రక్షణ మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వదేశీ పరికరాల సమర్థవంతమైన వినియోగం... దేశీయంగా, అంతర్జాతీయంగా మరింత పెరిగిన భారత్ ఖ్యాతి: రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్
విడిభాగాల తయారీపై దృష్టి సారిస్తూ, సరఫరా నిర్వహణ వ్యవస్థపై ఆధిపత్యం సాధించాలంటూ
దేశీయ పరిశ్రమలకు రక్షణమంత్రి పిలుపు
మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ద వరల్డ్ పరికరాలను సృష్టించేందుకు నిజమైన తయారీ కేంద్రాన్ని ఏర్పరుస్తున్న ప్రభుత్వం
రక్షణ ఎగుమతులు 2026 మార్చి నాటికి రూ. 30,000 కోట్లకు చేరుకునే అవకాశం
కొత్తగా వస్తున్న సవాళ్లను ఎదుర్కొనే ఏకైక మార్గం స్వావలంబన మాత్రమే
Posted On:
27 OCT 2025 3:38PM by PIB Hyderabad
ఆపరేషన్ సిందూర్ సమయంలో సాయుధ దళాలు స్వదేశీ పరికరాలను సమర్థవంతంగా వినియోగించడం... భారత్ ప్రతిష్ఠను దేశీయంగా, అంతర్జాతీయంగా మరింతగా బలపరిచాయని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశీయ పరిశ్రమలను ముఖ్యంగా ప్రైవేట్ రంగాన్ని ఆవిష్కరణ, పరిశోధన-అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా స్వావలంబన సాధనను మరింత వేగవంతం చేయాలని సూచించారు. సాంకేతిక ఆధారిత తయారీ, ఉప వ్యవస్థలకు చెందిన విడిభాగాల ఉత్పత్తి, సరఫరా, నిర్వహణ వ్యవస్థపై ఆధిపత్యం చెలాయించడం ద్వారా స్వావలంబన సులభతరం అవుతుందని పేర్కొన్నారు. 2025 అక్టోబర్ 27న న్యూఢిల్లీలో ‘రక్షణ స్వావలంబన: దేశీయ పరిశ్రమల ద్వారా జాతీయ భద్రత బలోపేతం’ అనే అంశంపై నిర్వహించిన భారత రక్షణ తయారీదారుల సంఘం వార్షిక సదస్సులో శ్రీ రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్, ఆకాశ్ తీర్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్, ఇతర స్వదేశీ పరికరాల శక్తిని ప్రపంచం ప్రత్యక్షంగా చూసిందని, ఈ దాడి విజయానికి సాహసవంతులైన సాయుధ దళాలతోపాటు ఆవిష్కరణ, రూపకల్పన, తయారీ రంగాల్లో ముందుండి పనిచేసిన పరిశ్రమ యోధులకు దక్కుతుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఆయన భారతీయ పరిశ్రమను సైన్యం, నౌకాదళం, వాయుసేనలతో సమానంగా ఉన్న రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన స్తంభాలలో ఒకటిగా అభివర్ణించారు.
“మేం ధృడ సంకల్పంతో స్పందించినప్పటికీ.. మన దళాలు దేశ సరిహద్దులను రక్షించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ, మనం నిరంతరం ఆత్మపరిశీలన చేసుకోవడం కొనసాగించాలి. ఆపరేషన్ సిందూర్ మన భవిష్యత్తు వ్యూహానికి మార్గదర్శకంగా నిలిచే ఒక అధ్యయనంగా ఉపయోగపడాలి. ఈ సంఘటన మన సరిహద్దుల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా జరగవచ్చని మళ్లీ మనకు చూపించింది. మనం ఎల్లప్పుడూ యుద్ధం లాంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. మన సంసిద్ధత మన సొంత పునాదిపై ఆధారపడి ఉండాలి” అని శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
ప్రస్తుత ప్రపంచ అనిశ్చిత పరిస్థితులు.. ప్రతి రంగంలో లోతైన విశ్లేషణ అవసరాన్ని పెంచుతాయని, నిరంతరం మారుతున్న రక్షణ రంగం, యుద్ధ స్వభావం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు స్వదేశీ ఏకైక మార్గమని రక్షణ మంత్రి తెలిపారు. “ప్రపంచ స్థాయి వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఘర్షణలు పెరుగుతున్నాయి. దీనివల్ల భారత్ తన భద్రతా వ్యూహాన్ని పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది” అని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం రక్షణ తయారీని పెంచడానికి, దేశీయ వ్యవస్థను బలపరచడానికి సమాన అవకాశాలను సృష్టిస్తోందని.. పరిశ్రమలు ఈ అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని శ్రీ రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. “రక్షణ పరికరాలను దేశంలో వినియోగించడానికే కాకుండా, ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్’ స్పూర్తిని ప్రతిబింబించే పరికరాలను రూపొందించడానికి నిజమైన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా మేం కృషి చేస్తున్నాం” అని అన్నారు. ఆవిష్కరణ, పరిశోధన-అభివృద్ధి సంస్కృతిని పెంపొందించడానికి క్వాంటం మిషన్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. దేశంలో ఇంతవరకు సాధించని లక్ష్యాలను మన పరిశ్రమ సాధించాలని అన్నారు.
ప్రభుత్వ స్వావలంబన ప్రయత్నాల వల్ల సాధించిన పురోగతిని శ్రీ రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. 2014 కి ముందు భారత్ తన భద్రతా అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపై ఆధారపడి ఉండేదని, కానీ నేడు అది తన సొంత గడ్డపై రక్షణ పరికరాలను తయారు చేస్తోందని అన్నారు. “2014లో సుమారు రూ. 46,000 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తి విలువ, ఇప్పుడు రికార్డు స్థాయిలో రూ. 1.51 లక్షల కోట్లకు చేరింది. ఇందులో రూ. 33,000 కోట్లు ప్రైవేట్ రంగం నుంచి వచ్చాయి. 10 సంవత్సరాల కిందట రూ. 1,000 కోట్ల కంటే తక్కువగా ఉన్న మన రక్షణ ఎగుమతులు, ఇప్పుడు సుమారు రూ. 24,000 కోట్లకు చేరాయి. మార్చి 2026 నాటికి ఈ ఎగుమతులు రూ. 30,000 కోట్లను చేరుకుంటాయనే నమ్మకం నాకు ఉంది. ఇటీవలే మేం డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ 2025ను తయారు చేశాం. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020ను సవరించే పనులు కొనసాగుతున్నాయి” అని రక్షణమంత్రి తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో దేశీయ రక్షణ తయారీకి ప్రైవేట్ రంగం తన సహకారాన్ని ప్రస్తుతం ఉన్న 25 శాతం నుంచి కనీసం 50 శాతానికి పెంచాలని శ్రీ రాజ్నాథ్ సింగ్ కోరారు.
స్వదేశీకరణను మరింత పెంచేందుకు, పరిశ్రమ సరఫరా, నిర్వహణ వ్యవస్థపై ఆధిపత్యం కోసం కృషి చేయాలని శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు. కేవలం పూర్తిస్థాయి పరికరాల తయారీకే పరిమితమవకుండా, పరికరాల ఉపవ్యవస్థలు, విడిభాగాల స్వదేశీ తయారీపై దృష్టి పెట్టాలని సూచించారు.“ఈ రోజుల్లో మనం విదేశాల నుంచి ప్రధాన పరికరాలను కొనుగోలు చేసినప్పుడు వాటి జీవితకాలం వాటి నిర్వహణ, మరమ్మతులు, పునరుద్ధరణ, విడి భాగాల నిర్వహణ వంటివి.. ఆర్థిక భారంగా మారుతుంది. ఇది మన వనరులపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితిని పెంచుతుంది. ఒక పూర్తిస్థాయి పరికరానికి అనేక భాగాలు, ముడిపదార్థాలు ఉన్నందున.. ఈ ఉప-వ్యవస్థల స్వదేశీ తయారీ ద్వారా మన దేశీయ తయారీని పెంచుకోవచ్చు. ‘మన నేల, మన రక్షణ’ మొదటి ప్రాధాన్యతగా ఉండేలా చూడాలి” అని అన్నారు.
కేవలం దేశంలో వినియోగించడమే లక్ష్యం కాదని, దేశంలోనే సాంకేతిక ఆధారిత తయారీని అభివృద్ధి చేయడం కావాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. “ఏ సాంకేతిక బదిలీ అయినా సమర్థవంతంగా ఉండాలి. ఇది మన స్వదేశీ పరిశ్రమలను శక్తిమంతం చేసే మార్గంగా కూడా పనిచేయాలి.”
ఆవిష్కరణ, పరిశోధన లేకుండా ఏ దేశం కూడా అభివృద్ధిని సాధించలేదని శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారు. వచ్చే ఏడాది ఎస్ఐడీఎమ్ పది సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా.. పెద్ద ఎత్తున పూర్తిస్థాయి సాంకేతిక ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని ప్రోత్సహించారు.
“ఐడెక్స్, అదితి ద్వారా మన యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలకు సవాళ్లు, సమస్యల గురించిన సమాచారం లభించింది. నేడు పెద్ద ఎత్తున పూర్తి స్థాయి సాంకేతిక ఉత్పత్తులను అభివృద్ధి చేసి, వాటిని మనకు అందించే సవాలును పరిశ్రమ స్వీకరించాలి. మేం వాటిని చర్చించి లోపాలను భర్తీ చేస్తాం. ప్రైవేటు రంగంతో కలిసి ముందుకు సాగడమే మా ప్రయత్నం. మనం కలిసి పనిచేయడం ద్వారా రక్షణ రంగం రూపురేఖలను మొత్తం మార్చగలం” అని అన్నారు. దీనికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రక్షణశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, ఎస్ఐడీఎమ్ అధ్యక్షుడు శ్రీ రాజిందర్ సింగ్ భాటియా, ఎస్ఐడీఎమ్ డైరెక్టర్ జనరల్ రమేష్ కే, మాజీ ఎస్ఐడీఎమ్ అధ్యక్షుడు శ్రీ ఎస్ పీ శుక్లా, సాయుధ దళాలు, రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, పరిశ్రమ నాయకులు, యువ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
***
(Release ID: 2183059)
Visitor Counter : 6