రైల్వే మంత్రిత్వ శాఖ
కాశీ తమిళ సంగమం 4.0 కోసం తమిళనాడు నుంచి బనారస్కు ఏడు ప్రత్యేక రైళ్లు నడుపుతున్న భారతీయ రైల్వే
प्रविष्टि तिथि:
02 DEC 2025 2:51PM by PIB Hyderabad
తమిళ ప్రాంతానికీ, ప్రాచీన ఆధ్యాత్మిక కేంద్రమైన కాశీకీ నడుమ సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేసే కాశీ తమిళ సంగమం 4.0లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనేందుకు వీలుగా.. కన్యాకుమారి, చెన్నై, కోయంబత్తూరు, బెనారస్ మధ్య ఏడు ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే నడుపుతోంది. అంతరాయం లేకుండా- సౌకర్యవంతంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణం, చాలా రోజులపాటు నిర్వహించనున్న ఈ సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమానికి వచ్చే వారు సకాలంలో చేరుకునేలా చూసేందుకు ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు.
2025 నవంబరు 29న కన్యాకుమారి నుంచి బయలుదేరిన మొదటి రైలుతో ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీని తరువాత ఈ రోజు చెన్నై నుంచి అదనపు ప్రత్యేక బయల్దేరి వెళ్లింది. డిసెంబరు 3న కోయంబత్తూరు నుంచి, డిసెంబరు 6న చెన్నై నుంచి, డిసెంబరు 7న కన్యాకుమారి నుంచి, డిసెంబరు 9న కోయంబత్తూరు నుంచి, డిసెంబరు 12న చెన్నై నుంచి సర్వీసులు ఉంటాయి. ఇలా ఓ ప్రణాళిక మేరకు రైళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. తమిళనాడులోని ముఖ్య నగరాల నుంచి బెనారస్ వరకు మొత్తం ఏడు ప్రత్యేక రైళ్లు చక్కటి సమన్వయంతో, దశలవారీగా నడుస్తాయి.
సకాలంలో తిరుగు ప్రయాణాన్ని అందించేలా.. బనారస్ నుంచి భారతీయ రైల్వే ప్రత్యేక తిరుగు ప్రయాణ సర్వీసులను ఏర్పాటు చేసింది. డిసెంబరు 5న కన్యాకుమారికి, డిసెంబరు 7న చెన్నైకి, 9న కోయంబత్తూరుకు ఇవి బయల్దేరి వెళ్తాయి. అనంతరం డిసెంబరు 11న చెన్నైకి, డిసెంబరు 13న కన్యాకుమారికి, డిసెంబరు 15న కోయంబత్తూరుకు, డిసెంబరు 17న మళ్లీ చెన్నైకి అదనపు తిరుగు ప్రయాణ సర్వీసులు నడుస్తాయి.
తమిళనాడు - కాశీ మధ్య దీర్ఘకాల సాంస్కృతిక అనుబంధాన్ని కొనసాగించే కాశీ తమిళ సంగమం 4.0 ఈ రోజు నుంచి ప్రారంభమవుతోంది. ‘‘తమిళం నేర్చుకుందాం – తమిళ కర్కాళం’’ ఇతివృత్తం ఈ యేడు కార్యక్రమానికి కేంద్ర బిందువుగా ఉంది. వారణాసిలోని పాఠశాలల్లో తమిళ అభ్యసన కార్యక్రమాలు, కాశీ ప్రాంతం విద్యార్థులకు తమిళనాడులో విద్యాయాత్రల ద్వారా.. ఇరు ప్రాంతాల మధ్య భాషా సాంస్కృతిక అనుబంధాన్ని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది. తెన్కాశీ నుంచి కాశీకి అగస్త్య మహర్షి వాహన యాత్రకు ఇది ప్రతీక.
ఏక్ భారత్ – శ్రేష్టతా భారత్ సారాన్ని కాశీ తమిళ సంగమం 4.0 ప్రతిబింబిస్తుంది. ప్రజలు తమ స్వీయ సంస్కృతులతోపాటు.. ఇతర సంస్కృతుల ఔన్నత్యాన్నీ తెలుసుకుని, వాటిపై అవగాహన పెంపొందించుకునేలా ప్రోత్సహిస్తుంది. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఐఐటీ మద్రాసు, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రధాన వైజ్ఞానిక భాగస్వాములుగా ఉన్నాయి. రైల్వే సహా పది మంత్రిత్వ శాఖల భాగస్వామ్యం, ఇరు ప్రాంతాల విద్యార్థులు, కళాకారులు, పరిశోధకులు, ఆధ్యాత్మికవేత్తలు, ఉపాధ్యాయులు, సాంస్కృతిక అభ్యాసకులను ఇది ఒక్కచోట చేరుస్తుంది. ఆలోచనలను, సాంస్కృతిక ఆచారాలను, సంప్రదాయ విజ్ఞాన ఆదాన ప్రదానాలకు మార్గం సుగమం చేస్తుంది.
ఏడు ప్రత్యేక రైళ్లను నడపడం, కచ్చితమైన ప్రణాళికతో కూడిన- సాంస్కృతికంగా సుసంపన్నమైన ఈ యాత్రను సమన్వయం చేయడం ద్వారా... దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించడంలో భారతీయ రైల్వే ప్రధాన పాత్ర పోషిస్తోంది. తమిళనాడు - కాశీ మధ్య ఉమ్మడి వారసత్వాన్ని బలోపేతం చేస్తోంది.
****
(रिलीज़ आईडी: 2197691)
आगंतुक पटल : 2