రాష్ట్రపతి సచివాలయం
6వ జాతీయ జల అవార్డులు, జల్ సంచయ్-జన్ భాగీదారీ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి
వ్యక్తులు, కుటుంబాలు, సమాజం, ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారానే సమర్థవంతమైన నీటి నిర్వహణ సాధ్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Posted On:
18 NOV 2025 2:06PM by PIB Hyderabad
ఇవాళ (నవంబర్ 18, 2025) న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో 6వ జాతీయ జల అవార్డులు, జల్ సంచయ్-జన్ భాగీదారీ అవార్డులను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.

నదీ పరివాహక ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, నీటి లభ్యత ఉన్న ప్రాంతాల చుట్టూనే మానవ నాగరికత అభివృద్ధి చెందిందని రాష్ట్రపతి అన్నారు. నదులు, చెరువుల వంటి నీటి వనరులను గౌరవించటం మన సంస్కతి అని చెప్పారు. మన జాతీయ గేయంలోనూ బంకించంద్ర చటర్జీ రాసిన మొదటి పదం సుజలాం అనే.. దాని అర్థం నీటి వనరులు సమృద్ధిగా కలది అని, మనదేశం నీటికి ఇస్తున్న ప్రాధాన్యతను ఇది ప్రతిబింబిస్తుందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన నీటి వినియోగం తప్పనిసరని, మనదేశంలో నీటి యాజమాన్యం అత్యవసరమని రాష్ట్రపతి తెలిపారు. ఎందుకంటే భారత్లో జనాభాతో పోల్చితే నీటి వనరులు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. తలసరి నీటిలభ్యత అతిపెద్ద సవాలన్నారు. వాతావరణ మార్పులు జల చక్రాన్ని ప్రభావితం చేస్తున్నాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో నీటి లభ్యత, నీటి భద్రతకు.. ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు.

గతేడాది ప్రారంభించిన జల్ సంచయ్-జన్ భాగీదారీ కార్యక్రమం ద్వారా 35 లక్షల ఇంకుడు గుంతలను నిర్మించటం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు.
పునరావృత నీటి ఆర్థిక వ్యవస్థ ద్వారా పరిశ్రమలు, ఇతర నీటి వినియోగదారులు జల వనరులను సమర్థంగా వాడుకోవచ్చని రాష్ట్రపతి తెలిపారు. నీటి శుద్ధి, పునర్వినియోగం ద్వారా పరిశ్రమలు ద్రవ వ్యర్థాలను విడుదల చేయటం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు. ఈ ప్రయత్నాలు నీటి నిర్వహణ, సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పాలనా విభాగాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల స్థాయిలో నీటి సంరక్షణ, స్థిరమైన నిర్వహణకు ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్రపతి స్పష్టం చేశారు. ఎన్నో విద్యాసంస్థలు, ప్రజా సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు ఈ దిశగా తమ వంతు సహకారం అందించటం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. నీటి వాడకాన్ని తగ్గించి, ఉత్పత్తిని పెంచే వినూత్న విధానాలను అవలంబించాలని రైతులు, పారిశ్రామికవేత్తలకు సూచించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే బాధ్యతాయుతమైన పౌరులు నీటి సంరక్షణలో కీలకమని ఆమె చెప్పారు. వ్యక్తులు, కుటుంబాలు, సమాజం, ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారానే సమర్థవంతమైన నీటి నిర్వహణ సాధ్యమవుతుందన్నారు.
నీటిని ఉపయోగిస్తున్నప్పుడు, విలువైన ఆస్తిని వినియోగిస్తున్నామని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని రాష్ట్రపతి అన్నారు. గిరిజన ప్రజలు నీటితో పాటు అన్ని సహజ వనరులను ఎంతో గౌరవిస్తారని తెలిపారు. అత్యంత సమర్థవంతమైన నీటి నిర్వహణ ప్రజల జీవన విధానంలో కీలక భాగం కావాలని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగానూ, సమూహంగానూ నీటి సంరక్షణకు నిరంతరం కృషి చేయాలని ఆమె సూచించారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం పెంచేలా నీటి అవగాహన కల్పించటం అత్యవసరమని చెప్పారు. నీటిని సేకరించి, సంరక్షించటం ప్రజల ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు.
నీటి ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించటం, ఉత్తమ నీటి వినియోగ పద్ధతులను పాటించేలా ప్రోత్సహించటమే జాతీయ జల అవార్డుల లక్ష్యం. ప్రజల భాగస్వామ్యం, వనరుల సమీకరణ ద్వారా కృత్రిమంగా భూగర్భ జలాలను పెంచటానికి వైవిధ్యమైన, విస్తరించగలిగే, పునర్వినియోగించగలిగే నమూనాల రూపకల్పనకు జల్ సంచయ్ జన్ భాగీదారీ (జేఎస్ జేబీ) కార్యక్రమం ఉపయోగపడుతుంది.
Please click here to see the President's Speech-
***
(Release ID: 2191260)
Visitor Counter : 11