సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో, ఏడు ఖండాల్లోని ఒక్కో దేశంలో భారీ స్థాయిలో 25వ భారత్ రంగ్ మహోత్సవ్ 2026 వేడుకలు
ఈ ఉత్సవంలో మొత్తం 228 భాషలు, మాండలికాలలో 277 భారతీయ ప్రదర్శనలు, 12 అంతర్జాతీయ ప్రదర్శనలు
కొత్త నాటక రచయితలను ప్రోత్సహించేందుకు థియేటర్ బజార్ ఏర్పాటు.. ‘శ్రుతి’ శీర్షిక కింద 17 పుస్తకాల ఆవిష్కరణ.. ప్రత్యేక ఆకర్షణగా మహిళా దర్శకులు రూపొందించిన 33 నాటక ప్రదర్శనలు
స్వాతంత్ర్య సమరయోధులు, సామాజిక సంస్కర్తలు, నాటక రంగ దిగ్గజాలకు నివాళులు అర్పిస్తూ ప్రత్యేక ప్రదర్శనలు
प्रविष्टि तिथि:
22 JAN 2026 4:28PM by PIB Hyderabad
ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ నాటకోత్సవమైన 25వ భారత్ రంగ మహోత్సవ్ (బీఆర్ఎమ్) 2026 జనవరి 27 నుంచి ఫిబ్రవరి 20 వరకు జాతీయ నాటక పాఠశాల (ఎన్ఎస్ డీ) నిర్వహించనుంది. ఇది ఇప్పటివరకు జరిగిన అన్ని ఉత్సవాల కంటే అత్యంత విస్తృతమైన, సమగ్ర కార్యక్రమంగా నిలవనుంది.

బీఆర్ఎమ్ 2026ను దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో నిర్వహించడంతో పాటు, ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఒక్కో దేశం నుంచి కనీసం ఒక నాటక ప్రదర్శనలను ప్రదర్శించడం కీలకం. ఈ ఉత్సవం ప్రపంచ వ్యాప్తిని, సాంస్కృతిక ప్రాధాన్యతను మరింత బలోపేతం చేస్తుంది.


ఈ ఉత్సవంలో మొత్తం 277 భారతీయ నాటకాలను ప్రదర్శించనున్నారు. వీటిలో 136 ఎంపిక చేసిన నాటకాలు, ఆహ్వానిత ప్రదర్శనలు ఉన్నాయి. అలాగే 12 అంతర్జాతీయ నాటక ప్రదర్శనలు కూడా నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలు 228 భారతీయ, విదేశీ భాషలు, మాండలికాల్లో ఉండనున్నాయి. దీని వల్ల భాషా వైవిధ్య పరంగా భారత్ రంగ మహోత్సవ్ ప్రపంచంలోనే అతిపెద్ద నాటకోత్సవంగా నిలుపుతుంది.
ఎంపిక చేసిన నాటకాలు 817 జాతీయ, 34 అంతర్జాతీయ దరఖాస్తులపై నిర్వహించిన కఠినమైన పరిశీలన ప్రక్రియ ద్వారా ఎంపిక చేశారు. వీటితోపాటు వివిధ కేంద్రాల్లో 19 విశ్వవిద్యాలయ ప్రదర్శనలు, 14 స్థానిక నాటక ప్రదర్శనలు కూడా ఈ ఉత్సవంలో భాగంగా ఉండనున్నాయి.
ఈ సందర్భంగా జాతీయ నాటక పాఠశాల (ఎన్ఎస్ డీ) ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ భారత్ గుప్తా మాట్లాడుతూ.. “భారత్ రంగ మహోత్సవ్ 2026, కేవలం ఉద్దేశంలోనే కాకుండా దాని విస్తృత స్థాయిలో కూడా నాటక రంగం ప్రజాస్వామ్యీకరణ, సార్వత్రికీకరణకు నిదర్శనంగా నిలుస్తోంది. విభిన్న భాషలు, కళారూపాలు, వివిధ వర్గాలు, వయసుల వారి నుంచి వచ్చిన నాటక వ్యక్తీకరణలను ఇందులో సమ్మిళితం చేయడం ద్వారా భారతీయ సృజనాత్మక వారసత్వాన్ని ఈ ఉత్సవం ప్రతిబింబిస్తోంది.” అని తెలిపారు.
ఈ ఏడాది ఉత్సవంలో మైథిలి, భోజ్పురి, తుళు, ఉర్దూ, సంస్కృతం,తాయ్ ఖమ్తి, నిషి వంటి భాషలతో పాటు దాదాపు అన్ని ప్రధాన దేశీయ భాషలు, పలు గిరిజన, అంతరించిపోతున్న భాషల్లో నాటక ప్రదర్శనలు జరగడం ద్వారా భాష, సాంస్కృతిక పరిధి గణనీయంగా విస్తరించింది.
ఈ ఉత్సవంలో తొలిసారిగా లడఖ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, దామన్ అండ్ దయ్యూ, ఐజ్వాల్ (మిజోరం), తురా (మేఘాలయ), నాగావ్ (అస్సాం), మండి (హిమాచల్ ప్రదేశ్), రోహ్తక్ (హర్యానా) వంటి ప్రాంతాలను కొత్త కేంద్రాలుగా చేర్చారు.
ఉత్సవ స్పూర్తిని వివరిస్తూ.. జాతీయ నాటక పాఠశాల డైరెక్టర్ శ్రీ చిత్తరంజన్ త్రిపాఠి ఇలా అన్నారు. ‘‘25వ భారత్ రంగ మహోత్సవ్ ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల ద్వారా నిర్వహించే నాటక రంగ మహాకుంభం. ఇది అందరినీ కలుపుకుపోయే, వర్గభేదాలు లేని అంతర్జాతీయ నాటక ఉత్సవం. ఇక్కడ విభిన్న నాటక రూపాల ద్వారా భాషలు, ప్రాంతాలు, కళా సౌందర్యాలు, సిద్ధాంతాలు ఏకమవుతాయి.
ఈ ఉత్సవం దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాల వరకు చేరుకోవడం గర్వకారణం. ఇలాంటి అవకాశాలు చాలా పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రజలకు నాటక అనుభవాన్ని చేరువ చేస్తుంది. గొప్ప మౌఖిక, లిఖిత సంప్రదాయాలు కలిగిన తగిన గుర్తింపు లేని భాషలకు కూడా బీఆర్ఎమ్ ఒక వేదికను అందిస్తోంది’’ అని తెలిపారు.
బీఆర్ఎమ్ 2026లో ఆదిరంగ్ మహోత్సవ్ విభిన్నమైన, అనుబంధ నాటక ఉత్సవాల సమాహారాన్ని ప్రదర్శిస్తుంది. వాటిలో (గిరిజన నాటకం, నృత్యం, హస్తకళలు), జష్నే బచ్పన్ (బాలల నాటకం), బాల్ సంగమ్ (పిల్లల జానపద నృత్య నాటకాలు), పూర్వోత్తర్ నాట్య సమారోహ్ (ఈశాన్య రాష్ట్రాల నాటక ప్రదర్శనలు), తోలుబొమ్మలాట ఉత్సవం, నృత్య రూపక ఉత్సవం, శాస్త్రీయ సంస్కృత నాటకోత్సవం, మైక్రో డ్రామా ఫెస్టివల్ వంటి ప్రదర్శనలు ఉండనున్నాయి.
తొలిసారిగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలు, సెక్స్ వర్కర్లు, సీనియర్ సిటిజన్లు ఇతర వెనుకబడిన వర్గావారు రూపొందించిన నాటక ప్రదర్శనలకు కూడా ఈ ఉత్సవంలో చోటు కల్పించనున్నారు.
ఈ ఉత్సవంలో భగవాన్ బిర్సా ముండా, లోక్ మాతా అహల్యా బాయి, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వంటి విశిష్ట వ్యక్తులను స్మరించుకోవడంతోపాటు, నాటకరంగ దిగ్గజాలైన రతన్ థియామ్, దయా ప్రకాష్ సిన్హా, బన్సీ కౌల్, ఆలోక్ ఛటర్జీలకు నివాళులర్పించనున్నారు. ఎన్ఎస్డీ ఢిల్లీ క్యాంపస్లో ఇబ్రహీం అల్కాజీని సత్కరించే ఓ ప్రత్యేక సదస్సును నిర్వహిస్తారు. క్యాన్సర్ బాధితుడు, ఎన్ఎస్డీ పూర్వ విద్యార్థి రాసి, ప్రదర్శించే ఒక ప్రత్యేక నాటక ప్రదర్శన కూడా ఇక్కడ నిర్వహించనున్నారు.
జానపద కళా ప్రదర్శనలు, వీధి నాటకాలు, సదస్సులు, మాస్టర్ క్లాస్లు, వర్క్షాప్లు ఈ ఉత్సవంలో అంతర్భాగంగా ఉంటాయి. ఎన్ఎస్డీ విద్యార్థుల సంఘం నేతృత్వంలోని అద్వితీయ విభాగం ద్వారా ఇంటరాక్టివ్ సదస్సులు, వీధి నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
ఉత్సవంలో థియేటర్ బజార్ అనే వేదిక ద్వారా కొత్తగా రాసిన నాటకాలను ప్రోత్సహిస్తారు. ఎంపిక చేసిన రచనలకు అవార్డులు అందించి వాటిని ప్రచురిస్తారు.. “శ్రుతి” కార్యక్రమంలో 17 పుస్తకాలు ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా మహిళా దర్శకులు తెరకెక్కించిన 33 నాటకాలను ప్రదర్శించనున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, సామాజిక సంస్కర్తలు, ప్రముఖ నాటక కళాకారులను సత్కరించే ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఉండనున్నాయి.
దేశంలోని విభిన్న వంటకాల సంప్రదాయాలు, సాంప్రదాయ హస్తకళలను ప్రదర్శించే ప్రత్యేక కౌంటర్లు ఈ ఉత్సవానికి సాంస్కృతిక శోభను తీసుకురానున్నాయి.
మైథిలీ–భోజ్పురి అకాడమీ, హిందీ అకాడమీ, గర్వాలీ–కుమౌని–జౌన్సారీ అకాడమీ, ఉర్దూ అకాడమీ (ఢిల్లీ ప్రభుత్వం) వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక, విద్యా సంస్థల సహకారంతో భారత్ రంగ్ మహోత్సవ్ 2026 ను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ సహకార సంస్థల్లో నేషనల్ పాలిష్ థియేటర్ అకాడమీ (వార్సా), నేషనల్ అకాడమీ ఆఫ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఆర్ట్స్ (మాడ్రిడ్), రష్యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ -జీఐటీఐఎస్(మాస్కో) వంటి సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు పలు భారతీయ రాష్ట్రాలు, సాంస్కృతిక సంస్థల మద్దతు కూడా ఉంది.
***
(रिलीज़ आईडी: 2217485)
आगंतुक पटल : 4