జల శక్తి మంత్రిత్వ శాఖ
ఆరో జాతీయ జల పురస్కారాల విజేతల ప్రకటన ఈ నెల 18న అవార్డులను ప్రదానం చేయనున్న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము
Posted On:
11 NOV 2025 1:50PM by PIB Hyderabad
జాతీయ స్థాయి 6వ జల పురస్కార విజేతల జాబితాను కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ సీ ఆర్ పాటిల్ ఈ రోజు న్యూఢిల్లీలోని శ్రమ శక్తి భవన్లో ప్రకటించారు. జల శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన జల వనరులు, నదుల వికాసం, గంగ సంరక్షణ విభాగం (డీఓడబ్ల్యూఆర్, ఆర్డీ అండ్ జీఆర్) 2024వ సంవత్సరానికి గాను జాతీయ 6వ జల పురస్కారాల్లో సంయుక్త విజేతలు సహా 46 విజేతలను ప్రకటించింది. ఈ పురస్కారాలను 10 విభాగాలలో అందజేస్తారు. వీటిలో అత్యుత్తమ రాష్ట్రం, అత్యుత్తమ జిల్లా, అత్యుత్తమ గ్రామ పంచాయతీ, అత్యుత్తమ పట్టణ స్థానిక సంస్థ, అత్యుత్తమ పాఠశాల లేదా కళాశాల, అత్యుత్తమ పరిశ్రమ, అత్యుత్తమ జల వినియోగదారు సంఘం, అత్యుత్తమ సంస్థ (పాఠశాల లేదా కళాశాల కాకుండా) అత్యుత్తమ పౌర సంఘంతో పాటు జల రంగంలో అత్యుత్తమ వ్యక్తి అనే కేటగిరీలు ఉన్నాయి. విజేతల జాబితాను అనుబంధంలో చూడవచ్చును.
అత్యుత్తమ రాష్ట్రం కేటగిరీలో మొదటి పురస్కారాన్ని మహారాష్ట్రకూ, రెండో పురస్కారాన్ని గుజరాత్కూ, మూడో పురస్కారాన్ని హర్యానాకూ ప్రకటించారు.
ప్రతి పురస్కార విజేతకూ ప్రశంసపత్రం, ట్రోఫీతో పాటు కొన్ని కేటగిరీల్లో నగదు బహుమతులను కూడా అందజేస్తారు.
జాతీయ స్థాయి 6వ జల పురస్కారాలు-2024 ప్రదాన కార్యక్రమాన్ని ఈ నెల 18న ఉదయం 11:30 కి న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్లీనరీ హాల్లో ఏర్పాటు చేయనున్నట్లు జల వనరులు, నదుల వికాసం, గంగ సంరక్షణ విభాగం (డీఓడబ్ల్యూఆర్, ఆర్డీ అండ్ జీఆర్) తెలిపింది. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
జాతీయ జల పురస్కారాల ప్రకటన కార్యక్రమంలో కేబినెట్ మంత్రి తో పాటు జల శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్ భూషణ్ చౌధరీ, జల వనరులు, నదుల వికాసం, గంగ సంరక్షణ విభాగం (డీఓడబ్ల్యూఆర్, ఆర్డీ అండ్ జీఆర్) కార్యదర్శి శ్రీ వి.ఎల్. కాంతా రావు, తాగునీరు, పారిశుధ్య విభాగం కార్యదర్శి శ్రీ అశోక్ కె.కె. మీనా, జల శక్తి శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జాతీయ సంపదగా పరిగణిస్తూ నీటి వనరుల్ని అభివృద్ధిచేయడం, సంరక్షించడంతోపాటు సమర్థంగా నిర్వహించడానికి అవసరమైన విధాన ప్రణాళికను సిద్ధం చేసి, ఆయా కార్యక్రమాల్ని అమలుపరిచే బాధ్యతను జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కేంద్ర శాఖను ఏర్పాటు చేసి అప్పగించారు. నీటి నిర్వహణ, జల సంరక్షణల విషయంలో జాతీయ స్థాయిలో చైతన్యాన్ని పెంపొందింపచేయడానికి గౌరవ ప్రధాన మంత్రి మార్గదర్శకత్వంలో జల శక్తి శాఖ ఒక విస్తృత ఉద్యమాన్ని నడుపుతోంది. ఈ దృష్టికోణానికి అనుగుణంగా, ప్రజల్లో నీటి ప్రాధాన్యం గురించి అవగాహనను పెంచడానికీ, నీటిని ఉపయోగించుకోవడంలో అత్యుత్తమ పద్ధతుల్ని అనుసరించేలా వారిని ప్రోత్సహించడానికీ జల వనరులు, నదుల వికాసం, గంగ సంరక్షణ విభాగం (డీఓడబ్ల్యూఆర్, ఆర్డీ అండ్ జీఆర్) ఒకటో జాతీయ జల పురస్కారాలను ఇవ్వడాన్ని 2018లో మొదలుపెట్టింది. 2వ, 3వ, 4వ, 5వ జాతీయ జల పురస్కారాలను వరుసగా 2019, 2020, 2022, 2023 సంవత్సరాల్లో ఇచ్చారు. 2021లో కోవిడ్ మహమ్మారి కారణంగా పురస్కారాలను ఇవ్వలేదు.
హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)కు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో 2024 అక్టోబరు 23న 2024 సంవత్సర ఆరో జాతీయ జల పురస్కారాల (ఎన్డబ్ల్యూఏ) ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 751 దరఖాస్తులు వచ్చాయి. న్యాయ నిర్ణేతల సంఘం సాయంతో దరఖాస్తుల పరిశీలన, మూల్యాంకన పూర్తి చేశారు. తరువాత తాత్కాలికంగా ఎంపిక చేసిన దరఖాస్తులకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలనను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)తో కలిసి కేంద్ర భూగర్భ జల మండలి (సీజీడబ్ల్యూబీ) ముగించింది. ఈ క్షేత్ర స్థాయి నివేదికలను ఆధారం చేసుకొని, సంయుక్త విజేతలు సహా మొత్తం 46 విజేతలను 2024 సంవత్సరానికి గాను10 వేర్వేరు కేటగిరీల్లో 6వ ఎన్డబ్ల్యూఏ కోసం ఎంపిక చేశారు.
‘జల సమృద్ధ భారత్’కు సంబంధించిన ప్రభుత్వ దృష్టి కోణాన్ని దేశవ్యాప్తంగా వ్యక్తులు, సంస్థల ద్వారా సాకారం చేసే దిశగా మంచి పనులకూ, ప్రయత్నాలకూ జాతీయ జల పురస్కారాల (ఎన్డబ్ల్యూఏస్) ప్రదానం స్ఫూర్తిని పంచుతోంది. నీటి ప్రాధాన్యం విషయంలో ప్రజలలో చైతన్యాన్ని పెంచడం, జల వినియోగానికి సంబంధించి అత్యుత్తమ పద్ధతులను పాటించేటట్లుగా వారికి స్ఫూర్తినివ్వడం ఈ పురస్కారాల ప్రదానం ముఖ్యోద్దేశం. వ్యక్తులకూ, సంస్థలకూ జల వనరుల సంరక్షణ, నిర్వహణ కార్యకలాపాల్లో పాలుపంచుకొనే అవకాశాలతో పాటుగా ప్రజా భాగస్వామ్యాన్ని పటిష్ఠపరిచే అవకాశాలను కూడా ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమం అందిస్తోంది.
***
(Release ID: 2188818)
Visitor Counter : 32