పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
· ప్రాధాన్యత రంగాలకు నిరంతరాయంగా కొనసాగుతోన్న సహజ వాయువు సరఫరా
· మార్చి నెలలో మంజూరైన 3.5 లక్షలకు పైగా గృహ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్లు
· గణనీయంగా తగ్గిన ముందస్తు బుకింగ్లు
· యథావిధిగా కొనసాగుతున్న గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ
· నిరంతర నిఘా, ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను, పౌర సరఫరాల శాఖ (ఎఫ్సీ-ఎస్) అధికారులను కోరిన కేంద్రం
· 547 మందికి పైగా భారతీయ నావికుల సురక్షిత స్వదేశీ పునరాగమనానికి మార్గం సుగమం
· పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ప్రపంచ నాయకులతో ప్రధానమంత్రి చర్చలు
· నౌకాయాన స్వేచ్ఛను కాపాడటం, సరకు రవాణా మార్గాలు సురక్షితంగా ఉండేలా చూసే విషయానికి ఉన్న ప్రాముఖ్యతను పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 MAR 2026 6:03PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై జరుగుతున్న వివిధ మంత్రిత్వ శాఖల (ఇంటర్ మినిస్ట్రీయల్) మీడియా సమావేశాల్లో భాగంగా ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత శాఖలకు చెందిన ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడారు. మారుతున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించడానికి ఈ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. నేటి కార్యక్రమంలో ఇంధన సరఫరా స్థితిగతులు, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందిస్తున్న సహాయంతో పాటు ఆయా రంగాల్లో స్థిరత్వాన్ని కొనసాగించడానికి తీసుకుంటున్న చర్యలపై సమగ్ర సమాచారాన్ని పంచుకున్నారు.
ఇంధన సరఫరా, లభ్యత
హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉంచేందుకు తీసుకుంటున్న చర్యలు.. ఇంధన సరఫరా స్థితిగతులపై పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ సమావేశంలో తాజా సమాచారాన్ని అందించింది. మంత్రిత్వ శాఖ ఈ విషయాలను వెల్లడించింది:
ముడి చమురు, చమురు శుద్ధి కేంద్రాలు
· అన్ని చమురు శుద్ధి కేంద్రాలు గరిష్ట సామర్థ్యంతో నడుస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉండటంతో పాటు పెట్రోల్, డీజిల్ విషయంలో తగినంత నిల్వలు అన్ని వేళలా ఉండేలా చూసుకుంటున్నారు.
· సంక్షోభానికి పూర్వం ఉన్న స్థాయిలతో పోలిస్తే చమురు శుద్ధి కేంద్రాల నుంచి దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి పెరిగింది.
రిటైల్ విక్రయకేంద్రాలు
· చమురు మార్కెటింగ్ కంపెనీల రిటైల్ విక్రయ కేంద్రాల్లో ఎక్కడా ఇంధన కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు. పెట్రోల్, డీజిల్ సరఫరా క్రమం తప్పకుండా కొనసాగుతోంది.
· తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నందున ప్రజలు అందోళనతో ముందస్తుగా కొనుగోళ్లు చేయొద్దని సూచించారు.
సహజ వాయువు
· ప్రాధాన్యత రంగాలకు రక్షిత సరఫరా కొనసాగుతోంది. ఇందులో గృహ వినియోగ పీఎన్జీ, సీఎన్జీ రవాణా రంగానికి 100 శాతం సరఫరా అందుతోంది. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు సరఫరాను సుమారు 80 శాతానికి పరిమితం చేశారు.
· సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు వాణిజ్య సముదాయాలకు పీఎన్జీ కనెక్షన్లను ప్రాధాన్యత క్రమంలో అందించాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి కంపెనీలు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
· సీజీడీ నెట్వర్క్ విస్తరణ విషయంలో దరఖాస్తుల ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని 16.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.
· ఎల్పీజీ నుంచి పీఎన్జీకి దీర్ఘకాలిక మార్పుకు సహకరించే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్పీజీని కేటాయించనున్నట్లు 18.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
· సీజీడీ విస్తరణ, పీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన సంస్కరణలు చేపట్టిందని 19.03.2026 నాటి లేఖ ద్వారా రాజస్థాన్ ప్రభుత్వం, 20.03.2026 లేఖ ద్వారా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపాయి. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి.
· సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పెండింగ్లో ఉన్న వాటితో పాటు కొత్త అనుమతుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలన్నింటినీ కోరింది.
· కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు లేదా విభాగాల పరిధిలోని కార్యాలయాలు, సంస్థల్లో పీఎన్జీ కనెక్షన్ల సంభావ్య డిమాండ్పై సమగ్ర అంచనా వేయాలని.. ఈ ప్రక్రియను సమన్వయం చేయడానికి ప్రతి మంత్రిత్వ శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించాలని 20.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం కోరింది.
· పై లేఖకు ప్రతిస్పందనగా పీఈఎస్ఓ (పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజీవ్ సేఫ్టీ ఆర్గనైజేషన్).. సీజీడీ దరఖాస్తుల ప్రక్రియను ప్రాధాన్యత ప్రతిపాదికన అంటే అందిన 10 రోజులలోపు పూర్తి చేయాలని తన పరిధిలోని అన్ని కార్యాలయాలకు సూచించింది.
· ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులు పీఎన్జీకి మారాల్సిందిగా కోరారు.
· సీజీడీ సంస్థల ద్వారా 2026 మార్చి మొదటి మూడు వారాల్లో 3.5 లక్షలకు పైగా గృహ, వాణిజ్య పీఎన్జీ కనెక్షన్లు జారీ అయ్యాయి లేదా క్రియాశీలకంగా మారాయి.
ఎల్పీజీ
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ సరఫరా ఇంకా ఆందోళనకరంగానే ఉంది. దీనిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.
· డిస్ట్రిబ్యూటర్ల వద్ద కొరత ఉందన్న నివేదికలు ఎక్కడా లేవు.
· భయాందోళనతో చేసే ముందస్తు బుకింగ్లు గణనీయంగా తగ్గాయి. గృహ అవసరాల ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ యథావిధిగా కొనసాగుతోంది.
· ఇప్పటికే వినియోగదారులకు పాక్షికంగా (20 శాతం) వాణిజ్య ఎల్పీజీ సరఫరాను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. దీనికి అదనంగా పీఎన్జీ విస్తరణకు సంబంధించి ‘సులభతర వాణిజ్య సంస్కరణల’ ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరో 10 శాతం వాణిజ్య ఎల్పీజీని కేటాయించాలని 18.03.2026 నాటి లేఖ ద్వారా ప్రతిపాదించింది.
· వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును మరో 20 శాతం పెంచుతూ 21.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీనితో మొత్తం కేటాయింపు 50 శాతానికి (పీఎన్జీ విస్తరణ సంస్కరణల ఆధారంగా ఇచ్చే 10%తో కలిపి) చేరుతుంది. ఈ అదనపు 20 శాతం కేటాయింపును రెస్టారెంట్లు, ధాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార శుద్ధి పరిశ్రమలు లేదా డైరీ పరిశ్రమలు, ప్రభుత్వం నిర్వహించే రాయితీ క్యాంటీన్లు, సామాజిక కిటెన్లు, వలస కూలీల కోసం ఉద్దేశించిన 5 కేజీల ఎఫ్టీఎల్ వంటి విభాగాలకు ప్రాధాన్యత క్రమంలో అందనుంది.
· కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వాణిజ్య ఎల్పీజీని కేటాయించాలని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాయి. మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. వాణిజ్య సిలిండర్లను విడుదల చేస్తున్నాయి. 2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లోని వాణిజ్య సంస్థలు మొత్తం సుమారు 15,842 మెట్రిక్ టన్నుల గ్యాస్ను పొందాయి.
కిరోసిన్
· రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 48,000 కిలోలీటర్ల (కేఎల్) కిరోసిన్ కేటాయించారు. వీటి పంపిణీ కేంద్రాలను గుర్తించాలని ఆయా రాష్ట్రాలను కోరారు.
· ఇప్పటికే 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ (ఎస్కేఓ) కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయగా.. హిమాచల్ ప్రదేశ్, లడఖ్ తమకు ఎటువంటి అవసరం లేదని తెలిపాయి. నేటి వరకు మరో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాత్ర
నిత్యావసర వస్తువుల చట్టం, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వుల ప్రకారం సరఫరా సక్రమంగా జరిగేలా చూడటంతో పాటు... అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్పై గట్టి నిఘా ఉంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకోవాలి.
భారత ప్రభుత్వం 13.03.2026, 18.03.2026 తేదీల నాటి లేఖల ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఇలా అభ్యర్థించింది.
· అక్రమ నిల్వలు కలిగి ఉండడం, బ్లాక్ మార్కెటింగ్, గృహావసర ఎల్పీజీ దారి మళ్లింపు సహా ఇతర అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు వాటిపై గట్టి నిఘా ఉంచడం.
· నిత్యావసర వస్తువుల చట్టం-1955, పెట్రోలియం చట్టం-1934, పెట్రోలియం నియమాలు-2002, మోటార్ స్పిరిట్, హెచ్ఎస్డీ ఉత్తర్వులు-2005, వర్తించే ఇతర చట్టాల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం.
· స్థానిక ప్రాధాన్యాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాణిజ్య ఎల్పీజీ పంపిణీకి తగిన విధానాలను రూపొందించడం.
· భయాందోళనలతో చేసే కొనుగోళ్లను నివారించడానికి ప్రజలకు సూచనలులు జారీ చేయడం, ఎల్పీజీని వివేకంతో ఉపయోగించుటను ప్రోత్సహించడం, కచ్చితమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడం.
· జిల్లా కలెక్టర్లు... ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు రోజువారీగా అమలు చర్యలు చేపట్టాలని కోరడమైనది.
· 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశాయి. ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చాలా వరకు రోజువారీ పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
· 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.
· కంట్రోల్ రూమ్లు, జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఇంకా ఏర్పాటు చేయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ అత్యవసర ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కోరడమైనది.
అమలవుతున్న చర్యలు
· అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి రాష్ట్రాల వ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో సుమారు 2,400 దాడులు నిర్వహించి, 800కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
· ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలలో స్వాధీనాలు, ఎఫ్ఐఆర్లు, అరెస్టులు సహా ప్రధాన చర్యలు నివేదించారు.
· ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వారాంతంలో దేశవ్యాప్తంగా రిటైల్ అవుట్లెట్లు, ఎల్పీజీ పంపిణీ కేంద్రాల్లో 2,600కు పైగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.
· ఇప్పటివరకు సుమారు 550 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, దాదాపు 150 మందిని అరెస్టు చేశారు.
ప్రభుత్వం చేపడుతున్న ఇతర చర్యలు
· ముఖ్యంగా గృహాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి ప్రాధాన్య రంగాలకు నిరంతరాయ ఎల్పీజీ సరఫరా కోసం ప్రాధాన్యమిస్తూనే, ప్రభుత్వం పీఎన్జీ విస్తరణకు ప్రాధాన్యత కొనసాగిస్తోంది.
· రిఫైనరీ ఉత్పత్తి పెంపు, పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచడం, ప్రాధాన్య కేటాయింపుల వంటి చర్యలు కొనసాగుతున్నాయి.
· ఎల్పీజీ డిమాండ్పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలను ప్రతిపాదించారు.
· చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు బొగ్గును పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగ్గును కేటాయించాలని ఇప్పటికే కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు గనులకు బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
· గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం పీఎన్జీ కనెక్షన్లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
ప్రజలకు సూచనలు
· పౌరులు అధికారిక సమాచార వనరులను మాత్రమే విశ్వసించాలనీ, వదంతులను నివారించాలని సూచించడమైనది.
· పౌరులు భయాందోళనలతో బుకింగ్లు చేయవద్దని, ఎల్పీజీ బుకింగ్ల కోసం డిజిటల్ వేదికలను మాత్రమే ఉపయోగించాలని, పంపిణీదారులను నేరుగా సందర్శించకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
· పీఎన్జీ, విద్యుత్-ఇండక్షన్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలని, దైనందిన వినియోగంలో ఇంధన పొదుపు పద్ధతులను పాటించాలని పౌరులను ప్రోత్సహిస్తున్నారు.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
ఈ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ నౌకలు, నావికులకు రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి గురించిన తాజా సమాచారాన్ని తెలిపిన నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ... కింది వివరాలను తెలియజేసింది:
· ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎటువంటి ఘటనలు చోటుచేసుకోలేదు.
· గత 48 గంటలుగా నౌకల మోహరింపులో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం 22 భారత జెండా నౌకలు, సుమారు 600 మంది భారతీయ నావికులు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నారు. 11 మంది నావికులు తమ విధులను ముగించుకుని, ప్రామాణిక విధానాల ప్రకారం స్వదేశానికి తిరిగి వస్తున్నారు.
· నౌకల యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, భారతీయ దౌత్య కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ డీజీ షిప్పింగ్ ఈ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24 గంటలూ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి గత 24 గంటల్లో పరిష్కరించిన 60 కాల్లు, 129 ఈమెయిళ్లు... గత 48 గంటల్లో పరిష్కరించిన 180 కాల్లు, 310 ఈమెయిళ్లు సహా ఇప్పటివరకు మొత్తం 3,730 కాల్లు, 7058 ఈమెయిళ్ళను స్వీకరించి, పరిష్కరించింది.
· గత 24 గంటల్లో 13 మంది, గత 48 గంటల్లో 34 మందితో సహా, ఇప్పటివరకు మొత్తం 547 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించడాన్ని డీజీ షిప్పింగ్ సులభతరం చేసింది.
· గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళం, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి సహా రాష్ట్ర మారిటైమ్ బోర్డులు ధ్రువీకరించినట్లుగా, ఓడరేవుల అంతటా ఎటువంటి రద్దీ లేకుండా భారత నౌకా వాణిజ్య రంగ కార్యకలాపాలు సజావుగా కొనసాగుతున్నాయి.
· జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, వి.ఓ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, విశాఖపట్నం పోర్ట్, ముంద్రా, దీన్దయాల్ పోర్ట్ అథారిటీ, న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ వంటి కీలక ఓడరేవుల్లో ఇప్పటికే అదనపు సామర్థ్యాన్ని కల్పించడం సహా నౌకల రాకపోకలు, సరుకు రవాణా కార్యకలాపాలను ఓడరేవులు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.
· సరుకు రవాణాను సజావుగా నిర్వహించడానికి, రద్దీని తగ్గించడానికి, చెన్నై పోర్ట్ అథారిటీలో సుమారు 40,000 చదరపు మీటర్ల బ్యాకప్ నిల్వ సహా, కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో దాదాపు 2,500 ఇరవై-అడుగుల సమాన యూనిట్ల (టీఈయూల) సామర్థ్యంతో అదనపు నిల్వ, నిర్వహణ సామర్థ్యం ఏర్పాటు చేశారు.
· పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ నౌకా రవాణా కార్యకలాపాలు, ఓడరేవు కార్యకలాపాలు, నావికుల భద్రత, నౌకా వాణిజ్యం కొనసాగింపును పర్యవేక్షిస్తూనే ఉంది.
ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత
భారత మిషన్ల ద్వారా కొనసాగుతున్న సహాయం, విస్తరణ సహా... ఈ ప్రాంతంలోని ఇటీవలి పరిణామాలపై తాజా సమాచారాన్ని పంచుకున్నారు. కింది విషయాలను తెలిపారు:
· పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల గురించి ప్రధానమంత్రి ప్రపంచ నాయకులతో మాట్లాడుతున్నారు.
· శనివారం రోజున ఇరాన్ అధ్యక్షులు డాక్టర్ మసూద్ పెజెష్కియన్తో మాట్లాడిన ప్రధానమంత్రి... ఆయనకు ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ కాలం పశ్చిమాసియాకు శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
· ఈ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను ప్రధానమంత్రి ఖండించారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగించడంతో పాటు, ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తున్నాయని అన్నారు.
· నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడం, నౌకాయాన మార్గాలు తెరవడంతో పాటు వాటిని సురక్షితంగా ఉండేలా చూడాల్సిన ప్రాముఖ్యతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
· ఇరాన్లోని భారత పౌరుల భద్రత, రక్షణకు ఇరాన్ అందిస్తున్న నిరంతర మద్దతును ఆయన ప్రశంసించారు.
· భారతీయ పౌరుల భద్రత, క్షేమం, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ... పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.
· రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతర సమన్వయంతో... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తూనే ఉంది.
· ఈ ప్రాంతం అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టులు నిరంతరం పనిచేస్తూ... హెల్ప్లైన్లను నిర్వహిస్తూ... పలు భారతీయ కమ్యూనిటీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ... ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నాయి.
· మిషన్లు ఆతిథ్య ప్రభుత్వాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ సముద్రయాన సిబ్బందికి, విద్యార్థులకు, చిక్కుకుపోయిన భారతీయ పౌరులకు, స్వల్పకాలిక సందర్శకులకు వీసా సౌకర్యం, కాన్సులర్ సేవలు, లాజిస్టికల్ మద్దతుతో సహాయం అందిస్తున్నాయి.
· ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుంచి సుమారు 3,75,000 మంది ప్రయాణికులు భారత్ తిరిగి వచ్చారు. దీంతో మొత్తం విమాన కార్యకలాపాలు మెరుగుపడుతూనే ఉన్నాయి.
· యూఏఈలో పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఈ రోజు సుమారు 95 విమానాలు భారత్కు రానున్నాయి.
· సౌదీ అరేబియా, ఒమన్ దేశాల నుంచి భారత్కు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. ఈ రోజు ఖతార్ ఎయిర్వేస్ భారత్కు సుమారు 8–10 షెడ్యూల్ చేయని విమానాలను నడపనుంది.
· కువైట్, బహ్రెయిన్ గగనతలాలు మూసి ఉన్నాయి. కువైట్కు చెందిన జజీరా ఎయిర్వేస్... సౌదీ అరేబియాలోని అల్ ఖైసుమా విమానాశ్రయం నుంచి భారత్లోని పలు గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది. బహ్రెయిన్కు చెందిన గల్ఫ్ ఎయిర్... సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి షెడ్యూల్ చేయని ప్రత్యేక వాణిజ్య విమానాలను భారత్కు నడపడం కొనసాగిస్తోంది.
· కువైట్, బహ్రెయిన్, ఇరాక్లలో ఉన్న భారత పౌరుల ప్రయాణానికి సౌదీ అరేబియా మీదుగా సౌకర్యం కల్పిస్తున్నారు.
· ఇరాన్లోని భారత పౌరులు అర్మేనియా, అజర్బైజాన్ల మీదుగా భారత్కు ప్రయాణించేందుకు సహాయం కొనసాగుతోంది. ఇప్పటివరకు 707 మంది విద్యార్థులు, 324 మంది భారత పౌరులు సహా 1,031 మంది భారతీయులు సరిహద్దు దాటారు.
· టెహ్రాన్, ఇస్ఫహాన్, షిరాజ్లలోని భారతీయ విద్యార్థులను ఇరాన్లోని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
· ఇజ్రాయెల్లోని భారత పౌరులు జోర్డాన్ మీదుగా భారత్కు ప్రయాణించేందుకు సౌకర్యం కల్పిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2244201)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7