రైల్వే మంత్రిత్వ శాఖ
37 రైళ్లలో 116 అదనపు కోచ్లు... విమానాల రద్దు వల్ల ప్రయాణ అంతరాయాలను తగ్గించేలా భారతీయ రైల్వే నిర్ణయం
प्रविष्टि तिथि:
05 DEC 2025 9:09PM by PIB Hyderabad
విస్తృతంగా విమానాల రద్దుతో ప్రయాణికుల రద్దీ పెరిగిన దృష్ట్యా.. సజావుగా ప్రయాణ సేవలతోపాటు ప్రయాణికులకు తగిన వసతులను అందుబాటులోకి తెచ్చేలా భారతీయ రైల్వే విస్తృత చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా మొత్తం 37 రైళ్లకు 116 అదనపు కోచ్లను జోడించి.. 114కు పైగా అదనపు సర్వీసుల్ని నడుపుతుతోంది.
దక్షిణ రైల్వే అత్యధిక సంఖ్యలో కోచ్లను విస్తరించింది. 18 రైళ్ల సామర్థ్యాన్ని పెంచింది. డిమాండ్ అధికంగా ఉన్న మార్గాల్లో అదనపు చైర్ కార్, స్లీపర్ క్లాస్ కోచ్లను జోడించింది. 2025 డిసెంబరు 6 నుంచి అమలయ్యే ఈ అదనపు సదుపాయాలు దక్షిణ ప్రాంతంలో వసతి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి.
ఉత్తర రైల్వే 8 రైళ్లలో 3 ఏసీ, చైర్ కార్ కోచ్లను జోడించి తర్వాతి స్థానంలో ఉంది. ఈ రోజు నుంచే అమలయ్యే ఈ చర్యలు.. ప్రయాణికులు ఎక్కువగా ఉండే ఉత్తర కారిడార్లలో ప్రయాణ సదుపాయాల లభ్యతను మెరుగుపరుస్తాయి.
పశ్చిమ రైల్వే ఎక్కువగా డిమాండ్ ఉన్న 4 రైళ్లలో 3 ఏసీ, 2 ఏసీ కోచ్లను అదనంగా జోడించింది. 2025 డిసెంబరు 6 నుంచి ఈ సేవలు అమలవుతాయి. పశ్చిమ ప్రాంతాల నుంచి దేశ రాజధానికి భారీ సంఖ్యలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు అనువుగా ఉంటుంది.
తూర్పు మధ్య రైల్వే 2025 డిసెంబర్ 6-10 మధ్య అయిదు ట్రిప్పులలో అదనంగా 2 ఏసీ కోచ్లను జోడించి రాజేంద్రనగర్ - న్యూఢిల్లీ (12309) మధ్య రవాణా సేవలను మెరుగుపరిచింది. ఈ ముఖ్యమైన బీహార్ - ఢిల్లీ సెక్టార్లో సమర్థమైన సేవలందించేలా ఈ చర్యలు తీసుకుంది.
ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ - న్యూఢిల్లీ సర్వీసులకు (రైళ్లు 20817/20811/20823) అయిదు ట్రిప్పులలో 2 ఏసీ కోచ్లను జోడించడం ద్వారా సేవలను విస్తరించింది. ఇది ఒడిశా, దేశ రాజధానుల మధ్య రవాణా సదుపాయాలను ఇది మెరుగుపరిచింది.
తూర్పు రైల్వే మూడు కీలక రైళ్లలో సేవల విస్తరణలను అమలు చేసింది. 2025 డిసెంబర్ 7-8 తేదీల్లో ఆరు ట్రిప్పులకు స్లీపర్ క్లాస్ కోచ్లను జోడించడం ద్వారా.. తూర్పు ప్రాంతంలో పెరిగిన ప్రాంతీయ, అంతర్రాష్ట్ర ప్రయాణ డిమాండును తీర్చేలా ఈ చర్యలు తీసుకుంది.
నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే 2025 డిసెంబర్ 6 –13 వరకుఎనిమిది ట్రిప్పులకు 3 ఏసీ, స్లీపర్ కోచ్లతో రెండు ముఖ్యమైన రైళ్లలో సేవలను విస్తరించింది. తద్వారా ఈశాన్య ప్రాంతంలోని ప్రయాణికులకు అంతరాయం లేకుండా సమర్థమైన సేవలందేలా చూస్తోంది.
వీటితోపాటు ప్రయాణికులకు మరిన్ని సేవలందించడం కోసం నాలుగు ప్రత్యేక రైలు సేవలను కూడా భారతీయ రైల్వే నడుపుతోంది. 2025 డిసెంబర్ 7 - 9 మధ్య.. గోరఖ్పూర్ - ఆనంద్ విహార్ టెర్మినల్ - గోరఖ్పూర్ స్పెషల్ (05591/05592) నాలుగు ట్రిప్పులను నడుపుతుంది. న్యూఢిల్లీ – అమరుడు కెప్టెన్ తుషార్ మహాజన్ - న్యూఢిల్లీ రిజర్వ్డ్ వందే భారత్ ప్రత్యేక రైలు (02439/02440) 2025 డిసెంబర్ 6న నడుస్తుంది. ఇది జమ్మూ ప్రాంతానికి వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాన్ని అందిస్తుంది.
పశ్చిమ సెక్టార్లో డిమాండుకు తగిన విధంగా సేవలందించేందుకు.. న్యూఢిల్లీ - ముంబై సెంట్రల్ - న్యూఢిల్లీ రిజర్వ్డ్ సూపర్ఫాస్ట్ స్పెషల్ (04002/04001) 2025 డిసెంబర్ 6, 7 తేదీల్లో నడుస్తుంది. దానితోపాటు హజ్రత్ నిజాముద్దీన్ - తిరువనంతపురం సెంట్రల్ రిజర్వ్డ్ సూపర్ఫాస్ట్ స్పెషల్ (04080) 2025 డిసెంబర్ 6న వన్ వేగా నడుస్తుంది. దక్షిణ ప్రాంతం దిశగా ఇది దూరప్రాంత ప్రయాణ సేవలను అందిస్తుంది.
అన్ని జోన్లలో సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ప్రత్యేక రైళ్లను నిర్వహించేలా చేపట్టిన ఈ చర్యలు.. ప్రయాణ సౌలభ్యం, తగిన వసతుల కల్పన, డిమాండ్ పెరిగిన ఈ సమయంలో సకాలంలో రవాణా సదుపాయాలను అందించడంలో భారతీయ రైల్వే అంకితభావానికి నిదర్శనం.
***
(रिलीज़ आईडी: 2200031)
आगंतुक पटल : 10