సహకార మంత్రిత్వ శాఖ
నాణ్యమైన బంగాళాదుంప విత్తనోత్పత్తి...వాణిజ్యం బనాస్ డెయిరీ, బీబీఎస్ఎస్ఎల్ మధ్య అవగాహనా ఒప్పందం
Posted On:
13 NOV 2025 1:29PM by PIB Hyderabad
'సహకారం ద్వారా అభివృద్ధి' అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనకు అనుగుణంగా ఈ ఒప్పందం జరిగింది. 'సహకార సంస్థలు పరస్పరం తోడ్పాటునందించుకోవాలి' అనే ప్రభుత్వ లక్ష్యాన్ని ఇది ముందుకు తీసుకెళ్తుంది.
బంగాళాదుంపల ఉత్పత్తికి విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు సమగ్రమైన వ్యవస్థను అభివృద్ధి చేయటం ఈ ఎంఓయూ లక్ష్యం.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచన 'సహకారం ద్వారా అభివృద్ధి'ని సాకారం చేసేందుకు సహకార సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించే కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ హోం, సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ దిశగా అత్యుత్తమ నాణ్యత గల విత్తన బంగాళాదుంపలను ఉత్పత్తి చేసి, పంపిణీ చేసేందుకు బనాస్ డెయిరీ (ఆసియాలోనే అతిపెద్ద సహకార డెయిరీ- అమూల్ అనుబంధ సంస్థ), భారతీయ విత్తన సహకార సమితి (బీబీఎస్ఎస్ఎల్) కలిసి అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశాయి. 2025 నవంబర్ 10న న్యూఢిల్లీలోని అటల్ అక్షయ్ ఉర్జాభవన్లో ఈ ఒప్పందం జరిగింది. భారత ప్రభుత్వ కార్యదర్శి (సహకార) డాక్టర్ ఆశీష్ కుమార్ భూటాని, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో.. బనాస్ డెయిరీ ఎండీ శ్రీ సంగ్రామ్ చౌదరి, బీబీఎస్ఎస్ఎల్ ఎండీ శ్రీ చేతన్ జోషి ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భూటాని మాట్లాడుతూ.. విలువ వ్యవస్థలను బలోపేతం చేయటం, ఉత్పాదకతను పెంచటం ద్వారా రైతుల సాధికారత, అభివృద్ధిలో ఈ భాగస్వామ్యం కీలకమని తెలిపారు.
విత్తనం నుంచి మార్కెట్ వరకు బంగాళాదుంప విలువాధారిత వ్యవస్థను సమగ్రంగా ఏర్పరచటమే ఈ భాగస్వామ్యం లక్ష్యం. ధ్రువీకరించిన, మేలైన బంగాళదుంప విత్తనాల ఉత్పత్తిని ఇది నిర్ధారించటమే కాక, శాస్త్రీయ సాగు పద్ధతులు, కాంట్రాక్ట్ వ్యవసాయ ఒప్పందాలు, సమర్థవంతమైన మార్కెట్ అనుసంధానాలను ప్రోత్సహిస్తుంది. సాంకేతికతను సహకారంతో జోడించి, విలువ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, పెట్టుబడి నష్టాలను తగ్గించటం వల్ల బంగాళాదుంపలు పండించే రైతుల ఆదాయం, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచటానికి ఈ కార్యక్రమం కృషి చేస్తుంది. ఈ ఎంఓయూ ప్రకారం బనాస్ డెయిరీ కణజాల వర్ధనం, ఏరోపోనిక్ సౌకర్యాలను బీబీఎస్ఎస్ఎల్ సంస్థ వినియోగించుకుంటుంది. అదే సమయంలో బనాస్ డెయిరీ సాంకేతికత, మార్కెట్ మద్దతును అందిస్తుంది. పాల ఉత్పత్తికి మించి బనాస్ డెయిరీ విస్తరణపై శ్రీ సంగ్రామ్ చౌదరి ప్రస్తావించగా, విత్తన బంగాళాదుంప స్వావలంబనపై శ్రీ చేతన్ జోషి మాట్లాడారు.
***
(Release ID: 2189763)
Visitor Counter : 2