ఆయుష్
లోనార్లో యోగా మహోత్సవ్-2026లో భాగంగా ఐడీవై 2026... 75 రోజుల కౌంట్డౌన్ను ప్రారంభించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ
యోగా మహోత్సవ్-2026లో సామూహిక త్రికోణాసన సాధనతో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం
సమష్టి భాగస్వామ్య స్ఫూర్తిని, ప్రతి ఒక్కరి ఆరోగ్య సంక్షేమాన్ని ప్రతిబింబించిన సామూహిక త్రికోణాసన ప్రదర్శన: శ్రీ ప్రతాపరావు జాదవ్
సంపూర్ణ ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్త చైతన్యానికి ప్రతీకగా యోగా మహోత్సవ్-2026
నాడు పోస్టు చేయడమైనది:
07 APR 2026 2:56PM by PIB Hyderabad
ఇవాళ మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా లోనార్లో ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ ఉద్యాన్ వద్ద ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎండీఎన్ఐవై), యోగా మహోత్సవ్-2026ను నిర్వహించింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహించిన త్రికోణాసన ప్రదర్శన ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించటంతో ఈ కార్యక్రమం కీలక ఘట్టంగా నిలిచింది.
చారిత్రక నగరమైన లోనార్ను సామూహిక ఆరోగ్య కేంద్రంగా మారుస్తూ.. వేకువజామునే కామన్ యోగా ప్రొటోకాల్ (సీవైపీ)ని నిర్వహించేందుకు 5,000 మంది సమావేశమయ్యారు. ఐక్యత, ఆరోగ్యం, సంక్షేమాన్ని పెంపొందించటంలో శక్తిమంతమైన మాధ్యమం యోగా అని, ప్రపంచవ్యాప్తంగా దీనికి పెరుగుతున్న ఆదరణను ఈ భారీ భాగస్వామ్యం స్పష్టం చేసింది.
కేంద్ర ఆయుష్ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ.. "అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)-2026కి సంబంధించి 75 రోజుల కౌంట్డౌన్కు ఈ కార్యక్రమం గొప్ప ఆరంభం" అని అభివర్ణించారు. భౌగోళిక ప్రాముఖ్యత గల లోనార్ ప్రాంతంలో ఈ వేడుకను నిర్వహించటం.. సంపూర్ణ ఆరోగ్యం, సామరస్యం పట్ల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చైతన్యానికి ప్రతీకని తెలిపారు. యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ.. యోగా సాధన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, భావోద్వేగ సమతుల్యత నిరంతరం మెరుగవుతాయన్నారు.
రికార్డు సృష్టించిన ఈ త్రికోణాసన ప్రదర్శన ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ.. యోగాలో అంతర్లీనంగా ఉన్న సామూహిక భాగస్వామ్యాన్ని, ఉమ్మడి సంక్షేమాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తుందని శ్రీ జాదవ్ అన్నారు. ఆయుష్ ఆహార ప్రాముఖ్యతను వివరిస్తూ.. రోగనిరోధక శక్తిని పెంచటంలో, సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించటంలో సంప్రదాయ, సహజ ఆహార పదార్థాలైన తృణధాన్యాలు, రాగులు, కొబ్బరి నూనె, ఔషధగుణాలు గల సుగంధ ద్రవ్యాల పాత్రను తెలియజేశారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీమతి మోనాలిసా దాష్ ప్రసంగిస్తూ.. ప్రపంచానికి భారత్ అందించిన విలువైన కానుకల్లో యోగా ఒకటని అభివర్ణించారు. మనసు, శరీరం, ఆత్మల మధ్య సామరస్యాన్ని పెంపొందించే జీవన విధానాన్ని సూచిస్తుందని చెప్పారు.
కామన్ యోగా ప్రోటోకాల్ ప్రత్యక్ష ప్రదర్శనతో మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎండీఎన్ఐవై) డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) కాశీనాథ్ సమగండి నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటివి చేయటం ద్వారా పాల్గొన్నవారంతా యోగా సమగ్ర ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన.. "యోగా ఫర్ ఎయిర్ ట్రావెల్" ప్రోటోకాల్, "అసంక్రమిత వ్యాధులకు 10 యోగా పద్ధతులు”, దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసే లక్ష్యంతో రూపొందించిన యోగా 365 వంటి పలు ప్రచార కార్యక్రమాలను యోగా మహోత్సవ్-2026లో ప్రదర్శించారు. 14 రోజుల పాటు ఉచిత యోగా శిక్షణను అందించే టోల్-ఫ్రీ హెల్ప్లైన్ (1800-315-7008) గురించి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై)-2026కు సంబంధించి 75 రోజుల కౌంట్డౌన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, జిల్లా పరిపాలనా విభాగ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
పదకొండేళ్లుగా ఆరోగ్యం, సంక్షేమానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ఉద్యమాల్లో ఒకటిగా అంతర్జాతీయ యోగా దినోత్సవం అవతరించింది. అంతర్జాతీయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. జరగబోయే 12వ ఎడిషన్ అసంక్రమిత వ్యాధుల నివారణ, వృద్ధుల ఆరోగ్య పరిరక్షణ, కృత్రిమ మేధస్సు వంటి నూతన సాంకేతికతలను యోగాతో అనుసంధానించే అంశాలపై దృష్టి సారించనుంది.
ఐడీవై-2026కు సన్నాహకంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ.. యోగాను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు నిబద్ధతతో ఉన్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది.
***
(రిలీజ్ ఐడి: 2249901)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11