రక్షణ మంత్రిత్వ శాఖ
మన రక్షణ పరిశ్రమల నుంచే భారత సైనిక శక్తి... స్వదేశీ ఆయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించిన ఆపరేషన్ సిందూర్: నార్త్ టెక్ సింపోజియం-2026లో రక్షణశాఖ సహాయ మంత్రి
వికసిత్ భారత్ లక్ష్యాన్ని నడిపిస్తున్న శక్తి అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలే
నాడు పోస్టు చేయడమైనది:
05 MAY 2026 12:03PM by PIB Hyderabad
‘‘మన రక్షణ రంగ ఫ్యాక్టరీల నుంచే భారత దేశ సైనిక శక్తి ఉద్భవిస్తోంది’’ అని రక్షణ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ అన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అత్యాధునిక ఆయుధాలు, ఆయుధ వ్యవస్థల సామర్థ్యంతో బలోపేతమైన రక్షణ బలగాల అసమానమైన ధైర్యం, సంకల్పమే ఆపరేషన్ సిందూర్ విజయానికి కారణమన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న నార్త్ టెక్ సింపోజియంలో 2026 మే 5న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈలే వెన్నెముక అని, అంకుర సంస్థలే దేశానికి బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. ‘‘భవిష్యత్తు వృద్ధిని నడిపించేది మన అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలే. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను నెరవేర్చడంలో కీలకపాత్ర పోషించే ఆధునిక విశ్వకర్మలు ఇవి’’ అని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాదుల స్థావరాలను నిర్మూలించి, భారత దేశ శత్రువుల కుయుక్తులను భగ్నం చేసిన రక్షణ బలగాలను రక్షణ శాఖ సహాయ మంత్రి ప్రశంసించారు. రక్షణ రంగంలో ఆత్మ నిర్భరతను సాధించాలనే మొత్తం దేశం - ప్రభుత్వం, డీపీఎస్యూలు, ప్రైవేటు రంగం, ముఖ్యంగా ఆవిష్కర్తలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల సంకల్పానికి మేడ్ ఇన్ ఇండియా సాధనాల సమర్థ వినియోగమే నిదర్శనమన్నారు.
దేశ ప్రయోజనాలను కాపాడేలా తన సొంత సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని విశ్వసించే నవ భారత ఆవిర్భావానికి రికార్డు స్థాయిలో నమోదైన రక్షణ ఉత్పత్తి, రక్షణ ఎగుమతుల గణాంకాలే నిదర్శనమని రక్షణ శాఖ సహాయ మంత్రి స్పష్టం చేశారు. ‘‘ఈ నవ భారతం ఎవరికీ చెడు చేయాలని ప్రయత్నించదు. తన సార్వభౌమత్వానికి ముప్పు కలిగించాలని ప్రయత్నించేవారిని విడిచిపెట్టదు’’ అని చెప్పారు.
ఈ రోజు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం రేపు ఉపయోగించకపోవచ్చని రక్షణ శాఖ సహాయ మంత్రి అన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్న ఈ తరుణంలో వినూత్నంగా ఆలోచించి సాంకేతికంగా ముందంజలో ఉండేందుకు కృషి చేయాలని పరిశ్రమలను కోరారు. దేశంలో రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఆవిష్కరణ నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ అనీ, దీనికి పూర్తి ప్రభుత్వ సహకారం ఉంటుందనీ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని రక్షణ పారిశ్రామిక కారిడార్ తీసుకొచ్చిన గుణాత్మక ప్రభావాన్ని గుర్తించారు. ఈ ప్రగతిని ఉన్నత శిఖరాలకు చేర్చాలని పరిశ్రమను కోరారు.
నూతన రంగాల్లో ప్రస్తుతం కార్యాచరణ అవసరాలను తీర్చడానికి, భారత ఆర్మీని భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా సిద్ధం చేయడానికి రక్షణ బలగాలతో కలసి పనిచేయాలని పరిశ్రమలను జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ (జీవోసీ-ఇన్-సీ), సెంట్రల్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ అనింధ్య సేన్ గుప్త అభ్యర్థించారు. స్వావలంబనే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి, సాంకేతిక సార్వభౌమత్వానికి, కార్యాచరణ రూపకల్పనకు దారి తీస్తుందన్నారు.
మూడు రోజుల పాటు జరిగే నార్త్ టెక్ సింపోజియం-2026ను భారత ఆర్మీకి చెందిన ఉత్తర, మధ్య సైనిక విభాగాలు, ఎస్ఐడీఎం నిర్వహిస్తున్నాయి. ‘‘రక్షణ త్రివేణీ సంగమం- సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమ, సైనిక సామర్థ్యాలు కలిసే చోటు’’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. దీనిని 2026 మే 4న రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. అత్యాధునిక రక్షణ రంగ సాంకేతికతను ప్రదర్శించేందుకు ప్రైవేటు రక్షణ ఉత్పత్తుల తయారీదారులు 284 స్టాళ్లను ఏర్పాటు చేశారు. మానవ రహిత ఏరియల్ వాహనాలు (యూఏవీలు), డ్రోన్లు, కౌంటర్ యూఏవీలు, అన్ని భూతల వాహనాలు, నిఘా సాధనాలు, ఇతర రక్షణ ఉత్పత్తులను సైతం ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు.
జీవోసీ-ఇన్-సీ ఉత్తర కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ, 1 కోర్స్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ వీ హరిహరన్, భారత రక్షణ తయారీదారుల సంఘం (ఎస్ఐడీఎం) అధ్యక్షుడు శ్రీ అరుణ్ టీ రాంచందానీ, పరిశ్రమ దిగ్గజాలు, ఆవిష్కర్తలు, అంకుర సంస్థలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2258010)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7