ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిబ్రవరి 16న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో- 2026'ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుతో పాటు 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో- 2026'
కృత్రిమ మేధ విషయంలో ఆచరణాత్మక పనితీరును చాటిచెప్పే జాతీయ ప్రదర్శనగా నిలవనున్న ఎక్స్పో
300కు పైగా ప్రత్యేకంగా రూపొందించిన ప్రదర్శనశాలలు, ప్రత్యక్ష ప్రదర్శనలకు వేదికకానున్న ఎక్స్పో
'ప్రజలు, పృథ్వీ, ప్రగతి' అనే మూడు ప్రధాన చక్రీయ ఇతివృత్తాల ఆధారంగా జరగనున్న ఎక్స్పో
ఏఐ వ్యవస్థలో అంతర్జాతీయ సహకారాన్ని చాటిచెప్పేలా 600కు పైగా అధిక సామర్థ్యంగల అంకురాలు,
13 దేశాల ప్రత్యేక పెవిలియన్లకు వేదికకానున్న ఎక్స్పో
ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థలు, అంకురాలు, విద్యా - పరిశోధనా సంస్థలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురానున్న ఎక్స్పో
నాడు పోస్టు చేయడమైనది:
15 FEB 2026 2:21PM by PIB Hyderabad
2026 ఫిబ్రవరి 16న సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026'ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.
ఈ ఎక్స్పోను ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు భారత్ మండపంలో 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు'తో పాటుగా నిర్వహించనున్నారు. ప్రభుత్వ విధానాలతో ఆచరణను, ఆవిష్కరణలతో విస్తృతిని, సాంకేతికతతో సామాన్య పౌరుడిని ఒకచోట కలిసే ఈ వేదిక.. కృత్రిమ మేధ విషయంలో ఆచరణాత్మక పనితీరును చాటిచెప్పే జాతీయ ప్రదర్శనగా నిలుస్తుంది.
70,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 10 ఏరినాల్లో విస్తరించి ఉన్న ఈ ఎక్స్పో.. అంతర్జాతీయ సాంకేతిక సంస్థలు, అంకురాలు, విద్యా - పరిశోధనా సంస్థలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఏఐ వ్యవస్థలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రతిబింబించేలా 13 దేశాల పెవిలియన్లు ఈ ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఎస్టోనియా, తజికిస్థాన్, ఆఫ్రికా దేశాల ప్రదర్శనలు ఉంటాయి.
ఈ ఎక్స్పోలో 'ప్రజలు, పృథ్వీ, ప్రగతి' అనే మూడు ప్రధాన చక్రీయ ఇతివృత్త ఆధారంగా 300కు పైగా ప్రత్యేక ప్రదర్శనలు, ప్రత్యక్ష ప్రదర్శనలు ఉంటాయి. ఇందులో 600కు పైగా అధిక సామర్థ్యం గల అంకురాలు పాల్గొంటున్నాయి. వీటిలో చాలా వరకు ప్రపంచస్థాయికి సరితూగేలా, భారీ జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఏఐ పరిష్కారాలను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితుల్లో అమల్లో ఉన్న తమ పనితీరును ప్రత్యక్షంగా ప్రదర్శిస్తాయి.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026కు అంతర్జాతీయ ప్రతినిధులతో సహా 2.5 లక్షల మందికి పైగా సందర్శకులు వస్తారన్న అంచనా ఉంది. ఈ కార్యక్రమం అంతర్జాతీయ ఏఐ వ్యవస్థలో కొత్త భాగస్వామ్యాలను పెంపొందించడం, సరికొత్త వ్యాపార అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఐదు రోజుల వ్యవధిలో 500కు పైగా సెషన్లు నిర్వహించనున్నారు. ఇందులో 3,250 మందికి పైగా దార్శనికత కలిగిన వక్తలు, ప్యానెల్ సభ్యులు పాల్గొంటారు. వివిధ రంగాల్లో ఏఐ చూపుతున్న విప్లవాత్మక ప్రభావాన్ని గుర్తించడం, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఏఐ ప్రయోజనం చేకూరేలా భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించనున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2228477)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam