గౌరవ ఛాన్సలర్ స్టాకర్,
ఉభయ దేశాల ప్రతినిధులారా,
మీడియా మిత్రులారా,
నమస్కారం!
గ్రుస్ గాట్!
ఛాన్సలర్ స్టాకర్, మీ తొలి భారత పర్యటనకు సాదర స్వాగతం పలుకుతున్నాను. ఐరోపా వెలుపల మీ మొదటి పర్యటన కోసం మీరు భారతదేశాన్ని ఎంచుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇది భారతదేశం-ఆస్ట్రియా సంబంధాల పట్ల మీకున్న దార్శనికత, నిబద్ధతను తెలియజేస్తోంది.
40 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా ఛాన్సలర్ భారతదేశ పర్యటనకు రావడం చాలా ముఖ్యమైన విషయం. 2026లో భారత్-ఐరోపా సమాఖ్య మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత భారత్-ఈయూ సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఛాన్సలర్ స్టాకర్ పర్యటన ద్వారా మేం భారత్-ఆస్ట్రియా సంబంధాలను ఒక నూతన యుగంలోకి తీసుకెళ్తున్నాం.
మిత్రులారా,
మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, సుస్థిరత రంగాలలో భారత్, ఆస్ట్రియా నమ్మకమైన భాగస్వాములు. ఢిల్లీ మెట్రో నుంచి మొదలుకొని హిమాలయాలలో 10,000 అడుగుల ఎత్తులో నిర్మించిన అటల్ టన్నెల్ వరకు ఆస్ట్రియాకు ఉన్న టన్నెలింగ్ నైపుణ్యం చెరగని ముద్ర వేసింది.
అంతేకాకుండా రైల్వే ప్రాజెక్టుల నుంచి గుజరాత్లోని గిర్నార్ రోప్వే వరకు, స్వచ్ఛ ఇంధనం నుంచి పట్టణాభివృద్ధి వరకు భారత్లోని అనేక ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో ఆస్ట్రియా కంపెనీలు చురుకైన భాగస్వాములుగా ఉన్నాయి.
మిత్రులారా,
ఛాన్సలర్ స్టాకర్ పర్యటన వాణిజ్యం, పెట్టుబడులలో సరికొత్త ఉత్తేజాన్ని నింపనుంది. ఆయన ఒక బలమైన దార్శనికత, భారీ వ్యాపార ప్రతినిధి బృందంతో భారత్కు రావడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
ఆస్ట్రియాకు ఉన్న నైపుణ్యాన్ని భారతదేశపు వేగం, విస్తృతితో అనుసంధానించడం ద్వారా ప్రపంచం కోసం నమ్మదగిన సాంకేతికతలు, సరఫరా గొలుసులను నిర్మించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. రక్షణ, సెమీకండక్టర్లు, క్వాంటం సాంకేతికత, జీవ సాంకేతికత రంగాలలో కూడా మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం.
అదే సమయంలో ఇంజనీరింగ్, సాంకేతిక విద్యా రంగాల్లో సహకారాన్ని మేం మరింత పటిష్టం చేస్తాం. ఐఐటీ ఢిల్లీ, ఆస్ట్రియాకు చెందిన మోంటన్ విశ్వవిద్యాలయం మధ్య ఈ రోజు సంతకాలు అయిన అవగాహన ఒప్పందం ఈ విజ్ఞాన మార్పిడికి ఒక చక్కని ఉదాహరణ.
మిత్రులారా,
ఆస్ట్రియా ఆవిష్కరణలు, ఉత్పాదకతను పెంపొందించే సామర్థ్యం భారతీయ మానవ వనరులకు ఉంది. 2023లో మేం ఆస్ట్రియాతో సమగ్ర వలస, గమనశీలత ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఈ ఒప్పందం ప్రకారం మేం ఇప్పుడు నర్సింగ్ రంగంలో కూడా గమనశీలతను మరింత ముందుకు తీసుకెళ్తాం.
మేం సంయుక్త పరిశోధన, అంకుర సహకారాన్ని కూడా మరింత బలోపేతం చేస్తాం. యువజన మార్పిడిని ప్రోత్సహించడానికి మేం ఈ రోజు 'భారత్-ఆస్ట్రియా వర్కింగ్ హాలిడే ప్రోగ్రామ్'ను కూడా ప్రారంభిస్తున్నాం.
మిత్రులారా,
ఈ రోజు ప్రపంచం మొత్తం అత్యంత తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉంది. దీని ప్రభావం మనందరిపై పడుతోంది. ఇటువంటి ఉద్రిక్త ప్రపంచ వాతావరణంలో సైనిక సంఘర్షణల ద్వారా పరిష్కారాలను సాధించలేమని భారత్, ఆస్ట్రియా ఏకీభవిస్తున్నాయి. ఉక్రెయిన్ అయినా లేదా పశ్చిమ ఆసియా అయినా మేం స్థిరమైన, సుస్థిరమైన, శాశ్వతమైన శాంతికి మద్దతు ఇస్తున్నాం.
పెరుగుతున్న ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థల సంస్కరణలు అత్యావశ్యకమని కూడా మేం అంగీకరిస్తున్నాం. తీవ్రవాదాన్ని వేళ్లతో సహా నిర్మూలించడం మా ఉమ్మడి నిబద్ధతగా కొనసాగుతుంది.
గౌరవనీయులైన స్టాకర్,
2024లో నా ఆస్ట్రియా పర్యటన కూడా నాలుగు దశాబ్దాల తర్వాత జరిగింది. ఆ పర్యటనను అనుసరిస్తూ ఈ రోజు మిమ్మల్ని భారతదేశానికి ఆహ్వానించడం మాకు ఎంతో గర్వకారణం.. సంతోషకరమైన విషయం. భారత్-ఆస్ట్రియా భాగస్వామ్యాన్ని ఆవిష్కరణల కేంద్రంగా, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా తీర్చిదిద్దేందుకు మనం కలిసి పని చేద్దాం.
చాలా ధన్యవాదాలు.