భారతదేశం, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి కుదిరిన ముసాయిదాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ స్వాగతించారు. ఈ పరిణామం ఇరుదేశాలకు గొప్ప శుభవార్త అన్నారు.
భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో డొనాల్డ్ ట్రంప్ చూపిన వ్యక్తిగత నిబద్ధతకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యాచరణ ఇరుదేశాల భాగస్వామ్యంలో పెరుగుతున్న సాన్నిహిత్యం, విశ్వాసం, శక్తిమంతమైన మార్పుని ప్రతిబింబిస్తోందన్నారు.
ఈ ఒప్పందం రైతులకు, పారిశ్రామికవేత్తలకు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలకు, మత్స్యకారులకు నూతన అవకాశాలను కల్పించటంతో 'మేక్ ఇన్ ఇండియా' బలోపేతం అవటమే కాక, మహిళలకు, యువతకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
పెట్టుబడులను, సాంకేతిక భాగస్వామ్యాలను ఈ కార్యాచరణ మరింత బలోపేతం చేస్తుందని.. స్థిరత్వం, విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలను పటిష్ఠం చేస్తుందని, అలాగే ప్రపంచ వృద్ధికి దోహదపడుతుందని ఆయన చెప్పారు.
వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశ ఆకాంక్షను ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజల సాధికారతకు, సామూహిక వృద్ధికి తోడ్పడే ప్రపంచ భాగస్వామ్యాలకు భారత్ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు.
భారత్, అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందానికి సంబంధించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో చేసిన పోస్టుకు స్పందిస్తూ, శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు;
"భారత్, యూఎస్ఏకు గొప్ప శుభవార్త!
రెండు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి రూపొందించిన ముసాయిదాపై మేం ఏకాభిప్రాయానికి వచ్చాం. మన దేశాల మధ్య పటిష్ఠమైన సంబంధాల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిన వ్యక్తిగత నిబద్ధతకు ధన్యవాదాలు.
ఈ కార్యాచరణ ఇరు దేశాల భాగస్వామ్యంలో పెరుగుతున్న సాన్నిహిత్యం, విశ్వాసం, శక్తిమంతమైన మార్పుని ప్రతిబింబిస్తోంది. దీని ద్వారా రైతులకు, పారిశ్రామికవేత్తలకు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలకు, మత్స్యకారులకు నూతన అవకాశాలు ఏర్పడటం వల్ల 'మేక్ ఇన్ ఇండియా' బలోపేతం అవుతుంది. మహిళలకు, యువతకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుంది.
భారత్, అమెరికా దేశాలు ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ కార్యాచరణ మన మధ్య పెట్టుబడులను, సాంకేతిక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేస్తుంది.
ఈ ముసాయిదా ద్వారా స్థిరత్వం, విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలు పటిష్టమవటమే కాక, ప్రపంచ వృద్ధికి దోహదపడుతుంది. వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశం అడుగులు వేస్తున్న తరుణంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజల సాధికారతకు, సామూహిక వృద్ధికి తోడ్పడే ప్రపంచ భాగస్వామ్యాల నిర్మాణానికి మేం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం.
@POTUS
@realDonaldTrump”