కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన
'సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్'ను (సీబీఎస్) ప్రారంభించిన కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
స్పందించడం కాకుండా… క్రియాత్మక దిశగా ప్రయాణం: సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్తో విపత్తు నిర్వహణను బలోపేతం చేసిన భారత్
ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణ హెచ్చరికలు: ప్రజా భద్రత కోసం దేశవ్యాప్త సెల్ బ్రాడ్కాస్ట్ వ్యవస్థను ప్రారంభించిన భారత్
నాడు పోస్టు చేయడమైనది:
02 MAY 2026 4:56PM by PIB Hyderabad
'సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్'ను (సీబీఎస్) ఈ రోజు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) సహకారంతో టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ) పరిధిలోని సీ-డాట్ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) ఈ స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. భారతదేశ అత్యవసర సమాచార వ్యవస్థలను బలోపేతం చేయటం, ప్రజా భద్రతా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఇది ఒక ముఖ్యమైన వ్యవస్థ.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోం కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, టెలికాం కార్యదర్శి శ్రీ అమిత్ అగర్వాల్, ఎన్డీఆర్ఎఫ్ డీజీ శ్రీ పియూష్ ఆనంద్, ఎన్డీఎంఏ కార్యదర్శి శ్రీ మనీష్ భరద్వాజ్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అనుజ్ శర్మ, ఎన్డీఎంఏ సభ్యులు శ్రీ కృష్ణ వత్స హాజరయ్యారు.
టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ), హోం మంత్రిత్వ శాఖ, ఎన్డీఎంఏ, సీ-డాట్ల సాధించిన ఈ చరిత్రాత్మక విజయంపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. “సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ ప్రారంభం భారతదేశ విపత్తు నిర్వహణ వ్యవస్థలో ఒక భారీ మార్పును తెచ్చే ఘట్టం. ఇది ప్రజలను రక్షించడంలో కేవలం స్పందించే విధానం నుంచి ముందస్తుగా చర్య తీసుకునే విధానానికి మారడాన్ని తెలియజేస్తోంది. అధునాతన టెలికాం సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా సీబీఎస్ వ్యవస్థ లక్షలాది మందికి తక్షణమే దాదాపు నిజ-సమయ, నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని (జియో ట్యాగ్డ్) హెచ్చరికలను అందించడానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల ఎవరూ ఈ విషయంలో వెనుకపడకుండా చూసుకుంటుంది. స్వదేశీ పరిజ్ఞానంతో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ పరిష్కారం మన సంసిద్ధతను బలపరుస్తుంది.. స్పందించే విషయంలో సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.. సురక్షితమైన, మరింత దృఢమైన భారత్ను నిర్మించాలనే మన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది” అని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అనుజ్ శర్మ.. విపత్తు సంసిద్ధత, ఎన్ఎండీఏ చేపడుతున్న ప్రస్తుత కార్యక్రమాలపై కేంద్ర మంత్రికి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు.
సీబీఎస్ అనేది ఒక టెలికాం ఆధారిత ప్రజా హెచ్చరిక వ్యవస్థ. ఇది నిర్దిష్ట ప్రాంతంలోని మొబైల్ పరికరాలకు ఏకకాలంలో భౌగోళికంగా నిర్దేశిత హెచ్చరికలను పంపడానికి అధికారులకు వీలు కల్పిస్తుంది. సీఏపీ-ఆధారిత సాచెట్ ప్లాట్ఫామ్తో అనుసంధానమైన ఈ వ్యవస్థ హెచ్చరికలను వేగంగా ప్రామాణీకరించిన పద్ధతిలో చేరవేయడానికి ఉపయోగపడుతుంది. ఇది సంప్రదాయ ఎస్ఎంఎస్-ఆధారిత వ్యవస్థల పరిమితులను అధిగమించి నిర్దిష్ట ప్రాంతాల్లోని ఎక్కువ మంది ప్రజలకు అత్యవసర సమాచారాన్ని వేగంగా సమర్ధవంతంగా చేరవేసేలా చేస్తుంది.
ఈ ప్రారంభోత్సవంలో భాగంగా ఈ వ్యవస్థను ఇవాళ దేశవ్యాప్తంగా విజయవంతంగా పరీక్షించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లకు ఒక ప్రత్యేకమైన అలర్ట్ టోన్తో కూడిన అత్యవసర హెచ్చరిక సందేశాలను ప్రసారం చేశారు. విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో హెచ్చరికలను సకాలంలో చేరవేసే విషయంలో ఈ ప్రదర్శన ఒక ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది.
భారతదేశంలో విపత్తు నిర్వహణ రంగంలో చేసిన అమూల్యమైన కృషి, నిస్వార్థ సేవలను గుర్తిస్తూ వ్యక్తులతో పాటు సంస్థలకు ఇచ్చే 'సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కార్'ను (ఎస్సీబీఏపీపీ) కూడా శ్రీ సింధియా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విపత్తు నిర్వహణపై మార్గదర్శకాలు, హ్యాండ్బుక్ను కూడా విడుదల చేశారు.
అత్యంత ఖచ్చితత్వంతో కూడిన భౌగోళిక లక్ష్యాల సామర్థ్యాలను సీబీఎస్ బలపరుస్తుంది. దీని ద్వారా నిర్దిష్ట సెల్ టవర్ లేదా సెల్ టవర్ల సమూహం స్థాయిలో హెచ్చరికలను ప్రసారం చేయొచ్చు. అదే సమయంలో పెద్ద భౌగోళిక ప్రాంతాల్లో కూడా దీనిని ఉపయోగించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ సందేశాలు దాదాపు నిజ-సమయంలో డెలివరీ అవుతాయి. ఎలాంటి జాప్యం లేకుండా కేవలం సెకన్ల వ్యవధిలోనే వినియోగదారులకు చేరుకుంటాయి. అత్యంత విశ్వసనీయత కోసం రూపొందించిన ఈ వ్యవస్థ నెట్వర్క్ రద్దీ వల్ల ప్రభావితం కాదు. ఇది అత్యవసర లేదా క్లిష్టమైన పరిస్థితుల్లోనూ నిరంతరాయంగా సమాచారం ప్రసారం అయ్యేలా చూసుకుంటుంది. లక్షిత ప్రాంతంలో రోమింగ్లో ఉన్నవారితో సహా మొబైల్ వినియోగదారులందరూ దీని పరిధిలోకి రావటం ద్వారా ఇది సార్వత్రిక చేరువను అందిస్తుంది. అంతేకాకుండా ఈ హెచ్చరికలను ఆపేయటానికి వినియోగదారులకు వీలుండదు. ఈ హెచ్చరికలు అత్యంత ప్రాధాన్యత గల నోటిఫికేషన్లుగా అందుతాయి. ఇవి ప్రత్యేకమైన పెద్ద టోన్లతో కూడిన పాప్-అప్ సందేశాలుగా కనిపిస్తాయి. అలాగే సపోర్ట్ చేసే మొబైల్ ఫోన్లలో ఈ సందేశం బిగ్గరగా మాటల్లో వినిపిస్తుంది.
ఈ వ్యవస్థ ఆకస్మిక వరదలు, గ్యాస్ లీకేజీల వంటి విపత్తుల సమయంలో రక్షణ చర్యలకు తగిన సమయాన్ని అందించేలా దాదాపు ఎప్పటికప్పుడు బహుభాషా హెచ్చరికలను అందిస్తుంది. 2జీ నుంచి 5జీ నెట్వర్క్ల వరకు సపోర్ట్ చేసే ఈ వ్యవస్థ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణంలో ఉన్న జనాభాతో సహా అందరికీ విస్తృతంగా అందుబాటులోకి వస్తుంది. ప్రత్యక్ష, అధికారిక సమాచార ప్రసారాన్ని అందించడం ద్వారా ఇది విపత్తు నిర్వహణను బలోపేతం చేయటంతో పాటు వేగవంతమైన ప్రతిస్పందనను ప్రోత్సహిస్తుంది. ఇది భయాందోళనలను తగ్గించి ప్రజల విశ్వాసం, సహకారాన్ని పెంపొందిస్తుంది.
క్యాప్-ఆధారిత సాషే విధానం కింద సెల్ బ్రాడ్కాస్ట్ సొల్యూషన్కు సంబంధించిన అఖిల భారత స్థాయి పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దీనికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వ్యవస్థ విపత్తుల సమయంలో ఎంతో సమర్థవంతమైందని నిరూపితమైంది. ఇది ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్లలోని మిలియన్ల మంది ప్రజలకు సేవలు అందించింది. దీనిని ప్రస్తుతం చార్ ధామ్ యాత్ర కోసం కూడా ఉపయోగిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ‘అందరికీ ముందస్తు హెచ్చరికలు’ అనే కార్యక్రమానికి అనుగుణంగా సీ-డాట్ దీనిని మారిషస్, కంబోడియా, ఎల్ సాల్వడార్, శ్రీలంక వంటి దేశాలలో అంతర్జాతీయంగా విజయవంతంగా ప్రదర్శించింది.
***
(రిలీజ్ ఐడి: 2257662)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5