రాష్ట్రపతి సచివాలయం
పార్లమెంటులో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం
प्रविष्टि तिथि:
28 JAN 2026 12:57PM by PIB Hyderabad
గౌరవ సభ్యులారా,
పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం సంతోషంగా ఉంది. భారత్ సాధిస్తున్న వేగవంతమైన వృద్ధికి, సుసంపన్నమైన వారసత్వానికి వేడుకగా గతేడాది నిలిచింది. ఈ ఏడాది తనతో ఎన్నో ఆకాంక్షలను తీసుకొచ్చింది. ఇప్పుడు వందేమాతరం 150 వసంతోత్సవాలను భారత్ నిర్వహిస్తోంది. ఈ స్ఫూర్తిని అందించిన రిషి బంకిం చంద్ర ఛటోపాధ్యాయకు భారతీయులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ పవిత్ర సందర్భంలో పార్లమెంటులో ప్రత్యేక చర్చ చేపట్టిన గౌరవ సభ్యులను అభినందిస్తున్నాను.
గౌరవ సభ్యులారా,
ఇదే ఏడాదితో శ్రీ గురు తేగ్ బహదూర్ ప్రాణత్యాగం చేసి 350 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు ఈ దేశం నివాళులు అర్పించింది. గిరిజన సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంది.
ఏక భారత్, శ్రేష్ఠ భారత్ స్పూర్తిని సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు బలోపేతం చేశాయి. అలాగే.. శ్రావ్యమైన గీతాలు, జాతీయ ఐక్యతా స్ఫూర్తితో నిర్వహించిన భారతరత్న భూపెన్ హజారికా శత జయంతి ఉత్సవాలను కూడా ప్రజలు వీక్షించారు.
గత వైభవానికి సంబంధించిన విజయాలను, తమ పూర్వీకుల చేసిన గొప్ప కార్యాలను ప్రజలు గుర్తు చేసుకున్నప్పుడు.. అది కొత్త తరానికి స్ఫూర్తినిస్తుంది. ‘వికసిత్ భారత్’ దిశగా దేశ ప్రయాణాన్ని ఈ స్ఫూర్తి మరింత వేగవంతం చేస్తుంది.
గౌరవ సభ్యులారా,
2026 ప్రారంభంతో ఈ శతాబ్దపు రెండో దశలోకి మనం ప్రవేశించాం. ఈ శతాబ్దపు తొలి 25 ఏళ్లలో మన దేశం అనేక విజయాలను, ఘనతలను, అసాధారణ అనుభవాలను సొంతం చేసుకుంది. గడచిన 10-11 ఏళ్లలో ప్రతి రంగంలోనూ తన స్థానాన్ని భారత్ బలోపేతం చేసుకుంది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ దిశగా దేశం వేగంగా సాగిస్తున్న ప్రయాణంలో ఈ సమయం బలమైన పునాదిని వేసింది.
గౌరవ సభ్యులారా,
సమానత్వానికి, సామాజిక న్యాయానికి బాబా సాహెబ్ అంబేద్కర్ ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చారు. మన రాజ్యాంగం కూడా ఇదే స్ఫూర్తిని మనకందిస్తోంది. ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి పౌరునికి అన్ని హక్కులు లభించడమే సామాజిక న్యాయం. నిజమైన సామాజిక న్యాయానికి నా ప్రభుత్వం పూర్తిగా అంకితమై ఉంది. ఫలితంగా.. గడచిన దశాబ్దంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారు. పేదలకు సాధికారత కల్పించే దిశగా నా ప్రభుత్వం తన మూడో పదవీ కాలంలో వేగంగా ముందుకెళుతోంది.
• గత దశాబ్దంలో పేదల కోసం నాలుగు కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. గతేడాది 32 లక్షల నూతన గృహాలను పేదలకు అందించారు.
• అయిదేళ్ల కాల వ్యవధిలో జల్ జీవన్ మిషన్ ద్వారా 12.5 కోట్ల కొత్త గృహాలకు నల్లా నీరు అందించారు. గతేడాదిలో కోటి కొత్త ఇళ్లకు నల్లా కనెక్షన్లు అందించారు.
• ఉజ్వల యోజన ద్వారా ఇప్పటి వరకు 10 కోట్ల గృహాలకు ఎల్పీజీ కనెక్షన్లు అందించారు. గతేడాది ఈ కార్యక్రమం వేగంగా పురోగతి సాధించింది.
• వ్యవస్థల్లో పారదర్శకత, నిజాయతీని నా ప్రభుత్వం సంస్థాగతం చేస్తోంది. గత సంవత్సరంలో మా ప్రభుత్వం 6.75 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రయోజనాలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించింది.
గౌరవ సభ్యులారా,
దళితులు, వెనకబడిన తరగతులు, అణగారిన, గిరిజన వర్గాలు - అందరి సంరక్షణనూ నా ప్రభుత్వం పట్టించుకుంటున్నది. దేశ ప్రజల జీవితాల్లో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ లక్ష్యం సానుకూల మార్పులను తీసుకొస్తోంది. 2014 ప్రారంభంలో 25 కోట్ల మంది పౌరులకు మాత్రమే సామాజిక భద్రతా పథకాలు చేరువయ్యాయి. నా ప్రభుత్వం చేపట్టిన నిరంతర ప్రయత్నాలతో ప్రస్తుతం సుమారుగా 95 కోట్ల మంది భారతీయులు సామాజిక భద్రతా పథకం పరిధిలోకి వచ్చారు.
• పేద రోగుల కోసం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో గతేడాది నాటికి 11 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందాయి. గడచిన సంవత్సరంలోనే 2.5 కోట్ల మంది పేద రోగులు ఈ పథకం ద్వారా ఉచిత వైద్య చికిత్సను పొందారు.
• గత ఒకటిన్నర సంవత్సర కాలంలోనే సుమారుగా ఒక కోటి మంది వయో వృద్ధులకు వయో వందన కార్డులు జారీ అయ్యాయి. ఈ కార్డుల సాయంతో ఆసుపత్రుల్లో 8 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఇన్-పేషెంట్లుగా ఉచిత వైద్యం లభించింది.
• దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఒక లక్షా 80 వేల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో రోగులు తమ ఇళ్లకు చేరువలోనే వైద్య చికిత్సను పొందారు.
ప్రధాన వ్యాధులతో నా ప్రభుత్వం నిర్ణయాత్మక పోరాటం చేసింది. సికిల్ సెల్ అనీమియా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా దాదాపు 6.5 కోట్ల మందికి పైగా పౌరులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఇది అనేక గిరిజన ప్రాంతాల్లో వ్యాధిని నియంత్రించడంలో సాయపడింది.
జపనీస్ ఎన్సెఫలిటిస్ తరహా వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించడానికి యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన కార్యక్రమాలు దోహదం చేశాయి. ఉత్తర ప్రదేశ్లో అభివృద్ధికి దూరంగా ఉన్న అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధిని ప్రభావవంతంగా నియంత్రించగలిగారు.
కంటి వ్యాధి అయిన ట్రకోమా నుంచి భారత్ విముక్తి పొందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం గర్వకారణమైన అంశం.
ప్రతి పౌరునికీ బీమా అందించేందుకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ ప్రయత్నంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కీలకపాత్ర పోషించాయి. ఈ పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలకు ఇన్సూరెన్స్ కవరేజిని పొందారు. ఈ పథకాల పరిధిలో 24 వేల కోట్ల రూపాయల విలువైన క్లెయిములకు చెల్లింపులు జరిగాయి. క్లిష్ట సమయాల్లో కోట్లాది మంది పేద ప్రజలకు ఈ పథకాలు సాయమందించాయి.
గౌరవ సభ్యులారా,
వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా మన దేశ యువత, రైతులు, శ్రామికులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తాము పోషిస్తున్న పాత్ర పరిధిని విస్తరించుకోవడం చూస్తుంటే సంతృప్తి కలుగుతోంది. గతేడాది సాధించిన ప్రోత్సాహకరమైన గణాంకాలు దీనిని బలపరుస్తున్నాయి.
• గతేడాది, రికార్డు స్థాయిలో 350 మిలియన్ టన్నులకు పైగా ఆహార ధాన్యాల దిగుబడిని భారత్ సాధించింది.
• 150 మిలియన్ టన్నుల దిగుబడితో ప్రపంచంలోనే అతి పెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ మారింది.
• మన దేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద చేపల ఉత్పత్తిదారు కూడా. సముద్ర ఆర్థిక వ్యవస్థలో మన దేశం సాధించిన విజయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
• పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన దేశంగా భారత్ ప్రసిద్ధి చెందింది. ఇది సహకార ఉద్యమ సామర్థ్యం సాధించిన ఫలితం.
• ఈ సమయంలో దేశ తయారీ రంగంలోనూ పెరుగుదల నమోదయింది. మొబైల్ తయారీ రంగంలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద తయారీదారుగా భారత్ మారింది. 2025-26 మొదటి అయిదు నెలల్లో భారతీయ స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 1 లక్ష కోట్ల రూపాయలను అధిగమించాయి. ఈ ఏడాది 100కు పైగా దేశాలకు విద్యుత్ వాహనాల ఎగుమతులను భారత్ ప్రారంభించింది.
గౌరవ సభ్యులారా,
అవినీతికీ, కుంభకోణాలకూ తావులేని వ్యవస్థను నిర్మించడంలో నా ప్రభుత్వం విజయవంతమవుతోంది. దాంతో పన్ను చెల్లింపుదారుల ప్రతి రూపాయీ దేశ అభివృద్ధి, సంక్షేమం కోసమే ఖర్చవుతున్నాయి.
ఆధునిక మౌలిక సదుపాయాల్లో భారత్ మునుపెన్నడూ లేని రీతిలో పెట్టుబడులు పెడుతోంది. నేలపైనా, నీటిలోనూ, గాల్లోనూ... భారత వేగవంతమైన పురోగతి నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమైంది.
• అటల్ జీ హయాంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రారంభమైంది. గత ఏడాది కాలంలో కొత్తగా 18 వేల కిలోమీటర్ల రహదారులు భారత్లోని గ్రామాల్లో విస్తరించాయి. ఇప్పుడు దాదాపు దేశంలోని గ్రామీణ ప్రజలందరికీ రోడ్డు సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
• పేదలు, మధ్యతరగతి ప్రజలకు సేవలందిస్తున్న భారతీయ రైల్వేలు.. 100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధించే దిశగా వేగంగా పురోగమిస్తున్నాయి.
• మిజోరాంలోని ఐజ్వాల్, న్యూఢిల్లీ నేరుగా రైలు మార్గంతో అనుసంధానమయ్యాయి. గతేడాది రాజధాని ఎక్స్ప్రెస్ తొలిసారిగా ఐజ్వాల్ రైల్వే స్టేషన్కు చేరిన వేళ.. స్థానిక ప్రజల్లో కలిగిన ఉత్సాహం దేశమంతటా సంతోషాన్ని నింపింది.
• మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ చారిత్రక మైలురాయిని దాటింది. జమ్మూకాశ్మీర్లో ప్రపంచంలో అత్యంత ఎత్తైన విల్లు ఆకారపు రైల్వే వంతెన (రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్) అయిన చీనాబ్ బ్రిడ్జిని, తమిళనాడులో కొత్త పంబన్ వంతెనను నిర్మించి దేశం సత్తా చాటింది.
• జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు.. నేడు దేశవ్యాప్తంగా 150కి పైగా వందే భారత్ రైళ్ల నెట్వర్క్ విస్తరించింది.
• కొన్ని రోజుల కిందటే.. కొత్త తరం వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా బెంగాల్ - అస్సాం మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించడం భారతీయ రైల్వే సాధించిన తాజా విజయం.
• భారత మెట్రో వ్యవస్థ కూడా మనకు గర్వకారణం. 2025లో దేశవ్యాప్తంగా మెట్రో రైలు వ్యవస్థ వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది.
• అంతర్గత జలమార్గాల అభివృద్ధికి కూడా నా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. గతంలో దేశంలో అయిదు జాతీయ జలమార్గాలు మాత్రమే ఉండేవి. ఆ సంఖ్య ఇప్పుడు వంద దాటింది. దీంతో ఉత్తరప్రదేశ్, బెంగాల్, బీహార్ సహా తూర్పు భారత రాష్ట్రాలు దేశంలో కీలక సరుకు రవాణా కేంద్రాలుగా అవతరిస్తున్నాయి.
• నావికాయాన పర్యాటకం వల్ల నదీ తీరాలు, సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకం గణనీయంగా పెరుగుతోంది. తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతమవుతున్నాయి.
గౌరవ సభ్యులారా,
ప్రస్తుతం అంతరిక్ష పర్యాటకం కూడా భారత్కు నేడు అసాధ్యమేం కాదు. భారత యువ వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం ఓ చారిత్రక ప్రయాణానికి నాంది పలికింది. మున్ముందు సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా దేశం అడుగులు వేస్తోంది. గగన్యాన్ మిషన్పై కూడా భారత్ అత్యంత ఉత్సాహంతో పనిచేస్తోంది.
గౌరవ సభ్యులారా,
దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు, అలాగే ప్రతి లబ్ధిదారుడికీ సంక్షేమ పథకాలను చేరవేసేందుకు ‘ప్రగతి’ అనే నూతన కార్యక్రమానికి నా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2025 డిసెంబరులో ప్రగతి 50వ సమావేశం జరగడం ఓ చారిత్రక మైలురాయి. కొన్నేళ్లలో ఈ వేదిక ద్వారా రూ. 85 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు వేగవంతమవడంతోపాటు.. లక్షల కోట్ల రూపాయల విలువైన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ఈ కార్యక్రమం తోడ్పడింది. దేశ ‘సంస్కరణ- ఆచరణ- పరివర్తన’ మంత్ర సాఫల్యానికి ఈ ప్రగతి సమావేశాలు విశేషంగా దోహదపడ్డాయి.
గౌరవ సభ్యులారా,
గత 11 ఏళ్లలో దేశ ఆర్థిక పునాదులు గణనీయంగా బలపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంక్షోభాలు ఎదురైనప్పటికీ, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడంలోనూ భారత్ తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. దీని వల్ల దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరుతోంది. నా ప్రభుత్వ విధానాల ఫలితంగా ప్రజల ఆదాయమూ, పొదుపులూ పెరిగాయి. వారి కొనుగోలు శక్తి కూడా మెరుగుపడింది.
ఐరోపా యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతమైన సందర్భంగా దేశ ప్రజలందరికీ అభినందనలు. ఈ ఒప్పందం భారత్లోని తయారీ, సేవా రంగాలకు నూతన ఉత్తేజాన్నివ్వడమే కాకుండా.. దేశ యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
గౌరవ సభ్యులారా,
నేడు నా ప్రభుత్వం ‘సంస్కరణల ఎక్స్ప్రెస్’పై వేగంగా పురోగమిస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పాత చట్టాలను, నిబంధనలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆధునికీకరిస్తోంది.
జీఎస్టీలో చారిత్రక నవతరం సంస్కరణలు ప్రజల్లో ఏ స్థాయిలో ఉత్సాహాన్ని నింపాయో మనందరమూ చూశాం. ఈ సంస్కరణ వల్ల దేశ ప్రజలకు లక్ష కోట్ల రూపాయల మేర ఆదా అయ్యాయి. జీఎస్టీ తగ్గింపు ఫలితంగా.. 2025లో ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు రెండు కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డును సృష్టించాయి.
ఆదాయ పన్ను చట్టాన్ని కూడా ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపునిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్కరణలు దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు మునుపెన్నడూ లేని రీతిలో ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకూ ఇది నవోత్తేజాన్నిచ్చింది.
గౌరవ సభ్యులారా,
దేశంలో అనేక కొత్త రంగాలు ఉద్భవిస్తున్న వేళ.. కార్మికుల ప్రయోజనాలను కాపాడటం కూడా అత్యావశ్యకం. కొత్త కార్మిక చట్టాల అమలు వెనుక ప్రధాన లక్ష్యం కూడా ఇదే. ఎన్నో ఏళ్లుగా పదుల కొద్దీ కార్మిక చట్టాల్లో దేశ కార్మికులు చిక్కుకుపోయారు. వాటినిప్పుడు నాలుగు కోడ్లుగా ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. దీనివల్ల కార్మికులు సరైన వేతనాలు, అలవెన్సులు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను సులభంగా పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ సంస్కరణలతో ముఖ్యంగా దేశ యువతకూ, మహిళలకూ విశేషంగా ప్రయోజనం కలుగుతుంది.
గౌరవ సభ్యులారా,
పర్యావరణ హిత వృద్ధికీ, ఆధునిక సాంకేతికతకూ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దేందుకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, కృత్రిమ మేధ, డేటా కేంద్రాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ కొత్త ఆర్థిక వ్యవస్థకు శక్తి కూడా అధికంగానే అవసరం. ఈ దిశగా అణుశక్తి ప్రధాన పాత్ర పోషించనుంది. ఇటీవల అమల్లోకి వచ్చిన శాంతి చట్టం.. 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. ఈ చారిత్రాత్మక సంస్కరణ సందర్భంగా మీ అందరికీ అభినందనలు.
అణుశక్తితోపాటు.. సౌరశక్తి రంగంలోనూ భారత్ శరవేగంగా దూసుకుపోతోంది. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా సామాన్య వినియోగదారులు ఇప్పుడు విద్యుదుత్పత్తిదారులుగా మారుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 20 లక్షల రూఫ్టాప్ సౌర వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. ఫలితంగా విద్యుదుత్పత్తి పెరగడమే కాకుండా, లక్షలాది కుటుంబాలకు కరెంటు బిల్లుల భారం తగ్గింది.
ఈ చర్యలన్నింటి ఫలితంగా.. ఈ దశాబ్దం ముగిసే నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని భారత్ నిశ్చయంగా చేరుకుంటుంది.
గౌరవ సభ్యులారా,
ప్రజల్లో భయాన్ని కాదు.. భద్రతను, భరోసాను, సాధికారతా భావాన్ని పెంపొందించడమే ఏ న్యాయ వ్యవస్థకైనా నిజమైన విజయం. ఈ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని.. భారతీయ న్యాయ సంహితను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. దీనితోపాటు సరికొత్త రూపంలో జనవిశ్వాస్ చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు 300కు పైగా నిబంధనలను క్రిమినల్ నేరాల విభాగం నుంచి ప్రభుత్వం తొలగించింది.
వికసిత భారత్ను సాకారం చేసుకోవడమే లక్ష్యంగా.. ఈ సంస్కరణల ఎక్స్ప్రెస్ గమనాన్ని మరింత వేగవంతం చేసే చర్యలను నా ప్రభుత్వం కొనసాగిస్తుంది.
గౌరవ సభ్యులారా,
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేవలం కొన్ని నగరాలు, ప్రాంతాల నుంచి మాత్రమే భారతదేశ ప్రగతి ఊపందుకుంది. దేశంలోని అధిక భాగం, జనాభాలో ఎక్కువ మందికి తగిన అవకాశాలు అందుబాటులో ఉండేవి కావు. నేడు నా ప్రభుత్వం.. వెనుకబడిన ప్రాంతాలు, అణగారిన వర్గాల సామర్థ్యాన్ని 'వికసిత్ భారత్'కు చోదక శక్తిగా మారుస్తోంది.
తూర్పు భారత్ విషయంలో వేగవంతమైన అభివృద్ధిగా పేర్కొనే 'పూర్వోదయ'కు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోంది. నేడు పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని తీరప్రాంతాలలో ప్రగతికి సంబంధించిన కొత్త అవకాశాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈశాన్య ప్రాంతం కూడా అభివృద్ధి విషయంలో ప్రధాన స్రవంతిలో కలిసిపోతోంది. ఈశాన్య ప్రాంతంలోని అస్సాం.. శ్రీమంత శంకరదేవ్ వంటి గొప్ప మహనీయుల పుట్టిన నేల. త్వరలోనే అస్సాంలో తయారైన సెమీకండక్టర్ చిప్ ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు జీవనాధారంగా మారుతుంది. ఈ ప్రాంతంలో అనుసంధానతను మెరుగుపరచడానికి మునుపెన్నడూ లేనంత శ్రద్ధ తీసుకుంటున్నాం.
గౌరవ సభ్యులారా,
గత 11 ఏళ్లలో ఈశాన్య ప్రాంతంలో 7,200 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు నిర్మాణమయ్యాయి. దీనివల్ల మారుమూల, కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవడం సులభతరమైంది.
దీనికి అదనంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద సుమారు 50 వేల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు నిర్మాణమయ్యాయి. ఇది మార్కెట్లు, ఆసుపత్రులు, పాఠశాలలకు వెళ్లే పరిస్థితిని మెరుగుపరిచింది. గత 11 ఏళ్లలో ఈశాన్య ప్రాంతంలో రైల్వేల అభివృద్ధి కోసం 80 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టాం. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం రాజధానులు ఇప్పుడు బ్రాడ్-గేజ్ రైలు మార్గాల ద్వారా అనుసంధామయ్యాయి. ఇది ఈ ప్రాంతాల్లో ఆర్థిక పురోగతి, ఉపాధి, పర్యాటక పరిశ్రమకు కొత్త అవకాశాలను కల్పించింది.
ఈ పది సంవత్సరాలు ఈశాన్య ప్రాంతంలో ఆరోగ్య సౌకర్యాలను కల్పించే కార్యక్రమాల దశాబ్దంగా కూడా నిలిచింది. ఇటానగర్లో స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, అస్సాంలోని శివసాగర్లో మెడికల్ కళాశాల ఏర్పాటు.. కోట్లాది కుటుంబాలకు చికిత్స అందించడంలో సహాయపడతాయి.
అదే విధంగా సిక్కింలోని సిచేలో మెడికల్ కళాశాల, అగర్తలలో మహిళలు- పిల్లల కోసం ఆసుపత్రి ఏర్పాటు చేయటం వల్ల ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడతాయి. ఇటువంటి ప్రయత్నాలు ఈశాన్య ప్రాంతంలో పటిష్ఠమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను సృష్టిస్తున్నాయి.
గౌరవ సభ్యులారా,
వెనుకబడి ఉన్న వారే మా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత. పీఎం జన్మన్ పథకం ఖచ్చితంగా ఇదే ప్రాధాన్యతపై పని చేస్తోంది. ఈ పథకం కింద గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన 20 వేలకు పైగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం. ఈ పథకం ద్వారా ఆయా గ్రామాల్లోని పేదల కోసం సుమారు 2.5 లక్షల ఇళ్లు నిర్మించాం. ధర్తీ ఆబా జన్జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ కూడా గిరిజన ప్రాంతాల్లో మునుపెన్నడూ లేని వేగంతో అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ఈ రెండు కార్యక్రమాలపై నా ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా రూపాయలను ఖర్చు చేస్తోంది.
గడిచిన 11 ఏళ్లలో షెడ్యూల్డ్ సామాజిక వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులకు 42 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో పోస్ట్-మెట్రిక్ ఉపకారవేతనాలు మంజూరయ్యాయి. దీనివల్ల దాదాపు ఐదు కోట్ల మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. గిరిజన ప్రాంతాల్లో 400 కంటే ఎక్కువ ఏకలవ్య మోడల్ ఆవాస పాఠశాలలను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇవి గిరిజన చిన్నారులకు నాణ్యమైన విద్యను, మెరుగైన భవిష్యత్తును అందిస్తున్నాయి.
గౌరవ సభ్యులారా,
వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తూ సంత్ తిరువళ్లువర్.. ‘ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తి జీవితం కష్టపడి పనిచేసే రైతు శ్రమపైనే ఆధారపడి ఉంటుందని’ చెప్పారు.
దీనిని దృష్టిలో ఉంచుకొనే నా ప్రభుత్వం.. వికసిత్ భారత్ను సాధించేందుకు సుసంపన్నమైన రైతు అనే విధానాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుంది. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' వంటి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా బదిలీ అయ్యాయి.
మా ప్రభుత్వ పటిష్ఠమైన విధానాలు, కార్యక్రమాలు.. దేశంలో వ్యవసాయ ఉత్పత్తి వేగంగా పెరగడానికి దారితీశాయి. 2024–25లో ఆహార ధాన్యాలు, ఉద్యానవన పంటల ఉత్పత్తి రికార్డు స్థాయిలో నమోదైంది. మన వ్యవసాయ రంగం మంచి దిగుబడి సాధించని పంటల ఉత్పత్తిని పెంచడానికి కూడా నా ప్రభుత్వం కృషి చేస్తోంది.
వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించాలనేది కూడా ప్రభుత్వ లక్ష్యం. తినే నూనెలు, నూనెగింజలు, పప్పుధాన్యాలపై తీసుకున్న జాతీయ మిషన్ల ద్వారా ఈ రంగాల్లో స్వయం సమృద్ధి దిశగా దేశం పయనిస్తోంది. దీని ఫలితంగా 2024–25లో నూనెగింజల పంటల ఉత్పత్తి కూడా పెరిగింది. రైతులకు అదనపు ఆదాయాన్ని అందించడం కోసం నా ప్రభుత్వం 'శ్రీ అన్న'గా పిలిచే చిరుధాన్యాలను ప్రపంచవ్యాప్తంగా నిరంతరాయంగా ప్రోత్సహిస్తోంది.
గౌరవ సభ్యులారా,
నేడు ఆహార ధాన్యాల ఉత్పత్తితో పాటు ఆర్థిక పురోగతికి సరికొత్త మార్గాలైన పశుపోషణ, మత్స్య సంపద, తేనెటీగల పెంపకంతో రైతులను అనుసంధానిస్తున్నాం. తీరప్రాంతాల్లో నివసించే మత్స్యకారులకు 'ప్రత్యేక ఆర్థిక మండలి' ప్రయోజనాలను అందించడానికి కొత్త విధానం రూపొందించాం. అంతేకాకుండా అంతర్జాతీయ సముద్ర జలాల్లోని వనరులను వినియోగించుకునేలా మత్స్యకారులను సన్నద్ధం చేయడానికి కూడా ఒక కొత్త విధానం రూపొందించాం. 2024–25లో దేశంలో చేపల ఉత్పత్తి సుమారు 200 లక్షల టన్నులకు పెరిగింది. ఇది 2014తో పోలిస్తే 105 శాతం పెరుగుదలను తెలియజేస్తోంది.
గౌరవ సభ్యులారా,
వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి, మెరుగైన రవాణా- నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం 'వ్యవసాయ మౌలికసదుపాయాల నిధి'ని ఏర్పాటు చేసింది. ఇది ఇప్పటి వరకు 1.25 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించిందని మీకు తెలియజేసేందుకు నేను సంతోషిస్తున్నాను. ఇది యువతకు లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టించింది. మా ప్రభుత్వ దూరదృష్టి కారణంగా దేశంలోని ఆహార శుద్ధి సామర్థ్యం ఇరవై రెట్లు పెరిగింది. దీనివల్ల పంటలకు మెరుగైన ధరలను రైతులు పొందగలుగుతున్నారు.
గౌరవ సభ్యులారా,
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ధి కోసం 'వికసిత్ భారత్ జీ రామ్ జీ ' అనే పేరుతో ఒక చట్టాన్ని చేశాం. ఈ కొత్త చట్టం.. గ్రామాల్లో 125 రోజుల ఉపాధికి హామీ ఇస్తుంది. ఇది అవినీతి, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేలా చూస్తుంది. దీని కోసం నా ప్రభుత్వం చాలా కాలంగా కృషి చేస్తోంది. ఈ పథకం గ్రామీణ అభివృద్ధికి కొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది.. రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల కోసం కొత్త సౌకర్యాలను సృష్టిస్తుంది.
గౌరవ సభ్యులారా,
వ్యవసాయం, పశుపోషణ వంటి రంగాల్లో నా ప్రభుత్వం సహకార ఉద్యమాన్ని బలోపేతం చేస్తోంది. త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం ద్వారా నేర్చుకోవడానికి, ముందుకు సాగడానికి సహకార సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు నేడు అవకాశాలను పొందుతున్నారు. దీనికి తోడు 10 వేలకు పైగా ఎఫ్పీఓలద్వారా వ్యవసాయ రంగం సాధికారత పొందుతోంది.
గౌరవ సభ్యులారా,
ప్రజలందరికీ సమానమైన పురోగతి అవకాశాలను కల్పించడం ద్వారా మాత్రమే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని నా ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. అందుకే నేడు 'మహిళా నాయకత్వంలోని అభివృద్ధి' అనే మంత్రంతో దేశం ముందుకు సాగుతోంది.
నా ప్రభుత్వం మహిళల కోసమే రూపొందించిన ప్రత్యేక పథకాలను ప్రారంభించింది. ఇతర పథకాలలో కూడా మహిళలను కేంద్రబిందువుగా పెట్టాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి జల్ జీవన్ మిషన్ వరకు ప్రతి పథకంలో మహిళా లబ్ధిదారులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
జాతీయ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి నా ప్రభుత్వం 10 కోట్ల మంది మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానించింది. నేడు దేశంలో 'లఖ్పతి దీదీ'ల సంఖ్య రెండు కోట్లకు పైగా ఉంది. గడిచిన ఏడాది కాలంలోనే 60 లక్షల మందికి పైగా మహిళలు 'లఖ్పతి దీదీ'లుగా మారారు. 'లఖ్పతి దీదీ'లుగా మూడు కోట్ల మంది మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యాన్ని ప్రభుత్వం త్వరలోనే సాధిస్తుంది.
గౌరవ సభ్యులారా,
దేశంలోని మారుమూల ప్రాంతాల్లో “నమో డ్రోన్ దీది” కార్యక్రమం మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది. శిక్షణ పొందిన ఈ డ్రోన్ దీదీలు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ వ్యవసాయ రంగలో సమూలమార్పులు తీసుకొస్తున్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధితో పాటు వారి పోషణ, ఆరోగ్యం, విద్య వంటి అన్ని రంగాలపై కూడా మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 2025 సెప్టెంబర్లో ప్రారంభించిన “స్వస్థ్ నారి, సశక్త్ పరివార్” ప్రచారం ర్వారా సుమారు ఏడు కోట్ల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాం. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తమ చికిత్సను ముందుగానే ప్రారంభించేందుకు ఎంతగానో త్పోడ్పడింది.
గౌరవ సభ్యులారా,
మా ప్రభుత్వ ప్రగతిశీల దృక్పథం, విధానాల ఫలితంగా దేశంలోని ప్రతి రంగంలోనూ మహిళలు వేగంగా ముందుకు సాగుతున్నారు. ఇదే దిశలో కేవలం కొన్ని నెలల కిందటే దేశం మరో కీలక ప్రస్థానాన్ని అధిగమించింది. జాతీయ రక్షణ అకాడమీ (ఎన్డీఏ) నుంచి తొలి మహిళా క్యాడెట్ల మొదటి బ్యాచ్ విజయవంతంగా గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకుంది. దేశ అభివృద్ధి, సాధికారతలో ‘‘నారీ శక్తి’’ అగ్రభాగాన నిలిచిందనే నమ్మకాన్ని ఇది మరింత బలపరిచింది.
గౌరవ సభ్యులారా,
శ్రీ గురు తేగ్ బహదూర్ జీ మనకు ఒక విషయాన్ని బోధించారు. ‘‘భయ్ కహూ కో దేత్ నయ్, నయ్ భయ్ మానత్ ఆన్’’.. అంటే మనం ఇతరులను భయపెట్టకూడదు. అలాగేని ఇతరులకు భయపడి జీవించకూడదు.
ఇలాంటి నిర్భయత్వ స్ఫూర్తితోనే దేశ భద్రతను కాపాడుకోవచ్చు. అధికారాన్ని బాధ్యతతో, వివేకంతో ఎలా ఉపయోగించవచ్చో భారత్ నిరూపించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత రక్షణ దళాల పరాక్రమాన్ని, వీరత్వాన్ని ప్రపంచం కళ్లారా చూసింది. మన దేశం తన సొంత వనరులను ఉపయోగించి ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దేశంపై జరిగే ఎలాంటి ఉగ్రవాద దాడికైనా గట్టి, నిర్ణయాత్మకమైన ప్రతిస్పందన ఉంటుందనే బలమైన సందేశాన్ని మా ప్రభుత్వం పంపింది. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత కూడా ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటంలో భాగమే. దేశ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు 'మిషన్ సుదర్శన్ చక్ర' కొనసాగుతోంది.
గౌరవలైన సభ్యులారా,
మా ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఉగ్రవాదంపై భద్రతా దళాలు కూడా నిర్ణయాత్మక చర్యలు చేపట్టాయి. ఏళ్ల తరబడి దేశంలోని 126 జిల్లాల్లో అభద్రతాభావం, భయం, అపనమ్మకం నెలకొన్నాయి. మావోయిస్టు సిద్ధాంతం అనేక తరాల భవిష్యత్తును చీకట్లోకి నెట్టివేసింది. ముఖ్యంగ మన యువత, గిరిజనులు, దళిత సోదరసోదరీలు తీవ్రంగా ప్రభావితమయ్యారు.
నేడు ఉగ్రవాద సమస్య 126 జిల్లాల నుంచి కేవలం ఎనిమిది జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. వీటిలో కూడా అత్యధికంగా ప్రభావితమయ్యే జిల్లాలు మూడు మాత్రమే ఉన్నాయి. గత ఏడాది కాలంలో ఉగ్రవాదంతో సంబంధం ఉన్న దాదాపు రెండు వేల మంది వ్యక్తులు లొంగిపోయారు. ఇది లక్షలాది మంది పౌరుల జీవితాల్లో తిరిగి శాంతిని నెలకొల్పింది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వస్తున్న మార్పును దేశమంతా చూస్తోంది. 25 ఏళ్ల తర్వాత బీజాపూర్లోని ఒక గ్రామానికి బస్సు చేరుకున్నప్పుడు గ్రామస్థులు దానిని పండుగలా జరుపుకున్నారు. బస్తర్ ఒలింపిక్స్లో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆయుధాలు వీడిన వారు ఇప్పుడు జగదల్పూర్లోని పండుమ్ కేఫేలో సేవలందిస్తున్నారు.
గౌరవ సభ్యులారా,
ఆయుధాలు విడిచిపెట్టి జన సమూహంలో చేరిన వారికి సాధారణమైన, గౌరవకరమైన జీవితం కల్పించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశం మావోయిస్టు ఉగ్రవాదం నుంచి పూర్తిగా విముక్తి పొందే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదు.
గౌరవ సభ్యులారా,
స్వావలంబన లేని జీవితంలో స్వేచ్ఛ అసంపూర్ణంగానే ఉంటుందని గురుదేవుడు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు. భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే దిశగా మా ప్రభుత్వం నిరంతరం కీలక చర్యలు తీసుకుంటోంది. నేడు ‘‘మేక్ ఇన్ ఇండియా’’ దార్శనికతతో తయారైన ఉత్పత్తులు వివిధ ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటున్నాయి. ’స్వదేశీ’పై పౌరుల్లో కూడా గొప్ప ఉత్సాహం కనిపిస్తోంది.
గౌరవలైన సభ్యులారా,
పిఎల్ఐ పథకం ద్వారా ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. 17 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ఉత్పత్తి జరిగింది. దేశ ఎలక్ట్రానిక్స్ రంగం ఎన్నడూ లేనంత వేగంతో అభివృద్ధి చెందుతోంది. గత 11 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగింది. నేడు ఇది 11 లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంది.
2025లో దేశ రక్షణ ఉత్పత్తి 1.5 లక్షల కోట్ల రూపాయలను అధిగమించింది. రక్షణ ఎగుమతులు కూడా 23 వేల కోట్ల రూపాయల రికార్డును దాటాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్లో తయారైన(మేడ్ ఇన్ ఇండియా) రక్షణ వేదికలపై విశ్వాసం మరింత బలపడింది.
గౌరవ సభ్యులారా,
ప్రపంచ పెట్టుబడులు, ఎగుమతుల్లో భారత్ వాటా క్రమంగా పెరుగుతోంది. గత 11 ఏళ్లలో భారత్ సుమారు 750 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను పొందింది.
దీంతో కొత్త రంగాలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆధునిక తయారీ రంగం, భవిష్యత్తు సాంకేతికతలకు మైక్రోచిప్ల తయారీలో స్వావలంబన చాలా అవసరం. 2025లో మరో నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు అనుమతులు లభించాయి. సమీప భవిష్యత్తులో మరో 10 కర్మాగారాలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. నానో చిప్ ల తయారీలో కూడా భారత్ స్పష్టమైన, పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది.
గౌరవ సభ్యులారా,
మా ప్రభుత్వం చిప్లతో పాటు అత్యంత ప్రాధాన్యతతో పని ప్రారంభించిన మరో కీలక రంగం కూడా ఉంది. జాతీయ కీలక ఖనిజాల మిషన్ ద్వారా అత్యవసరమైన ఖనిజాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
గౌరవ సభ్యులారా,
గతంలో సముద్ర వాణిజ్యంలో భారత్ ఒక మహాశక్తిగా ఉండేది. అయితే వలస పాలన తరువాత దశాబ్దాల పాటు నిర్లక్ష్యం కారణంగా నేడు భారత వాణిజ్యంలో 95 శాతం విదేశీ నౌకల ద్వారానే సాగుతోంది. దీని కోసం ప్రతి సంవత్సరం ఆరు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతోంది.
ఈ పరిస్థితి నుంచి దేశాన్ని బయటకు తీసుకురావడానికి మా ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపడుతోంది. షిప్పింగ్ రంగం కోసం సుమారు 70 వేల కోట్ల రూపాయల చారిత్రక ప్యాకేజీని మా ప్రభుత్వం ప్రకటించింది. భారీ నౌకలకు మౌలిక సదుపాయాల హోదా కల్పించింది. అదేవిధంగా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పాత సముద్ర చట్టాలను కూడా సవరించాం.
గౌరవ సభ్యులారా,
కేరళకు చెందిన గొప్ప సాధువు శ్రీనారాయణ గురు ఇలా చెప్పారు: ‘‘విద్య ద్వారా జ్ఞానాన్ని సంపాదించండి.. సంఘటితం కావడం ద్వారా శక్తిమంతులు అవ్వండి’’. ఎందుకంటే ఒక దేశం కలలు కనే సయంలో ఆ కలలు ఆవిష్కరించేంది యువతే. వాటిని సాకారం చేసేది కూడా అదే యువత.
గత 11 ఏళ్లలో ఒక్క ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోనే 25 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు అందించామని తెలుసుకోవడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మా ప్రభుత్వ అనుకూల విధానాలతో దేశంలో అనేక కొత్త రంగాలు కూడా ఎదుగుతున్నాయి. సెమీకండక్టర్లు, హరిత ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ వంటి కొత్త రంగాల్లో కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
గౌరవ సభ్యులారా,
గత కొన్ని సంవత్సరాలుగా ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం 50 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింది. ఈ మౌలిక సదుపాయాలకు అందించిన పెట్టుబడి యువతకు విస్తారైన ఉపాధి అవకాశాలను కల్పించింది.
గౌరవ సభ్యులారా,
నేడు మనం దేశంలోని యువ మేధావుల్లో మరో సానుకూల మార్పును చూస్తున్నాం. దేశ యువత ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ, మేక్ ఇన్ ఇండియాలను తమ బాధ్యతగా తీసుకుంటున్నారు.
యువతలో ముద్ర యోజన వంటి కార్యక్రమాలు వ్యవస్థాపకత. స్వయం ఉపాధి స్ఫూర్తిని పెంపొందిస్తున్నాయి. ఈ పథకం ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు 38 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు అందించా. మొదటిసారిగా స్వయం ఉపాధి పొందుతున్న వారికి సుమారు 12 కోట్ల రుణాలు మంజూరు చేశాం.
అదే విధంగా పీఎం విశ్వకర్మ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా చేతివృత్తుల వారికి శిక్షణ, బ్యాంకింగ్ మద్దతు అందుతోంది. పీఎం స్వనిధి పథకం కింద ద్వారా 72 లక్షల మంది వీధి వ్యాపారులు 16 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు.
గౌరవనీయ సభ్యులారా,
ఇటీవలే స్టార్టప్ ఇండియా కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ పదేళ్లలో, భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకురసంస్థ వ్యవస్థగా అవతరించింది. ఒక దశాబ్దం కిందట మన దేశంలో 500 కంటే తక్కువ అంకుర సంస్థలు ఉండేవి. ఈ రోజు దాదాపు రెండు లక్షల అంకుర సంస్థలు నమోదయ్యాయి. వాటిలో సుమారు 50 వేల కొత్త అంకుర సంస్థలు కేవలం గత సంవత్సర కాలంలోనే నమోదయ్యాయి. భారత అంకురసంస్థల నెట్వర్క్లో 20 లక్షల మందికి పైగా యువత పనిచేస్తున్నారు. ఈ అంకుర సంస్థల్లోని 45 శాతం సంస్థల్లో కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉన్నారు.
గౌరవనీయ సభ్యులారా,
గత సంవత్సర కాలంలో మన ప్రభుత్వం వివిధ ఉద్యోగ మేళాల ద్వారా లక్షలాది మంది యువతకు శాశ్వత ఉద్యోగాలను కల్పించింది. ప్రైవేట్ రంగంలోనూ లక్ష కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనాను ప్రారంభించాం. ఈ పథకం కింద 3.5 కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నాం.
మన ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్లే ఐటీ సేవలు, ఎలక్ట్రానిక్స్ తయారీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో కోటి మందికి పైగా యువతకు ఉపాధి లభించింది.
గౌరవనీయ సభ్యులారా,
గత సంవత్సరంలో లక్షకు పైగా మొబైల్ టవర్ల ద్వారా 4జీ, 5జీ నెట్వర్క్ సేవలు దేశంలోని ప్రతి మూలకూ చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా విస్తరణ... ప్రపంచంలోని వేల కోట్ల విలువైన సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు భారత్ను ప్రధాన కేంద్రంగా పరిచయం చేసింది. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేయడం లక్ష్యంగా మన ప్రభుత్వం 'వేవ్స్' పేరుతో కొత్త వేదికనూ ప్రారంభించింది.
గౌరవనీయ సభ్యులారా,
ఈ రోజు సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీని ఫలితంగా ఉద్యోగాల స్వరూపం వేగంగా మారుతోంది. అందుకే వర్తమాన, భవిష్యత్ అవసరాలను తీర్చేలా జాతీయ విద్యా విధానాన్ని రూపొందించాం.
పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో సాంకేతికత, ఆవిష్కరణలతో కూడిన ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తున్నాం. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇందులో సమర్థమైన పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా విద్యార్థులు అటల్ టింకరింగ్ ల్యాబ్ల ద్వారా ప్రయోజనం పొందారు. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా పరిశోధనాభివృద్ధి సంస్కృతినీ ప్రోత్సహిస్తున్నారు.
గౌరవనీయ సభ్యులారా,
దేశంలో ఐటీఐ నెట్వర్క్ ఉన్నతీకరణ కోసం వెయ్యి ఐటీఐలను భవిష్యత్తుకు సిద్ధంగా ఆధునికీకరిస్తున్నాం. దీని కోసం పీఎం సేతు పథకం కింద 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.
మన ప్రభుత్వం ఆధునిక సాంకేతికత కోసం పరిశ్రమకు సిద్ధంగా ఉండే శ్రామికశక్తిని సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు సెమీకండక్టర్ పరిశ్రమ కోసం 60 వేల మంది యువతకు శిక్షణనిచ్చాం. కృత్రిమ మేధ రంగంలోనూ 10 లక్షల మంది యువతకు శిక్షణనిస్తున్నాం.
గౌరవనీయ సభ్యులారా,
ఈ రోజు కృత్రిమ మేధ దుర్వినియోగం వల్ల తలెత్తుతున్న ప్రమాదాల నేపథ్యంలో ఈ విషయంపై తీవ్రంగా దృష్టి సారించడం అత్యవసరం. డీప్ఫేక్, తప్పుడు సమాచారం, నకిలీ కంటెంట్ ప్రజాస్వామ్యానికి, సామాజిక సామరస్యానికీ, ప్రజల నమ్మకానికీ పెను ముప్పుగా మారుతున్నాయి. మీరంతా తీవ్రమైన ఈ సమస్యపై చర్చించడం చాలా ముఖ్యం.
గౌరవనీయ సభ్యులారా,
భారత యువత, మన ప్రభుత్వ సమష్టి కృషితో మన దేశం క్రీడారంగంలోనూ అపూర్వమైన అభివృద్ధిని సాధిస్తోంది.
మన కుమార్తెలు, దివ్యాంగులైన మన బిడ్డల ప్రదర్శన మెరుగుపడిన తీరు నిజంగా అద్భుతం. భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ను గెలుచుకుంది. అంధులైన మహిళల క్రికెట్ జట్టూ ప్రపంచ కప్ను సాధించింది. ఇంతటి విజయం సాధించిన మన దేశ ఆడపడుచులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
గౌరవనీయ సభ్యులారా,
గత దశాబ్ద కాలంలో భారత క్రీడలకు సంబంధించిన ప్రతి వ్యవస్థలోనూ సంస్కరణలు చేపట్టాం. మన ప్రభుత్వం ఖేలో ఇండియా విధానాన్ని రూపొందించడం ద్వారా క్రీడలకు సంబంధించిన సంస్థల్లో పారదర్శకతను తీసుకువచ్చింది.
తగిన సంసిద్ధత, ఆత్మవిశ్వాసం ఫలితంగానే కామన్వెల్త్ గేమ్స్-2030కు ఆతిథ్యం ఇచ్చే బాధ్యతను భారత్ పొందగలిగింది.
వికసిత భారత్ నిర్మాణంలో దేశంలోని సమర్థులైన యువశక్తి నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారని నేను విశ్వసిస్తున్నాను.
యువతను దేశ నిర్మాణ ఆలోచనతో అనుసంధానించడం కోసం మన ప్రభుత్వం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ వేదికనూ ప్రారంభించింది. ఈ సంవత్సర కాలంలోనే ఈ వేదిక ద్వారా దాదాపు 50 లక్షల మంది యువత తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు సుమారు రెండు కోట్ల మంది యువత మై భారత్ వేదికలో చేరారు.
గౌరవనీయ సభ్యులారా,
ప్రపంచం అనిశ్చితుల మధ్య ముందుకు సాగుతోందని మీ అందరికీ తెలుసు. సుదీర్ఘకాలంగా ప్రపంచ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. కొనసాగుతున్న సంఘర్షణల వల్ల తలెత్తుతున్న అనిశ్చితులు ప్రపంచ స్థిరత్వంపైనా, ఆర్థిక వ్యవస్థపైనా ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ సవాలుతో కూడిన పరిస్థితుల్లోనూ భారత్ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ విజయం వెనక మన ప్రభుత్వ సమతుల్య విదేశాంగ విధానం, దూరదృష్టితో కూడిన దార్శనికత ఉన్నాయి.
గౌరవనీయ సభ్యులారా,
ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ అనిశ్చితి పరిస్థితుల మధ్య భారత్ వారధి పాత్రను పోషిస్తోంది. సంఘర్షణలో నిమగ్నమైన దేశాలూ కీలక విషయాల్లో భారత్ పట్ల తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సమతుల్యమైన, నిష్పక్షపాతమైన వైఖరిని అనుసరిస్తూ... మానవతా దృక్పథానికీ భారత్ నిరంతర ప్రాధాన్యమివ్వడం సంతృప్తికరమైన విషయం. అది 'ఇండియా ఫస్ట్' అనే తన సంకల్పంపై స్థిరంగా నిలబడింది.
గౌరవనీయ సభ్యులారా,
ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సౌత్ గళాన్ని భారత్ బలోపేతం చేసింది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా సహా వివిధ ప్రాంతాల్లో కొత్త భాగస్వామ్యాలను భారత్ ఏర్పరచుకుంది. దీర్ఘకాల సంబంధాలను పటిష్ఠం చేస్తూనే పాత బంధాలనూ బలపరిచింది. బిమ్స్టెక్, జీ20, బ్రిక్స్, ఎస్సీవో వంటి వివిధ అంతర్జాతీయ వేదికలపైనా భారత్ తన ఉనికిని నిరంతరం బలోపేతం చేసుకుంటోంది.
గౌరవనీయ సభ్యులారా,
మానవాళికి సేవ చేయడమే ప్రపంచ రాజకీయాలు, సహకారాల అంతిమ లక్ష్యమని భారత్ ఎల్లప్పుడూ విశ్వసిస్తుంది. భారత్ తన చర్యల ద్వారా దీనికి స్ఫూర్తిదాయక ఉదాహరణలనూ అందించింది. లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, పసిఫిక్ దీవులు, పొరుగు దేశాల్లో సంక్షోభం తలెత్తిన సమయాల్లోనూ భారత్ సాధ్యమైన సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చింది. 2025, నవంబరు నెలలో శ్రీలంకలో దిత్వా తుఫాను సమయంలోనూ మన ప్రభుత్వం ఆపరేషన్ సాగర్ బంధును నిర్వహించింది. మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్లోనూ ఆపద సమయంలో భారత్ మొదటగా స్పందించింది.
గౌరవనీయ సభ్యులారా,
ఈ రోజు భారత్ తన విస్తృత పాత్ర, చురుకైన భాగస్వామ్యంతో అనేక అంతర్జాతీయ సంస్థల్లో కీలక బాధ్యతలనూ నిర్వర్తిస్తోంది. ఈ సంవత్సరం భారత్ బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తోంది. ప్రపంచం దీనిని గొప్ప ఆశావాదంతో చూస్తోంది. భవిష్యత్ అవకాశాలు, సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడానికి భారత్ ఒక గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సదస్సునూ నిర్వహించనుంది. ఇది ప్రపంచ స్థాయిలో ఒక కీలక కార్యక్రమంగా నిలుస్తుంది.
గౌరవనీయ సభ్యులారా,
వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆధునిక అభివృద్ధికి ఎంత ప్రాధాన్యమిస్తామో, జాతీయ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక ప్రతిష్ఠకీ అంతే ప్రాధాన్యమివ్వాలి. సాంస్కృతిక దృక్కోణంలో ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో భారత్ ఒకటి. ఈ వారసత్వాన్ని దేశానికి బలమైన మూలంగా మార్చడానికి మన ప్రభుత్వం కృషి చేస్తోంది.
మెకాలే కుట్రల ద్వారా వలస పాలన కాలంలో భారత ప్రజల్లో ఒక రకమైన ఆత్మన్యూనతా భావాన్ని నూరిపోశారు. ఇప్పుడు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా మన ప్రభుత్వం ఆ కుట్రను తిప్పి కొట్టే ధైర్యాన్ని ప్రదర్శించింది.
గౌరవ సభ్యులారా,
ప్రస్తుతం, దేశం తన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకోవడానికీ, సుసంపన్నం చేయడానికీ అన్ని విధాలుగానూ కృషి చేస్తోంది. ఇదే దిశలో, నా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలతో నూట ఇరవై అయిదు సంవత్సరాల తరువాత.. భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలు భారత్కు తిరిగి చేరాయి. ఆ పవిత్ర అవశేషాలను ఇక సామాన్య ప్రజానీకం సందర్శనార్థం అనుమతిస్తున్నారు.
ఈ సంవత్సరంలోనే, సౌరాష్ట్రలో సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించి 75వ సంవత్సరం పూర్తి కాబోతోంది. సోమనాథ్ ఆలయంపై దాడులు జరిగిన తరువాత ఒక వేయి సంవత్సరాల ప్రస్థానం.. భారత ధార్మిక నిష్ఠకీ, సనాతన సంస్కృతికీ, చిరకాల నమ్మకానికీ ప్రతీకగా నిలుస్తోంది. ఈ సందర్భంగా దేశమంతటా ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’లో ప్రజలు ఎంతో ఉత్సాహంతో పాలుపంచుకున్నారు.. ఇది నిజంగా సాటి లేనిది.
రాజేంద్ర చోళుడు గంగైకొండ-చోళపురాన్ని నిర్మించిన తరువాత, కొద్ది కాలం కిందటే ఈ ఘట్టానికి 1000 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భం కూడా కోట్లాది దేశప్రజలకు తమ గత కాల వైభవాన్ని గమనించి, గర్వపడే అవకాశాన్ని అందించింది.
గౌరవ సభ్యులారా,
మన దేశం ప్రాచీన జ్ఞానానికి కేంద్రంగా పేరు తెచ్చుకుంది. ఈ జ్ఞాన భాండాగారాన్ని వేల సంవత్సరాలుగా, తరం తరువాత తరం.. చేతిరాత పుస్తకాల రూపంలో పరిరక్షిస్తూ వచ్చాం. ఏమైనా విదేశీ దండయాత్రలతో పాటు స్వాతంత్య్రానంతరం కూడా అజాగ్రత్త వహించిన కారణంగా, ఈ అమూల్య వారసత్వానికి భారీ నష్టం వాటిల్లింది. ప్రస్తుతం నా ప్రభుత్వం, ఈ జ్ఞాన భాండాగారాన్ని సంరక్షించడానికి చర్యలు తీసుకుంటోంది. జ్ఞాన భారతం మిషన్ను అమలుచేస్తూ, దేశం నలుమూలలా ప్రాచీన చేతిరాత పుస్తకాల సారాంశాన్ని డిజిటలీకరించే పనిని మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాలు రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జ్ఞాన సంపదను సురక్షితంగా ఉంచడంతో పాటు, ఆ జ్ఞాన సంపదను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచడంలో ఓ కీలక పాత్రను పోషిస్తాయి.
గౌరవ సభ్యులారా,
దేశ గిరిజనుల ఘన వారసత్వాన్ని కాపాడటానికి నా ప్రభుత్వం గిరిజన మ్యూజియంలను కూడా ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగా, ఛత్తీస్గఢ్లో శహీద్ వీర్ నారాయణ్ సింగ్ గిరిజన స్వాతంత్య్రయోధుల మ్యూజియాన్ని ఇటీవల ప్రారంభించారు. రాజ్యాంగాన్ని సంథాలీ భాషలోకి అనువాదం చేయించి, గిరిజన సమాజం గౌరవాన్ని నా ప్రభుత్వం పెంచిందని ప్రకటిస్తూ నేను సంతోషిస్తున్నాను.
గౌరవ సభ్యులారా,
మనం మన సంస్కృతీ సంప్రదాయాల్ని గౌరవించామంటే, అప్పుడు.. మనని ప్రపంచం కూడా గౌరవిస్తుంది. కిందటి ఏడాదిలో, యునెస్కో మన దీపావళి పండుగను మానవ జాతికి చెందిన అమూర్త సాంస్కృతిక సంప్రదాయ జాబితాలో చేర్చింది. దీనికి తోడు, దీపావళి అంటే ప్రపంచం అంతటా లోకప్రియత్వం అంతకంతకూ పెరుగుతుండడంతో, యునెస్కో ఇప్పుడు ఇచ్చిన ఈ గుర్తింపు మన భారతీయులందరికీ గొప్ప గర్వకారణమైన విషయంగా మారింది.
గౌరవ సభ్యులారా,
వేర్వేరు అభిప్రాయాలు, వివిధ ఆలోచనల నడుమ.. దేశం కంటే మరేదీ మిన్న కాదనే విషయాన్ని అంతా ఒప్పుకొని, గౌరవిస్తున్నారు. పూజ్య మహాత్మాగాంధీ, నెహ్రూ జీ, బాబాసాహెబ్, సర్దార్ పటేల్, జేపీ జీ, లోహియా జీ, పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ, అటల్ జీ.. వీళ్లందరూ ప్రజాస్వామ్యంలో అంశాలపై భిన్నాభిప్రాయాలతో ఉండటం స్వాభావికమేననీ, అయితే కొన్ని విషయాలు అభిప్రాయ భేదాలకు అతీతమయినవనీ నమ్మారు. వికసిత్ భారత్ సంకల్పం, భారత్ భద్రత, స్వయంసమృద్ధి, స్వదేశీ ప్రచారం, దేశ ఏకత దిశగా కృషి, స్వచ్ఛత.. ఇలా దేశంతో ముడిపడ్డ విషయాలపై పార్లమెంట్ సభ్యులు ఏకతాటి మీద నిలవాలి. మన రాజ్యాంగ భావన కూడా ఇదే. ఈ కారణంగా దేశ ప్రయోజనాలతో ముడిపడ్డ విషయాలపై పార్లమెంటులో ప్రతి సభ్యుడు/ ప్రతి సభ్యురాలు ఒకే మాట మీద నిలబడి, దేశ ప్రగతిలో భాగస్తులై చర్చించాలనీ, దేశ ప్రగతి సాధన ప్రయత్నాల్లో కొత్త శక్తిని నింపాలనీ ఈ రోజు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
గౌరవ సభ్యులారా,
ప్రస్తుతం, భారత్ తన భవితలో ఓ ముఖ్య దశకు చేరుకోవడాన్ని పౌరులంతా గమనించవచ్చు. ఇప్పుడు తీసుకొనే నిర్ణయాల ప్రభావం రాబోయే సంవత్సరాల్లో కనిపిస్తుంది.
వికసిత్ భారత్ లక్ష్యం ఏ ఒక్క ప్రభుత్వానికో, లేక ఏ ఒక్క తరానికో పరిమితం కాదు. ఇది నిరంతరంగా కొనసాగే ప్రయాణం. ఈ ప్రయాణంలో మన అందరి ప్రయత్నాలు, క్రమశిక్షణ, నిరంతరత్వం ముఖ్యపాత్రను పోషిస్తాయి. రాబోయే కాలంలో దేశ ప్రగతి మన ఉమ్మడి సంకల్పంతోనే సాకారమవుతుంది.
పార్లమెంటూ, ప్రభుత్వమూ, పౌరులూ కలిసికట్టుగా వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేరుస్తారని నేను నమ్ముతున్నాను. భారత పౌరులు దేశహితాన్ని అన్నింటి కన్నా మిన్నగా భావిస్తూ, రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ ముందుకు సాగుతారు. దేశ ప్రజలంతా తమ కర్తవ్యాలను దేశ హితంతో పాటు దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఈ నమ్మకంతోనే, నేను చట్టసభల సభ్యులందరూ ఫలవంతమైన సమావేశాలను అందించాలంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మీకు ఇవే ధన్యవాదాలు.
జై హింద్.
జై భారత్.
***
(रिलीज़ आईडी: 2219668)
आगंतुक पटल : 17