వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత ఎగుమతి ఆదాయాన్ని గణనీయంగా పెంచే సామర్థ్యం సేవా రంగంగా విద్యా రంగానికి ఉందని.. ఉన్నత ప్రమాణాలతో భారత విద్యను ప్రపంచవ్యాప్తంగా విస్తరించటానికి ఇది గొప్ప అవకాశమన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ప్రపంచ భవిష్యత్ వృద్ధికి ప్రగతి రథాలుగా మారనున్న భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు.. భారత్ తో పరిచయం అభివృద్ధి చెందిన దేశాల విద్యార్థులకు ప్రయోజనకరం: శ్రీ గోయల్
ఉన్నత విద్యలో అంతర్జాతీయ సహకారానికి, ప్రపంచ స్థాయి ప్రమాణాలకు కొత్త మార్గాలను సుగమం చేస్తున్న నూతన విద్యా విధానం-2020: శ్రీ గోయల్
నాడు పోస్టు చేయడమైనది:
06 MAR 2026 3:50PM by PIB Hyderabad
భారత ఎగుమతి ఆదాయాన్ని గణనీయంగా పెంచే సామర్థ్యం సేవా రంగంగా విద్యా రంగానికి ఉందని.. ఉన్నత ప్రమాణాలతో భారత విద్యను ప్రపంచవ్యాప్తంగా విస్తరించటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు.
న్యూఢిల్లీలో ఇవాళ ‘వికసిత్ భారత్-2047 కోసం ఉన్నత విద్యను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించటం’ అంశంపై జరిగిన వైస్ ఛాన్సలర్ల సదస్సులో శ్రీ పీయూష్ గోయల్ ప్రసంగించారు. భారత్ లో ఉన్నత విద్య భవిష్యత్ పై వైస్ ఛాన్సలర్లతో చర్చించి, వారి ఆలోచనలు, అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత ఎగుమతి ఆదాయాన్ని పెంచటంలో, భారతీయ విద్యను ప్రపంచవ్యాప్తంగా విస్తరించటంలో విద్యను ఒక సేవగా మలచటంలోని అవకాశాలను అన్వేషించేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, దాని పరిధిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ) ముందుకు రావటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ భాగస్వామ్యాలు, విద్యార్థుల రాకపోకలు, నియంత్రణ చట్టాలు, ఒకే సమయంలో రెండు డిగ్రీ పట్టాలు అందించే ప్రోగ్రాములు సహా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నత విద్య వంటి కీలక అంశాలపై చర్చలకు, నిపుణుల సంభాషణలకు వేదికగా నిలిచింది. భారతీయ ఉన్నత విద్యా సంస్థల ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని పెంపొందించే వ్యూహాలపై చర్చించారు. విద్యార్థుల రాకపోకల్లో వస్తున్న నూతన ధోరణులను విశ్లేషిస్తూ, విస్తరిస్తున్న ప్రపంచ విద్యా సేవల మార్కెట్ లో భారత్ ఉనికిని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలను అన్వేషించారు.
ప్రపంచ భవిష్యత్ వృద్ధికి ప్రగతి రథాలుగా తక్కువ అభివృద్ధి చెందిన లేదా అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలు నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల విద్యార్థులకు భారత్ వంటి దేశాలతో పరిచయం ఉండటం, వారి భవిష్యత్తుకు దోహదపడుతుందన్నారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో (ఎఫ్టీఏలు) సేవా రంగ విభాగాలపై చర్చలు జరుగుతున్నప్పుడు, ఈ ధోరణికి పెరుగుతున్న గుర్తింపును గమనించినట్లు శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖరారు చేసిన తొమ్మిది ఎఫ్టీఏలు, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో జరిగినట్లు వెల్లడించారు. మరింత అభివృద్ధి చెందిన, పరిణతి చెందిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ ఒప్పందాలు చేసుకోవటం వల్ల.. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ వాణిజ్యంలో దాదాపు మూడింట రెండు వంతుల వాటా ఈ వాణిజ్య ఒప్పందాల పరిధిలోకి వచ్చిందని అభిప్రాయపడ్డారు.
భారత్ ఇప్పుడు బలహీన స్థితిలో, వలసవాద మనస్తత్వంతో చర్చలు జరపటం లేదని, ప్రపంచ దేశాలతో భారత్ వ్యవహరించే తీరులో వచ్చిన మార్పును ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు. భారత్ ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో, శక్తిమంతంగా వ్యవహరిస్తుందన్నారు.
ప్రపంచ వృద్ధిలో సుమారు 20 శాతం వాటాను అందిస్తూ, వృద్ధికి ఇంజిన్ లా భారత్ ఆవిర్భవించిందని.. ప్రపంచవ్యాప్తంగా యువతరం, భారత్ వంటి దేశాలతో పనిచేయాల్సిన అవసరం భవిష్యత్తులో మరింత పెరుగుతుందని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా విద్యావేత్తలతో విస్తృతమైన చర్చలు జరిపి జాతీయ విద్యా విధానం-2020ని రూపొందించటం ద్వారా భారత విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సమగ్ర ప్రయత్నం జరిగినట్లు మంత్రి తెలిపారు. దేశవిదేశాల్లోని భాగస్వాముల ద్వారా వచ్చిన సూచనలు, విభిన్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ విధానాన్ని రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. దాదాపు మూడు లక్షల సలహాలు, అభిప్రాయాలు అందాయని.. పాలసీని ఖరారు చేసేముందు వాటన్నింటికీ తగిన ప్రాధాన్యతనిస్తూ జాగ్రత్తగా పరిశీలించామని ఆయన వివరించారు.
ఏళ్ల తరబడి సాగించిన చర్చల ఫలితంగా ఈ విద్యా విధానం రూపుదిద్దుకుందని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పనితీరుని ఇది ప్రతిబింబిస్తుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యను రూపొందించటం, భారత్ లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యా సంస్థలను విస్తరించటం, ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షించేలా భారతీయ ఆలోచనా దృక్పథాన్ని ఈ విధానం మార్చిందని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు.
భారత్ లో అంతర్జాతీయ విద్యా సంస్థలు క్యాంపస్ లను ఏర్పాటు చేయటానికి ఈ విధానం అనుమతించిందని.. విదేశీ విశ్వవిద్యాలయాలు భారతీయ సంస్థలతో కలిసి ఒకే సమయంలో రెండు డిగ్రీ పట్టాలు అందించేందుకు వీలు కల్పించిందని మంత్రి తెలిపారు. విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవటాన్ని ఈ విధానం ప్రోత్సహించింది. దీనివల్ల అభివృద్ధి చెందిన, ఇతర దేశాల విద్యా వ్యవస్థలపై భారత విద్యార్థులు అవగాహన పొందవచ్చు. అంతర్జాతీయంగా విద్యార్థులు కూడా భారత విద్యా విధానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు.
అభివృద్ధి చెందిన దేశాల విద్యార్థులు భారత్కు వచ్చి చదువుకునేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఇందుకోసం మూడేళ్ల ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు ఒక ఏడాది భారత్లో, రెండేళ్లు స్వదేశీ విద్యాసంస్థలో చదువుకునేలా ఉండాలని.. రెండు విద్యాసంస్థల మధ్య సమయాన్ని సమానంగా పంచుకునేలా ఉండాలని నమూనాను సూచించారు. ఒకే సమయంలో రెండు డిగ్రీలు అందించే కార్యక్రమం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆలోచనా విధానం, పనితీరు, సంస్కృతి, సమాజంతో అనుసంధానమయ్యే తీరును అభివృద్ధి చెందిన దేశాల విద్యార్థులు అర్థం చేసుకోవటానికి ఎంతగానో సహకరిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సదస్సులో పాల్గొన్న వైస్ ఛాన్సలర్లను భారత భవిష్యత్ నిర్మాతలుగా శ్రీ పీయూష్ గోయల్ అభివర్ణించారు. భారత యువత ఆలోచనలకు పదును పెట్టటంలో వారు కీలక పాత్ర పోషిస్తారన్నారు. రేపటి సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దటంలోనూ, అభివృద్ధి చెందిన ఆధునిక దేశానికి పునాదులు వేయటంలోనూ ప్రతి వైస్ ఛాన్సలర్ బాధ్యత వహించాలన్నారు.
కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యాసంస్థలు మారాలని, ఉపాధ్యాయులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, శిక్షణ పొందుతూ ఉండాలని తెలిపారు. తద్వారా ఆధునిక పాఠ్యాంశాలపైన, భవిష్యత్ అవసరాలకు తగిన జ్ఞానం పొంది విద్యార్థులకు బోధించగలరని పేర్కొన్నారు.
కాలం చెల్లిన విద్యా ప్రణాళికలతో భవిష్యత్తు కోసం విద్యార్థులను సిద్ధం చేయలేమని మంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా సిద్ధమవుతూ, సరికొత్త భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు.
భారత వాణిజ్యం, తయారీ, సేవా రంగాలను ప్రపంచ స్థాయికి విస్తరించటంతో పాటు కృత్రిమ మేథ, క్వాంటం కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో అనుసంధానమవటం కీలకమని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. భారతదేశ ప్రస్తుత వృద్ధి రేటును కొనసాగించాలన్నా, ప్రపంచంలోని మొదటి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవాలన్నా, అంతర్జాతీయ సాంకేతిక శక్తి కేంద్రంగా ఎదగాలన్నా ఈ అంశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటాయన్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను, బోధనా పద్ధతులను విద్యా సంస్థలు పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని అవకాశాలను విద్యార్థులు అర్థం చేసుకునేలా అంతర్జాతీయ వాణిజ్యం, భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వంటి అంశాలను విద్యా ప్రణాళికలో చేర్చాలని స్పష్టం చేశారు.
ఈ అమృత కాలంలో అంతర్జాతీయ చట్టాలు, వాణిజ్య నిబంధనలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే ప్రయోజనాలపై అవగాహన ఉన్న విద్యార్థులు భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించటంలో కీలక పాత్ర పోషిస్తారని కేంద్రమంత్రి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
విద్యాసంస్థలు ఆధునిక బోధనా పద్ధతులను అవలంబిస్తూ, వసతులను మెరుగుపరచుకుంటూ, ప్రపంచ పోకడలపై ఉపాధ్యాయులకు అవగాహన పెంచితే.. భారత విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకునేందుకు ఆసక్తి కనబరుస్తారని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. అంతేకాక, ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షించే కేంద్రంగా భారత్ మారుతుందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం 28 మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్తుంటే, ఒక విదేశీ విద్యార్థి భారత్ వస్తున్నారు. ఈ గణాంకాలు రాబోయే ఏళ్లలో తారుమారు కావాలని ఆయన కాంక్షించారు. భారత విద్యార్థులు విదేశాలకు వెళ్లటం తగ్గిపోయి, సుమారు 1.3 మిలియన్ విదేశీ విద్యార్థులు భారతీయ విద్యా సంస్థల్లో చదువుకోవటానికి రావాలని కోరుకున్నారు.
ఉన్నత విద్యను అంతర్జాతీయ స్థాయికి చేర్చాలనే లక్ష్యాన్ని సాధించటానికి, 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా మార్చేందుకు.. విద్యా సంస్థలు, ప్రభుత్వం, పరిశ్రమల మధ్య మరింత సహకారం ఉండాలని కాంక్షిస్తూ మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2236617)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5