రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
హైవేలపై అవకాశాలు: జాతీయ రహదారుల వెంట పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు,
వసతి కేంద్రాల కోసం అనుమతులు రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ సైటుతో ఇక మరింత సులభం
నాడు పోస్టు చేయడమైనది:
13 MAR 2026 1:53PM by PIB Hyderabad
దేశంలో రద్దీగా ఉండే జాతీయ రహదారి వెంబడి ఒక పెట్రోల్ బంకునో, రెస్టారెంటునో లేదా విశ్రాంతి స్థలాన్నో ఏర్పాటు చేయాలనుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోండి. కొంత కాలం కిందటి వరకు, దీనికి కావాల్సిన అనుమతులు పొందాలంటే.. అనేక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. పెద్ద సంఖ్యలో పత్రాలను నింపడంతోపాటు నెలల తరబడి వేచిచూడాల్సి వచ్చేది. అయితే, నవీకరించిన రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ సైటు వల్ల నేడు ఈ ప్రక్రియ చాలా సులభతరమైంది. జాతీయ రహదారుల వెంబడి నిర్మాణాలను చేపట్టడానికి అవసరమైన అనుమతులు పొందడం ఇప్పుడు మరింత వేగంగా, పారదర్శకంగా, సౌకర్యవంతంగా మారబోతోంది.
పెట్రోల్ బంకులు, ప్రయాణికుల వసతి కేంద్రాలు, నివాస గృహ సముదాయాలు, విశ్రాంతి గదుల సముదాయాలు, జాతీయ రహదారులతో కలిపేందుకు అవసరమైన అనుసంధాన రహదారులకు కావాల్సిన నిరభ్యంతర పత్రాలను పొందే ప్రక్రియను సరళతరం చేయడం కోసం ఈ వేదికను రూపొందించారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఇటీవల ఈ పోర్టల్ ను ప్రారంభించారు. సాంకేతికత ఆలంబనగా పాలన ద్వారా.. ప్రభుత్వ పనితీరులో సమర్థతనూ, పారదర్శకతనూ పెంచే దిశగా ప్రభుత్వ కృషిలో ఇది మరో కీలక ముందడుగు.
ఆధునికీకరించిన రాజ్మార్గ్ ప్రవేశ్ పోర్టల్ ద్వారా వివిధ అనుమతులు ఒకే డిజిటల్ వేదికపైకి వస్తాయి. దేశంలో విస్తరిస్తున్న రహదారి వ్యవస్థకు తోడ్పాటునందించేలా అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని సులభతరం చేస్తూ.. వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులకు ఇదెంతో ఊరటనిస్తుంది. హైవేల వద్ద ప్రైవేటు ఆస్తులు, పరిశ్రమలు, రహదారి వసతుల కోసం అనుమతులను ఇకపై ఆన్లైన్ ద్వారా తక్కువ సమయంలోనే పొందవచ్చు.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు జాతీయ రహదారుల వెంబడి నీరు, గ్యాస్ పైప్లైన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు, విద్యుత్ లైన్ల వంటి కీలక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులను కూడా ఈ జాతీయ వేదిక ద్వారా పొందవచ్చు.
దరఖాస్తు ప్రక్రియను డిజిటలీకరించడం ద్వారా, జవాబుదారీతనానికి ప్రాధాన్యమిస్తూ.. అనుమతి ప్రక్రియను సకాలంలో, మరింత సమర్థంగా పూర్తయ్యేలా చేయడం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ లక్ష్యం. ఈ వెబ్ సైటు భౌతిక పత్రాల అవసరాన్ని చాలా వరకూ తగ్గించడంతోపాటు దరఖాస్తు ఏ దశలో ఉందో పరిశీలించే అవకాశాన్నీ అందిస్తుంది. దీంతో జాప్యం తగ్గడమే కాకుండా సంస్థలకు కీలకమైన సమయమూ, నిర్వహణ వ్యయమూ ఆదా అవుతాయి. ఆధునికీకరించిన ఈ రాజ్మార్గ్ ప్రవేశ్ పోర్టల్ ద్వారా హైవేల రంగంలో డిజిటల్ నిర్వహణ మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, ఎలాంటి అంతరాయాలూ లేకుండా ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా.. అధికారులూ, దరఖాస్తుదారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.
అనుమతులూ, నిరభ్యంతర పత్రాలూ ఒకే చోట...
దేశ జాతీయ రహదారుల వ్యవస్థ 1.46 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించిన నేపథ్యంలో.. రహదారులు కేవలం ప్రాంతాలకు అనుసంధానాలు మాత్రమే కాదు. వాటి పాత్ర మరింత విస్తరించింది. కారిడార్ల వెంబడి కొత్త వ్యాపారాలకూ, మెరుగైన సేవలకూ, పటిష్టమైన మౌలిక సదుపాయాలకూ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ సదుపాయాల నిర్మాణాన్నీ, వినియోగాన్నీ మరింత సులభతరం చేయడానికి.. జాతీయ రహదారులకు సంబంధించి ప్రవేశ అనుమతులు, రోడ్డుపై చేపట్టే పనులకు (రైట్ ఆఫ్ వే) అనుమతులు, నిరభ్యంతర పత్రాల కోసం ఒకే సమగ్ర డిజిటల్ వేదికగా రాజ్మార్గ్ ప్రవేశ్ ఉపయోగపడుతుంది.
రాజ్మార్గ్ ప్రవేశ్ ద్వారా పొందగల అనుమతులు:
· వాణిజ్యపరమైన దుకాణాలు – జాతీయ రహదారుల వెంబడి పెట్రోల్ పంపులు, రెస్టారెంట్లు, దాబాలు, విశ్రాంతి ప్రదేశాలను ఏర్పాటు చేయాలనుకునే వ్యాపార సంస్థలు ఈ పోర్టలు ద్వారా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
· మౌలిక సదుపాయాలకు చేరువయ్యేందుకు – పరిశ్రమలు, నివాస ప్రాంతాలు, ప్రైవేటు భూముల యజమానులు తమ ఆస్తులను సమీపంలోని జాతీయ రహదారులతో అనుసంధానించే రోడ్ల కోసం అనుమతులు కోరవచ్చు.
· వసతి సదుపాయాలు – ప్రయాణికులకు, సరుకు రవాణా వాహనాల రాకపోకల కోసం సౌకర్యాలను మెరుగుపరిచేందుకు.. విశ్రాంతి కేంద్రాలు, ప్రత్యేక లాజిస్టిక్స్ వసతుల అభివృద్ధికి సంబంధించిన దరఖాస్తులను ఈ వేదిక ద్వారా సమర్పించవచ్చు.
· అత్యవసర సేవల కల్పన – రహదారి కారిడార్ల వెంబడి భూగర్భ నీటి పైప్లైన్లు, గ్యాస్ పైప్లైన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు, విద్యుత్ లైన్లను వేయడానికి కూడా అనుమతులను పొందవచ్చు.
నాడు – నేడు: ప్రక్రియలో వచ్చిన మార్పులేంటి?
గతంలో దరఖాస్తుదారులు క్షేత్రస్థాయిలో అనేక కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. చాలా పత్రాలతో కూడుకున్న సుదీర్ఘ ప్రక్రియ వల్ల అనుమతులకు చాలా సమయం పట్టేది. ఆ ప్రక్రియలోని పలు అంశాలు:
-
ప్రతీ దశలోనూ నేరుగా పత్రాలను సమర్పించాల్సి రావడం, వివిధ విభాగాల మధ్య ఫైళ్ల బదిలీ
-
దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ట్రాకింగ్ సదుపాయం పరిమితంగా ఉండేది. దీనివల్ల అనవసరమైన జాప్యం జరిగేది.
-
బాధ్యతలన్నీ వివిధ అధికారుల మధ్య విడివడి ఉండడం వల్ల.. ఏ అధికారికి దరఖాస్తు చేయాలో తెలియకపోవడం, సరైన అధికారిని గుర్తించడం కోసం ఒక్కోసారి మొదటినుంచి పనిని ప్రారంభించల్సి రావడంతో ప్రక్రియ పూర్తయ్యేందుకు చాలా సమయం తీసుకునేది.
దీనివల్ల మొత్తం ప్రక్రియలో కాలయాపన పెరిగి, పారదర్శకత లేకుండా ఉండేది.
ఈ కొత్త డిజిటల్ వేదిక అందులో చాలా మార్పులను తెచ్చింది:
· ఎప్పటికప్పుడు ట్రాకింగ్ సదుపాయం ద్వారా.. దరఖాస్తు ఏ దశలో ఉందో ఏ సమయంలోనైనా తెలుసుకోవచ్చు.
· అనుమతులు లేదా సలహాలను నిర్దిష్ట సమయం లోపే అందేలా చూస్తూ నిర్ణీత కాలపరిమితిలో తగిన స్పందన వచ్చేలా ఈ వ్యవస్థలో ఏర్పాట్లు చేశారు. దీంతో అనవసర జాప్యం తగ్గుతుంది.
· దరఖాస్తు పత్రాలను డిజిటల్ రూపంలో అప్లోడ్ చేయవచ్చు. దరఖాస్తు రుసుములను కూడా సురక్షిత డిజిటల్ చెల్లింపు వ్యవస్థల ద్వారా ఆన్లైన్లోనే చెల్లించవచ్చు.
· ప్రతి చర్యకూ, ప్రతి పత్రానికీ సంబంధించిన పూర్తి రికార్డు అందుబాటులో ఉంటుంది. దీంతో జవాబుదారీతనం మెరుగవుతుంది. ఏదైనా వివాదం తలెత్తినా త్వరగా పరిష్కారమవుతుంది.
· జీఐఎస్ ఆధారిత స్వీయ గుర్తింపు ప్రక్రియ ద్వారా కచ్చితమైన ప్రాంతాన్నీ, ఆ ప్రాంతం ఏ అధికారి పరిధిలోకి వస్తుందనే అంశాన్నీ స్వయంచాలకంగా తెలుసుకోవచ్చు. డేటా ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడడమే కాకుండా, మానవ పొరపాట్లను కూడా ఇది తగ్గిస్తుంది.
నవీకరించిన రాజ్మార్గ్ ప్రవేశ్ ఆన్లైన్ పోర్టల్ తో ఇలా అనేక ప్రయోజనాలున్నాయి. దేశ జాతీయ రహదారుల వెంబడి నిర్మాణాలు చేపట్టే ప్రతి ఒక్కరూ.. ఆలోచనలకే పరిమితం కాకుండా, ఆమోదం పొందే వరకూ ప్రక్రియను ఇదిప్పుడు మరింత సులభతరం చేయనుంది.
***
(రిలీజ్ ఐడి: 2244548)
సందర్శకుల సూచీ సంఖ్య : : 47