గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘వికసిత్ భారత్: జీ రామ్ జీ’ యోజన ‘ఎంజీఎన్ఆర్ఈజీఏ’ కంటే మెరుగైనది: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
‘‘కార్మిక సోదరులారా.. ఇకపై 100 రోజులకు బదులుగా 125 పని దినాలకు చట్టబద్దమైన హామీ లభిస్తుంది’’: శ్రీ శివరాజ్
సింగ్ చౌహాన్
ఎంజీఎన్ఆర్ఈజీఏ పేరుతో మరోసారి దేశాన్ని తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోంది: శ్రీ చౌహాన్
प्रविष्टि तिथि:
21 DEC 2025 8:26PM by PIB Hyderabad
‘వికసిిత్ భారత్: జీ రామ్ జీ’ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ‘వికసిత్ భారత్: జీ రామ్ జీ చట్టం’ గురించి వివరించడంతో పాటు.. దానిపై ప్రచారమవుతున్న అపోహలను నివృత్తి చేస్తూ.. కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ ప్రకటన జారీ చేశారు.
ఎంజీఎన్ఆర్ఈజీఏ పేరుతో మరోసారి దేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని కేంద్ర మంత్రి అన్నారు. ‘‘ఎంజీఎన్ఆర్ఈజీఏ కంటే వికసిత్ భారత్: జీ రామ్ జీ యోజన మెరుగ్గా ఉన్నప్పటికీ దాని గురించి వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి’’ అని తెలిపారు.
కొత్త చట్టంలో 100 రోజులకు బదులుగా 125 పని దినాలకు చట్టబద్ధమైన హామీ ఉంటుందని శ్రీ చౌహాన్ అన్నారు. పని కల్పించలేని పక్షంలో నిరుద్యోగ భృతికి సంబంధించిన నిబంధనను కూడా మరింత బలోపేతం చేశారు. కూలీ చెల్లింపుల్లో జాప్యం జరిగితే అదనంగా పరిహారం చెల్లించే నిబంధన ఇప్పుడుంది.
ప్రస్తుత సంవత్సరానికి ఈ పథకానికి రూ.1,51,282 కోట్లకు పైగా భారీ మొత్తాన్ని కేటాయించాలని ప్రతిపాదించామని, ఇది ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఇది తగినంత ఉపాధిని కల్పించేందుకు, సమగ్ర గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించేందుకు భరోసా ఇస్తుంది. ఉపాధి అవకాశాలు సమృద్ధిగా లభించేలా.. అభివృద్ధి చెందిన, స్వావలంబన సాధించిన, పేదరిక రహిత గ్రామాలను నిర్మించడమే దీని లక్ష్యం.
నీటి పరిరక్షణ, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి కార్యకలాపాలు, విపత్తు ఉపశమనం, తదితర పనులకు ‘‘అభివృద్ధి చెందిన గ్రామాల ద్వారా అభివృద్ధి చెందిన భారత్’ లక్ష్యానికి అనుగుణంగా ప్రాధాన్యం లభిస్తుంది. ఈ పనులు దీర్ఘకాల ఆదాయ వనరులను ఏర్పాటు చేస్తాయి. అదే సమయంలో గ్రామీణ స్థిరత్వాన్ని, ఉత్పాదకతను బలోపేతం చేస్తాయి.
‘‘125 రోజుల ఉపాధికి హామీ ఇవ్వడంతో పాటుగా.. వ్యవసాయ పనుల సమయంలో చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందులు ఎదురవకుండా ప్రత్యేక నిబంధనలు పొందుపరిచాం. ఈ చట్టం పేదలకు అనుకూలంగా, ప్రగతికి తోడ్పాటు అందించేలా, శ్రామికులకు పూర్తి ఉపాధి హామీని అందించేదిగా నిలుస్తుంది. ఇది అభివృద్ధి చెందిన భారత్కు పునాది అభివృద్ధి చెందిన గ్రామాలే అనే ప్రతిజ్ఞను ముందుకు తీసుకెళుతుంది’’ అని శ్రీ చౌహాన్ అన్నారు.
అదనపు చర్యలను వివరిస్తూ.. పరిపాలనా వ్యయ పరిమితిని 6 నుంచి 9 శాతానికి పెంచే ముఖ్యమైన నిబంధన ఈ చట్టంలో ఉందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రతిపాదిత కేటాయింపులైన రూ.1,51,282 కోట్లలో 9 శాతం అంటే దాదాపు రూ.13,000 కోట్లు ఉంటుంది. పంచాయతీ సెక్రటరీలు, ఉపాధి సహాయకులు, సాంకేతిక సిబ్బందితో సహా ఈ పథకాన్ని అమలు చేసేవారికి సకాలంలో, తగినంత వేతనం అందేలా చూడటమే పెరిగిన పరిపాలన వ్యయం ప్రధానోద్దేశం. ఆర్థిక తోడ్పాటుకు లభించిన హామీతో.. ఈ క్షేత్ర స్థాయి బృందాలు ప్రాజెక్టులను సమర్థంగా నిర్వహించేందుకు, అట్టడుగు స్థాయిలో అత్యున్నత నాణ్యత కలిగిన పనిని అందించేందుకు సన్నద్ధమవుతారు.
సమగ్రాభివృద్ధి, గ్రామీణ పునరుజ్జీవనం, కార్మికులకు సాధికారత అందించడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ‘వికసిత్ భారత్: జీ రామ్ జీ’ చట్టం ప్రతిబింబిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఉపాధి హామీ, చట్టబద్ధమైన వేతనాలు, సామాజిక వనరులతో ప్రతి గ్రామాన్ని ఉత్పాదకతకు, గౌరవానికి, సుస్థిరాభివృద్ధికి కేంద్రంగా మార్చడమే దీని లక్ష్యం.
‘‘పేదల హక్కులు, దేశ సంక్షేమ కోసం ఈ చట్టం రూపొందింది’’ అని శ్రీ చౌహాన్ స్పష్టం చేశారు. ‘‘మన కార్మికులకు ఉపాధి హామీని ఇచ్చి, సాధికారత, అభివృద్ధి చెందిన గ్రామాలతో అభివృద్ధి చెందిన భారత్కు పునాది వేస్తుంది’’ అని వివరించారు.
ఈ చట్టం గురించి అందరికీ అవగాహన కల్పించేలా వాస్తవాలను ప్రచారం చేయాలని పౌరులు, భాగస్వాములు సహకరించాలని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. ‘‘అసత్య సమాచారానికి ఎవరూ బాధితులు కాకుండా.. సరైన సమాచారం ప్రతి ఇంటికి చేరువయ్యేలా కృషి చేద్దాం. ఎంజీఎన్ఆర్ఈజీఏ పరిధిలో నిర్దేశించిన లక్ష్యానికి బలమైన కొనసాగింపుగా ‘వికసిత్ భారత్: జీ రామ్ జీ’ పనిచేస్తుంది. ప్రత్నామ్నాయంగా కాదు. అభివృద్ధి చెందిన భారత్ కలను సాకారం చేయాలనే దార్శనికత ఇప్పుడు మరింత విస్తృతమైంది’’ అని తన ప్రసంగాన్ని ముగించారు.
***
(रिलीज़ आईडी: 2207374)
आगंतुक पटल : 4