ఆర్థిక మంత్రిత్వ శాఖ
దేశంలోని 99.92 శాతం గ్రామాలకు చేరువైన బ్యాంకులు... 5 కిలోమీటర్ల పరిధిలోనే (బ్యాంకు శాఖ, బీసీ, ఐపీపీబీ) బ్యాంకింగ్ సేవా కేంద్రాలు
జన్ ధన్ దర్శక్ యాప్ ద్వారా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల జీఐఎస్ ఆధారిత నిరంతర పర్యవేక్షణ
నాడు పోస్టు చేయడమైనది:
30 MAR 2026 3:35PM by PIB Hyderabad
దేశంలోని ప్రతి నివాస గ్రామానికి అయిదు కిలోమీటర్ల పరిధిలోనే బ్యాంకింగ్ సేవలను (బ్యాంకు శాఖ, వ్యాపార ప్రతినిధి, భారతీయ తపాలా చెల్లింపుల బ్యాంకు) అందుబాటులోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల లభ్యతను ‘జన్ ధన్ దర్శక్’ అనే భౌగోళిక సమాచార వ్యవస్థ ఆధారిత మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
బ్యాంకులు జేడీడీ యాప్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా 6 మార్చి 2026 నాటికి దేశంలోని 99.92 శాతం గ్రామాలు..దాద్రా, నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతంలోని 100 శాతం గ్రామాలు కేవలం 5 కిలోమీటర్ల పరిధిలోనే బ్యాంకింగ్ సేవా కేంద్రాల (బ్యాంకు శాఖ, బీసీ, ఐపీపీబీ) సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల విస్తరణలో అనుసంధానం, ఇతర మౌలిక సదుపాయాల కొరతతో పాటు, సరైన భవనాలు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.
ప్రస్తుతం ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు.. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయడం ఒక నిరంతర ప్రక్రియ. దీనిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం, సభ్య బ్యాంకులు ఇతర భాగస్వాములతో సంప్రదించి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, కేంద్రపాలిత ప్రాంత స్థాయి బ్యాంకర్ల కమిటీ పర్యవేక్షిస్తుంది. ఇతర అంశాలతోపాటు ఆర్బీఐ ఆదేశాలు, తమ వ్యాపార ప్రణాళికలు, వాణిజ్య సాధ్యాసాధ్యాలను దృష్టిలో ఉంచుకుని కొత్త బ్యాంకు కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలిస్తాయి. ఒక ప్రాంతంలో బ్యాంకు సేవా కేంద్రాన్ని ప్రారంభించడానికి ఉన్న అనుకూలతను అంచనా వేయడానికి బ్యాంకులు అవసరమైన సర్వేలను కూడా నిర్వహిస్తాయి.
ఈ సమాచారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి నేడు లోక్సభలో వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 2247068)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15