ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీ లోని తన ఇంట్లో ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్రధానమంత్రి ప్రసంగం ఆంగ్ల అనువాదం
प्रविष्टि तिथि:
25 JAN 2023 6:15PM by PIB Hyderabad
కేంద్ర మంత్రివర్గానికి చెందిన నా సీనియర్ సహోద్యోగులు, దేశ రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, ఎన్సీసీ డైరెక్టర్ జనరల్, ఉపాధ్యాయులు, అతిథులు, నా మంత్రిమండలి సహచరులు, ఇతర ప్రముఖులు, గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొంటున్న వివిధ కళాకారులు, నా యువ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సహచరులారా!
చాలా మంది పిల్లలు నేతాజీలా దుస్తులు ధరించి, మొదటిసారిగా ప్రధాన మంత్రి నివాసానికి రావడాన్ని నేను గమనించాను. మొదటిగా, నేను మీ అందరికీ వందనం చేస్తున్నాను. జై హింద్ మంత్రం ప్రతిసారీ మనకు ప్రేరణ ఇస్తుంది.
మిత్రులారా,
గత కొన్ని వారాలుగా, నేను యువ సహోద్యోగులను పదేపదే కలుసుకునే అవకాశం పొందాను. ఒక నెల క్రితం, ‘వీర్ బాల్ దివస్’ ను జరుపుకున్నాం. వీర్ సాహిబ్ జాదీస్ (సిక్కు గురు గోవింద్ సింగ్ కుమారులు) శౌర్యం త్యాగానికి వందనం చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ తర్వాత కర్ణాటకలో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్ లో పాల్గొన్నాను. రెండు రోజుల తర్వాత, నేను దేశంలోని యువ అగ్నివీరులను కలిశాను. ఆ తర్వాత నేను యూపీలో జరిగిన ఖేల్ మహాకుంభ్ లో యువ ఆటగాళ్లను కలిశాను. ఈ రోజు పార్లమెంటులో, తరువాత ప్రధాన మంత్రి నివాసంలో.. దేశం నలుమూలల నుండి ‘నో యువర్ లీడర్ కార్యక్రమం’లో పాల్గొన్న విద్యార్థులను కలిసే అవకాశం నాకు లభించింది. నిన్ననే, నేషనల్ చైల్డ్ అవార్డును గెలుచుకున్న పిల్లలను నేను కలిశాను. ఈ రోజు నేను మీ అందరినీ ఈ ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుంటున్నాను. కొన్ని రోజులు తర్వాత, నేను 'పరీక్షా పే చర్చా' ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత, విద్యార్థులతో మాట్లాడబోతున్నాను. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా నేను ఎన్సీసీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పొందుతున్నాను.
మిత్రులారా,
యువతతో నా సంభాషణలు నాకు రెండు కారణాల వల్ల చాలా ప్రత్యేకమైనవి. ఒకటి, యువతలో శక్తి, తాజాదనం, ఉత్సాహం, అభిరుచి, కొత్తదనం ఉంటాయి. ఈ సానుకూలత నాకు ప్రేరణ ఇచ్చి, రాత్రింబవళ్లు కష్టపడటానికి నన్ను ప్రోత్సహిస్తుంది. రెండవది, స్వాతంత్ర్యానికి చెందిన ఈ అమృత్ కాల్ లో మీరు అందరూ దేశం యొక్క ఆకాంక్షలు, కలలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు అభివృద్ధి చెందిన భారతదేశం ప్రయోజనాన్ని పొందనున్నారు. అందుక పునాదిగా నిలవాల్సిన బాధ్యత కూడా మీ భుజాలపై ఉంది. వివిధ కార్యక్రమాలలో యువత భాగస్వామ్యం పెరగడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ‘పరాక్రమ్ దివస్’ సందర్భంగా ఒక ముఖ్యమైన సందేశంతో జరిగే పోటీల్లో మీలాంటి పిల్లలు పాల్గొనడం ఒక మంచి ఉదాహరణ. అమృత్ మహోత్సవ్ కు సంబంధించిన ఇలాంటి అనేక కార్యక్రమాలు, పోటీలు దేశంలో తరచూ జరుగుతున్నాయి. కోట్లాది మంది యువకులు ఇందులో పాల్గొంటున్నారు. ఇది చిన్న వయస్సులోనే దేశం కోసం పెద్ద కలలు కనడానికి, అంకితభావానికి ప్రతీక. భారతదేశంలోని యువత దేశ బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉందని, తమ బాధ్యతలను నెరవేర్చడంలో కట్టుబడి ఉన్నారని ఇది నిరూపిస్తుంది. కవిత్వం, డ్రాయింగ్, డ్రెస్సింగ్, వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన యువకులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో మన ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు మరియు వివిధ కళాకారులు గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనబోతున్నారు. మీ అందరికీ నా శుభాకాంక్షలు.
మిత్రులారా,
ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్... యువతను జాతీయ లక్ష్యాలు, జాతీయ ప్రయోజనాలతో అనుసంధానం సంస్థలు. కరోనా కాలంలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేశ సామర్థ్యాన్ని ఎలా నిరూపించారో మన దేశం మొత్తం చూసింది. అందువల్ల, ఈ సంస్థలను ప్రోత్సహించడానికి, విస్తరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నిస్తోంది. ఉదాహరణకు, మన సరిహద్దు, సముద్ర తీర జిల్లాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వాటిని ఎదుర్కోడానికి మీలాంటి యువతను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దేశంలో అలాంటి డజన్ల కొద్దీ జిల్లాల్లో ఎన్సీసీ ప్రత్యేక కార్యక్రమం జరుగుతోంది, సైన్యం, నావికాదళం, వైమానిక దళం ద్వారా ప్రత్యేక శిక్షణ అందుతోంది. ఫలితంగా, యువ సహచరులు భవిష్యత్తుకు సిద్ధంగా ఉంటారు. అవసరమైతే తక్షణం స్పందించే పాత్రను కూడా పోషించగలరు. ఇప్పుడు మేము ‘వైబ్రెంట్ బోర్డర్ ఏరియా’ కార్యక్రమాన్ని కూడా నడుపుతున్నాం. ఈ కార్యక్రమం కింద సరిహద్దు గ్రామాలను అన్ని రకాల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని యువత శక్తి సామర్థ్యాలను పెంచడం, కుటుంబాలు తమ గ్రామాల్లో ఉండటానికి ఇష్టపడేలా చేయడం, అలాగే విద్య, ఉపాధికి మెరుగైన అవకాశాలను కలిగించడం ప్రధాన ఉద్దేశం.
మిత్రులారా,
ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాల మధ్య, మీ జీవితంలో ఒక విషయం ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు జీవితంలో ఏదైనా విజయం సాధించినప్పుడు, దాని వెనుక మీతో పాటు మీ తల్లిదండ్రులు, కుటుంబం పాత్ర కూడా ఉంటుంది. మీ ఉపాధ్యాయులు, పాఠశాల, మీ స్నేహితులు కూడా అందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అలా మీరు అందరి మద్దతును పొందుతారు, అదే మీ పురోగతికి కారణం. ప్రతి ఒక్కరూ మీ సామర్థ్యం, నిర్ణయాలను విశ్వసించి ఉంటారు. ప్రతి ఒక్కరూ మీ ప్రయత్నంలో చేరి ఉంటారు. ఇప్పుడు మీరు గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనబోతున్నందున, ఇది మీ కుటుంబం, పాఠశాల, కళాశాల మరియు స్థానికుల గౌరవాన్ని కూడా పెంచింది. అంటే, మీ విజయాలు కేవలం మీ ప్రయత్నాల వల్లే రావు. మన విజయాలు ఎప్పుడూ మనవి మాత్రమే కావు. మీరు మీ జీవితంలో సమాజం మరియు దేశం పట్ల అదే వైఖరిని కొనసాగించాలి. మీకు ఆసక్తి ఉన్న ఏ రంగంలోనైనా మీరు ముందుకు సాగాలి. కానీ, మీ లక్ష్యాన్ని సాధించడంలో మీరు చాలా మందిని మీతో తీసుకెళ్లాలి. మీరు బృంద స్ఫూర్తితో కలిసి పనిచేయాలి. అందువల్ల, మీరు మీ లక్ష్యాలను దేశం యొక్క లక్ష్యాలతో సరిపోల్చినప్పుడు, మీ విజయానికి అవకాశం మరింత విస్తరిస్తుంది. మీ విజయాన్ని భారతదేశం విజయంగా ప్రపంచం చూస్తుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, హోమీ జహంగీర్ భాభా, డాక్టర్ సి. వి. రామన్ లాంటి శాస్త్రవేత్తలు కావచ్చు, లేదా మేజర్ ధ్యాన్ చంద్, ప్రస్తుత క్రీడాకారులు కావచ్చు... వాళ్లు సాధించిన విజయాలను ప్రపంచం మొత్తం భారతదేశం విజయంగా భావిస్తారు. అంతేకాకుండా, భారతదేశానికి చెందిన ఈ విజయాలలో ప్రపంచం తన కొత్త భవిష్యత్తు చూస్తుంది. అంటే, చారిత్రక విజయాలు మొత్తం మానవాళి అభివృద్ధికి మెట్లుగా మారతాయి. ‘సబ్కా ప్రయాస్’ (ప్రతి ఒక్కరి కృషి) స్ఫూర్తి యొక్క నిజమైన శక్తి ఇదే.
మిత్రులారా,
ఈ రోజు మీరు ఉన్న కాలానికి ఇంకో ప్రత్యేక విషయం ఉంది. నేడు, దేశంలో యువతకు లభించే కొత్త అవకాశాలు అసాధారణంగా ఉన్నాయి. నేడు దేశం స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి ప్రచారాలను నిర్వహిస్తోంది. అంతరిక్ష రంగం నుంచి పర్యావరణం, వాతావరణం మరియు వాటితో సంబంధం ఉన్న సవాళ్ల వరకు, భారతదేశం నేడు మొత్తం ప్రపంచం భవిష్యత్తు కోసం కృషి చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ వంటి భవిష్యత్ రంగాల్లో మన దేశం ముందంజలో ఉంది. క్రీడలు మరియు సృజనాత్మకత కోసం దేశం మెరుగైన పర్యావరణాన్ని కూడా సృష్టించింది. మీరు అందులో భాగం కావాలి. మీరు కనిపించని అవకాశాలను వెతకాలి, కొత్త ప్రాంతాలను అన్వేషించాలి మరియు ఊహించని పరిష్కారాలను కనుగొనాలి.
మిత్రులారా,
భవిష్యత్తు కోసం పెద్ద లక్ష్యాలు మరియు తీర్మానాలు మనకు చాలా ముఖ్యమైనవి. కానీ అదే సమయంలో, చిన్న ప్రాధాన్యతలకు కూడా మనం సమాన ప్రాముఖ్యత ఇవ్వాలి. అందువల్ల, దేశంలో జరుగుతున్న ప్రతి మార్పు గురించి మీరంతా తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. దేశంలో జరుగుతున్న కొత్త ప్రచారాలలో మీరు తప్పకుండా పాల్గొనాలి. స్వచ్ఛ భారత్ అభియాన్ ఉదాహరణ మన ముందుంది. యువత దీనిని తమ జీవితంలో లక్ష్యం చేసుకోవాలి. మీలో సృజనాత్మకతతో పాటు ఉత్సాహం కూడా ఉంది. మీ మిత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి, మీ ప్రాంతం, గ్రామం, నగరం, పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చడానికి నిరంతరం కృషి చేస్తామని మీరు ప్రతిజ్ఞ చేయవచ్చు. మీరు పరిశుభ్రత మిషన్ కోసం బయటకు వెళ్లినప్పుడు, ఇది వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అదేవిధంగా, అమృత్ మహోత్సవ్ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల గురించి కనీసం ఒక పుస్తకం చదవాలని మీరు తీర్మానం చేసుకోవాలి. మీలో చాలా మంది కవితలు, కథలు రాస్తారు. అలాగే వ్లాగింగ్ పట్ల కూడా ఆసక్తి చూపిస్తారు. స్వాతంత్య్ర సంగ్రామం, స్వాతంత్ర్య సమరయోధుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఒక సృజనాత్మక కార్యక్రమాన్ని చేపట్టండి. ఈ అంశంపై కార్యక్రమాలు, పోటీలను నిర్వహించడానికి మీరు మీ పాఠశాలను కూడా అడగవచ్చు. మీ ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్లను కూడా నిర్మిస్తున్నాం. మీ మిత్రులను నిమగ్నం చేస్తూ, మీరు మీ సమీపంలోని అమృత్ సరోవర్ కు చాలా దోహదం చేయవచ్చు. ఉదాహరణకు, మీరు అమృత్ సరోవర్ చుట్టూ చెట్లు నాటవచ్చు. దాని నిర్వహణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీని నిర్వహించవచ్చు. మీరు దేశంలో జరుగుతున్న ఫిట్ ఇండియా ఉద్యమం గురించి కూడా వినే ఉంటారు. ఇది యువతకు చాలా ఆకర్షణీయమైన ప్రచారం. మీరు ఇందులో చేరడమే కాకుండా, మీ కుటుంబ సభ్యులను కూడా చేరమని అడగండి. మీరు ప్రతిరోజూ ఉదయం మీ కుటుంబంతో కలిసి యోగా చేసే ఈ అభ్యాసాన్ని ప్రారంభించవచ్చు. ఈ సంవత్సరం జి-20 కి భారతదేశం కూడా అధ్యక్షత వహిస్తున్నదని మీరు వినే ఉంటారు. ఇది భారతదేశానికి చాలా ముఖ్యమైన అవకాశం. మీరు దాని గురించి కూడా చదవాలి. మీ పాఠశాల, కళాశాలలో కూడా చర్చించాలి.
మిత్రులారా,
ప్రస్తుతం, దేశం ‘మన వారసత్వంపై గర్వం’, ‘బానిస మనస్తత్వం నుండి స్వేచ్ఛ’ అనే తీర్మానంతో ముందుకు సాగుతోంది. ఈ తీర్మానాల పట్ల దేశంలోని యువతకు కూడా బాధ్యత ఉంది. భవిష్యత్తు కోసం మన వారసత్వాన్ని కాపాడడం, అభివృద్ధి చేయడం మీ బాధ్యత. మీరు దేశ వారసత్వాన్ని తెలుసుకుని, అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ పని చేయగలుగుతారు. మీరు పర్యటనకు వెళ్ళేటప్పుడు, వారసత్వ ప్రదేశాలను తప్పక సందర్శించాలని నేను సూచిస్తున్నాను. మీరు యువకులు కాబట్టి, భవిష్యత్తు కోసం ఒక దార్శనికతను నిర్మించడానికి ఇది సరైన సమయం. మీ ఆలోచనలు, ప్రమాణాలకు మీరే సృష్టికర్త. మీరు నవభారతానికి మార్గం సుగమం చేసే వ్యక్తులు. మీరు దేశం యొక్క అంచనాలను మరియు ఆకాంక్షలను కొనసాగిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీ అందరికీ మరోసారి చాలా శుభాకాంక్షలు!
ధన్యవాదాలు!
గమనిక : ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి స్వేచ్చా అనువాదం. అసలు ప్రసంగం హిందీలో జరిగింది.
***
(रिलीज़ आईडी: 2202673)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam