శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 26 మంది యువ వైద్య నిపుణులకు అవార్డులను ప్రదానం చేసిన కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
వైద్య వృత్తి ప్రారంభించిన తొలినాళ్లలోనే వైద్యులకు అవార్డులు ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
ఇది వారికి గొప్ప గుర్తింపుతో పాటు ప్రోత్సాహాన్ని ఇస్తుంది... కెరీర్ చివరి దశలో వచ్చే అవార్డుతో పోలిస్తే ఇది చాలా ముఖ్యం: కేంద్రమంత్రి
కొత్త సాంకేతికతలు, కృత్రిమ మేధ రాకతో వైద్య రంగం విప్లవాత్మక మార్పులను లోనవుతుంది: కేంద్రమంత్రి
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎంపికలు, సాంకేతికతలతో ప్రతి యువ వైద్యుడు వైద్య నైపుణ్యంలో ఓ నిర్దిష్ట రంగంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా తనను తాను అప్ డేట్ చేసుకోవాలి: డాక్టర్ జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
05 MAR 2026 1:17PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఉన్న 26 మంది యువ వైద్య నిపుణులకు కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ మంత్రి, పీఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ నేడు అవార్డులను ప్రదానం చేశారు. అంకాలజీ, పీడియాట్రిక్స్, ఎండోక్రినాలజీ, ఆర్థోపెడిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్ వంటి వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ గుర్తింపు లభించింది.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మీడియా సంస్థను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. తమ వృత్తిలో కీలక దశలోకి అడుగుపెడుతున్న వైద్యులకు అవార్డులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. కెరీర్ చివరి దశలో వచ్చే అవార్డుల కంటే ఈ వయసులో లభించే అవార్డు గొప్ప గుర్తింపును ఇవ్వడమే కాకుండా వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
దేశంలో వైద్య సేవలను భవిష్యత్తులో మరింత బలోపేతం చేయడానికి యువ వైద్యులను వారి వృత్తి ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యమని మంత్రి అన్నారు. వైద్య నిపుణులను వారి ఎదుగుదల దశలో ప్రోత్సహించడం వల్ల నిరంతరం మారుతున్న వైద్య రంగంలో అద్భుతమైన ప్రతిభను చాటడానికి, తమ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడానికి వారికి అవకాశం లభిస్తుందని తెలిపారు.
సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ప్రదానం చేసిన అనేక పురస్కారాల్లో చాలా వరకు కెరీర్ ముగింపులో ఉన్న సీనియర్ నిపుణులకు కాకుండా యువ వైద్యులకు దక్కడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిభను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా, సమాజానికి మరింత నిబద్ధతతో సేవలు అందించేలా యువ వైద్య నిపుణులకు స్పూర్తినిస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.
వైద్య వృత్తిలో వస్తున్న మార్పుల గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. నూతన సాంకేతికతలు, కృత్రిమ మేధ రాకతో ఆరోగ్య సంరక్షణ రంగం విప్లవాత్మక మార్పులకు లోనవుతోందని అన్నారు. సాంకేతికత వల్ల వ్యాధి నిర్ధారణ, చికిత్స గణనీయంగా మెరుగుపడినప్పటికీ, వైద్యుని పాత్ర ఎప్పటికీ భర్తీ చేయలేనిదని ఆయన స్పష్టం చేశారు. రోగి సంరక్షణలో అనుభవం, క్లినికల్ అవగాహన ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
వైద్య శాస్త్రంలో దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామాలను గమనించిన కేంద్రమంత్రి తన అనుభవాన్ని పంచుకున్నారు. గతంలో వైద్య విద్య అనేది మొత్తం వైద్య రంగాన్ని అర్థం చేసుకోవడానికి సిఫిలిస్, మధుమేహం వంటి నిర్దిష్ట వ్యాధుల గురించి లోతుగా అధ్యయనం చేయడం చుట్టూ తిరిగేదని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేసుకున్నారు. కానీ నేడు అనేక ప్రత్యేక విభాగాలు, కొత్త చికిత్సా పద్ధతులు అందుబాటులోకి రావడంతో వైద్య రంగ పరిధి అసాధారణంగా విస్తరించిందని తెలిపారు. సాంప్రదాయ అభ్యాస ప్రక్రియను కృత్రిమ మేధ భర్తీ చేసే ధోరణి కనిపిస్తోందని ఆయన అన్నారు.
సాంకేతిక పురోగతులు, కొత్తగా ఆవిర్భవిస్తున్న వ్యాధులు, మారుతున్న ఆరోగ్య సంరక్షణ అవసరాల కలయిక వైద్య రంగాన్ని గతంలో కంటే మరింత సంక్లిష్టంగా మార్చిందని మంత్రి అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వేగంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి యువ వైద్యుడు వైద్యశాస్త్రంలోని ఒక నిర్దిష్ట విభాగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఎల్లప్పుడూ తమను తాము అప్డేట్ చేసుకోవాలని సూచించారు. వైద్య రంగంలో జ్ఞానం వేగంగా మారుతున్న నేపథ్యంలో నిరంతర అభ్యాసం ఎంతో అవసరమని ఆయన యువ వైద్యులకు హితవు పలికారు.
కోవిడ్ అనంతర ఆరోగ్య పరిస్థితుల గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. అటు అంటువ్యాధులు, ఇటు జీవనశైలి వ్యాధులు రెండూ ప్రస్తుతం ఆరోగ్య వ్యవస్థలకు సవాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులకు ప్రత్యేక నైపుణ్యం, నిరంతర అభ్యాసం ప్రాముఖ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో సన్మానం పొందిన యువ వైద్యులపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. వారిలో చాలామంది తమ కెరీర్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని డాక్టర్ జితేంద్ర సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య వృత్తికి చేసిన కృషికి జీవితకాల సాఫల్య గౌరవాలను అందుకోవడానికి భవిష్యత్తులో ఏదో ఒక రోజు మళ్లీ తిరిగి రావాలని అన్నారు.




***
(రిలీజ్ ఐడి: 2235584)
సందర్శకుల సూచీ సంఖ్య : : 80