మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
డెహ్రాడూన్లో రేపు రాష్ట్రీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమం
పోషకాహారంపై అవగాహనను, సమాజ భాగస్వామ్యాన్ని, ప్రవర్తనా మార్పును ప్రోత్సహించేందుకు నెల రోజుల పాటు నిర్వహించిన ప్రజా ఉద్యమం ముగింపును సూచిస్తున్న కార్యక్రమం
Posted On:
16 OCT 2025 10:05AM by PIB Hyderabad
పోషణ అంటే పౌష్టికాహారం గురించి మాత్రమే కాదు.. అది బలమైన, ఆరోగ్యకరమైన, మరింత సామర్థ్యం కలిగిన భారత్ను తయారుచేయడం గురించి కూడా. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గనిర్దేశానుసారం ఎనిమిదో పోషణ మాసం (2025 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు) నిర్వహించారు. ఆరోగ్యవంతమైన కుటుంబాలకు, వికసిత భారత్కు మహిళల ఆరోగ్యం, పోషకారమే పునాది అని తెలియజేసిన ఈ కార్యక్రమం 2025 సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్లోని ధార్లో ప్రారంభమైంది.
ఎనిమిదో రాష్ట్రీయ పోషణ్ మాసం 2025 ముగింపు కార్యక్రమాన్ని రేపు (2025 అక్టోబర్ 17) ఉత్తరాఖండ్, డెహ్రాడూన్లోని హిమాలయన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా మిషన్ సాక్షం అంగన్వాడీ, పోషన్ 2.0 ద్వారా పోషకాహారంపై అవగాహనను, సమాజ భాగస్వామ్యాన్ని, ప్రవర్తనా మార్పును ప్రోత్సహించేందుకు నెల రోజుల పాటు నిర్వహించిన ప్రజా ఉద్యమం పూర్తవుతుంది.
ఈ కార్యక్రమానికి మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉత్తరాఖండ్ మహిళా సాధికారత, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి రేఖా ఆర్య, ఉత్తరాఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గణేష్ జోషి, మహిళా, శిశు అభివృద్ధి శాఖకు చెందిన కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
సమగ్ర ఆరోగ్య పరీక్షలు, సేవలకు ప్రాధాన్యమిస్తూ.. మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణను మెరుగుపరచడంపై దృష్టి సారించి.. ‘‘స్వాస్థ నారీ, సశక్త పరివార్’’ ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా పోషణ మాసాన్ని నిర్వహించారు. దీని ద్వారా చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు: ఊబకాయానికి పరిష్కారం, చక్కెర, నూనె వినియోగాన్ని తగ్గించడం, బాల్య సంరక్షణ, విద్య (ఈసీసీఈ), శిశు, చిన్నారుల పోషణ (ఐవైసీఎఫ్) పద్ధతులు, పోషకాహారంలో పురుషుల భాగస్వామ్యం, క్షేత్ర స్థాయి సాధికారిత, స్వావలంబన కోసం ఓకల్ ఫర్ లోకల్, కేంద్రీకృత చర్యలు, డిజిటలైజేషన్.
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి నాయకత్వంలో నెల పాటు నిర్వహించిన పోషణ మాసం 2025 కార్యక్రమం ‘‘యావత్ ప్రభుత్వం, యావత్ సమాజం’’ అనే స్ఫూర్తితో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సామాజిక సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చింది. సుపోషిత్ భారత్ - పౌష్టికమైన, ఆరోగ్యవంతమైన, సాధికారత సాధించిన దేశమనే జాతీయ అంకితభావాన్ని గృహ స్థాయి ప్రదర్శనల నుంచి బృహత్ స్థాయిలో నిర్వహించిన ప్రచారాల వరకు చేపట్టిన కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయి.
ముగింపు కార్యక్రమంలో సమాజ సమీకరణ, క్షేత్ర స్థాయి కార్యక్రమాలు, పోషకాహారంపై ప్రదర్శనలు ఉంటాయి. అలాగే పోషణ్, మిషన్ శక్తి ఛాంపియన్లను సత్కరిస్తారు. సుపోషిత్, వికసిత్ భారత్ సాధనకు ప్రజా ఉద్యమాన్ని ముందుకు నడిపించే సమష్టి కార్యక్రమంగా ఇది నిలిచింది.
***
(Release ID: 2179945)
Visitor Counter : 9