ప్రధాన మంత్రి కార్యాలయం
పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్ల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
అద్భుతమైన పుదుచ్చేరి ప్రజల మధ్య ఉండటం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. నేడు జీవన సౌలభ్యాన్ని పెంచే, ఈ ప్రాంత ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నాం: ప్రధాని
నేను గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ‘బెస్ట్ పుదుచ్చేరి’ సూత్రాన్ని ఇచ్చాను. బెస్ట్ అంటే వ్యాపారం, విద్య, ఆధ్యాత్మికత, పర్యాటకం. గత నాలుగైదు ఏళ్లుగా ఈ దార్శనికత అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది: ప్రధాని
సుపరిపాలనతో పాటు అభివృద్ధిని సాధించిన పుదుచ్చేరి: ప్రధాని
దృఢమైన, సాధికారత కలిగిన యువత మన వృద్ధికి పునాది. వారి కలలకు మద్దతు ఇచ్చే దిశగా మేం కృషి చేస్తున్నాం: ప్రధాని
ఎన్ఐటీ కరైకల్లో కొత్తగా నిర్మించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ బ్లాక్, ఆధునిక హాస్టల్ వసతులు ఎంతో మంది విద్యార్థుల సాంకేతిక విద్యను బలోపేతం చేస్తాయి: ప్రధాని
పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే పనులు చేపట్టాం: ప్రధాని
ఆరోగ్య సంరక్షణ అనేది తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో ఉండాలని మేం అనుకుంటున్నాం. ఆయుష్మాన్ భారత్ పథకం ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్ల కుటుంబాల విషయంలో ఈ లక్ష్యాన్ని నెరవేరుస్తోంది: ప్రధాని
వైద్య పర్యాటక కేంద్రంగా పుదుచ్చేరి మారుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. పుదుచ్చేరిలో ఇప్పటికే తొమ్మిది వైద్య కళాశాలలు... జిప్మెర్లోని ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రం ఆధునికీకరణ ద్వారా వైద్య సేవలు మరింత విస్తరిస్తాయి: ప్రధాని
పీఎం-అభిమ్ పథకం కింద తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగుల కోసం మూడు క్రిటికల్ కేర్ బ్లాక్లకు నేడు శంకుస్థాపన చేశాను: ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
01 MAR 2026 2:11PM by PIB Hyderabad
పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం రవాణా వంటి కీలక రంగాలకు చెందిన ఈ ప్రాజెక్టులు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచనున్నాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. “ సిద్ధులు, సాధువులు, కవులు, స్వాతంత్ర్య సమరయోధుల నిలయం పుదుచ్చేరి. ఇక్కడే మహాకవి సుబ్రహ్మణ్య భారతి జాతీయవాద స్ఫూర్తిని రగిలించగా.. శ్రీ అరబిందో, మదర్... ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందించారు” అని వ్యాఖ్యానించారు.
పుదుచ్చేరికి సంబంధించిన తన 'బెస్ట్ (బీఈఎస్టీ)' సూత్రాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఇది వ్యాపారం (బిజినెస్), విద్య (ఎడ్యుకేషన్), ఆధ్యాత్మికత (స్పిరిచువాలిటీ), పర్యాటకాన్ని (టూరిజం) తెలియజేస్తోంది. “గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఈ దార్శనికత సుపరిపాలన, అభివృద్ధికి దారితీసింది. తలసరి ఆదాయం పెరగడమే కాకుండా దేశంలోనే అత్యున్నత సామాజిక పురోగతి సూచిక స్కోరును పుదుచ్చేరి సాధించటమే దీనికి నిదర్శనం” అని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి మాట్లాడిన ప్రధాని.. ఈ ఏడాది దీని కోసం బడ్జెట్లో రికార్డు స్థాయిలో రూ. 12 లక్షల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. “ఇంతకుముందు కేవలం రాష్ట్రాలకే పరిమితమైన ‘రాష్ట్రాలకు పెట్టుబడి వ్యయం విషయంలో ప్రత్యేక సహాయం’ పథకంలోకి ఇప్పుడు పుదుచ్చేరిని కూడా చేర్చాం. ఇది రోడ్లు, తాగునీటి సరఫరా, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అందేలా చూస్తుంది” అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
యువ శక్తిని ప్రస్తావించిన ప్రధానమంత్రి.. “బలమైన, సాధికారత కలిగిన యువతే మన వృద్ధికి ఆధారం. వారి కలలకు అండగా నిలిచేందుకు మేం కృషి చేస్తున్నాం” అని పేర్కొన్నారు. ఎన్ఐటీ కరైకల్లో కొత్తగా ప్రారంభించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ బ్లాక్, అత్యాధునిక హాస్టల్ సదుపాయాలతో పాటు పాండిచ్చేరి యూనివర్సిటీలో చేపట్టిన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే పనులు సాంకేతిక విద్యను బలోపేతం చేయటంతో పాటు వేలాది మంది విద్యార్థులకు అండగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేసిన ప్రక్రియ అనంతరం ప్రజా సేవల్లో చేరిన యువతకు ఆయన అభినందనలు తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచమంతా స్వచ్ఛ, హరిత రవాణాపై దృష్టి సారిస్తోందన్న ప్రధానమంత్రి.. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారుతున్నాయని అన్నారు. పుదుచ్చేరి వంటి పర్యాటక కేంద్రంలో 'పీఎం ఈ-బస్ సేవా' కింద ఈ రోజు అందించిన ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. కుటుంబాలకు స్థిరత్వంతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని అందించే గృహ నిర్మాణ ప్రాజెక్టులతో పాటు పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానాంలలో వందల కోట్ల విలువైన ఇతర అభివృద్ధి పనుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. వీటిలో స్వచ్ఛమైన తాగునీటిని అందించే లవణరహిత (డీసాలినైజేషన్) కేంద్రాలు, వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచే మురుగునీటి శుద్ధి కేంద్రాలు, వర్షాకాలంలో వరద ముంపు సమస్యను తగ్గించే పనులు ఉన్నాయి. “మా పనులన్నీ పుదుచ్చేరి ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా సాగుతున్నాయి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
మానవ వనరులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ దేశమైనా పురోగమించగలదని.. అందుకే ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి ప్రముఖంగా చెప్పారు. వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరికీ లభించాలని, తక్కువ ఖర్చుతో ఉండాలనేది తమ సంకల్పమని తెలిపిన ఆయన.. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఇప్పటికే కోట్ల కుటుంబాల విషయంలో ఈ దార్శనికత సాకారం అవుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. పుదుచ్చేరి ప్రజలెవరూ చికిత్స కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదన్న ఆయన.. ఇప్పటికే తొమ్మిది వైద్య కళాశాలలు ఉన్న ఈ ప్రాంతానికి 'వైద్య పర్యాటక కేంద్రం’గా మారే సామర్థ్యం ఉందని అన్నారు. వైద్యారోగ్య సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు జిప్మర్లోని ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాన్ని ఆధునికీకరిస్తున్నట్లు తెలిపిన ఆయన.. అత్యవసర సేవలను మెరుగుపరచడానికి 'పీఎం-అభిమ్' కింద పుదుచ్చేరి, కరైకల్లలో మూడు క్రిటికల్ కేర్ బ్లాక్లకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. కరైకల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి.. సిద్ధ వైద్యం, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణలో ఈ ప్రాంతానికి ఉన్న ఖ్యాతిని మరింత పెంచుతుందని అన్నారు. “పుదుచ్చేరి వైద్యారోగ్య పర్యాటక కేంద్రంగా మారగలదని నేను గట్టిగా నమ్ముతున్నాను” అని ఆయన ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.
గ్రామీణ, పట్టణ మౌలికపాయాలపై దృష్టి సారించే అనుసంధానత పురోగతికి వెన్నెముక అని ప్రధాని అన్నారు. విద్యార్థులు, రైతులు, చిన్న వ్యాపారులకు సౌకర్యవంతమైన రవాణా కల్పించేందుకు వందల కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. “పుదుచ్చేరి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి రూ. 1,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. ఇందులో రూ. 440 కోట్ల వ్యయంతో నిర్మించే కొత్త పైవంతెన కూడా ఉంది” అని ప్రధాని ఉద్ఘాటించారు. తూర్పు తీర రహదారి, గ్రాండ్ సదరన్ ట్రంక్ రోడ్ల ద్వారా చెన్నైకి ప్రయాణ సమయాన్ని రెండు గంటల లోపుకు తగ్గించేలా అనుసంధానతను మెరుగుపరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. “కన్యాకుమారి వరకు తూర్పు తీర కారిడార్లో రూ. 30,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ ప్రాజెక్టులు పుదుచ్చేరిని బెంగళూరు, కోయంబత్తూర్ వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాలతో అనుసంధానిస్తాయి. ఇది పర్యాటకం, వాణిజ్యం, పరిశ్రమలకు గణనీయమైన ఊతాన్ని ఇస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు.
పుదుచ్చేరి అతిపెద్ద బలాలలో పర్యాటకం ఒకటని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది ఇప్పటికే వేలాది మంది సందర్శకులను ఆకర్షించే ఒక ప్రముఖ వారాంతపు పర్యాటక కేంద్రంగా నిలుస్తోందని ఆయన అన్నారు. ఇక్కడి ప్రజల ఆత్మీయత వల్లే ఈ విజయం సాధ్యమైందని.. ఈ ప్రాంతానికి వచ్చే రైళ్లు, విమానాలు నిరంతరం నిండుగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. “ఆధ్యాత్మిక, పర్యావరణ, ఆరోగ్య పర్యాటకంపై ప్రభుత్వం ప్రత్యేక పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగా ప్రసాద్ పథకం కింద వివిధ ఆలయాలలో తీర్థయాత్ర సౌకర్యాల అభివృద్ధిని చేపడుతున్నాం” అని శ్రీ నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఆరోవిల్ను 'విశ్వ చైతన్య నగరం' అనే దార్శనికతతో శ్రీ అరబిందో, మాత(ది మదర్) చూశారన్న ప్రధాని.. ఈ రోజు అక్కడ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం ప్రారంభం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి సమ్మేళనాలు వివిధ ప్రాంతాలు, మతాల ప్రజలను ఏకం చేయడానికి దోహదపడతాయని ఆయన అన్నారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పుదుచ్చేరి ఒక విడదీయలేని భాగమన్న ప్రధాని.. ఎందరో మహోన్నత నాయకులకు ఇది జన్మభూమిగా లేదా కర్మభూమిగా నిలిచిందని గుర్తు చేశారు. 1947లో భారత్ స్వాతంత్ర్యం పొందటంలో ఈ గడ్డ అత్యంత కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. 2047 నాటికి 'వికసిత పుదుచ్చేరి', 'వికసిత భారత్'ను తయారు చేయటమే తమ లక్ష్యమని అన్నారు. ఈ దిశగా 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వం' కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 'మేం ఎల్లప్పుడూ బెస్ట్ పుదుచ్చేరి కోసం కృషి చేస్తూనే ఉంటాం' అంటూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2234262)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam