సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వేవ్స్ 2025లో చౌకైన, అందరికీ అందుబాటులో ఉండే విద్యా సాంకేతిక పరిష్కారాలకు ఊతమిచ్చిన ‘ఇన్నోవేట్ 2 ఎడ్యుకేట్’ ఛాలెంజ్
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 4:41PM by PIB Hyderabad
విద్య, సాంకేతికతను సృజనాత్మకంగా అనుసంధానిస్తూ సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ (సీఐసీ) మొదటి సీజన్లో భాగంగా ‘ఇన్నోవేట్ 2 ఎడ్యుకేట్’ పోటీని నిర్వహించారు. విద్యార్థులు, అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు చేతితో పట్టుకోగలిగే సులభతరమైన అభ్యాస పరికరాలను రూపొందించడం, అభివృద్ధిపై ఈ ఛాలెంజ్ ప్రత్యేక దృష్టి సారించింది.
దృష్టి లోపం ఉన్నవారు, న్యూరో డైవర్జెంట్ అభ్యాసకుల వంటి విభిన్న అభ్యాస అవసరాలు గల పిల్లలతో సహా, వినూత్నమైన, అందరికీ అందుబాటులో ఉండే పరిష్కారాలను రూపొందించేందుకు పాల్గొనేవారిని ఈ పోటీ ప్రోత్సహించింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విభిన్న నేపథ్యాలకు చెందిన విద్యార్థులు, ఆవిష్కర్తలు పాల్గొన్నారు. మంత్రిత్వ శాఖ మద్దతుతో ఒక పారిశ్రామిక సంఘం ఈ పోటీని నిర్వహించింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. అన్ని వర్గాల ప్రజలు ఇందులో భాగస్వామలయ్యేలా చూడటమే దీని ఉద్దేశ్యం.
ఈ పరికరాల తయారీలో వాడే హార్డ్వేర్ భాగాల ఖర్చు రూ. 1,000 మించకూడదని మార్గదర్శకాలను విధించారు. విద్యా సాంకేతికత సామాన్యులకు అందుబాటులో ధరలో ఉండేలా, పొదుపుతో కూడిన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ, వర్క్షాప్ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వారి పరిష్కారాలను మరింత మెరుగుపరిచి, పటిష్టమైన ఆవిష్కరణలుగా తీర్చిదిద్దారు.
దేశవ్యాప్తంగా వచ్చిన 1,800కి పైగా దరఖాస్తుల నుంచి పది మందిని ఫైనలిస్టులుగా ఎంపిక చేశారు. ఎంపికైన వారికి క్రియేటోస్పియర్, వేవ్స్ 2025 వేదికలపై తమ నమూనాలను ప్రదర్శించేందుకు, పరిశ్రమ నిపుణులతో చర్చించేందుకు అవకాశం కల్పించారు.
అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మొదటి మూడు విజేత బృందాలకు వారి కృషి, ఆవిష్కరణలకు గుర్తింపుగా రూ. 50,000 వరకు నగదు బహుమతి అందించారు. ప్రదర్శించిన డిజైన్లు, నమూనాలు అందరికీ అందుబాటులో ఉండే, ఇంటరాక్టివ్ లెర్నింగ్, సాంకేతికత ఆధారిత విద్యా విధానాలపై సరికొత్త దృక్పథాలను ప్రతిబింబించాయి.
సదస్సు ముగిసిన తర్వాత ఫైనలిస్టులుగా నిలిచిన 10 బృందాల్లో 4 అంకుర సంస్థలుగా ఎదిగాయి. వీటిలో రెండు వేవెక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్ కార్యక్రమం ద్వారా వ్యాపార ప్రోత్సాహక సౌకర్యాలను పొందే ప్రయత్నంలో ఉన్నాయి. వేవ్స్ బజార్ ప్రచార కార్యక్రమాల ద్వారా విజేతలు తమ ఆవిష్కరణలను భారీ స్థాయిలో విస్తరించేందుకు సంభావ్య పెట్టుబడిదారులతో చర్చించే అవకాశం లభించింది.
ఈ సమాచారాన్ని సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ నేడు లోక్సభలో శ్రీ బసవరాజ్ బొమ్మై అడిగిన ప్రశ్నలకు సమాధానంగా లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 2247982)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16