వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్ ఇంధన రంగం రూపురేఖలను మార్చిన దార్శనికత, పట్టుదల: వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
శుద్ధి చేసే సామర్థ్యం, గ్యాస్ పైప్లైన్ వ్యవస్థతో పాటు పరమాణు రంగంలోనూ కీలక పరిణామాలు: శ్రీ పీయూష్ గోయల్
అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, తక్కువ ఖర్చు, లభ్యత స్థాయులు, ఆర్థికంగా లాభదాయకత, దీర్ఘకాలిక మనుగడలే ఊతంగా ఇంధన రంగంలో చోటుచేసుకున్న మార్పులు
प्रविष्टि तिथि:
15 DEC 2025 2:27PM by PIB Hyderabad
సాహసోపేత దార్శనికత, పట్టు విడవని కార్యాచరణ దేశ భవితను మార్చగలవనడానికి గత 11 సంవత్సరాలుగా భారత ఇంధన రంగం పయనిస్తున్న తీరే నిదర్శనంగా నిలుస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఆయన ఈ రోజు న్యూఢిల్లీలో ఒక సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్బంగా దేశ ప్రజలు భారతదేశ ఉక్కు మనిషినే కాకుండా, రాజకీయంగానూ, ఆర్థికంగానూ, వ్యూహాత్మకంగానూ మన దేశం సొంత కాళ్ల మీద నిలబడాలని కోరుకున్న ఒక దార్శనికుడిని కూడా స్మరించుకొంటున్నారని శ్రీ గోయల్ అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఇంధన రంగంలో కూడా ఇదే విధమైన స్వావలంబన స్ఫూర్తిని సాధించిందని మంత్రి తెలిపారు. దేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇదివరకు ఎన్నడూ లేనంతగా 1,048 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారనీ, బొగ్గు దిగుమతులు దాదాపుగా 8 శాతం మేరకు తగ్గాయనీ ఆయన చెప్పారు. భారత సౌర విద్యుత్తు ఉత్పాదన సామర్థ్యం గత 11 సంవత్సరాల్లో 46 రెట్లు పెరిగిందనీ, ఇది దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతి పెద్ద సౌర ఇంధన ఉత్పత్తిదారుగా నిలిపిందన్నారు. పవన విద్యుత్తు సామర్థ్యం 2014లో 21 గిగావాట్లుగా ఉండగా, 2025లో 53 గిగావాట్లకు చేరుకొందన్నారు. ప్రపంచంలో నాలుగో అతి పెద్ద చమురు శుద్ధి కూడలిగా భారత్ ఎదిగిందనీ, తన రిఫైనింగ్ కెపాసిటీని 20 శాతం మేరకు పెంచుకొనే దిశగా కృషిని కొనసాగిస్తోందనీ మంత్రి వెల్లడించారు. ఇంతవరకు 34,238 కిలోమీటర్ల సహజవాయు గొట్టపుమార్గాన్ని అధికారికంగా గుర్తిస్తే అందులో ప్రస్తుతం 25,923 కి.మీ. మార్గం గుండా సహజవాయువును సరఫరా చేస్తున్నారన్నారు. పరమాణు ఇంధన రంగంలో పాలుపంచుకొనేందుకు ప్రయివేటు పాత్రధారులకు అనుమతినివ్వాలనేదే శాంతి బిల్లు సంకల్పమని కూడా ఆయన వివరించారు.
విద్యుత్తు ఉత్పాదనలో మిగులును సాధించడంతో పాటు గ్రిడ్ ఏకీకరణ దిశగానూ, పునరుత్పాదక ఇంధన రంగంలో నాయకత్వాన్ని అందించే దిశగానూ దేశం పయనిస్తోందని శ్రీ గోయల్ అన్నారు. ఈ మార్పు అకస్మాత్తుగా చోటుచేసుకొన్నదేమీ కాదనీ, స్పష్టమైన దార్శనికత, నిరంతర కృషి వల్ల లభించిందనీ ఆయన తెలిపారు. విద్యుత్తు కొరత స్థితి నుంచి విద్యుత్తు విషయంలో భద్రమైన స్థితికి భారత్ చేరుకొందనీ, విద్యుత్తు ఉత్పాదన స్థాయిని దీర్ఘకాలం పాటు నిలకడగా ఉంచుకొనే దిశగా పయనిస్తోందనీ మంత్రి వివరించారు.
ఈ మార్పు అయిదు ముఖ్య స్తంభాలపై ఆధారపడిందని మంత్రి అన్నారు. సర్వజనులకూ అందుబాటులోకి అనేది భారత ఇంధన రంగ పరివర్తనలో ఒకటో కీలకాంశమని శ్రీ గోయల్ తెలిపారు. సౌభాగ్య పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికీ కరెంటును సమకూర్చారనీ, ఉజాలా కార్యక్రమం కింద 47.4 కోట్ల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశారనీ, దీంతో కరెంటు బిల్లులు ఆదా అవడంతో పాటు వాతావరణంలోకి బొగ్గుపులుసు వాయువు విడుదల స్థాయిలు కూడా తగ్గాయన్నారు. పిల్లలు ఇక చీకటి పడ్డ తరువాతా చదువుకోగలుగుతున్నారనీ, కరెంటుతో ఒక్క ఇళ్లే కాకుండా ప్రజల్లో ఆశలు కూడా వెలుగులీనుతున్నాయన్నారు. 10 కోట్ల కుటుంబాలకు స్వచ్ఛ వంట గ్యాస్ కనెక్షన్లను అందించారనీ, మహిళలు ఆరోగ్యంగా జీవిస్తున్నారనీ, పీఎం-కుసుమ్ పథకంలో భాగంగా రైతులు ఇంధన సరఫరాదారులుగా మారారనీ మంత్రి వెల్లడించారు.
తక్కువ ఖర్చును రెండో ముఖ్యాంశంగా ఆయన వర్ణించారు. సౌర, పవన విద్యుత్తు, ఇతర స్వచ్ఛ ఇంధన సామగ్రిపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారని తెలిపారు. 20 శాతం మేరకు ఇథెనాల్ను కలిపే లక్ష్యాన్ని 2030 కల్లా సాధించాలని మొదట అనుకున్నప్పటికీ, అంత కన్నా ముందుగానే ఈ లక్ష్యాన్ని సాధించినట్లు ఆయన తెలిపారు. సౌర, పవన విద్యుత్తు అమ్మకాలపై అంతర్ రాష్ట్ర సరఫరా చార్జీల్ని రద్దు చేసిన సంగతిని కూడా ఆయన ఈ సందర్బంగా వెల్లడించారు.
మూడో ముఖ్యాంశం లభ్యత అని శ్రీ గోయల్ అన్నారు. విద్యుత్తు కోతలు 2013లో 4.2 శాతంగా ఉంటే, 2025లో 0.1 శాతానికి పరిమితమయ్యాయని తెలిపారు. ఏకీకృత జాతీయ గ్రిడ్ను ఏర్పాటు చేయడంతో, 250 గిగావాట్ల అత్యధిక స్థాయి విద్యుత్తు అవసరాల్ని భారత్ తీర్చగలిగిందని ఆయన చెప్పారు.
ఆర్థికంగా లాభసాటిగా ఉండడమనేది నాలుగో ముఖ్యాంశమని మంత్రి వివరించారు. పీఎం-ఉదయ్ పథకంలో భాగంగా చేపట్టిన సంస్కరణలు విద్యుత్తు పంపిణీ రంగాన్ని బలపరిచాయనీ, డిస్కమ్ బకాయిలు 2022లో రూ.1.4 లక్షల కోట్ల నుంచి 2025లో రూ.6,500 కోట్లకు తగ్గాయనీ ఆయన వెల్లడించారు.
దీర్ఘకాలిక మనుగడ, ప్రపంచ బాధ్యతలు.. ఇవి అయిదో ముఖ్యాంశమని శ్రీ గోయల్ అన్నారు. ప్యారిస్ ఒప్పంద లక్ష్యాలను నెరవేర్చిన ఒకటో జీ20 దేశంగా భారత్ నిలిచిందని ఆయన తెలిపారు. దేశంలో ఇప్పటివరకూ నెలకొల్పిన విద్యుత్తు ఉత్పాదన సామర్థ్యంలో 50 శాతం ప్రస్తుతం శిలాజేతర ఇంధన వనరుల నుంచే అందుతోందని ఆయన వివరించారు.
భారత్ 2047కల్లా స్వాతంత్య్ర శత వార్షికోత్సవాలను జరుపుకోనుందని మంత్రి గుర్తు చేస్తూ, రాబోయే కాలపు సవాళ్లను పరిష్కరించడానికి వ్యూహంలో అవసరమైన మార్పుచేర్పుల్ని చేస్తున్నారన్నారు. 2030 కల్లా ఒక్కో సంవత్సరం 5 ఎంఎంటీ ఉత్పాదనే జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ధ్యేయం, రూ.1 లక్ష కోట్ల శిలాజ ఇంధన దిగుమతులను తగ్గించడం దీని లక్ష్యమని ఆయన తెలిపారు. దాదాపు 20 లక్షల కుటుంబాలకు ఇంటి పైకప్పు మీద సూర్యరశ్మి ఆధారిత విద్యుత్తు ఉత్పాదనా సామగ్రిని అమర్చేందుకు పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతిని కూడా ఆయన ప్రస్తావించారు. భారత ఇంధన రంగాన్ని పటిష్ఠపరచడానికి ప్రభుత్వం ప్రజలకు సాధికారతను కల్పిస్తుందన్న ప్రధానమంత్రి మాటలను మంత్రి ఈ సందర్భంగా ఉదాహరించారు. బొగ్గు రంగంపై ఏర్పాటు చేసిన ఉన్నతాధికార సంఘం సూచించిన అనేక సిఫారసులు పరిశీలన దశలో ఉన్నాయన్నారు. ఆ సిఫారసులలో బొగ్గు అన్వేషణనూ, తవ్వకాలనూ వేగవంతం చేయడంతో పాటు బొగ్గును గ్యాసుగా మార్చే ప్రక్రియలో వేగం పెంచడం సహా అనేక అంశాలున్నాయని ఆయన అన్నారు.
‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని 2047 కల్లా సాధించే దిశగా ఇండియా అడుగులు వేస్తున్న క్రమంలో, విస్తృతీ, వేగమూ, దీర్ఘకాలిక మనుగడా.. ఈ మూడింటి నిర్వహణలో మన దేశ ఇంధన రంగం ప్రపంచానికే ఒక అధ్యయనాంశంగా మారగలదన్న విశ్వాసాన్ని శ్రీ గోయల్ వ్యక్తం చేశారు.
***
(रिलीज़ आईडी: 2204217)
आगंतुक पटल : 18