ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
ఆత్మ నిర్భర భారత్ లక్ష్యానికున్న సామర్థ్యాన్ని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్,
టెలికాం రంగంలో దేశం సాధించిన విజయం ప్రతిబింబిస్తాయి: పీఎం
ఒకప్పుడు 2జీతో ఇబ్బంది పడిన దేశంలో ఇప్పుడు.. ప్రతి జిల్లాలోనూ 5జీ సేవలు: పీఎం
దేశీయంగా సాధించిన విజయమే మేడిన్ ఇండియా 4జీ స్టాక్...
ప్రపంచంలో ఈ సామర్థ్యం ఉన్న అయిదు దేశాల్లో భారత్ ఒకటి: పీఎం
మన దగ్గర ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికాం మార్కెట్,
రెండో అతిపెద్ద 5జీ మార్కెట్, శ్రామిక శక్తి, రవాణా, నాయకత్వ శక్తి ఉన్నాయి: పీఎం
భారత్లో డిజిటల్ అనుసంధానత ఇకపై విశేషమైనదో.. విలాస వస్తువో కాదు..
అది ప్రతి భారతీయుని జీవితంలో ఒక భాగం: పీఎం
భారత్లో పెట్టుబడులకు, ఆవిష్కరణలకు, తయారీకి ఇదే సరైన సమయం: పీఎం
అంతర్జాతీయంగా మొబైల్, టెలికాం, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ రంగాల్లో తలెత్తిన సమస్యలకు
భారత్ పరిష్కారాలను అందిస్తుంది: పీఎం
నాడు పోస్టు చేయడమైనది:
08 OCT 2025 12:40PM by PIB Hyderabad
ఆసియాలోనే అతిపెద్ద టెలికాం, మీడియా, టెక్నాలజీ కార్యక్రమమైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 9వ సంచికను న్యూఢిల్లీలోని యశోభూమిలో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రత్యేక ఎడిషన్కు ప్రతినిధులను ఆహ్వానిస్తూ.. ఆర్థిక మోసాల నివారణ, క్వాంటం కమ్యూనికేషన్, 6జీ, ఆప్టికల్ కమ్యూనికేషన్, సెమీకండక్టర్లు సహా ఇతర కీలకమైన అంశాలపై అనేక స్టార్టప్లు వినూత్న ఆలోచనలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయన్నారు. ముఖ్యమైన అంశాలపై ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలు భారత సాంకేతిక భవిష్యత్తు భద్రమైన చేతుల్లోనే ఉందనే నమ్మకాన్ని ఇస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు.
మొబైల్, టెలికాం పరిధిని అధిగమించి.. కొన్నేళ్లలోనే ఆసియాలోనే అతి పెద్ద డిజిటల్ టెక్నాలజీ ఫోరంగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆవిర్భవించిందని తెలియజేస్తూ.. ఈ విజయ గాథను ఎలా రాశారని, దాన్ని ఎవరు నడిపించారని ప్రశ్నించారు. దీనిని భారతీయ సాంకేతిక ఆలోచనలే రూపొందించాయని, ప్రతిభాశక్తితో నిండిన దేశ యువత దానిని ముందుకు నడిపించిందని వివరించారు.
దేశీయ సామర్థ్యానికి ప్రభుత్వం అందించిన బలమైన తోడ్పాటుతోనే ఈ వృద్ధి సాధ్యమైందని, దీనిని ఆవిష్కర్తలు, అంకుర సంస్థలు ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి అన్నారు. టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్, డిజిటల్ కమ్యూనికేషన్స్ ఇన్నోవేషన్స్ స్వేర్ లాంటి కార్యక్రమాల ద్వారా అంకుర సంస్థలకు నిధులు అందిస్తున్నామని వెల్లడించారు. ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి 5జీ, 6జీ సాంకేతికతలు, అత్యాధునిక ఆప్టికల్ కమ్యూనికేషన్లు, టెరాహెట్జ్ సాంకేతికతలను పరీక్షించే వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని ప్రధాని తెలియజేశారు. అంకుర సంస్థలు, ప్రముఖ పరిశోధనా సంస్థల మధ్య భాగస్వామ్యాల ఏర్పాటు సులభతరమైందని, ప్రభుత్వ సహకారంతో భారతీయ పరిశ్రమ, అంకుర సంస్థలు, విద్యాసంస్థలు వివిధ రంగాల్లో సహకారం కుదుర్చుకుంటున్నాయని తెలిపారు. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడం, విస్తరించడంలోనూ, పరిశోధనాభివృద్ధి ద్వారా మేధో సంపదను తయారు చేయడం, అంతర్జాతీయ ప్రమాణాలకు దోహదపడటం- ఇలా అన్ని కోణాల్లోనూ భారత్ పురోగమిస్తోందని ఆయన చెప్పారు. ఈ ప్రయత్నాలే అంతర్జాతీయ యవనికపై భారతదేశాన్ని సమర్థవంతమైన స్థానంలో నిలిపాయని వెల్లడించారు.
‘‘ఆత్మనిర్భర భారత్ దార్శనికత సామర్థ్యాన్ని టెలికాం రంగంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ సాధించిన విజయం ప్రతిబింబిస్తుంది’’ అని ప్రధాని చెప్పారు. సాంకేతికంగా అధునాతన ఉత్పత్తులను తయారు చేయడంలో భారత్ సామర్థ్యాన్ని సందేహించిన సంశయవాదులు ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను ఎలా హేళన చేశారో గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వాల హయాంలో కొత్త సాంకేతికతలను స్వీకరించడానికి దశాబ్దాల తరబడి జాప్యం చేశారని విమర్శించారు. దేశం నిర్ణయాత్మకంగా స్పందించిందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఒకప్పుడు 2జీ తో ఇబ్బందులు ఎదుర్కొన్న దేశంలో ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ 5జీ సేవలు అందుతున్నాయని, 2014 నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి ఆరు రెట్లు పెరిగిందని, మొబైల్ ఫోన్ల తయారీ 28 రెట్లు పెరిగిందని, అదే సమయంలో వాటి ఎగుమతులు 127 రెట్లు పెరిగాయని వెల్లడించారు. గడచిన దశాబ్దంలో మొబైల్ ఫోన్ల తయారీ రంగం మిలియన్ల సంఖ్యలో ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించింది. ఇటీవలే ఒక ప్రధాన స్మార్ట్ ఫోన్ సంస్థ విడుదల చేసిన సమాచారాన్ని ఉటంకిస్తూ.. ఈ తయారీ వ్యవస్థలో 45 భారతీయ సంస్థలున్నాయని, దాదాపుగా 3.5 లక్షల ఉద్యోగాలను ఒకే సంస్థ అందించిందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అనేక సంస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తిలో నిమగ్నమయ్యాయని, పరోక్ష ఉద్యోగాలను కూడా జోడిస్తే.. ఉపాధి గణాంకాలు మరింత పెరుగుతాయని ప్రధానమంత్రి తెలియజేశారు.
‘‘స్వదేశీ విజయంగా నిలిచిన మేడిన్ ఇండియా 4జీ స్టాక్ను భారత్ ఇటీవలే ప్రారభించింది. తద్వారా ఈ సామర్థ్యమున్న అయిదు దేశాల సరసన భారత్ చేరింది’’ అని శ్రీ మోదీ చెప్పారు. దీనిని డిజిటల్ స్వావలంబన, సాంకేతిక స్వాతంత్ర్యం దిశగా వేసిన కీలకమైన ముందడుగుగా అభివర్ణించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ, 5జీ స్టాక్ ద్వారా ఎలాంటి అవరోధాలు లేని అనుసంధానాన్ని నిర్దారిస్తూ.. హై స్పీడ్ ఇంటర్నెట్ను, నమ్మకమైన సేవలను తన పౌరులకు భారత్ అందిస్తోందని ఆయన తెలియజేశారు.
4జీ స్టాక్ను ప్రారంభించిన రోజున దేశవ్యాప్తంగా దాదాపుగా ఒక లక్ష 4జీ టవర్లు ఒకే సమయంలో పనిచేయడం ప్రారంభించి.. రెండు కోట్ల మంది ప్రజలను భారత డిజిటల్ ఉద్యమంలో భాగం చేశాయన్నారు. వీటిలో ఎక్కువ భాగం మారుమూల ప్రాంతాల్లోనూ.. గతంలో డిజిటల్ అనుసంధానం లేని చోటే ఉన్నాయని, ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.
భారత్లో తయారైన 4జీ స్టాక్లో మరో ప్రధాన అంశం - ఎగుమతుల సంసిద్ధత గురించి శ్రీ మోదీ ప్రస్తావించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ స్టాక్ భారతీయ వ్యాపార విస్తృతికి మాధ్యమంగా పనిచేస్తుందని, ‘ఇండియా 6జీ విజన్ 2030’ దిశగా తోడ్పాటు అందిస్తుందన్నారు.
గడచిన దశాబ్దంలో భారతీయ సాంకేతిక విప్లవం వేగంగా అభివృద్ధి చెందిందని, ఈ వేగాన్ని, స్థాయిని అందుకోవడానికి చట్టపరంగా బలమైన, ఆధునిక విధాన పునాది అవసరమైందని ప్రధానమంత్రి తెలియజేశారు. ముత్తాతల నాటి, కాలం చెల్లిన టెలిగ్రాఫ్ చట్టం, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం స్థానంలో ఆధునిక టెలీకమ్యూనికేషన్ల చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. 21వ శతాబ్దపు విధానాలకు అనుగుణంగా కొత్త నియమావళి ఉండాల్సిన వివరిస్తూ.. దానిని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిందని స్పష్టం చేశారు. కొత్త చట్టం.. నియంత్రణా వ్యవస్థగా కాకుండా.. ఆమోద ప్రక్రియను సులభతరం చేసే, అనుమతులను సత్వరమే జారీ చేసే సహాయకారిగా పనిచేస్తుందన్నారు. ఫలితంగా ఫైబర్, మొబైల్ నెట్వర్క్ విస్తరణ వేగంగా సాగుతోందని, వ్యాపార సౌలభ్యం విస్తరిస్తోందని, పెట్టబడులకు ప్రోత్సాహం లభిస్తోందని, పరిశ్రమలు దీర్ఘకాలికంగా ప్రణాళికలు రచించడానికి వీలవుతోందని శ్రీ మోదీ వెల్లడించారు.
దేశంలో సైబర్ భద్రతకు సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. సైబర్ మోసాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు చేశామని, జవాబుదారీతనాన్ని పెంచామని, సమస్యల పరిష్కార మార్గాలను మెరుగుపరిచామని చెప్పారు. దీనివల్ల పరిశ్రమలు, వినియోగదారులు లబ్ధిపొందుతున్నారని వెల్లడించారు.
భారత్ సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తిస్తుందని చెబుతూ, ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద టెలికాం మార్కెట్ గా, 5జీ మార్కెట్ గా భారత్ అవతరించిందని ప్రధానమంత్రి వెల్లడించారు. మార్కెట్ బలంతో పాటు మానవ వనరులు, పనిచేసే సామర్థ్యం, ప్రగతిశీల దృక్పథంతో భారత్ ఉందన్నారు. ఎక్కువ సంఖ్యలో, నైపుణ్యం కల మానవ వనరులు భారత్ లో ఉన్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా భారత్ లో ఉందని, ఈ తరానికి భారీ స్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారత్ లో అత్యంత వేగంగా సాఫ్ట్ వేర్ నిపుణుల సంఖ్య పెరుగుతోందని వ్యాఖ్యానించారు.
భారత్ లో ప్రస్తుతం ఒక కప్పు టీ ధర కంటే ఒక జీబీ వైర్ లెస్ డేటా ధర తక్కువగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వినియోగదారులవారీగా డేటా వినియోగంలో ముందున్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తుందని, డిజిటల్ కనెక్టివిటీ ఇకపై విలాస వస్తువేమీ కాదని, అది రోజువారీ జీవితంలో ఒక అవసరంగా మారిందని స్పష్టం చేశారు.
"పరిశ్రమలు, పెట్టుబడిని విస్తరించాన్న ఆలోచనతో భారత్ ముందుకు వెళ్తుంది" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రభుత్వాలు పెట్టుబడులను ఆహ్వానించే వైఖరి, సులభతర వాణిజ్య విధానాలు, భారత్ ను పెట్టుబడిదారులకు అనుకూల గమ్యస్థానంగా మార్చిందని తెలిపారు. ప్రభుత్వానికున్న డిజిటల్-ఫస్ట్ అనే విధానానికి నిదర్శనంగా భారత్ లోని డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు సాధించిన విజయాలను ప్రస్తావించారు. "భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు, నూతన ఆవిష్కరణలకు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే అత్యుత్తమ సమయం!" అని ప్రధానమంత్రి పూర్తి విశ్వాసంతో స్పష్టం చేశారు. తయారీ రంగం నుంచి సెమీ కండక్టర్లు, మొబైల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, అన్ని రంగాల్లో స్టార్టప్ లతో భారత్ లో అవకాశాలు, ఉత్సాహం పెరుగుతుందన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రస్తుత సంవత్సరాన్ని ప్రధాన సంస్కరణలు, పరివర్తనాత్మక మార్పుల ఏడాదిగా ప్రధానమంత్రి ప్రకటించారు. వేగంగా మారుతున్న సంస్కరణలతో పరిశ్రమలు, ఆవిష్కర్తల బాధ్యత కూడా పెరుగుతుందన్నారు. వేగం, సాహస సామర్థ్యాలతో సరికొత్త మార్గాలు, అవకాశాలను సృష్టిస్తున్న అంకుర సంస్థలు, యువ ఆవిష్కర్తల కీలక పాత్రను ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ 500కు పైగా అంకుర సంస్థలను ఆహ్వానించడం.. పెట్టుబడిదారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో అనుసంధానమయ్యే అవకాశాన్ని కల్పించటం పట్ల శ్రీ నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ రంగాన్ని విస్తరించేందుకు ఇప్పటికే స్థిరపడిన సంస్థలు ముఖ్య పాత్రను పోషిస్తున్నాయని, పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాల మద్దతులో దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపేందుకు ఈ సంస్థలు స్థిరత్వం, పరిమాణం, దిశను చూపిస్తున్నాయని తెలిపారు. స్టార్టప్ ల వేగం, స్థిరమైన సంస్థలు కలిసి పనిచేయటం ద్వారా భారత్ మరింత శక్తిమంతంగా మారుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
పరిశ్రమలోని అనేక కీలక రంగాల్లో యువ స్టార్టప్ ఆవిష్కర్తలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంఘం, విధాన రూపకర్తల నుంచి ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని చెబుతూ, అటువంటి చర్చలకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ వంటి వేదికలు సమర్థ ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మొబైల్, టెలికాం, ఎలక్ట్రానిక్స్, విస్తృత సాంకేతిక వ్యవస్థలో ప్రపంచ సరఫరా వ్యవస్థలోని అంతరాయాలపై దృష్టి సారించాలని, ప్రపంచంలో ఎక్కడ అడ్డంకులు ఉన్నా, పరిష్కారాలను అందించే అవకాశం భారత్ కు ఉందని ఆయన తెలిపారు. గతంలో సెమీ కండక్టర్ తయారీ సామర్థ్యం కొన్ని దేశాల్లోనే ఉండేదని, ప్రపంచం ఇప్పుడు వైవిధ్యాన్ని కోరుకుంటున్నదని శ్రీ నరేంద్ర మోదీ ఉదహరించారు. ఈ దిశగా భారత్ చర్యలు తీసుకుంటుందని, దేశవ్యాప్తంగా పది సెమీ కండక్టర్ తయారీ యూనిట్లలో పనులు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
పరిమాణం, విశ్వసనీయతను అందించగలిగే నమ్మకమైన భాగస్వామ్య గ్లోబల్ కంపెనీల కోసం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం చూస్తుందని ప్రధానమంత్రి అన్నారు. టెలికాం నెట్వర్క్ పరికరాల తయారీకి కూడా నమ్మకమైన భాగస్వాములు అవసరమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఒక బలమైన ప్రశ్నను సంధించారు... భారతీయ కంపెనీలు నమ్మదగిన ప్రపంచ సరఫరాదారులుగా, తయారీ భాగస్వాములుగా ఎందుకు మారలేవు?
మొబైల్ తయారీకి కావాల్సిన చిప్ సెట్లు, బ్యాటరీలు, డిస్ ప్లేలు, సెన్సార్ల వంటి విడిభాగాలు దేశంలోనే ఉత్పత్తి చేయాల్సిన అవసముందని శ్రీ మోదీ అన్నారు. గతంలో ఎన్నడూ లేనంత డేటాను ప్రపంచం ఉత్పత్తి చేస్తోందని, దీనివల్ల నిల్వ చేయటం, భద్రత, సార్వభౌమాధికారం వంటి అంశాలు కీలకమవుతాయని చెప్పారు. డేటా కేంద్రాలు, క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై పనిచేయటం ద్వారా ప్రపంచ డేటా కేంద్రంగా ఎదిగే సామర్థ్యం భారత్ కు ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. రాబోయే సెషన్లు కూడా అదే విధానాన్ని, లక్ష్యాన్ని కొనసాగిస్తాయని ఆశిస్తూ ప్రసంగాన్ని ముగించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింథియా, డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
టెలి కమ్యూనికేషన్ విభాగం (డీఓటీ), సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 అక్టోబర్ 8 నుంచి 11వ తేదీ వరకు జరుగుతుంది. "మార్పు కోసం ఆవిష్కరణ" అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం డిజిటల్ మార్పు, సామాజిక పురోగతికి ఆవిష్కరణలను వినియోగించుకోవాలనే భారతదేశ ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది.
టెలికాం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలోని తాజా పరిణామాలను ఐఎంసీ 2025 ప్రదర్శిస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రపంచ నాయకులు, విధాన రూపకర్తలు, పారిశ్రామిక రంగ నిపుణులు, ఆవిష్కర్తలు పాల్గొంటున్నారు. ఆప్టికల్ కమ్యూనికేషన్లు, టెలికాం రంగంలో సెమీ కండక్టర్లు, క్వాంటమ్ కమ్యూనికేషన్లు, 6జీ, ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్లు వంటి కీలక అంశాలపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. దీని ద్వారా భవిష్యత్ తరం కనెక్టివిటీ, డిజిటల్ సార్వభౌమాధికారం, సైబర్ మోసాల నియంత్రణ, ప్రపంచ సాంకేతిక నాయకత్వంలో భారత వ్యూహాత్మక ప్రాధాన్యతలను తెలియజేస్తుంది.
150కి పైగా దేశాల నుంచి 1.5 లక్షల మందికి పైగా సందర్శకులు, 7,000కు పైగా ప్రపంచ ప్రతినిధులు, 400లకు పైగా కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. 5G/6G, ఏఐ, స్మార్ట్ మొబిలిటీ, సైబర్ భద్రత, క్వాంటం కంప్యూటింగ్, గ్రీన్ టెక్నాలజీ వంటి రంగాల్లో 1,600కి పైగా నూతన వినియోగ పద్ధతులు 100కి పైగా సెషన్లలో 800కి పైగా వక్తల ద్వారా తెలియజేస్తారు.
ఈ కార్యక్రమంలో జపాన్, కెనడా, యూకే, రష్యా, ఐర్లాండ్, ఆస్ట్రియా ప్రతినిధుల బృందాలు పాల్గొనటం ద్వారా అంతర్జాతీయ సహకారాన్ని ఐఎంసీ 2025 స్పష్టం చేస్తుంది.
(రిలీజ్ ఐడి: 2176530)
సందర్శకుల సూచీ సంఖ్య : : 48
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam