ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
కృత్రిమ మేధ ఆధారిత మౌలిక సదుపాయాలు, స్వచ్ఛ ఇంధనం, ఉన్నత విలువ కలిగిన ఉద్యోగాల కల్పనకు దోహదపడే గూగుల్ ఏఐ హబ్ ను భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు గేమ్ ఛేంజర్ గా పేర్కొన్న కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్
ఏఐ ఆధారిత సేవలను అభివృద్ధికి భారతదేశంలో గూగుల్ అతి పెద్ద పెట్టుబడి...
విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల వ్యయంతో ఏఐ హబ్ ఏర్పాటు
రైల్టెల్ నెట్వర్క్ విస్తరణ, మయన్మార్ మీదుగా సీమాంతర కేబుల్ పొడిగింపుతో ఈశాన్య రాష్ట్రాలలో డిజిటల్ అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి వైజాగ్ - సిట్వే లింక్ ఏర్పాటుకు శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రతిపాదన
అండమాన్ను అంతర్జాతీయ ఇంటర్నెట్ డేటా బదిలీకి తదుపరి ప్రధాన కేంద్రంగా మార్చేందుకు భారత ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు: శ్రీ అశ్వినీ వైష్ణవ్
Posted On:
14 OCT 2025 6:19PM by PIB Hyderabad
విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ ఏఐ హబ్ భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారు. త్వరలో జరిగే ఇండియా ఏఐ శిఖరాగ్ర సదస్సుకు ముందస్తుగా గూగుల్ విశాఖపట్నంలో నిర్వహించిన 'భారత్ ఏఐ శక్తి' కార్యక్రమంలో శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రసంగించారు. “గూగుల్ ఏఐ హబ్ భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఈ మౌలిక సదుపాయాలు ఏఐ ఫస్ట్ డేటా సెంటర్ ఆర్కిటెక్చర్ రంగంలో కొత్త దారులను తెరుస్తాయి. ఇవి కొత్త సబ్సీ కేబుల్ నెట్వర్క్లలో పెట్టుబడులు, స్వచ్ఛమైన ఇంధనంతో ఆధారితమై ఉంటాయి. ఇది ఏఐ ఆధారిత సేవలకు కొత్త శకాన్ని అందించడమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్నత విలువ గల ఉద్యోగాలు, ఆర్థిక అవకాశాలను కూడా సృష్టిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రపంచ స్థాయి సాంకేతికత భారతదేశానికి రావడం చూసి మేము గర్విస్తున్నాం” అని పేర్కొంటూ, ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ హబ్ పాత్రను కేంద్ర మంత్రి ప్రముఖంగా వివరించారు. “ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలు మన ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలను చేరుకోవడంలో చాలా వరకు ఉపయోగపడతాయి” అని అన్నారు.
ఏఐ సేవలను భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన అభివృద్ధి చెందుతున్న రంగంగా శ్రీ అశ్వినీ వైష్ణవ్ అభివర్ణించారు. ప్రతిభను, ఉద్యోగాల కల్పనను (పెంచడానికి ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని ఆయన గూగుల్ను కోరారు. ఇండియా ఏఐ మిషన్ కింద సాధారణ కంప్యూట్ మౌలిక సదుపాయాలలో భాగంగా ఎన్వీఐడిఐ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ) లతో పోటీ పడటానికి గూగుల్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ (టీపీయూ) రాకను ఆయన స్వాగతించారు. ఏఐ హబ్ భారత ఏఐ మిషన్ లక్ష్యాలను గణనీయంగా ముందుకు నడిపిస్తుందని అన్నారు. వేగవంతమైన ఏఐ ఆధారిత మార్పుల మధ్య ఐటీ నిపుణులకు పెద్ద ఎత్తున నైపుణ్యాలను తిరిగి నేర్పడం, నైపుణ్యాలను మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ కృషిలో పరిశ్రమకు మద్దతు ఇవ్వాలని ఆయన గూగుల్ను కోరారు.
సముద్ర తీరంలో సబ్సీ కేబుల్ కనెక్టివిటీ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, “అండమాన్, నికోబార్ దీవులు వ్యూహాత్మకంగా ఉన్నాయి. సింగపూర్ పై ఇప్పటికే భారం ఎక్కువగా ఉంది. గ్లోబల్ ఇంటర్నెట్ డేటా బదిలీ కోసం అండమాన్ ను తదుపరి ప్రధాన కేంద్రంగా ఎందుకు మార్చలేం? భారత ప్రభుత్వం నుంచి ఈ ప్రయత్నానికి పూర్తి మద్దతు అందిస్తాం. ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా మొదలైన కొత్త డేటా సామర్థ్యాన్ని అన్వేషిస్తున్న ఇతర ప్రాంతాలకు కనెక్ట్ అయ్యేందుకు అండమాన్ దీవులు గూగుల్, ఇతర ఇంటర్నెట్ ఆధారిత సంస్థలకు సహాయం చేయగలవు” అని వివరించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో డిజిటల్ కనెక్టివిటీని పెంచేందుకు వైజాగ్ - సిట్ట్వే మార్గాన్ని ప్రతిపాదించిన మంత్రి
ఈశాన్య రాష్ట్రాలలో డిజిటల్ కనెక్టివిటీని బలోపేతం చేయడానికి వైజాగ్ - సిట్ట్వే (మయన్మార్) లింకును ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ప్రతిపాదించారు. ఇప్పటికే ఉన్న రైల్టెల్ నెట్వర్క్ను మెరుగుపరచవలసిన ఆవశ్యకతను ఆయన ఈ సందర్భంగా వివరించారు. సైరాంగ్ వరకు రైల్వే లైన్ ఇప్పటికే పూర్తి అయినందున, ప్రధానమంత్రి ఆదేశాల మేరకు దానిని మయన్మార్ సరిహద్దు వరకు పొడిగించే పని జరుగుతున్నందున మయన్మార్ మీదుగా మిజోరాం వరకు కేబుల్ను విస్తరించడం ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్లో ఈ ముఖ్యమైన పెట్టుబడి భారత డిజిటల్ మార్పు ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది" అని అన్నారు. భారతదేశంలో మొట్టమొదటి అసలైన గిగావాట్ - స్కేల్ డేటా సెంటర్, గూగుల్ మొదటి ఏఐ హబ్కు ఆతిథ్యం ఇవ్వడం తమకు గర్వకారణమని, రాష్ట్రంలోని వ్యాపారాలు, స్టార్టప్లకు ఆవిష్కరణలు, ఏఐ స్వీకరణ, దీర్ఘకాలిక మద్దతు పట్ల తమకు గల భాగస్వామ్య నిబద్ధతకు ఇది ఒక నిదర్శనమని ఆయన అన్నారు.
గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ,"విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ భారతదేశ డిజిటల్ భవిష్యత్తులో ఒక కీలక పెట్టుబడిగా నిలుస్తుంది. పరిశ్రమలోని ప్రధాన ఏఐ మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున అందించడం ద్వారా వ్యాపారాలను వేగంగా ఆవిష్కరించడానికి మేం సహాయపడుతున్నాం. సమ్మిళిత వృద్ధికి అర్థవంతమైన అవకాశాలను సృష్టిస్తున్నాం. ఈ భాగస్వామ్యం భారత్, అమెరికా ప్రభుత్వాలతో ఏఐను బాధ్యతతో ఉపయోగించాలనే, సమాజానికి మార్పు చూపే ప్రభావాన్ని తీసుకురావాలనే మా సార్వత్రిక కట్టుబాటును ప్రతిబింబిస్తుంది” అని పేర్కొన్నారు.
గూగుల్ ఏఐ హబ్: ఏఐ మార్పు వేగవంతం
భారత్ అంతటా ఏఐ ఆధారిత మార్పును వేగవంతం చేసే లక్ష్యంతో, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ హబ్ ద్వారా కంపెనీ తన పూర్తి ఏఐ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తుంది. ఈ కొత్త ఏఐ హబ్ అధునాతన ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ సామర్థ్యం, పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన వనరులు, విస్తరించిన ఫైబర్-ఆప్టిక్ నెట్వర్క్లన్నింటిని ఒకేచోటకు తీసుకువస్తుంది.
దీనిపై రాబోయే ఐదేళ్లలో (2026–2030) సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతారు. ఇది ఇప్పటివరకు భారతదేశంలో గూగుల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి. ఏఐ ఆధారిత సేవలను వేగవంతం చేయాలనే లక్ష్యం కలిగివున్న భారత ప్రభుత్వ వికసిత భారత్ దార్శనికతతో ఇది ముడిపడింది.
విశాఖపట్నంలోని గూగుల్ ఏఐ హబ్ ప్రత్యేకంగా నిర్మించే డేటా సెంటర్ క్యాంపస్ను కలిగి ఉంటుంది. ఇది భారత్ అంతటా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ సేవల డిమాండ్ను తీర్చడంలో సహాయపడటానికి గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యాన్ని జోడిస్తుంది. అదానీ కోనెక్స్, ఎయిర్టెల్ వంటి భాగస్వామ్యులతో కలసి దీనిని అభివృద్ధి చేస్తున్నారు. గూగుల్ సర్చ్, వర్క్స్పేస్, యూట్యూబ్ వంటి గూగుల్ ఉత్పత్తులకు శక్తినిచ్చే అత్యాధునిక మౌలిక సదుపాయాలతో దీనిని నిర్మిస్తారు.
వ్యాపారాలు, సంస్థలు తమ సొంత ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించడానికి, వాటిని విస్తరించడానికి అవసరమైన అధిక పనితీరు, ఆలస్యం లేని సేవలను కూడా ఈ ఏఐ హబ్అందిస్తుంది. ఇది పరిశోధన, అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. అంతిమంగా ఏఐ ఆధారిత భవిష్యత్తులో భారత్ ప్రపంచ నాయకత్వ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది మేక్ మై ట్రిప్, మీషో, టీసీఎస్ వంటి పెద్ద సంస్థలతో పాటు, కొరోవర్, గ్లాన్స్, ఇన్వీడియో ఏఐ, సర్వం వంటి సంస్థలకే కాకుండా, ఇతర భారతీయ ఏఐ స్టార్టప్లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.
కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఈ కొత్త డేటా సెంటర్ క్యాంపస్ ఇప్పటికే 12 దేశాలలో విస్తరించి ఉన్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ల నెట్వర్క్లో చేరుతుంది. బెంగళూరు, హైదరాబాద్, పుణెలలోని గూగుల్ ఆర్ అండ్ డీ కేంద్రాలు అభివృద్ధి చేసిన సాంకేతికతతో, కీలకమైన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఆవిష్కరణల రూపకల్పన, అభివృద్ధి సహా అనేక ప్రయోజనాలను పొందుతుంది.
కొత్త అంతర్జాతీయ సబ్సీ గేట్వే
గూగుల్ ఏఐ హబ్ పెట్టుబడిలో భాగంగా, భారత తూర్పు తీరంలోని విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యేలా బహుళ అంతర్జాతీయ సముద్ర గర్భ కేబుల్స్తో కూడిన ఒక కొత్త అంతర్జాతీయ సబ్సీ గేట్వే నిర్మాణం కూడా ఉంది. ఇది గూగుల్ కు ఇప్పటికే ఉన్న రెండు మిలియన్ మైళ్ళకు పైగా భూగర్భ, సముద్రం అడుగున ఉన్న కేబుల్స్కు అనుసంధానమౌతుంది. ఇది విశాఖపట్నాన్ని భారతదేశానికి మాత్రమే కాకుండా, ప్రపంచం మొత్తానికి సేవలు అందించే ఏఐ, కనెక్టివిటీ హబ్గా ఉంచుతుంది.
ఈ గేట్వే దేశంలో పెరుగుతున్న డిజిటల్ డిమాండ్ను తీర్చడానికి, ఇప్పటికే ముంబై, చెన్నై ప్రాంతాలలో ఉన్న సబ్సీ కేబుల్ ల్యాండింగ్లకు అదనంగా రూట్ వైవిధ్యాన్ని అందించడానికి సహాయపడుతుంది. అధిక-సామర్థ్యం, తక్కువ ఆలస్యం గల ఈ కొత్త మార్గాలు గూగుల్ వినియోగదారులకు వేగవంతమైన అనుభవాలను అందిస్తాయి. ఇది భారతదేశ డిజిటల్ పునాదుల స్థిరత్వాన్ని, సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే, దేశవ్యాప్తంగా డిజిటల్ సమ్మిళితం, మార్పుకు దోహదం చేస్తూ, ఏఐ లాభాలను మరింతమంది ప్రజలకు, వ్యాపారాలకు అందిస్తుంది.
ఇంధన సామర్థ్యం, విద్యుత్ గ్రిడ్ సుస్థిరత బలోపేతం
గూగుల్ అత్యంత శక్తి సామర్ధ్యాలు కలిగిన డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. తన మౌలిక సదుపాయాలను బాధ్యతాయుతంగా పెంచడానికి కట్టుబడి ఉంది. భారతదేశంలో ఇప్పటికే ఉన్న గూగుల్ స్వచ్ఛమైన ఇంధన కార్యక్రమాలకు కొనసాగింపుగా, ఆంధ్రప్రదేశ్లో కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు, స్వచ్ఛమైన ఇంధన శక్తి ఉత్పత్తి, ఇంధన నిల్వ వ్యవస్థలను అందించడానికి కంపెనీ స్థానిక భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. ఈ చర్య భారత విద్యుత్ గ్రిడ్కు దోహదపడే స్వచ్ఛమైన ఇంధన సాంకేతికతల విభిన్న పోర్ట్ఫోలియోను విస్తరిస్తుంది.
***
(Release ID: 2179275)
Visitor Counter : 9