ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
08 MAR 2026 3:54PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా, కేంద్ర మంత్రివర్గ సహచరులు మనోహర్ లాల్, హర్ష్ మల్హోత్రా, తోఖన్ సాహు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులందరికీ, గౌరవ పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు, నా ప్రియమైన ఢిల్లీ సోదరీ, సోదరులకు నమస్కారం.
అభివృద్ధికి కొత్త వేగం ఇచ్చేందుకు మనమందరం నేడు ఇక్కడ ఢిల్లీలో సమావేశమయ్యాం. కాసేపటి క్రితమే, ముప్పై మూడున్నర వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. మెట్రో విస్తరణ మొదలుకొని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల గృహనిర్మాణం వరకు రాజధానిలోని సౌకర్యాలు నిరంతరం బలోపేతం అవుతున్నాయి, ఇది నగరానికి కొత్త శక్తిని ఇస్తోంది. ఏడాది క్రితం ఢిల్లీ ప్రజలైన మీరు ఏ నమ్మకంతో, ఆశతో ఇక్కడ బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, ఆ సంకల్పం ఇప్పుడు ఈ అభివృద్ధి పనుల్లో కనిపిస్తోంది. ఈ నిరంతర ప్రగతి సందర్భంగా ఢిల్లీ పౌరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా,
నేటి కార్యక్రమం మరో కారణం చేత కూడా ప్రత్యేకం. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. భారత్ నేడు మహిళా సాధికారతకు సంబంధించి కొత్త చరిత్ర రాస్తోంది. రేఖా గుప్తా విజయవంతమైన నాయకత్వంలో రాజధాని నగరం ముందుకు సాగుతోంది. రాజకీయాలు, పరిపాలన, సైన్స్, క్రీడలు లేదా సామాజిక సేవ ఇలా ప్రతి రంగంలోనూ భారత మహిళా శక్తి కొత్త ఉత్సాహంతో దూసుకుపోతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళా శక్తికి నా హృదయపూర్వక అభినందనలు. దేశ అభివృద్ధిలో వారి అపారమైన కృషిని గుర్తించడమే కాకుండా, సమాజాన్ని, దేశాన్ని వారు మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు వారు కొత్త శక్తిని అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ వారికి అనేకానేక శుభాకాంక్షలు.
మిత్రులారా,
ప్రపంచంలో ఎవరైనా భారత్ వంటి భారతదేశం లాంటి విశాలమైన ప్రజాస్వామ్య దేశం గురించి ఆలోచించినప్పుడు, తరచుగా ఢిల్లీ చిత్రమే గుర్తుకు వస్తుంది. ఢిల్లీ కేవలం భారత రాజధాని మాత్రమే కాదు. ఇది భారతదేశ గుర్తింపు, భారత శక్తికి చిహ్నం. అందువల్ల, ఢిల్లీ అభివృద్ధి అంటే కేవలం ఒక నగరం అభివృద్ధి మాత్రమే కాదు. ఇది దేశం మొత్తం ప్రతిష్టతో ముడిపడి ఉంది. ఢిల్లీ ఎంత ఆధునికంగా మారుతుందో, ఢిల్లీలో సౌకర్యాలు ఎంత పెరుగుతాయో, ఢిల్లీ అనుసంధానం ఎంత మెరుగుపడుతుందో అంత బలంగా భారతదేశ ఆత్మవిశ్వాసం ప్రపంచం ముందు కనిపిస్తుంది. అందుకే, నేడు మన ఢిల్లీ నగరం సౌకర్యాలు, మౌలిక సదుపాయాల పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఒకప్పుడు ఢిల్లీ అంటే కేవలం ఇక్కడి అస్తవ్యస్త ఏర్పాట్ల గురించే చర్చ జరిగే రోజులు ఉండేవి. నగరంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే గంటల సమయం పట్టేది. బస్ స్టాండ్లలో బస్సులు, ఆటోల కోసం వేచి చూస్తూ తల్లులు, అక్కాచెల్లెళ్ళ సమయం వృధా అయ్యేది. కానీ నేడు ఢిల్లీ ముఖచిత్రం మారుతోంది. కేవలం కొన్ని రోజుల క్రితమే, వేగవంతమైన 'నమో భారత్' రైలు ఢిల్లీని మీరట్తో అనుసంధానించింది. దీనివల్ల ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ మధ్య ప్రయాణం సులభమైంది. నేడు మెట్రో నాలుగో దశ ప్రారంభంతో, ఢిల్లీ మెట్రో నెట్వర్క్ పరిధి 375 కిలోమీటర్లు దాటింది. ప్రపంచంలోని అనేక పెద్ద నగరాల్లో కూడా ఇంతటి భారీ మెట్రో నెట్వర్క్ లేదు.
మిత్రులారా,
నేడు ప్రారంభమైన కొత్త మెట్రో మార్గం రాజధానిలోని లక్షలాది మందికి ఎంతో సౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా తూర్పు, ఈశాన్య ఢిల్లీ ప్రజలకు రోజువారీ ప్రయాణం ఇప్పుడు చాలా సులభం అవుతుంది. దీనితో పాటు, ఢిల్లీ, ఎన్సిఆర్ నగరాలైన ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్ మధ్య ప్రయాణం కూడా మరింత సౌకర్యవంతంగా మారుతుంది.
మిత్రులారా,
ఏడాది క్రితం ఢిల్లీ ఒక ప్రమాదకరమైన ప్రభుత్వం నుంచి విముక్తి పొందడం ఎంత మంచిదన్నది చెప్పడానికి నేటి కార్యక్రమం ఒక నిదర్శనం. ఇక్కడ ఆ ప్రమాదకర ప్రభుత్వం లేకపోయి ఉంటే, మెట్రో నాలుగో దశ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేది. కానీ ఆ దుష్ప్రభుత్వ పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీలోని లక్షలాది మంది సౌకర్యాలను పక్కన పెట్టారు. ఇప్పుడు ఇక్కడ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీ సర్వతోముఖాభివృద్ధికి గొప్ప వేగం వచ్చింది.
మిత్రులారా,
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఢిల్లీలోని ప్రతి రవాణా సౌకర్యం ఆధునికత సంతరించుకుంటోంది. ఢిల్లీలో ప్రతిరోజూ లక్షలాది మంది బస్సుల్లో ప్రయాణిస్తారు. అందుకే ఢిల్లీ ప్రజలకు శుభ్రమైన, సౌకర్యవంతమైన, ఆధునిక బస్సు సేవలు అందించాలన్నది మా ప్రయత్నం. కేంద్ర ప్రభుత్వం అందించిన నాలుగు వేల పైగా ఎలక్ట్రిక్ బస్సులు నేడు ఢిల్లీ ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. గత ఒక్క ఏడాదిలోనే సుమారు 1800 కొత్త బస్సులు ఢిల్లీ రోడ్ల మీదకు వచ్చాయి. వీటిలో వందలాది "దేవి బస్సులు" ఢిల్లీలోని కాలనీలను, పరిసర ప్రాంతాలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తున్నాయి.
మిత్రులారా,
దాదాపు పదేళ్ల పాటు ఇక్కడి ప్రమాదకర ప్రభుత్వం ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంది. ఇప్పుడు మా ప్రభుత్వం ఢిల్లీకి సంబంధించిన వివిధ సవాళ్లను పరిష్కరించేందుకు ఒక లక్ష్యంతో పనిచేస్తోంది. పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వే నిర్మాణంతో లక్షలాది వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించాల్సిన అవసరం తప్పింది. యమునా నది శుభ్రత కోసం కూడా బిజెపి ప్రభుత్వం భారీ స్థాయిలో పనిచేస్తోంది. దీని కోసం కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.
మిత్రులారా,
ఢిల్లీలోని గత ప్రభుత్వం పేదల, మధ్యతరగతి ప్రజల లేదా మరెవరి సమస్యలను గురించీ పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని కూడా నాశనం చేసింది. ఆయుష్మాన్ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ మేము వారికి లేఖలు రాశాం. భారత ప్రభుత్వం కూడా లేఖలు రాసింది. కానీ ఆ పాలకులు పేదలను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడు రేఖాజీ నాయకత్వంలో, ఈ పరిస్థితిని మార్చడానికి బిజెపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. గత ఒక్క ఏడాదిలోనే, ఇక్కడ అనేక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. ఇప్పుడు ఢిల్లీలో ఆయుష్మాన్ పథకం కూడా అమలవుతోంది. ఢిల్లీ ప్రజలకు ఉచిత వైద్యం అందుతోంది. తేడా స్పష్టంగా కనిపిస్తోంది. తక్కువ పని, ఎక్కువ సాకులు చెప్పడం ఆ ప్రమాదకర ప్రభుత్వ పాలకుల విధానం. నేడు ఢిల్లీ నమూనా అంటే - సాకులు ఆగిపోయాయి. పని మొదలైంది. గతంలో ప్రాజెక్టులు ఫైళ్లలోనే ఆగిపోయేవి. నేడు ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయి.
మిత్రులారా,
ఇక్కడికి వచ్చే ముందు నేను సరోజినీ నగర్కు వెళ్లాను. అక్కడ కొత్తగా నిర్మించిన ప్రభుత్వ గృహాలను చూసే అవకాశం నాకు లభించింది. ప్రతి జాతీయ సంకల్పాన్ని నెరవేర్చడానికి పగలు రాత్రి కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ ఇళ్లు నిర్మించాం. వారికి సురక్షితమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నివాసం లభించడం చాలా అవసరం. అందుకే ఈ కొత్త, ఆధునిక భవనాలను నిర్మిస్తున్నాం. నేడు అటువంటి వేలాది కొత్త ఫ్లాట్లను లబ్ధిదారులకు అందించాం. ఈ కొత్త ఇళ్లు మన ఉద్యోగుల, వారి కుటుంబాల జీవితాల్లో కొత్త ఆనందాన్ని, కొత్త ఆశను నింపుతాయని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
నేడు దేశంలో ఎక్కడ బిజెపి ప్రభుత్వం ఉన్నా, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, నగరంలో ప్రజలు ఏదో ఒక పథకం ద్వారా కచ్చితంగా ప్రయోజనం పొందుతున్నారు. మన పేద కుటుంబాలు, మన తల్లులు, అక్కాచెల్లెళ్ళు, మన కార్మికులు, రైతులు, చిన్న చిన్న పనులు చేసుకునే మన సోదరీ,సోదరులు - వీరందరి కోసం ప్రభుత్వం ఏదో ఒక పని చేస్తూనే ఉంది. మన వీధి వ్యాపారులనే ఉదాహరణగా తీసుకుందాం. కరోనా సమయంలో మన దైనందిన జీవితాల్లో వారి ప్రాముఖ్యతను గుర్తించాం. ఒకప్పుడు తోపుడు బండ్లను కూడా అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితిలో వీరు ఉండేవారు. ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టడానికి కూడా వేరే వారి దగ్గర ఒకటి లేదా రెండు వేల రూపాయలను భారీ వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వచ్చేది. కానీ మా ప్రభుత్వం వారి కష్టాన్ని అర్థం చేసుకుని వారిని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించింది. నేడు ప్రధానమంత్రి స్వనిధి యోజన ద్వారా, అటువంటి లబ్ధిదారులు తమ వ్యాపారాల కోసం సులభంగా రుణాలు పొందుతున్నారు. ఢిల్లీలో కూడా సుమారు 2 లక్షల మంది వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా దాదాపు 350 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పొందారు.
మిత్రులారా!
ఇప్పుడే, వీధిలో బండ్లపై వ్యాపారం చేసే కొందరు మహిళలతో ముచ్చటించే అవకాశం నాకు లభించింది. వారంతా ఎంత బాగా ముందంజ వేస్తున్నారో విని నా హృదయం గర్వంతో ఉప్పొంగింది.
మిత్రులారా!
ఒకనాడు ఇదే ఢిల్లీ నగరంలో డెబిట్-క్రెడిట్ కార్డులు ధనవంతుల చేతుల్లోనే కనిపించేవి. కానీ, నేడు పరిస్థితి మారుతోంది... మన వీధి వ్యాపారులతోపాటు బండ్ల కార్మికులు కూడా క్రెడిట్ కార్డు సదుపాయం పొందుతున్నారు. ఈ వ్యాపారులకు స్వానిధి క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇకపై తమ జేబులోని క్రెడిట్ కార్డును వారు అవసరాలకు అనుగుణంగా వాడుకోవచ్చు. ఇంతకుముందే ఈ వేదికపైన స్వానిధి క్రెడిట్ కార్డులలో కొన్నింటిని నా చేత్తో మహిళలకు అందజేసే అవకాశం లభించింది. ఇప్పడివి పేదల ఆత్మగౌరవం పెంచే సరికొత్త మాధ్యమంగా మారుతున్నాయి.
మిత్రులారా!
ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో దేశంలోని లక్షలాది సోదరీమణులతో మరొక ఆనందకర అంశాన్ని పంచుకోవాలని భావిస్తున్నాను. కొన్నేళ్ల కిందట దేశంలోని 3 కోట్ల మంది మహిళలను “లక్షాధికారి సోదరి”గా మార్చాలని మేము నిశ్చయించుకున్నాం. గ్రామీణ మహిళలు లక్షాధికారులు కావడమన్నది ఎన్నికల్లో గెలవడం కోసం మోదీ చెప్పిన అబద్ధమని చాలా మంది నన్ను హేళన చేశారు. నన్నెంతగానో విమర్శించారు... చులకనగా తీసిపారేశారు. వివిధ సామాజిక మాధ్యమ వేదికలు చలోక్తులతో నిండిపోయాయి. కానీ నేడు.. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నా తల్లులు, సోదరీమణులు అపార శక్తిమంతులని నేను సగర్వంగా ప్రకటిస్తున్నాను. అవకాశం లభించాలేగానీ, వారు సాధించలేని విజయమంటూ ఏదీ ఉండదు. కాబట్టే, 3 కోట్ల మంది మహిళలను “లక్షాధికారులు”గా మారుస్తామన్న మా సంకల్పం నెరవేరిందని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. వాస్తవానికి వారి సంఖ్య 3 కోట్లను మించిపోయింది.
మిత్రులారా!
గ్రామీణ ప్రాంతాల్లోని మా సోదరీమణులు దశాబ్దాలుగా తమ నైపుణ్యాన్ని చాటుకుంటూనే ఉన్నారు. వారెంతో శ్రమజీవులైనా, తగినంత మూలధనంతోపాటు అవకాశాల అందుబాటు స్వల్పం. కాబట్టే, స్వయం సహాయ సంఘాలతో... బ్యాంకులతో మేం అనుసంధానించాం. వారికి సరికొత్త పద్ధతుల్లో శిక్షణ ఇచ్చి, అవకాశాలతోపాటు మార్కెట్ సౌలభ్యం కల్పించాం. ఇప్పుడ దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మహిళలు ఇలాంటి సంఘాలతో ముడిపడి ఉన్నారు. ఈ స్వయం సహాయ సంఘాలకు రూ.లక్షల కోట్ల ఆర్థిక సహాయం అందుతోంది. ఫలితంగా, గ్రామీణ మహిళలు స్వావలంబన సాధించడమే కాకుండా తమ కుటుంబాల ఆదాయం పెంచుకుంటున్నారు. తద్వారా “లక్షాధికారి సోదరి”గా మారి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నారు.
మిత్రులారా!
మన సోదరీమణుల విజయం సరికొత్త సంకల్పం పూనడంలో మాకు స్ఫూర్తినిచ్చింది. ఆదిలో 3 కోట్ల మందిని ‘లక్షాధికారి సోదరి’ స్థాయికి తేవడం ఒకరకంగా అసాధ్యమనే అనిపించింది. కానీ, ఆ సంకల్పం నేడు సాకారమైన నేపథ్యంలో మరో 3 కోట్ల మందిని ఈ జాబితాలో జోడించాలని కృతనిశ్చయం పూనాం. అంటే, ఇప్పటికే లక్షాధికారులైన 3 కోట్ల మందికి అదనంగా, మరో 3 కోట్ల మందిని వారి సరసన చేర్చాలని సంకల్పించాం. మన దేశ నారీశక్తి ఆశీస్సులతో ఇది కూడా సాకారం కాగలదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
సోదరీసోదరులారా!
దేశం ఇవాళ మన తల్లులు, అక్కచెల్లెళ్లు, కుమార్తెల విజయోత్సవం చేసుకుంటున్న నేపథ్యంలో ఢిల్లీ వాసులతో, దేశంతో నేనొక వేదనను పంచుకోవాలని భావిస్తున్నాను. ఈ బాధ, దుఃఖం, హృదయానికి తగిలిన లోతైన గాయాన్ని పౌరుల ముందు వెలిబుచ్చాలని అనుకుంటున్నాను. ఇవాళ మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. కానీ, నిన్న పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం మన రాష్ట్రపతి, గౌరవనీయ ద్రౌపది ముర్మును తీవ్రంగా అవమానించింది. ఆమె సంతాల్ గిరిజన సంప్రదాయం ప్రధానోత్సవంలో పాల్గొనడానికి బెంగాల్ వెళ్లారు. అయితే, ఆమెతోపాటు ముఖ్యమైన గిరిజన కార్యక్రమాన్ని గౌరవించే బదులు, సంతాల్ ప్రజల పవిత్ర కార్యక్రమం సహా అధ్యక్షురాలిని టీఎంసీ బహిష్కరించింది. ఆమె స్వయంగా గిరిజన సమాజం నుంచి వచ్చారు... సంతాల్ ప్రజల ప్రగతి కోసం ఎంతో కృషి చేశారు. కానీ, టీఎంసీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని గందరగోళంలో పడేసింది.
మిత్రులారా!
ఇది రాష్ట్రపతిని అవమానించడం మాత్రమే కాదు... రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య ఘన సంప్రదాయాన్ని కూడా అవమానించడమే. పోరాటాల ద్వారా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ప్రతి సోదరిని, కుమార్తెను కూడా ఘోరంగా అవమానించడమే!
మిత్రులారా!
మన సంప్రదాయం ఏమంటోందంటే- “అహంకారే హతః పుష్ఠః సమూలాం చ వినశ్యతి” అంటే... నిలువెల్లా అహంకారం నిండిన వ్యక్తి, ఎంత శక్తిమంతుడైనా, చివరికి నశించక తప్పదు! అని అర్థం. ఈ నేపథ్యంలో ఇవాళ దేశ రాజధాని నుంచి మీకందరికీ నా విన్నపం ఏమిటంటే: గిరిజన రాష్ట్రపతిని అవమానించిన టీఎంసీ నీచ రాజకీయం, అధికార దురహంకారం త్వరలో సమసిపోవాలి. గిరిజనులను, అందునా గౌరవనీయ రాష్ట్రపతిని అవమానించిన టీఎంసీని పశ్చిమ బెంగాల్లోని వివేచనగల పౌరులు ఎన్నటికీ క్షమించరు. ఈ దేశం... గిరిజన సమాజం... మహిళా శక్తి కూడా వారిని ఎప్పటికీ క్షమించవు.
మిత్రులారా!
ప్రతి వర్గాన్ని, ప్రతి ఆలోచనను గౌరవించాలన్నది మన సంస్కృతి మనకు నేర్పిన సూత్రం. అలాగే, మన వారసత్వం పట్ల గర్వించాలని కూడా నేర్పింది. ఈ స్ఫూర్తితో నేడు మనం ఢిల్లీ వారసత్వాన్ని కాపాడుకోవడానికీ కృషి చేస్తున్నాం. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం “వారసత్వ సహిత ప్రగతి” తారకమంత్రంగా పనిచేసింది, ఢిల్లీలోని అనేక చారిత్రక ప్రదేశాలను సుందరీకరించింది. అలాగే అనేక కొత్త ప్రదేశాలు కూడా నిర్మితమయ్యాయి. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుల గౌరవార్థం జాతీయ యుద్ధ స్మారకం నిర్మించాం. కొత్త పార్లమెంట్ భవనం, కర్తవ్యపథ్, కర్తవ్య భవన్, సేవా తీర్థ్ అన్నీ ఈ 21వ శతాబ్దపు భారత్ నవ్య దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. కొద్ది రోజుల కిందట భారత్ మండపంలో చారిత్రక అంతర్జాతీయ ఏఐ శిఖరాగ్ర సదస్సు నిర్వహించాం. భారత్ మండపం, యశోభూమి వంటి ప్రాంగణాలు భారత సంస్కృతి, వాణిజ్యం, సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పే ప్రధాన వేదికలుగా రూపొందాయి. ప్రధానమంత్రి మ్యూజియం, యుగే-యుగే భారత్ మ్యూజియం వంటి కొత్త ప్రదర్శనశాలలు కూడా ఢిల్లీ ప్రతిష్ఠను మరింత బలోపేతం చేస్తున్నాయి.
మిత్రులారా!
దేశ చారిత్రక ప్రస్థానంలో ఢిల్లీ నగరానికి ప్రత్యేక స్థానముంది. నేడు ఈ నగరం ఓ నవ శకానికి సాక్షిగా నిలుస్తోంది. ఇది నవ భారత్ ఆత్మవిశ్వాస యుగం... ఈ ఆత్మవిశ్వాసం మనల్ని వికసిత పథంలో భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. అందువల్ల ప్రతి సంకల్పాన్ని సాకారం చేసుకోవడానికి మనమంతా సమష్టిగా కృషి చేయాలి. ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తా, ఆమె బృందం సారథ్యాన ఢిల్లీలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఊపందుకుంటుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఢిల్లీలోని ప్రతి కుటుంబం సంపన్నమై, మరింత మెరుగ్గా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సామరస్య స్ఫూర్తితో ఈ అభివృద్ధి పనులపై మరోసారి మీకందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇప్పుడు నాతోపాటు గళమెత్తి బిగ్గరగా నినదించండి:
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
***
(రిలీజ్ ఐడి: 2236885)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada