ప్రధాన మంత్రి కార్యాలయం
మలేషియా ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి అధికారిక చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
08 FEB 2026 11:19AM by PIB Hyderabad
ఈ రోజు పెర్దానా పుత్రా కాంప్లెక్స్లో మలేషియా ప్రధానమంత్రి గౌరవ దాతోసేరి అన్వర్ ఇబ్రహీం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సంప్రదాయ పూర్వక స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అధికారిక నివాసం సెరి పెర్దానాలో ప్రతినిధి బృందం స్థాయిలో చర్చలు జరిపారు.
ఈ విస్తృత చర్చల్లో భాగంగా 2024లో ఇరు దేశాల మధ్య కుదిరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నేతలు అంగీకరించారు. ఈ భాగస్వామ్యానికి మూలధారమైన ప్రాచీన భారత్-మలేషియా సంబంధాలను, ప్రజల మధ్య సన్నిహిత బంధాలను వారు గుర్తు చేసుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, నౌకా వాణిజ్యం, పరిశుద్ధ ఇంధనాలు, మౌలిక సదుపాయాలు, అంకురసంస్థలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఆయుర్వేదం, పర్యాటకం, సాంస్కృతిక సంబంధాల వంటి ప్రాధాన్య రంగాలు సహా మొత్తం ద్వైపాక్షిక సంబంధాలను ఇరువురు నేతలు సమీక్షించారు. సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పరస్పర సహకారాన్ని మెరుగుపరచడం గురించీ వారు చర్చించారు. ద్వైపాక్షిక డిజిటల్ కౌన్సిల్ ద్వారా ఇరు దేశాల మధ్య డిజిటల్ సహకారంలో స్థిరమైన పురోగతిని నాయకులు ప్రశంసించారు. ఫిన్టెక్ సహకారాన్ని మెరుగుపరచడానికి యూపీఐ, పే-నెట్ మధ్య ఒప్పందాన్ని వారు స్వాగతించారు.
ద్వైపాక్షిక, సంస్థాగత, సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరచడం లక్ష్యంగా చట్ట సభలు, విశ్వవిద్యాలయాల ద్వారా ఇరు దేశాల యువత మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని ప్రధానమంత్రి శ్రీ మోదీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయం, మలయా యూనివర్సిటీ, ఐఐటీ మద్రాస్, అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ అకాడమీ ఆఫ్ మలేషియా మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ఆయన స్వాగతించారు. మలేషియాలో భారత తొలి కాన్సులేట్ ప్రారంభం వాణిజ్య, ప్రజా సంబంధాలను బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచస్థాయిలో పాలనా సంస్కరణలు, బలోపేతమవుతున్న ఇండో-పసిఫిక్, భారత్-ఆసియాన్ భాగస్వామ్యం సహా పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై తమ దృక్కోణాలను వారు పంచుకున్నారు. ఏఐటీఐజీఏ సమీక్షను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భారత ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
2025లో ఆసియాన్ కూటమికి మలేషియా విజయవంతంగా అధ్యక్షత వహించిన సందర్భంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంను ప్రధానమంత్రి అభినందించారు. 2026లో బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహించనున్న క్రమంలో భారత ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం... ఈ విషయంలో భారత్కు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడిని, ఎర్రకోట పేలుళ్లను తీవ్రంగా ఖండించిన మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో నిరంతర సన్నిహిత సహకారం కోసం పిలుపునిచ్చారు.
చర్చల అనంతరం డిజిటల్ చెల్లింపులు, భద్రతా సహకారం, సెమీకండక్టర్లు, ఆరోగ్యం, వైద్యం, విపత్తు నిర్వహణ, అవినీతిని ఎదుర్కోవడం, ఆడియో-విజువల్ సహ నిర్మాణం, సాంకేతిక-వృత్తి విద్య, యూఎన్ శాంతి పరిరక్షణ సహకారం, భారతీయ కార్మికులకు సామాజిక భద్రత వంటి అనేక ముఖ్యమైన ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ)లో చేరడానికి మలేషియా అన్ని ప్రక్రియలనూ పూర్తి చేసింది. ఇరు దేశాల మధ్య జరిగిన అవగాహన ఒప్పందాల పూర్తి జాబితాను ఇక్కడ చూడవచ్చు. [లింక్]
ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఈ నెల 7న 10వ భారత్-మలేషియా సీఈవోల సదస్సును నిర్వహించారు. ఈ సదస్సు తీర్మానాలను ఇరుపక్షాలూ ఆమోదించాయి.
భారత ప్రధానమంత్రి గౌరవార్థం మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అందించిన సాదర ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపిన భారత ప్రధానమంత్రి... భారత్ను సందర్శించాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.
***
(రిలీజ్ ఐడి: 2225164)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5