యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
22 పతకాలు, 10వ స్థానంతో మన పారా అథ్లెట్లు నవ భారత స్ఫూర్తిని నింపుకున్నారు: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మీరు పారా అథ్లెట్లు కాదు.. భారతదేశ పవర్ అథ్లెట్లు: కేంద్ర క్రీడా మంత్రి
మీరు వైకల్యాన్ని దృఢ సంకల్పంగా మార్చారు.. ధైర్యానికి ఇచ్చిన ఈ కొత్త నిర్వచనం
భవిష్యత్ తరాలకు స్ఫూర్తి: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
ఈ పతకాలు కేవలం లోహ ప్రతిరూపాలు కాదు.. మీ అచంచలమైన సంకల్పానికి ప్రతీకలు
సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు వీల్చైర్లు కూడా రెక్కలుగా మారగలవని మీరు నిరూపించారు: కేంద్ర మంత్రి
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో రికార్డు స్థాయి పతకాలు సాధించిన భారత్..
పారా అథ్లెట్లను సత్కరించిన కేంద్ర క్రీడా మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
Posted On:
11 OCT 2025 3:46PM by PIB Hyderabad
ఢిల్లీలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్-2025లో పతకాలు సాధించిన భారతదేశ క్రీడాకారుల బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు - క్రీడలు, కార్మిక - ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు సత్కరించారు. అసాధారణ స్ఫూర్తి, దృఢ సంకల్పంతో దేశం గర్వపడేలా రికార్డు స్థాయిలో పతాకాలు సాధించిన క్రీడకారులను ఆయన ప్రశంసించారు.
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ చరిత్రలో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన. రికార్డు స్థాయిలో 22 పతకాలతో (6 బంగారు, 9 రజత, 7 కాంస్య) పతాకాల పరంగా 10వ స్థానంలో నిలిచింది. యువజన వ్యవహారాలు- క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని క్రీడా శాఖ.. పారా అథ్లెట్లకు రూ. 1.09 కోట్లకు పైగా నగదు పురస్కారాలను అందజేసింది.
ఈ సందర్భంగా అథ్లెట్లను ఉద్దేశించి కేంద్ర మంత్రి డాక్టర్ మనుసుఖ్ మాండవీయ మాట్లాడారు. "మీరు పారా అథ్లెట్లు కాదు.. భారతదేశ పవర్ అథ్లెట్లు. పతకాలు సాధించిన మీరు దేశానికి గర్వకారణం. ముఖ్యంగా దివ్యాంగులకు మీరు ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన సందేశం గమనార్హం. మీరు చూపిన ఆసక్తి అపారమైనది" అని వ్యాఖ్యానించారు. క్రీడల్లో స్ఫూర్తి, ధృడత్వం చూపించినందుకు ఆయన క్రీడాకారులను ప్రశంసించారు. " ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ భారత్ దార్శనికత, స్ఫూర్తిని ఉత్తమ రీతిలో మీరు నిలబెట్టారు. ప్రధానమంత్రి మీ మ్యాచ్లను టీవీలో చూస్తున్నారు. మా సమావేశాల్లో మీ అందరి గురించి అడుగుతూ ఉండేవారు" అని కేంద్ర మంత్రి తెలిపారు.
ప్రపంచ స్థాయి పారా-క్రీడలను అత్యంత విజయవంతంగా నిర్వహించినందుకు అంతర్జాతీయంగా భారత్ ప్రశంసలు అందుకుంటోంది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ పోటీలు జరిగాయి. భారత్లో ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద పారా-క్రీడ కార్యక్రమం ఇదే. మొత్తం 186 పతకాలతో కూడిన క్రీడల్లో 100 దేశాలకు చెందిన 2,100 మందికి పైగా పోటీ పడ్డారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా మాట్లాడుతూ.. "క్రీడా మంత్రిత్వ శాఖ, భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఐ) మాకు ఒక కుటుంబంగా సహాయం చేశాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు డబ్ల్యూపీఏ.. క్రీడల చివరి రోజున మాకు ట్రోఫీని అందించింది. ఇలాంటి మరిన్ని క్రీడలను భవిష్యత్తులో ఇక్కడ నిర్వహించడం పట్ల సంతోషంగా ఉన్నట్లు వారు చెప్పారు. అథ్లెట్ల సదుపాయాల విషయంలో ప్రమాణాలు, క్రీడల సాంకేతిక నిర్వహణ అత్యున్నత స్థాయిలో ఉన్నాయని ఐపీసీ అధ్యక్షులు ఆండ్రూ పార్సన్స్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ అధ్యక్షుడు పాల్ ఫ్రిట్జెరాల్డ్ అన్నారు. పీసీఐ, ఎస్ఏఐ, మంత్రిత్వ శాఖల సమష్టి కృషి కారణంగా అంతర్జాతీయ సంస్థల నుంచి ఈ రకమైన ప్రశంసలు అందుతున్నాయి. పోటీలు జరిగిన ఏడు రోజుల్లోనే అథ్లెట్లకు నగదు అవార్డులను మంత్రి అందజేసారు. ఇది క్రీడలను మెరుగుపరిచేందుకు ఆయన చేసిన అద్భుతమైన కృషికి మరో నిదర్శనంగా ఉంది" అని ఝఝారియా అన్నారు.
ఛాంపియన్షిప్లకు కీలకంగా ఉపయోగపడిన జేఎల్ఎన్ స్డేడియంలోని మోండో ట్రాక్ను అథ్లెట్లంతా ఏకగ్రీవంగా మెచ్చుకున్నారు.
"మేమందరం మోండో ట్రాక్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాం. ఇది వార్మప్తో పాటు పోటీ జరిగే ప్రాంతం.. రెండింటిలోనూ ఉంది" అని సుమిత్ అంటిల్ అన్నారు. "దీనితో పాటు హోటళ్లు, రవాణా కూడా చాలా బాగుంది. స్థానిక వాలంటీర్లతో పాటు ఎస్ఏఐ, పీసీఐ కూడా మాకు చాలా సహాయపడ్డాయి" అని అన్నారు.
డబ్ల్యూపీఏసీ- 2025లో భారతదేశానికి తొలి స్వర్ణం సాధించిన శైలేష్ కుమార్ మాట్లాడుతూ.. "ఇది భారతదేశంలో చాలా పెద్ద క్రీడా కార్యక్రమం. మొదటి రోజు నేను భయపడ్డాను కానీ ఏర్పాట్లు బాగున్నాయి. ట్రాక్, సొంత స్డేడియం మద్దతు చాలా అనుకూలంగా ఉన్నాయి. మోండో ట్రాక్తో పాటు సమీపంలోని జిమ్, ఫిట్నెస్ సెంటర్ కూడా ఉపయోగకరంగా ఉన్నట్లు రుజువైంది" అని వ్యాఖ్యానించారు.
మెడికల్ కేంద్రం గురించి డబుల్ మెడలిస్ట్ ప్రీతి పాల్ ప్రస్తావించారు. "మా రేసుల మధ్య స్ప్రింటర్లకు కోలుకునేందుకు మెడికల్ రూమ్ మాకు చాలా సహాయపడింది. ముఖ్యంగా ఐస్ బాత్ నిజంగా ప్రయోజనకరంగా ఉంది" అని ఆమె అన్నారు.
పారా అథ్లెట్లు ప్రదర్శించిన మనో ధైర్యాన్ని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు. 'వైకల్యాన్ని దృఢ సంకల్పంగా' మార్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. " ధైర్యానికి ఇచ్చిన ఈ కొత్త నిర్వచనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. మీ విజయాల పట్ల దేశం మొత్తం గర్విస్తోంది. మీరు పతకాలు సాధించడమే కాకుండా మా హృదయాలను కూడా గెలుచుకున్నారు. సంకల్పం బలంగా ఉన్నప్పుడు వీల్చైర్లు కూడా రెక్కలుగా మారగలవని మీరు నిరూపించారు" అని ఆయన వ్యాఖ్యానించారు.
***
(Release ID: 2178057)
Visitor Counter : 10