ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్లోని జైపూర్లో పలు ప్రాజెక్టుల శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
05 OCT 2023 1:03PM by PIB Hyderabad
వేదికను అలకరించిన రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్రాజ్ మిశ్రా, కేంద్రమంత్రి వర్గంలో నా సహచరులు, దేశానికి సేవకులైన గజేంద్ర సింగ్ షెకావత్, కైలాష్ చౌదరి, రాజస్థాన్ ప్రభుత్వ మంత్రి భజన్లాల్, పార్లమెంటు సభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సీపీ జోషి, ఇతర పార్లమెంటు సభ్యులు, ప్రతినిధులకు, మహిళలు, పెద్దలందరికీ స్వాగతం!
ముందుగా, వీర దుర్గాదాస్ రాథోడ్కు చెందిన ఈ ధైర్యభూమికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మార్వార్లోని పవిత్ర భూమి జోధ్పూర్లో ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. రాజస్థాన్ అభివృద్ధికి 9 ఏళ్లుగా మేము చేస్తున్న నిరంతర కృషి స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ దాని ఫలితాలను అనుభవిస్తున్నాం. ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ప్రాచీన భారత వైభవాన్ని, దేశ శౌర్యం, సంపద, సంస్కృతిని ప్రతిబింబించే అద్భుతమైన దృశ్యాలను రాజస్థాన్లో చూడవచ్చు. ఇటీవల జోధ్పూర్లో జరిగిన జీ20 సదస్సు ప్రపంచవ్యాప్త అతిథుల ప్రశంలందుకుంది. మన దేశ పౌరులైనా, విదేశీ పర్యాటకులైనా, ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా జోధ్పూర్లోని సన్ సిటీని సందర్శించాలనుకుంటారు. మెహ్రాన్గఢ్, జస్వంత్ థడా వంటి ప్రాంతాలను చూడాలని కోరుకోవటంతో పాటు, స్థానిక హస్తకళల పట్ల వారిలో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. భారత్ గత వైభవాన్ని సూచించే రాజస్థాన్, దేశ భవిష్యత్తుకు కూడా ప్రతీకగా నిలవటం అవసరం. మేవాడ్ నుంచి మార్వాడ్ వరకు రాజస్థాన్ వ్యాప్తంగా అభివృద్ధి జరిగినప్పుడు, ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం జరిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. జోధ్పూర్ గుండా బికనీర్ నుంచి జైసల్మేర్ వరకున్న ఎక్స్ప్రెస్వే కారిడార్ రాజస్థాన్లో ఆధునిక, హైటెక్ మౌలిక సదుపాయాలకు ఒక ఉదాహరణ. రాజస్థాన్లోని ప్రతి రంగంలో రైలు, రోడ్డు మార్గాలతో పాటు ప్రతి అంశంలోనూ భారత ప్రభుత్వం శరవేగంగా పనిచేస్తుంది.
ఈ ఏడాదిలో రాజస్థాన్ రైల్వే అభివృద్ధికి దాదాపు రూ.9,500 కోట్లు కేటాయించాం. గత ప్రభుత్వాల వార్షిక సగటు కంటే ఈ బడ్జెట్ దాదాపు 14 రెట్లు ఎక్కువ. నేను ఇక్కడ రాజకీయ ప్రకటన చేయటం లేదు.. వాస్తవ సమాచారాన్ని అందిస్తున్నాను. లేదంటే 'మోదీ శక్తిమంతమైన దాడి' అని మీడియా రాస్తుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు రాజస్థాన్లో కేవలం 600 కిలోమీటర్ల రైలు మార్గాలు మాత్రమే విద్యుదీకరణ చేస్తే, గత 9 ఏళ్లలో 3,700 కిలోమీటర్లకు పైగా రైలు మార్గాల విద్యుదీకరణ పూర్తయింది. డీజిల్ ఇంజిన్లకు బదులుగా, విద్యుత్ ఇంజిన్లతో నడిచే రైళ్లు ట్రాక్లపై పరుగులు పెట్టనున్నాయి. దీని వల్ల రాజస్థాన్లో కాలుష్యం తగ్గటమే కాక, గాలి కూడా శుభ్రంగా ఉంటుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా రాజస్థాన్లో 80 కంటే ఎక్కువ రైల్వేస్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నాం. అనేక ప్రాంతాల్లో ధనవంతులు వెళ్లే విమానాశ్రయాలను అద్భుతంగా నిర్మించే ధోరణి ఉంది. కానీ, మోదీ ప్రపంచం భిన్నంగా ఉంటుంది. పేద, మధ్య తరగతి ప్రజలు వెళ్లే రైల్వే స్టేషన్లో విమానాశ్రయం కంటే మెరుగైన సౌకర్యాలను కల్పిస్తాను. అందులో మన జోధ్పూర్ రైల్వేస్టేషన్ కూడా ఉంది.
సోదరులు, సోదరిణులు,
ఈ రోజు ప్రారంభించిన రోడ్డు, రైలు ప్రాజెక్టులు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తాయి. రైలు మార్గాలను రెట్టింపు చేయటం వలన ప్రయాణ సమయం తగ్గి, సౌకర్యం పెరుగుతుంది. జైసల్మేర్-ఢిల్లీ ఎక్స్ప్రెస్ రైలు, మార్వార్-ఖంబ్లీ ఘాట్ రైలును ప్రారంభించే అవకాశం నాకు లభించింది. కొన్ని రోజుల క్రితం, వందే భారత్ రైలును కూడా నేను ప్రారంభించాను. ఇవాళ మూడు రహదారి ప్రాజెక్టులకు ఇక్కడ శంకుస్థాపన చేశాను. జోధ్పూర్, ఉదయ్పూర్ విమానాశ్రయాల్లో ప్యాసింజర్ టెర్మినల్ నూతన భవనాలకు శంకుస్థాపన జరిగింది. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. అంతేకాక, రాజస్థాన్లో పర్యాటక రంగాన్ని పునరుత్తేజపరచటానికి కూడా దోహదపడతాయి.
మిత్రులారా,
వైద్య, ఇంజినీరింగ్ రంగంలో మన రాజస్థాన్ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కోటా ప్రాంతం దేశానికి ఎంతోమంది వైద్యులను, ఇంజినీర్లను అందించింది. మా ప్రయత్నం ఏటంటే, రాజస్థాన్ను కేవలం విద్యా కేంద్రంగానే కాక, వైద్య, ఇంజినీరింగ్ నైపుణ్యాల్లో కొత్త శిఖరాలను చేరుకునే ఒక నాణ్యతా కేంద్రంగా తీర్చిదిద్దటం. ఇందుకోసం జోధ్పూర్ ఎయిమ్స్లో ట్రామా, అత్యవసర, క్రిటికల్ కేర్ కోసం అధునాతన సౌకర్యాల అభివృద్ధి జరుగుతోంది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా జిల్లా ఆసుపత్రుల్లో కూడా క్రిటికల్ కేర్ బ్లాక్లు ఏర్పాటవుతున్నాయి. జోధ్పూర్ ఎయిమ్స్, జోధ్పూర్ ఐఐటీ వంటి సంస్థలు రాజస్థాన్లోనే కాక, మొత్తం దేశంలోనే అగ్రగామి సంస్థలుగా ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉంది.
ఎయిమ్స్, ఐఐటీ జోధ్పూర్ సంస్థలు వైద్య సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలపై పని చేస్తున్నాయి. రోబోటిక్ సర్జరీ వంటి హైటెక్ వైద్య సాంకేతికతలు పరిశోధన, పరిశ్రమ రంగాల్లో భారత్ నూతన శిఖరాలను చేరుకోవడానికి మార్గం సుగమం చేస్తాయి. ఇది వైద్యరంగంలోనూ పర్యాటకాన్ని పెంచుతుంది.
మిత్రులారా,
ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించే వారికి ఎంతో ఇష్టమైన ప్రదేశం రాజస్థాన్. గురు జంభేశ్వర్, బిష్ణోయ్ సమాజం శతాబ్దాలుగా ఈ జీవన విధానాన్ని పాటిస్తోంది. ఇవాళ ఈ జీవనశైలిని ప్రపంచమంతా అనుకరించాలని కోరుకుంటోంది. ఈ వారసత్వం ఆధారంగా నేడు యావత్ ప్రపంచానికి భారత్ మార్గనిర్దేశం చేస్తోంది. మన ప్రయత్నాలు వికసిత భారత్కు మూలమవుతాయని నేను విశ్వసిస్తున్నాను. రాజస్థాన్ అభివృద్ధి చెందినప్పుడే భారత్ కూడా అభివృద్ధి చెందుతుంది. మనమంతా కలిసి రాజస్థాన్ను సుసంపన్నంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చాలి. ఈ ప్రాధాన్యతతో ఇక్కడ కొన్ని నియమాలు ఉన్నందున మీ సమాయాన్ని నేను ఎక్కువగా తీసుకోను. దీని తర్వాత నేను మరో ప్రాంతానికి వెళ్లాలి. అక్కడ వాతావరణం, ఉత్సాహం, ఉద్దేశ్యం భిన్నంగా ఉంటాయి. మరికాసేపట్లో మిమ్మల్ని మరో ప్రాంతంలో కలుస్తాను.
ధన్యవాదాలు!
***
(रिलीज़ आईडी: 2197455)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil