సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
పిప్రహ్వా అవశేషాలను తిరిగి స్వదేశానికి తీసుకురావటం యాజమాన్య హక్కు కాదు.. సంరక్షణ బాధ్యత
ఒత్తిడి, నిర్బంధం ద్వారా కాదు.. సంభాషణ, నైతిక విలువల ద్వారా ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని బోధనల వ్యాప్తి
రాయ్ పిథోరా సాంస్కృతిక భవనంలో బౌద్ధ తత్వశాస్త్రంపై ప్యానెల్ చర్చ
प्रविष्टि तिथि:
05 JAN 2026 9:43AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శన సందర్భంగా న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా సాంస్కృతిక భవనంలో బౌద్ధ తత్వశాస్త్రంపై ప్యానెల్ చర్చ నిర్వహించారు.
నలందలోని నవ నలంద మహావిహార (డీమ్డ్ విశ్వవిద్యాలయం) వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ సింగ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నళిన్ కుమార్ శాస్త్రి, ఢిల్లీ విశ్వవిద్యాలయం ఫిలాసఫీ విభాగం ప్రొఫెసర్ బాల గణపతి, లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆనంద్ సింగ్,న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం ప్రొఫెసర్ రజనీశ్ మిశ్రా, కోల్కతా విశ్వవిద్యాలయం బౌద్ధ అధ్యయన విభాగం మాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఉజ్వల్ కుమార్తో పాటు పలువురు ప్రముఖ విద్యాంసులు ప్యానెల్ సభ్యులుగా పాల్గొన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ సిద్ధార్థ్ సింగ్ ప్రసంగిస్తూ.. బలప్రయోగం లేదా ఒత్తిడి ద్వారా కాకుండా, సంభాషణ, నైతిక విలువలు, వ్యక్తిగతంగా ఆదర్శంగా తీసుకోవటం ద్వారా బుద్ధుని బోధనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించినట్లు తెలిపారు. ధర్మం ఆధారంగా ఉండే ఇతర సంప్రదాయాల లాగే బౌద్ధమతం కూడా మత మార్పిడికి కాక మానవాళి మనసును శుద్ధి చేయటం, బాధల నుంచి విముక్తి కలిగించటంపై దృష్టి సారిస్తుందని చెప్పారు. వర్తమాన ఆచరణకర్తలను చారిత్రక బుద్ధునితో అనుసంధానిస్తూ, సజీవ సంప్రదాయాలను కొనసాగించటంలో బుద్ధుని అవశేషాలు తోడ్పడుతున్నాయని స్పష్టం చేశారు. పిప్రహ్వా అవశేషాలను తిరిగి స్వదేశానికి తీసుకురావటమనేది కేవలం యాజమాన్య హక్కుకు సంబంధించిన విషయం కాదని, ఉమ్మడి వారసత్వ సంరక్షణ బాధ్యతకు నిదర్శనమని చెప్పారు.
పిప్రహ్వా అవశేషాలను తిరిగి స్వదేశానికి తీసుకురావటం.. శాంతి, సమగ్ర జాతీయ అభివృద్ధికి మార్గదర్శిగా పునరుద్ధరించిన బౌద్ధ తత్వశాస్త్ర ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని ప్రొఫెసర్ నళిన్ కుమార్ శాస్త్రి అన్నారు. నైతిక పాలన, పర్యావరణ సుస్థిరత, మానసిక ఆరోగ్యం వంటి సమకాలీన అంశాలతో ప్రాచీన జ్ఞానాన్ని బౌద్ధ చింతన అనుసంధానిస్తుందని తెలిపారు. సామాజిక సామరస్యం, పర్యావరణ బాధ్యత, ప్రపంచ సంక్షేమానికి అనత్త, బ్రహ్మవిహారాలు, ప్రతీత్యసముత్పాదం వంటి బోధనలు అత్యవసరమన్నారు. ధర్మానికి మాతృభూమిగా భారత్ పాత్రను ఆయన స్పష్టం చేశారు.
బుద్ధుడు, ఆయన శిష్యుల అవశేషాలు కేవలం చిహ్నాలు మాత్రమే కాదని, ధర్మానికి సజీవ స్వరూపాలని ప్రొఫెసర్ ఆనంద్ సింగ్ స్పష్టం చేశారు. బుద్ధుని ఉనికిని, ఆయన బోధనలను ఇవి ఏకకాలంలో ప్రతిబింబిస్తాయన్నారు. స్థూపాలు, చైత్యాల ద్వారా పవిత్ర బౌద్ధ క్షేత్రాలు విస్తరించటంలో ఈ అవశేషాల ఆరాధన కీలక పాత్ర పోషించిందని తెలిపారు. మౌలిక తాత్విక విలువలను కోల్పోకుండానే, ఆదిబుద్ధ భావనలను, మాతృదేవత ఆరాధన వంటి స్థానిక సాంస్కృతిక అంశాలను బౌద్ధమతం మిళితం చేసుకుందని చెప్పారు.
దార్శనికత, సార్వత్రిక నైతిక విలువలే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధమతం ఆదరణ పొందటానికి ముఖ్య కారణాలని ప్రొఫెసర్ బాల గణపతి స్పష్టం చేశారు. పిప్రహ్వా అవశేషాలను బుద్ధుని సందేశానికి సజీవ చిహ్నాలుగా అభివర్ణిస్తూ, ధర్మానికి మాతృభూమిగా భారత నాగరికత పాత్రను తెలియజేశారు. విచ్ఛిన్నమవుతున్న నేటి ప్రపంచంలో శాంతి, పరస్పర సహకారం, నైతిక స్పష్టతకు ఆచరణాత్మక, మానవీయ మార్గాన్ని బౌద్ధ దర్శనం చూపుతుందని అభిప్రాయపడ్డారు.
బౌద్ధ దర్శనానికి, ప్రాచీన భారతీయ చింతనకూ మధ్య లోతైన తాత్విక, గ్రంథపరమైన కొనసాగింపును ప్రొఫెసర్ రజనీశ్ మిశ్రా తెలిపారు. శ్రమణ, బ్రాహ్మణ సంప్రదాయాల మధ్య ఉమ్మడి మేధో వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వారణాసి వంటి విద్యా కేంద్రాలు చారిత్రక కాలం నుంచి చర్చలు, వాదోపవాదాలు, తాత్విక పరిణతికి వేదికలుగా నిలిచాయని అన్నారు.
బుద్ధుడి మొదటి బోధనలకు వారణాసి సమీపంలోని సారనాథ్ ను ఎంచుకోవటంలోని ఉద్దేశ్యాన్ని ప్రొఫెసర్ ఉజ్వల్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా బౌద్ధ ధర్మ సిద్ధాంతాల్లోని స్థూపం, చైత్యం మధ్య వ్యత్యాసాన్ని స్పష్టం చేశారు. బుద్ధుని, ఇతర గొప్ప గురువుల పవిత్ర అవశేషాలతో ఉండేది స్థూపం.. బుద్ధుని గౌరవార్థం, స్మారకార్థం నిర్మించిన పవిత్ర చిహ్నం, చైత్యమని తెలిపారు. బౌద్ధుల నైతిక, భక్తిపూర్వక జీవితంలో ఈ రెండూ కీలకమని చెప్పారు.
పిప్రహ్వా అవశేషాలను స్వదేశానికి తీసుకురావటానికి గౌరవ భారత ప్రధానమంత్రి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి చేసిన సమష్టి కృషిని ప్యానల్ కొనియాడింది. ఇది కేవలం దౌత్యపరమైన అంశం మాత్రమే కాదని, సాంస్కృతిక బాధ్యత, ప్రపంచ సంక్షేమం, శాంతి, మానవీయ విలువల పట్ల భారత్ కున్న అచంచలమైన ప్రాధాన్యతకు నిదర్శనమని పేర్కొంది.
***
(रिलीज़ आईडी: 2211535)
आगंतुक पटल : 18