|
ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్లోని రాజ్కోట్లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
25 FEB 2024 7:45PM by PIB Hyderabad
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
వేదికపై ఆసీనులైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మన్సుఖ్ మాండవీయ, భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షులు, పార్లమెంటులో నా సహచరులైన శ్రీ సి.ఆర్.పాటిల్, ఇతర ప్రముఖులతోపాటు రాజ్కోట్లోని నా సోదరీసోదరులందరికీ నమస్కారం!
వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు నేటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా మనతో మమేకమైన గౌరవనీయ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
జాతీయ స్థాయి కీలక కార్యక్రమాలన్నీ ఒకనాడు దేశ రాజధాని ఢిల్లీకే మాత్రమే పరిమితంగా ఉండేవి. అయితే, రాజ్కోట్లో నేటి కార్యక్రమం సహా కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలను వికేంద్రీకరించి, దేశం నలుమూలలకూ తీసుకొచ్చాను. అనేక నగరాల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన వేడుకను ఏకకాలంలో నిర్వహించే ఓ కొత్త సంప్రదాయాన్ని ఈ కార్యక్రమం సూచిస్తుంది. కొన్ని రోజుల కిందట నేను జమ్మూకాశ్మీర్లో పర్యటించాను... జమ్మూ నుంచి ఏకకాలంలో “భిలాయ్, తిరుపతి నగరాల్లో ‘ఐఐటీ’లు; కర్నూల్లో ఐఐఐటీ; బోధ్గయ, జమ్మూ, విశాఖపట్నం నగరాల్లో ‘ఐఐఎం’లు; కాన్పూర్లో ఐఐఎస్” వంటి వివిధ విద్యా ప్రాంగణాలను ప్రారంభించాను. అదే తరహాలో నేడు ఇక్కడి నుంచి రాజ్కోట్, రాయ్బరేలీ, మంగళగిరి, భటిండా, కల్యాణి నగరాల్లో ‘అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థల (ఏఐఐఎంఎస్-ఎయిమ్స్)ను ఒకేసారి ప్రారంభించాను. సమగ్రాభివృద్ధి సహా దేశం శరవేగంగా పురోగమించడంపై మా నిబద్ధతను ఇవన్నీ ప్రతిబింబిస్తాయి.
మిత్రులారా!
నేనివాళ రాజ్కోట్కు వచ్చిన సందర్భంగా ఇక్కడి చాలా జ్ఞాపకాలు మదిలో మెదలుతున్నాయి. నిన్నటి రోజు నా జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. నా రాజకీయ ప్రయాణంలో 22 ఏళ్ల కిందట ఫిబ్రవరి 24న ఈ నగరం నన్ను తొలిసారి శాసనసభకు తన ప్రతినిధి (ఎమ్మెల్యే)గా పంపింది. రాజ్కోట్ ప్రజల ఆశీర్వాదంతో మరునాడు.. అంటే- ఫిబ్రవరి 25న నేను గాంధీనగర్లోని శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాను. ఈ నగర ప్రజల అవ్యాజానురాగం, నమ్మకాలకు నేనెంతో రుణపడి ఉన్నాను. ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత శక్తివంచన లేకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేశానని సగర్వంగా చెప్పగలను.
యావద్దేశం ఇప్పుడు నాపై అపార ప్రేమాభిమానాలు కురిపిస్తూ ఆశీర్వదిస్తోంది. నాకు లభిస్తున్న ఈ గుర్తింపులో రాజ్కోట్ నగరానికీ సముచిత భాగం ఉంది. ఈ సందర్భంగా- ‘అబ్ కీ బార్ 400 పార్’పై అపూర్వ విశ్వాసంతో ‘ఎన్డీఏ’ ప్రభుత్వం వరుసగా మూడోసారి దేశవ్యాప్త ఆమోదం పొందిన నేపథ్యంలో రాజ్కోట్లోని ప్రతి ఒక్కరికీ సవినయంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తరాలు మారవచ్చుగానీ, వయసుతో నిమిత్తం లేకుండా మోదీపై అభిమానం వెల్లువెత్తుతుందని స్పష్టమవుతోంది. ఈ అవధులెరుగని ప్రేమను నేనొక రుణంగా పరిగణిస్తూ- అందరి ప్రగతికీ కృషి చేయడం ద్వారా దాన్ని వడ్డీతో చెల్లించే ప్రయత్నం చేస్తాను.
మిత్రులారా!
ఇక్కడకు రావడంలో ఆలస్యమైనందుకు, నాకోసం వేచి ఉండేలా చేసినందుకు మీకందరికీ, వివిధ రాష్ట్రాల గౌరవనీయ ముఖ్యమంత్రులకు, పౌరులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. అయితే, నేను ద్వారకకు వెళ్లడమే ఈ జాప్యానికి కారణం. అక్కడ ద్వారకాధీశుని ఆశీస్సులు కోరుతూ ప్రార్థించి, ద్వారక-బేట్ ద్వారకలను కలిపే సుదర్శన్ వంతెనను ప్రారంభించాను. ద్వారకకు సేవ చేయడంలో ఈ సందర్శన నాకు తోడ్పడటమేగాక ప్రగాఢ ఆధ్యాత్మిక అనుభవాన్నిచ్చింది. శ్రీ కృష్ణుడు స్వయంగా నిర్మించినదిగా చరిత్ర చెబుతున్న ద్వారక, ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసింది. ఆ ప్రాచీన నగర అవశేషాలను నీటి అడుగున చూడగలగటం, నివాళి అర్పించడం, శ్రీ కృష్ణుడి ఆరాధనలో కొద్దిసేపు తాదాత్మ్యం చెందడం ఈ రోజు నాకు లభించిన దివ్యానుభూతి. నా ఈ చిరకాల ఆకాంక్ష చివరకు ఇలా నెరవేరింది. ప్రాచీన గ్రంథాలు, పురావస్తు ఆవిష్కరణల ద్వారా ద్వారక గురించి తెలుసుకోవడం నన్ను సదా విస్మయానికి గురిచేస్తుంది. సముద్ర గర్భంలో కలిసిన ఆ పవిత్ర ప్రదేశాలను స్పర్శించిన క్షణంలో నాలో భావోద్వేగం రగిలింది. కృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలతోపాటు నెమలి ఈకలను కూడా సమర్పించాను. నేను సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తున్నపుడు సుసంపన్న భారతీయ వారసత్వం, దాని అద్భుత పురోగమనం గురించి ఆలోచించాను. సముద్రం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత శ్రీకృష్ణుని ఆశీర్వాదాలను మాత్రమేగాక ద్వారక నుంచి పావన స్ఫూర్తిని కూడా నాతో తెచ్చాను. వారసత్వ పరిరక్షణతోపాటు అభివృద్ధిపై నా నిబద్ధతకు నేడు పునరుత్తేజం లభించింది. వికసిత భారత్ రూపకల్పన సంకల్పానికి పవిత్ర విశ్వాసం తోడైంది.
మిత్రులారా!
ఈ రోజున రూ.48 వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడాన్ని మీతోపాటు యావద్దేశం చూసింది. గుజరాత్ నుంచి హర్యానాలోని చమురుశుద్ధి కర్మాగారానికి నేరుగా ముడి చమురు సరఫరా కోసం ముంద్రా-పానిపట్ కొత్త పైప్లైన్ ప్రాజెక్టుకు పునాది వేశాం. దీంతోపాటు రాజ్కోట్ సహా సౌరాష్ట్ర ప్రాంతమంతటికీ అనేక సౌకర్యాలు విస్తరించాయి. వీటిలో రహదారులు, వంతెనలు, రైలుమార్గాల డబ్లింగ్, విద్యుత్తు, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల ప్రాజెక్టులున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం తర్వాత రాజ్కోట్ ఇప్పుడు ‘ఎయిమ్స్’ను సొంతం చేసుకోవడం ఓ కీలక ఘట్టం. రాజ్కోట్, సౌరాష్ట్ర సహా గుజరాత్లో ఇవాళ ‘ఎయిమ్స్’ ప్రారంభమయ్యే ప్రాంతాల ప్రజలందరికీ ఈ సందర్భంగా నా శుభాభినందనలు.
మిత్రులారా!
రాజ్కోట్, గుజరాత్లకు మాత్రమేగాక దేశం మొత్తానికీ ఈ రోజు ఒక చారిత్రక సంఘటనను సూచిస్తుంది. వికసిత భారత్లో ఆరోగ్య సంరక్షణకు ఓ నిర్దిష్ట ప్రమాణంతో ప్రపంచ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఆరోగ్య రంగం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చిన 50 ఏళ్ల తర్వాత కూడా ఢిల్లీలో మాత్రమే… అదీ ఒకేఒక ‘ఎయిమ్స్’ ఉండేది. మరికొన్నిటి నిర్మాణానికి అనుమతులు, ఆమోదాలు ఉన్నప్పటికీ అవి అసంపూర్ణంగా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో కేవలం గత పది రోజుల్లోనే, 7 కొత్త ‘ఎయిమ్స్’కు మేం శంకుస్థాపన చేశాం. కాబట్టే, గడచిన 6-7 దశాబ్దాల కాలంతో పోలిస్తే అనేక రెట్లు వేగంగా మేం దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రజల సంక్షేమానికి నిబద్ధతతో ఉన్నామని నేను చెప్పగలను. ఇదే సందర్భంలో 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 200కుపైగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవం చేశాం. వీటిలో తీవ్ర అనారోగ్యానికి చికిత్స చేసే వైద్య కళాశాలలు, ప్రధాన ఆసుపత్రుల ఉప కేంద్రాలు కూడా ఉన్నాయి.
మిత్రులారా!
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్లనే మోదీ హామీపై దేశంలో విశ్వాసం ఇనుమడించింది. ‘ఎయిమ్స్’ ఆస్పత్రుల ప్రారంభమే ఇందుకు తిరుగులేని నిదర్శనం. రాజ్కోట్లో తొలి ‘ఎయిమ్స్’ ఏర్పాటుపై ఇచ్చిన హామీ మేరకు మూడేళ్ల కిందట పునాది రాయి వేశాను. ఇప్పుడు దాన్ని ప్రారంభించడం ద్వారా నా వాగ్దానం నెరవేర్చాను. పంజాబ్ రాష్ట్రానికీ ఇదే హామీ ప్రకారం శంకుస్థాపన చేయగా, ఇప్పుడు భటిండాలో ‘ఎయిమ్స్’ను ప్రారంభించి మీ ‘సేవకుడు’ తన మాట నిలబెట్టుకున్నాడు. అదేవిధంగా ఐదేళ్ల కిందటి హామీని నెరవేరుస్తూ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీలో ‘ఎయిమ్స్’ను ప్రారంభించాను. కాంగ్రెస్ రాజ కుటుంబం రాయబరేలీలో రాజకీయాల్లో మునిగితేలితే, మోదీ వాస్తవంగా చేయాల్సిన పనులు చేశాడు. మరోవైపు పశ్చిమ బెంగాల్లోని కల్యాణి, ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో కూడా ‘ఎయిమ్స్’ను ప్రారంభించి, మా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం. కొద్ది రోజుల కిందట… ఫిబ్రవరి 16న హర్యానాలోని రేవారీలో ‘ఎయిమ్స్’కు శంకుస్థాపన చేసి, మరో హామీ నెరవేర్చాను. మొత్తంమీద గత దశాబ్ద కాలంలో మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా 10 కొత్త ‘ఎయిమ్స్’ నిర్మాణానికి ఆమోదం ఇవ్వడం ద్వారా ఆధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాన్ని ప్రజలకు చేరువ చేసింది. వివిధ రాష్ట్రాల ప్రజలు ‘ఎయిమ్స్’ కోసం ఏళ్ల తరబడి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ విసిగిపోయారు. అయితే, నేడు ‘ఎయిమ్స్’ వంటి అనేక ఆధునిక ఆసుపత్రులతోపాటు వైద్య కళాశాలలు వరుసగా ప్రారంభం అవుతున్నాయి. ఇతరులు ఎక్కడ విఫలమయ్యారో, అక్కడ మోదీ హామీ నెరవేరుతుందనే రికార్డును ఈ ప్రగతి పునరుద్ఘాటిస్తుంది.
మిత్రులారా!
కరోనా మహమ్మారిపై పోరులో భారత్ విజయం సాధించడం ఇవాళ ప్రపంచవ్యాప్త చర్చనీయాంశంగా ఉంది. గత దశాబ్దంలో దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రగతిశీల పరిణామమే ఈ విజయానికి కారణమని చెప్పవచ్చు. ఈ కాలంలోనే ‘ఎయిమ్స్’తోపాటు వైద్య కళాశాలలు, అత్యవసర వైద్య మౌలిక సదుపాయాలు అసాధారణ రీతిలో విస్తరించాయి. సాధారణ వ్యాధులకు చికిత్స కోసం ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’ పేరిట ప్రతి గ్రామంలో ఒకటి వంతున 1.5 లక్షలకుపైగా కేంద్రాలను ఏర్పాటు చేశాం. దశాబ్దం కిందటితో పోలిస్తే ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు గణనీయంగా పెరిగాయి. పదేళ్లకు ముందు దేశంలో వైద్య కళాశాలల సంఖ్య సుమారు 380-390 కాగా, ఇవాళ 706కు పెరిగింది. అలాగే ఎంబీబీఎస్ సీట్లు సుమారు 50 వేల నుంచి 1 లక్షకుపైగా పెరిగాయి. అదేవిధంగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య సీట్లు సుమారు 30 వేల నుంచి 70 వేలకుపైగా పెరిగాయి. ప్రస్తుత అదనపు సదుపాయాల ఫలితంగా కొన్నేళ్లలోనే కొత్త డాక్టర్ల సంఖ్య స్వాతంత్ర్యం తర్వాత 70 ఏళ్లలో వైద్య కళాశాలల నుంచి వచ్చిన యువ వైద్యుల సంఖ్యను మించిపోగలదు. వీటన్నిటితోపాటు దేశవ్యాప్తంగా రూ.64 వేల కోట్లతో ‘ఆయుష్మాన్ భారత్ మౌలిక సదుపాయాల కార్యక్రమం’ ఇప్పుడు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ అనేక వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, క్షయ చికిత్స కోసం పరిశోధన కేంద్రాలు, ‘పీజీఐ’ ఉప కేంద్రాలు, అత్యవసర చికిత్స విభాగాలు సహా అనేక ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశాం. అంతేగాక ఆయా రాష్ట్రాలకు ‘ఇఎస్ఐసీ’ ఆస్పత్రులను అప్పగించాం.
మిత్రులారా!
దేశవ్యాప్తంగా వ్యాధి నివారణ-నిరోధక సామర్థ్యాలను పెంచడంపైనా మా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా సంప్రదాయ, ఆధునిక వైద్య విధానాలు రెండింటినీ ప్రోత్సహిస్తున్నాం. పోషకాహారం, యోగా-ఆయుష్, పరిశుభ్రత వంటి రోగ నివారణ అంశాలకు ప్రాధాన్యమిచ్చాం. ఈ దిశగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో యోగా, ప్రకృతి వైద్యం కోసం రెండు ప్రత్యేక ఆస్పత్రి-పరిశోధన కేంద్రాలను ప్రారంభించాం. ఇక సంప్రదాయ వైద్య విధానాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుజరాత్లో అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
మిత్రులారా!
దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలకు పొదుపు సొమ్ము కోల్పోకుండా మెరుగైన ఆరోగ్య సంరక్షణ లభించేలా మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. దీంతో ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ద్వారా పేదలకు రూ.లక్ష కోట్ల దాకా ఆదా అయింది. జనౌషధి కేంద్రాల ద్వారా దాదాపు 80 శాతం తగ్గింపు ధరతో నాణ్యమైన మందులు కూడా లభిస్తున్నందున పేదలు-మధ్యతరగతి వారికి మరో రూ.30 వేల కోట్ల వ్యయం తగ్గింది. ఈ విధంగా ప్రభుత్వం ప్రాణరక్షణకు చేయూతనివ్వడమే కాకుండా వారిపై ఆర్థిక భారాన్ని కూడా తగ్గించింది. ఇక ఉజ్వల యోజన కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు రూ.70 వేల కోట్లకుపైగా ఆదా అయింది. మా ప్రభుత్వం చౌకధరతో డేటాను అందించడం వల్ల మొబైల్ వినియోగదారులకు ప్రతి నెలా దాదాపు రూ.4000 ఆదా అవుతోంది. అలాగే పన్ను సంస్కరణలతో చెల్లింపుదారులకు దాదాపు రూ.2.5 లక్షల కోట్లు ఆదా అయ్యాయి.
మిత్రులారా!
భవిష్యత్తులో పేద, మధ్యతరగతి కుటుంబాల పొదుపును మరింత పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం మరొక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' కింద ఇంట్లో విద్యుదుత్పత్తి ద్వారా బిల్లులు సున్నా స్థాయికి తగ్గడంతోపాటు గృహాలకు ఆదాయం కూడా సమకూరుతుంది. ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రజలందరికీ పొదుపు, ఆదాయార్జనలో తోడ్పడాలన్నది మా ధ్యేయం. ఈ పథకం కింద లబ్ధిదారులకు 300 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్తు లభిస్తుంది. దీనికి మించి ఉత్పత్తయ్యే విద్యుత్తును ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
మిత్రులారా!
ప్రతి కుటుంబానికి సాధికారత ద్వారా సౌర విద్యుదుత్పత్తిదారుగా మార్చేందుకు మేం కృషి చేస్తున్నాం. దీంతోపాటు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇవాళ కచ్లో 2 సౌర, ఒక పవన విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. తద్వారా గుజరాత్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యం మరింత ఇనుమడిస్తుంది.
మిత్రులారా!
స్వయంసమృధ్ధ భారత్ను సాకారం చేయడంలో రాజ్కోట్లోని మన వ్యవస్థాపకులు, కార్మికులు, చేతివృత్తులవారు కీలక పాత్ర పోషించగలరు. మునుపటి పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైన వీరిలో అధికశాతానికి మోదీ పాలనలో తొలిసారి గుర్తింపు, చేయూత లభిస్తున్నాయి. దేశ చరిత్రలో మొదటిసారి మన విశ్వకర్మ మిత్రుల కోసం జాతీయ స్థాయిలో రూ.13వేల కోట్లతో ‘ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం’ రూపొందించాం. దీనికింద ఇప్పటిదాకా లక్షలాది మంది నమోదైన నేపథ్యంలో వారందరికీ రూ.15,000 వంతున ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ పథకం పరిధిలో నిర్వహించే కార్యక్రమాల ద్వారా నైపుణ్యం పెంచుకుని, వృత్తులు-వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం వారికి లభిస్తుంది. ఈ మేరకు ఒక్క గుజరాత్లోనే 20 వేల మందికిపైగా శిక్షణ పొందారు.
మిత్రులారా!
రాజ్కోట్లో సోనార్ (స్వర్ణకార) సమాజం పాత్ర ఎంత కీలకమైనదో మీకందరికీ తెలుసు... ఈ వృత్తిలో ఉన్నవారు కూడా విశ్వకర్మ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారు.
మిత్రులారా!
దేశంలోని వీధి వ్యాపారులకు చేయూత కోసం తొలిసారి ‘పీఎం స్వానిధి’ పథకం ప్రవేశపెట్టాం. దీనికింద ఇప్పటిదాకా సుమారు రూ.10 వేల కోట్ల మేర వారికి ఆర్థిక సహాయం అందించగా, గుజరాత్లోని వీధి వ్యాపారులు రూ.800 కోట్లదాకా లబ్ధిపొందారు. ఒక్క రాజ్కోట్లోనే 30 వేలకుపైగా రుణాలు వారికి పంపిణీ అయ్యాయి. గతంలో అణచివేతకు గురైన వీధి వ్యాపారులు ఇప్పుడు బీజేపీ హయాంలో ఆత్మగౌరవంతో జీవిస్తుండటం గమనార్హం.
మిత్రులారా!
దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలకు సాధికారత కల్పన ద్వారా వికసిత భారత్ సంకల్పం మరింత బలోపేతం అవుతుంది. భారత్ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దాలని మోదీ ప్రతినబూనిన నేపథ్యంలో ఆరోగ్యం-శ్రేయస్సుపై అందరికీ భరోసా ఇవ్వాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నాడు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ దిశగా మా నిబద్ధతను మరింత పటిష్ఠం చేస్తాయి. ఈ ఆకాంక్షతోనే విమానాశ్రయంలో మాకు మీ నుంచి సాదర స్వాగతం లభించింది. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు చాలామంది పాత సహచరులను పలకరించే అవకాశం లభించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా రాజ్కోట్లోని బీజేపీ సహచరులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఇటువంటి విశిష్ట కార్యక్రమాలతోపాటు వికసిత భారత్ సంకల్ప సాకారం కోసం మనమంతా సమష్టిగా ముందడుగు వేద్దాం. మీకందరికీ మరోసారి నా అభినందనలు. చివరగా, దేశం నలుమూలలకూ వినిపించేలా మీరందరూ నాతో గొంతు కలపండి:
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
అనేకానేక ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.
****
(रिलीज़ आईडी: 2171110)
|