వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో భాగంగా భారత్ జీఐ కాఫీ లాంజ్ను సందర్శించిన గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ శ్రీ సుందర్ పిచాయ్
ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భారత్ జీఐ ట్యాగ్ పొందిన వివిధ రకాల కాఫీ ప్రదర్శనలను తిలకించిన అంతర్జాతీయ ప్రతినిధులు
భారతీయ భౌగోళిక గుర్తింపు(జీఐ) ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా
ప్రదర్శించడానికి ఏకీకృత జాతీయ బ్రాండ్గా భారత్ జీఐని ఆవిష్కరించిన డీపీఐఐటీ
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 5:41PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో భాగంగా పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఏర్పాటు చేసిన భారత్ జీఐ కాఫీ లాంజ్ను గూగుల్, ఆల్ఫాబెట్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శ్రీ సుందర్ పిచాయ్ సందర్శించారు. అక్కడ మలబార్ అరబికా కాఫీని రుచి చూశారు. ఈ సందర్భంగా బారిస్టా (కాఫీ మాస్టర్స్)లతో ముచ్చటించి, భారతీయ అత్యుత్తమ జీఐ ట్యాగ్ కలిగిన కాఫీల విశిష్టతను తెలుసుకున్నారు.
ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, నైజీరియా, బోట్స్ వానా, లిథువేనియా, కజకిస్థాన్, పోలాండ్, జర్మనీ వంటి అనేక దేశాల ప్రతినిధులు కూడా ఈ కాఫీ అనుభూతి కేంద్రాన్ని సందర్శించారు. భారతీయ జీఐ కాఫీ వారసత్వంపై ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా ఫిన్లాండ్ ప్రతినిధి '‘మాన్సూన్డ్ మలబార్ అరబికా’ మృదువైన రుచిని, దాని ప్రత్యేక తయారీ విధానాన్ని ప్రపంచ స్థాయి ఆవిష్కరణగా ప్రశంసించారు.
ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఎక్స్ వేదికగా పంచుకుంటూ...‘‘@SundarPichai వచ్చి కాఫీ రుచి చూశారంటే ఇది నిజంగా ఎంతో విలువైనదని అర్థం. #IndiaAIImpactSummit2026 లో ప్రపంచమంతా భారత్ జీఐ కాఫీ కప్పును పైకెత్తి ఆహ్వానిస్తోంది.భారత్ జీఐ కాఫీ లాంజ్, భారత్ మండపం (హాల్ 14, మొదటి అంతస్తు) 17 నుంచి20 ఫిబ్రవరి వరకు’’ అని పేర్కొన్నారు. ట్వీట్ కోసం -https://x.com/PiyushGoyal/status/2024386674072179011 క్లిక్ చేయండి.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు రెండో రోజు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద భారత్ జీఐ కాఫీ అనూభూతి కేంద్రాన్ని సందర్శించారు. భారతీయ జీఐ నమోదిత కాఫీ వైవిధ్యాన్ని, గొప్పతనాన్ని ఆయన కొనియాడారు. భౌగోళిక గుర్తింపులు ఎలా వస్తువుల ప్రామాణికతను కాపాడుతాయో, స్థానిక ప్రజలను ఎలా సాధికారం చేస్తాయో, భారతీయ కాఫీ ప్రాంతాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపును ఎలా తెస్తాయో ఆయన వివరించారు.
ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూ ఢిల్లీలో జరుగుతున్న అతిపెద్ద ఏఐ సదస్సులో భారత విశిష్ట జీఐ ఉత్పత్తుల ప్రదర్శన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ‘భారత్ జీఐ’ అనే నూతన జాతీయ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
భారత్ జీఐని ఏకీకృత జాతీయ మేధో సంపత్తి బ్రాండ్గా పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఆవిష్కరించింది. ‘ఎ వరల్డ్ ఎక్స్క్లూజివ్’ అనే ట్యాగ్లైన్తో భారతీయ ప్రత్యేకమైన జీఐ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడమే దీని లక్ష్యం. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భారతీయ వైవిధ్యమైన, గొప్ప కాఫీ రుచులను, వారసత్వాన్ని సందర్శకులకు పరిచయం చేసేందుకు డీపీఐఐటీ, కాఫీ బోర్డు సంయుక్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
హాల్ నంబర్ 14 మొదటి అంతస్తులో ఉన్న కాఫీ అనుభవ కేంద్రం వివిధ భారతీయ జీఐ కాఫీలను అన్వేషించడానికి, వచ్చే సందర్శకులతో కిక్కిరిసిపోయింది.నీడలో సుస్థిరంగా పెంచిన, చేతితో ఏరిన, సహజంగా ఎండలో ఆరబెట్టిన భారతీయ జీఐ కాఫీలను ఆస్వాదించడానికి అంతర్జాతీయ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు.
***
(రిలీజ్ ఐడి: 2230518)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10