రాతిపదికన 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితికి మించి, ప్రతి రాష్ట్రంలో వారికి 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల దైనందిన పరిమాణాన్ని రెట్టింపు చేయాలని 06.04.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం సూచించింది. తదనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే ‘ఓఎంసీ’ల సహాయంతో సరఫరా చేయడం కోసం ఈ 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు అక్కడి ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి.
· గడచిన రెండు రోజులలో సుమారు 1.2 లక్షల మేర 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లను విక్రయించారు.
· దేశంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రభుత్వ రంగ ‘ఓఎంసీ’లు 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి 10,400కు పైగా అవగాహన శిబిరాలను నిర్వహించి, సుమారు 1,84,000 సిలిండర్లను విక్రయించాయి.
· నిన్న ఒక్క రోజునే 132 శిబిరాల నిర్వహణ ద్వారా 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్లు దాదాపు 4,171 దాకా అమ్ముడయ్యాయి.
· ‘ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్” ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో నియమించిన త్రిసభ్య కమిటీ నిరంతరం రాష్ట్ర అధికారులు, పారిశ్రామిక సంస్థలతో సంప్రదిస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వాణిజ్య ఎల్పీజీ విక్రయ ప్రణాళికను ఖరారు చేస్తుంది.
· గడచిన రెండు రోజులలో మొత్తం 15,900 టన్నులకు పైగా (8.37 లక్షలకు పైగా 19 కిలోల ఎల్పీజీ సిలిండర్లకు సమానం) వాణిజ్య ఎల్పీజీని విక్రయించారు.
· అలాగే, గత రెండు రోజులలో ప్రభుత్వ రంగ ‘ఓఎంసీ’లు మొత్తం 876 టన్నుల ఆటో ‘ఎల్పీజీ’ని విక్రయించాయి.
సహజ వాయువు సరఫరా, పీఎన్జీ విస్తరణ కార్యక్రమాలు
· డీ-పీఎన్జీ, సీఎన్జీ-రవాణాకు 100 శాతం సరఫరాలతో వినియోగదారులకు ప్రాధాన్యమిస్తున్నారు.
· ఎరువుల కర్మాగారాలకు కేటాయించే మొత్తం గ్యాస్ను, వాటి ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 98 శాతానికి పెంచారు.
· అదనంగా, సీజీడీ నెట్వర్క్ల ద్వారా జరిగే సరఫరాలు సహా... ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.
· వాణిజ్య ఎల్పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి సీజీడీ సంస్థలు తమ అన్ని జిఏల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించాయి.
· ఐజీఎల్, ఎమ్జీఎల్, జీఏఐఎల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
· సీజీడీ వ్యవస్థల విస్తరణకు అవసరమైన ఆమోదాలను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.
· ఎల్పీజీ నుంచి పీఎన్జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా 10 శాతం కేటాయింపును తేది 18.03.2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.
· పీఎన్జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును పొందుతున్నాయి.
· రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తేదీ 24.03.26 నాటి లేఖ ద్వారా సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించడానికి ‘తగ్గించిన కాలపరిమితులతో సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద విధాన ప్రణాళిక’ను 3 నెలల పాటు ప్రత్యేకంగా అమలు చేస్తోంది.
· 24.03.2026 తేదీ గల గెజిట్ ద్వారా భారత ప్రభుత్వం... నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడం, నిర్మించడం, నిర్వహించడం, విస్తరించడం ద్వారా) ఉత్తర్వులు-2026ను జారీ చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్లైన్లను వేయడానికి, విస్తరించడానికి ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తుంది. ఇది అనుమతులు, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించి, నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది పీఎన్జీ నెట్వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, మారుమూల ప్రాంతాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, పరిశుద్ధ ఇంధనాలకు మారడానికి మద్దతునిస్తుందని, తద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసి భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.
· డీ-పీఎన్జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్జీఆర్బీ ఆదేశించింది. పీఎన్జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి నేషనల్ పీఎన్జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడిగించారు.
· పరిశుద్ధమైన, మరింత సురక్షితమైన, స్వయం సమృద్ధిగల ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం రాష్ట్ర సీబీజీ విధానం కోసం నమూనా ముసాయిదాను అభివృద్ధి చేసింది. ఈ నమూనా విధానం... సీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలుకు అనువుగా ఉండే వ్యవస్థను సృష్టించుకోవడానికి వీలు కల్పించే ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక విధాన ప్రణాళికగా పనిచేయడానికి ఉద్దేశించినది. దీనిని ఎంచుకున్న రాష్ట్రాలకు, వాణిజ్య ఎల్పీజీ అదనపు కేటాయింపుల తదుపరి విడతలో ప్రాధాన్యమిస్తారు.
· మంత్రిత్వశాఖ 07.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా... సీజీడీ వ్యవస్థ, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి 15 రోజుల్లోపు అనుమతి మంజూరు చేసేందుకు ఎస్పీసీబీ, పీసీసీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని సీపీసీబీని ఆదేశించింది.
· మార్చి 2026 నుంచి సుమారు 6.31 లక్షల పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభమైంది. అదనంగా 2.67 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 8.98 లక్షలకు చేరింది. కొత్త కనెక్షన్ల కోసం సుమారు 6.93 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.
· 05.05.2026 వరకు 49,200 కంటే ఎక్కువ మంది పీఎన్జీ వినియోగదారులు MYPNGD.in వెబ్సైట్ ద్వారా తమ ఎల్పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.
ముడి చమురు లభ్యత, రిఫైనరీ కార్యకలాపాలు
· అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో పెట్రోల్, డీజిలు నిల్వలు సరిపడా ఉన్నాయి.
· దేశీయ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.
· దేశీయ మార్కెట్కు అవసరమైన పెట్రోకెమికల్ ముడిసరుకు సరఫరా నిరంతరాయంగా అందేలా చూడటం కోసం వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. దీనిని అనుసరిస్తూ భారత ప్రభుత్వం 01.04.2026 నాటి ఉత్తర్వుల ద్వారా.. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు తమ వద్ద ఉండే సీ3, సీ4 గ్యాస్ నిల్వలను నిర్ణీత పరిమాణంలో కొన్ని ముఖ్యమైన రంగాలకు అందించాలని అనుమతించింది.
· ఔషధ విభాగం, రసాయనాలు, పెట్రో కెమికల్స్ విభాగం, పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం నుంచి అందిన అభ్యర్థనల మేరకు… ఔషధ, రసాయన రంగ కంపెనీల కోసం ఎల్పీజీ పూల్ నుంచి రోజుకు 1120 మెట్రిక్ టన్నులను కేటాయించారు.
· 9 ఏప్రిల్ 2026 నుంచి ముంబై, కొచ్చి, విశాఖకపట్నం, చెన్నై, మధుర, గుజరాత్ రిఫైనరీలు రసాయన, ఔషధ, పెయింట్ పరిశ్రమలకు 12,000 మెట్రిక్ టన్నులకు పైగా ప్రొపైలిన్, 1750 మెట్రిక్ టన్నులకు పైగా బ్యూటైల్ అక్రిలేట్ను విక్రయించాయి.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల నియంత్రణ చర్యలు
· దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకులు యథావిధిగా పనిచేస్తున్నాయి.
· మధ్యప్రాచ్యం సంక్షోభం వల్ల ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిలు పైన ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.
· దేశంలోని అన్ని పెట్రోలు బంకుల్లో పెట్రోలు, డీజిలు తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పెట్రోలు, డీజిలు సాధారణ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల అవుట్లెట్లలో వాటి ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
సముద్ర భద్రత, నౌకా రవాణా కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్లో నెలకొన్న సముద్ర పరిస్థితిపై ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతంలో భారతీయ నౌకలు, సిబ్బంది భద్రత, రక్షణను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించింది. ఆ సమాచారం మేరకు..
· నావికుల సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలను నిర్ధారించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్ర రంగ భాగస్వాములతో మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.
· ఆ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 48 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.
· గత 48 గంటల్లో భారతీయ నౌకలకు గానీ, భారతీయ నావికులతో కూడిన విదేశీ నౌకలకు గానీ సంబంధించి ఎలాంటి సంఘటనలు జరిగినట్లు నివేదించలేదు.
· షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24x7 పనిచేస్తూనే ఉంది. ప్రారంభమైనప్పటి నుంచి 8,570 కాల్స్ , 18,732 కంటే ఎక్కువ ఈమెయిళ్లను స్వీకరించి పరిష్కరించింది.. గత 24 గంటల్లో 156 కాల్స్, 668 ఈమెయిళ్లు అందాయి.
· డీజీ షిప్పింగ్ ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 24 గంటల్లో 23 మందితో సహా… ఇప్పటివరకు 2,999 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో మంత్రిత్వ శాఖ సహాయపడింది.
· దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.
యుద్ధ ప్రభావ ప్రాంతంలో భారత పౌరుల భద్రత
గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాంతంలోని భారతీయుల భద్రత, రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసిన వివరాల ప్రకారం...
· సమాచార మార్పిడి, ప్రయత్నాలను మెరుగ్గా సమన్వయం చేసేందుకు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
· భారత పౌరులు, వారి కుటుంబాలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక నియంత్రణ గది (కంట్రోల్ రూమ్) పనిచేస్తోంది.
· భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు మన పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు నిరంతరాయంగా హెల్ప్లైన్లను నిర్వహిస్తున్నాయి. అలాగే అక్కడి స్థానిక ప్రభుత్వాలతో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాయి.
· స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన ప్రయాణాల పరిస్థితి, కాన్సులర్ సేవలు, ప్రవాస భారతీయుల కోసం చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యలకు సంబంధించిన తాజా సమాచారంతో కూడిన సూచనలను ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు.
· భారతీయ సమాజ సంఘాలు, సంస్థలు, వృత్తిపరమైన సమూహాలు, భారతీయ కంపెనీల ఆందోళనలను పరిష్కరించేందుకు వారితో మన దౌత్య కార్యాలయాలు చురుగ్గా సంప్రదింపులు జరుపుతున్నాయి.
· ఆ ప్రాంతంలో భారతీయ నావికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దౌత్య కార్యాలయాలు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడం, కాన్సులర్ మద్దతును అందించడం, భారత్కు తిరిగి రావాలనే వారికి అవసరమైన సహాయక చర్యలను చేపడుతున్నాయి.
· ఆ ప్రాంతాల నుంచి భారత్లోని వివిధ గమ్యస్థానాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతో విమాన రాకపోకల పరిస్థితి మొత్తం మీద మెరుగుపడుతూనే ఉంది.
· యూఏఈ గగనతలం తెరిచి ఉంది. విమానయాన సంస్థలు యూఏఈ నుంచి భారత్లోని వివిధ గమ్యస్థానాలకు విమానాలు నడుస్తూనే ఉన్నాయి.
· సౌదీ అరేబియా, ఒమన్లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్లోని వివిధ గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో ఖతార్ ఎయిర్వేస్ భారత్లోని వివిధ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, ఖతార్ ఎయిర్వేస్ సంస్థలు ఖతార్ నుంచి భారత్కు తమ విమాన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
· కువైట్ గగనతలం తెరిచి ఉంది. జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్, కువైట్ నుంచి భారత్కు విమానాలను నడుపుతున్నాయి.
· బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, గల్ఫ్ ఎయిర్ సంస్థలు బహ్రెయిన్ నుంచి భారత్లోని వివిధ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నాయి.
· ఇరాక్ గగనతలం తెరిచి ఉంది. ఆ ప్రాంతంలోని ఇతర నగరాలకు పరిమిత విమానాలు నడుస్తున్నాయి. వాటి ద్వారా భారత్కు ప్రయాణించవచ్చు.
· ఇరాన్ గగనతలం కార్గో, చార్టర్డ్ విమానాల కోసం పాక్షికంగా తెరిచి ఉంది. భారతీయులు ఇరాన్ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు భారత రాయబార కార్యాలయం సహాయంతో భూ సరిహద్దు మార్గాల ద్వారా ఇరాన్ దాటాలని కోరారు. ఇప్పటివరకు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం 2,520 మంది భారతీయులు భూ సరిహద్దుల ద్వారా ఇరాన్ నుంచి బయటకు వచ్చేలా సాయపడింది.
· ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉంది. ఆ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. వీటిని భారత్కు తదుపరి ప్రయాణం కోసం ఉపయోగించుకోవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2258565)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3