రైల్వే మంత్రిత్వ శాఖ
బులెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రలోని పాల్ఘర్లో మొదటి పర్వత ప్రాంత సొరంగ నిర్మాణం పూర్తి: శ్రీ అశ్వినీ వైష్ణవ్
బులెట్ రైలు మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చులో ప్రయాణ సదుపాయాన్ని అందించనుందన్న శ్రీ అశ్వినీ వైష్ణవ్
ఎంఏహెచ్ఎస్ఆర్ ప్రాజెక్టుతో కారిడార్ వెంబడి ఆర్థిక కార్యకలాపాలకు ఊతం.. ఉపాధి అవకాశాలూ పెరుగుతాయ్
బులెట్ రైల్లో ఒక గంటా 58 నిమిషాల్లోనే ముంబయి నుంచి అహ్మదాబాద్ వెళ్లొచ్చు
प्रविष्टि तिथि:
02 JAN 2026 3:24PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని పాల్ఘర్లో రెండో సొరంగాన్ని విజయవంతంగా నిర్మించడంతో బులెట్ రైలు ప్రాజెక్టులో ఓ ముఖ్య విజయాన్ని అందుకున్నట్లు కేంద్ర రైల్వేలు, సమాచార, ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇది మహారాష్ట్రలో ఈ ప్రాజెక్టులోని పర్వత ప్రాంత సొరంగ మార్గం మొదటిది. దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవైన పర్వత ప్రాంత సొరంగం (ఎంటీ-5) నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇది పాల్ఘర్ జిల్లాలో అన్నింటి కన్నా పొడవైన సొరంగాల్లో ఒకటి. ఇది విరార్, బోయిసర్ బులెట్ రైలు స్టేషన్ల మధ్య ఉంది.
ఎంటీ-5 సొరంగాన్ని రెండు వైపుల నుంచీ తవ్వుకుంటూ వచ్చారు. అత్యాధునిక డ్రిల్, బ్లాస్ట్ పద్ధతిని ఉపయోగించి 18 నెలల్లో దీనిని పూర్తి చేశారు. ఈ పద్ధతి తవ్వకం కాలంలో నేల ప్రతిస్పందించిన తీరును వాస్తవిక సమయంలో పర్యవేక్షిస్తూ.. షాట్క్రీట్, రాక్ బోల్టులు, లాటిస్ గర్డర్లు వంటి సహాయక వ్యవస్థలను అమర్చడానికి తోడ్పడింది. సొరంగాన్ని నిర్మించేటప్పుడు, గాలి ప్రసారం, అగ్ని నివారక చర్యలు, సులభంగా బయటకు రావడానికి ఏర్పాట్లు సహా రక్షణ పరంగా అవసరమైన అన్ని జాగ్రత్తలనూ తీసుకున్నారు.


అంతకు ముందు, ఠాణేకీ బీకేసీకీ మధ్య సుమారు 5 కి.మీ. పొడవైన భూగర్భ సొరంగాన్ని నిర్మించే పనిని 2025 సెప్టెంబర్లో పూర్తి చేశారు. ముంబయి-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు (ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టు పొడవు మొత్తం 508 కిలో మీటర్లు. దీనిలో సొరంగాల మొత్తం పొడవు 27.4 కిలోమీటర్లు. మళ్లీ దీనిలో 21 కి.మీ. మేర భూగర్భ సొరంగ మార్గం కాగా, 6.4 కి.మీ. మేరకు ఉపరితల సొరంగం కలిసి ఉంది. ఈ ప్రాజెక్టులో 8 పర్వత ప్రాంత సొరంగాలు భాగంగా ఉన్నాయి. వాటిలో ఏడు సొరంగాలు మహారాష్ట్రలో ఉన్నాయి. వీటి మొత్తం పొడవు రమారమి 6.05 కిలోమీటర్లు. మరో 350 మీటర్ల పొడవైన సొరంగం గుజరాత్లో ఉంది.

బులెట్ రైలు ప్రాజెక్టుతో ఉపాధి అవకాశాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏర్పడుతున్నాయనీ, రైలు రాకపోకల కాలంలో అదనపు అవకాశాలు లభిస్తాయనీ కేంద్ర మంత్రి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత ముంబయి, అహ్మదాబాద్ల మధ్య ప్రయాణ కాలం తగ్గి కేవలం 1 గంట 58 నిమిషాలకు పరిమితం అవుతుందనీ, దీంతో ప్రధాన వాణిజ్య కేంద్రాల్లోని ఆర్థిక వ్యవస్థలు ఒకదానితో మరొకటి సంధానమవుతాయనీ ఆయన వివరించారు.
ఈ ప్రాజెక్టుతో కారిడార్లో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోవడంతో పాటు, జ్ఞాన బదిలీలో సౌలభ్యం ఏర్పడుతుంది. కొత్త పారిశ్రామిక, ఐటీ కూడళ్ల అభివృద్ధికీ తోడ్పాటు అందుతుందన్న అంచనాలూ ఉన్నాయి. దీంతో దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయనీ, సౌకర్యవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ సదుపాయాన్ని అందజేసి మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం సాధ్యపడుతుందనీ కేంద్ర మంత్రి చెప్పారు.
ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత రోడ్డు రవాణాతో పోలిస్తే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్లో 95 శాతం తగ్గుదల సాధ్యపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.
మహారాష్ట్రలో ఏడు పర్వత ప్రాంత సొరంగాల నిర్మాణం పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. 820 మీటర్ల పొడవైన ఎంటీ-1 తాలూకు భౌతిక పురోగతి 15 శాతం మేర పూర్తయింది. కాగా 228 మీటర్ల పొడవైన ఎంటీ-2 ప్రస్తుతం సన్నాహాల స్థితిలో ఉంది. 1,403 మీటర్ల పొడవైన ఎంటీ-3 పనులు 35.5 శాతం, 1,260 మీటర్ల పొడవైన ఎంటీ-4 పనులు 31 శాతం వరకూ పూర్తి అయ్యాయి. 1,480 మీటర్ల (సుమారు 1.5 కి.మీ.) పొడవైన అన్నింటి కన్నా సుదీర్ఘంగా ఉన్న ఎంటీ-5 పనులు 55 శాతం మేర పూర్తి కావచ్చాయి. మరి 2026 జనవరి 2న ఇది తుది రూపును సంతరించుకుంది. 454 మీటర్ల పొడవైన ఎంటీ-6 పనులు 35 శాతం, 417 మీటర్ల పొడవైన ఎంటీ-7 పనులు 28 శాతం పూర్తి అయ్యాయి. దీంతో మహారాష్ట్రలో పర్వత ప్రాంత సొరంగాల మొత్తం పొడవు దాదాపుగా 6 కి.మీ.కి చేరింది.
ఎంఏహెచ్ఎస్ఆర్ సుమారు 508 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. దీనిలో 352 కి.మీ. గుజరాత్, దాద్రా, నగర్ హవేలీలోనూ, 156 కి.మీ. మహారాష్ట్రలోనూ ఉంటుంది. ఈ కారిడార్ సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదరా, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపీ, బోయిసర్, విరార్, ఠాణేలతో పాటు ముంబయి వంటి ముఖ్య నగరాలను కలుపుతుంది. దీంతో భారత్లో రవాణా సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనలో ఒక పెద్ద మార్పు చోటుచేసుకోనుంది.
***
(रिलीज़ आईडी: 2211472)
आगंतुक पटल : 5