రక్షణ మంత్రిత్వ శాఖ
మిలన్ 2026: తొమ్మిది ఆసియాన్ సభ్యదేశాలకు చెందిన నౌకాదళ ప్రధానాధికారులు, నావికా ప్రతినిధులతో రక్షణ మంత్రి భేటీ
భారత్ అనుసరిస్తున్న ఇండో-పసిఫిక్ వ్యూహానికి ప్రధాన ఆధారం ఆసియాన్,
ప్రాంతీయ సంక్షేమానికి ఉమ్మడి భద్రతే పునాది: శ్రీ రాజనాథ్ సింగ్
స్వావలంబనతో పరిణతి సాధించిన భారత రక్షణ సాంకేతిక వ్యవస్థ నుంచి
ప్రయోజనం పొందాలని ఆసియాన్ భాగస్వాములను ఆహ్వానించిన రక్షణ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 3:43PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరుగుతున్న మిలన్-2026 నౌకా విన్యాసాల్లో భాగంగా తొమ్మిది ఆసియాన్ సభ్యదేశాలకు చెందిన నౌకాదళ అధికారులు, నావికా ప్రతినిధులతో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ 2026 ఫిబ్రవరి 19న సమావేశమయ్యారు. ‘యాక్ట్ ఈస్ట్ విధానం’ పట్ల, ప్రాంతీయ భద్రత, పురోగతి కోసం పరస్పర, సమగ్ర అభివృద్ధి లక్ష్యం (మహాసాగర్) పట్ల భారత్ అంకితభావాన్ని ఈ సమావేశం తెలియజేస్తుంది.
మిలన్-2026లో ఆసియాన్ నౌకాదళాల భాగస్వామ్యాన్ని రక్షణ మంత్రి స్వాగతించారు. 1995లో కేవలం నాలుగు దేశాలకు చెందిన నౌకాదళాలతో ప్రారంభమైన ఈ విన్యాసాలు 2026 ఫిబ్రవరి నాటికి 74 దేశాల భాగస్వామ్యంతో అతిపెద్ద ఎడిషన్గా మారి చరిత్ర సృష్టించాయన్నారు. ఇండో-పసిఫిక్ భాగస్వామ్య దేశాల మధ్య విశ్వాసం, కార్యాచరణ సమన్వయాన్ని పెంపొందించడంలో ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం (ఐవోఎన్ఎస్) - ప్రధానాధికారుల సదస్సు, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026కు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. కొనసాగుతున్న మిలన్-2026 సీ ఫేజ్ గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే యాంటీ-సబ్మరైన్ వార్ఫేర్ (ఏఎస్డబ్ల్యూ), ఎయిర్ డిఫెన్స్, సెర్చ్-అండ్-రెస్క్యూ కార్యకలాపాలు, తదితర సంక్లిష్ట సముద్ర విన్యాసాలపై దృష్టి సారించారు.
భారతదేశం అనుసరిస్తున్న ఇండో-పసిఫిక్ వ్యూహానికి ప్రధానాధారంగా ఆసియాన్ను శ్రీ రాజనాథ్ సింగ్ వర్ణించారు. ఉమ్మడి భద్రతే ప్రాంతీయ సంక్షేమానికి పునాది అని తెలియజేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం చేపట్టిన ‘ఆత్మనిర్భర భారత్’ ప్రయత్నాల వల్ల భారతదేశ రక్షణ సాంకేతిక వ్యవస్థ పరిణతి సాధించిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆసియాన్ భాగస్వామ్య దేశాలను ఆహ్వానించారు. నిర్మాణ సామర్థ్యం కలిగిన నౌకాదళంగా భారత్ మారిందనడానికి ఐఎన్ఎస్ విక్రాంత్, విశాఖపట్నం-శ్రేణి విధ్వంసక నౌకలే ప్రతీకలని ఆయన స్పష్టం చేశారు.
2025 చివరిలో జరిగిన భారత్-ఆసియాన్ సాధారణ సమావేశంలో తెలియజేసిన అభిప్రాయాలను ఆసియాన్ ప్రతినిధులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో ఏదైనా ఆపద కలిగినప్పుడు తక్షణమే స్పందించే దేశంగా భారత్ పోషిస్తున్న పాత్రను వారు ప్రశంసించారు. దీర్ఘకాలిక సముద్ర భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో.. ఆసియాన్-ఇండియా డిఫెన్స్ థింక్-ట్యాంక్ చర్చలను విస్తరించాలని, అలాగే నౌకాదళ యువ అధికారుల భాగస్వామ్యంతో కొత్త కార్యక్రమాలను ప్రారంభించాలని రక్షణ మంత్రి ప్రతిపాదించారు
మిలన్-2026 అధికారిక ఇతివృత్తమైన ‘సౌభ్రాతృత్వం, సహకారం, భాగస్వామ్యం’ స్ఫూర్తితో నడిచే స్వేచ్ఛాయుతమైన, అవరోధాలు లేని, సమ్మిళితమైన ఇండో-పసిఫిక్ పట్ల ఉమ్మడి నిబద్ధతను వ్యక్తం చేస్తూ సమావేశం ముగిసింది.
***
(రిలీజ్ ఐడి: 2230498)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6