మంత్రిమండలి
నిరంతర సముద్ర బీమా రక్షణను సులభతరం చేయడానికి రూ. 12,980 కోట్ల సార్వభౌమ హామీతో 'భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్' (బీఎంఐ పూల్) ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి వర్గం
ప్రపంచవ్యాప్త అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితిని ఎదుర్కోవడానికి సహాయపడనున్న ఈ స్వదేశీ బీమా పూల్
భారతీయ నౌకలు విదేశీ బీమాపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించనున్న బీమా పూల్
హల్, మెషినరీ, కార్గో, పీ- ఐ, యుద్ధ ప్రమాదాల వంటి అన్ని సముద్రయాన ముప్పులకు కవరేజీ ఇవ్వనున్న పూల్
అస్థిరమైన సముద్ర మార్గాల గుండా ప్రయాణించేటప్పుడు కూడా అంతర్జాతీయ ప్రాంతాల నుంచి భారతీయ ఓడరేవులు, తిరిగి వెళ్లే సరుకు రవాణా నౌకలకు పూర్తి బీమా రక్షణను కల్పించనున్న పూల్
నాడు పోస్టు చేయడమైనది:
18 APR 2026 3:10PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 'భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్' (బీఎంఐ పూల్) ఏర్పాటుకు అధికారికంగా ఆమోదం లభించింది. నిరంతర సముద్ర బీమా కవరేజీని కల్పించేందుకు రూ. 12,980 కోట్ల సార్వభౌమ హామీతో ఈ పూల్ ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయంగా సముద్ర మార్గాల్లో అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ భారతీయ వాణిజ్యానికి ఎటువంటి అంతరాయం కలగకుండా చూడటమే దీని ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ ఓడరేవుల నుంచి భారతీయ ఓడరేవులకు సరుకు రవాణా చేసే నౌకలతో పాటు భారత్ నుంచి అంతర్జాతీయ గమ్యస్థానాలకు సరుకు రవాణా చేసే నౌకలకు అస్థిరమైన సముద్ర మార్గాల్లో ప్రయాణించేటప్పుడు కూడా సరసమైన ధరలో బీమా సౌకర్యం అందుబాటులో ఉండేలా ఈ పూల్ భరోసా ఇస్తుంది.
"ప్రపంచవ్యాప్త అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా సముద్ర వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమైంది. దీనివల్ల సరుకు, నౌకలకు నష్టపోయే ముప్పు పెరగడమే కాకుండా బీమా ఖర్చులు పెరగడం, బీమా నిరంతరాయంగా అందుబాటులో ఉండటంపై అనిశ్చితి నెలకొంది. అంతేకాకుండా చమురు కాలుష్య బాధ్యతలు, శిథిలాల తొలగింపు, సరుకు నష్టం, సిబ్బంది గాయాలు, స్వదేశానికి తరలింపు, ఢీకొనడం వల్ల కలిగే నష్టాలు వంటి తృతీయ పక్ష బాధ్యతలకు సంబంధించిన పీ-ఐ బీమా కోసం భారతీయ నౌకలు 'ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ ఇండెమ్నిటీ (ఐజీపీ-ఐ) క్లబ్'పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అందువల్ల ఆంక్షలు లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బీమా కవరేజీని నిలిపివేసిన పరిస్థితుల్లో కూడా దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ వాణిజ్య కార్యకలాపాలను నిరంతరాయంగా కొనసాగించడానికి ఒక దేశీయ సముద్ర ప్రమాదాల బీమా పూల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
పైన పేర్కొన్న పరిస్థితుల దృష్ట్యా ‘భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్’ (బీఎంఐ పూల్) ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది భారత జెండా కలిగిన లేదా భారత నియంత్రణలో ఉన్న నౌకలకు, భారత్ నుంచి బయలుదేరే లేదా భారత్కు వచ్చే నౌకలకు వర్తిస్తుంది. దీనికి ప్రభుత్వ సార్వభౌమ హామీ ఉంటుంది. ఈ పూల్ హల్- మెషినరీ, కార్గో, పీ- ఐ, యుద్ధ ముప్పు వంటి అన్ని సముద్ర ప్రమాదాలను కవర్ చేస్తుంది. పూల్ సభ్యులుగా ఉన్న బీమా సంస్థలు సుమారు రూ. 950 కోట్ల మొత్తం అండర్ రైటింగ్ సామర్థ్యాన్ని ఉపయోగించి పాలసీలను జారీ చేస్తాయి. ఈ పూల్ ద్వారా బాధ్యతాయుతమైన బీమాను స్థానికంగా నిర్వహించడం.. భారతీయ షిప్పింగ్ పరిస్థితులు, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా బీమాను రూపొందించడం సులభతరం అవుతుంది. అంతేకాకుండా భారతదేశంలోనే ప్రత్యేక మెరైన్ అండర్ రైటింగ్, క్లెయిమ్స్ నిర్వహణ, చట్టపరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి ఇది దోహదపడుతుంది.
ఇంకా ఈ పూల్ ఏర్పాటు, పనితీరును పర్యవేక్షించడానికి ఒక పాలక మండలిని ఏర్పాటు చేస్తారు. స్వయం సమృద్ధిని పెంపొందించడం, ఆంక్షలను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడం, మరింత మెరుగైన సార్వభౌమ నియంత్రణను నిర్ధారించడం వంటి ముఖ్య ఉద్దేశంతో ఈ దేశీయ బీమా సంస్థకు సార్వభౌమ హామీని అందించాలని ప్రతిపాదించారు.
***
(రిలీజ్ ఐడి: 2253267)
సందర్శకుల సూచీ సంఖ్య : : 22