అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (2025 డిసెంబర్ 3) న్యూఢిల్లీలో 2025 సంవత్సరానికి వికలాంగుల సాధికారత జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దివ్యాంగ జనులు సమానత్వానికి అర్హులని అన్నారు. సమాజ, దేశ అభివృద్ధి ప్రస్థానంలో వారికి సమాన భాగస్వామ్యాన్ని కల్పించడం ప్రజలందరి విధి అని, అది దాతృత్వానికి సంబంధించిన విషయం కాదని అన్నారు. దివ్యాంగులకు సమాన భాగస్వామ్యం లభిస్తేనే దాన్ని నిజంగా అభివృద్ధి చెందిన సమాజంగా పరిగణిస్తారన్నారు. ‘సామాజిక పురోగతిని ముందుకు నడిపేలా దివ్యాంగ సమ్మిళిత సమాజాలకు ప్రోత్సాహం’ అన్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం- 2025 ఇతివృత్తానికి కూడా ఈ ప్రగతిశీల భావనే ఆధారమని ఆమె వ్యాఖ్యానించారు.
సంక్షేమ ధోరణికి మాత్రమే పరిమితం కాకుండా.. దివ్యాంగుల కోసం హక్కుల ప్రాతిపదికన, వారి గౌరవంపై దృష్టి సారించే వ్యవస్థలను మన దేశం అవలంబిస్తుండడంపై రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. దివ్యాంగుల సమ్మిళితత్వం దేశ అభివృద్ధి ప్రస్థానంలో అంతర్భాగమని ఆమె వ్యాఖ్యానించారు. దివ్యాంగులకు ప్రత్యేక గౌరవం ఇవ్వడం కోసం 2015 నుంచి ‘దివ్యాంగులు’ అనే పదాన్ని ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దివ్యాంగుల సమ్మిళితత్వం, సాధికారత కోసం అనుకూలమైన వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోందని రాష్ట్రపతి అన్నారు. సంకేత భాష పరిశోధన - శిక్షణ, మానసిక ఆరోగ్య పునరావాసం, క్రీడా శిక్షణ వంటి వివిధ రంగాల్లో వారి కోసం అనేక జాతీయ స్థాయి సంస్థలను ప్రభుత్వం నెలకొల్పింది. లక్షలాది దివ్యాంగులకు ప్రత్యేక దివ్యాంగ గుర్తింపు కార్డులను జారీ చేసింది. దాంతో ప్రత్యేక సౌకర్యాల ద్వారా ప్రయోజనం పొందేందుకు వారికి అవకాశం లభిస్తుంది.
దివ్యాంగుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం తో పాటు సమాజం కూడా అప్రమత్తంగా, క్రియాశీలంగా ఉండాలని రాష్ట్రపతి అన్నారు. ఇది ప్రభుత్వ ప్రగతిశీల చర్యలను బలోపేతం చేస్తుంది. దివ్యాంగుల గౌరవం, స్వావలంబన, ఆత్మగౌరవం ప్రజలందరి బాధ్యత అన్నారు. సామాజిక, జాతీయ పురోగతి కోసం తమ కృషిలో.. దివ్యాంగులను భాగస్వాములను చేసేలా ప్రతి పౌరుడూ ప్రతినబూనాలి.
రాష్ట్రపతి ప్రసంగాన్ని చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి