ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్లోని తారాభ్లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
22 FEB 2024 4:27PM by PIB Hyderabad
జై వాలినాథ్! జై-జై వాలినాథ్!
పరంబా హింగ్లాజ్ మాతాజీ కీ- జై! హింగ్లాజ్ మాతాజీ కీ – జై!
భగవాన్ శ్రీ దత్తాత్రేయ కీ – జై! భగవాన్ శ్రీ దత్తాత్రేయ కీ – జై!
మీరంతా ఎలా ఉన్నారు? నేను ఈ గ్రామంలోని పాత సన్యాసులను చూశాను.. నాటి సహచరులను కూడా కలిశాను. వాలినాథ్ ఒక పండుగ స్ఫూర్తిని అందించారు. నేను గతంలో చాలాసార్లు వాలినాథ్కు వచ్చాను. కానీ నేటి వైభవం ప్రత్యేకంగా ఉంది. ప్రపంచంలో ఎంత సాదర స్వాగతం, గౌరవం లభించినప్పటికీ.. ఇంట్లో ఉన్నప్పుడు కలిగే ఆనందం ప్రత్యేకమైనది. ఈ రోజు గ్రామస్తుల్లో నాకు ఏదో ప్రత్యేకత కనిపించింది. నేను మా బాబాయి ఇంటికి వచ్చినప్పుడు కలిగిన ఆనందం కూడా ప్రత్యేకమైనది. నేను చూసిన వాతావరణం ఆధారంగా భక్తీ, విశ్వాసంతో మునిగిపోయిన భక్తులందరినీ నేను స్వాగతిస్తున్నాను. ఇది ఎంత యాదృచ్చికమో చూడండి! ఒక నెల కిందట అంటే జనవరి 22న నేను అయోధ్యలో రాముడి పాదాల చెంత ఉన్నాను. అక్కడ నాకు రాముడి చరిత్రాత్మక ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం లభించింది. తరువాత అబుదాబిలో ఫిబ్రవరి 14న వసంత పంచమి రోజున గల్ఫ్ దేశాల్లో మొదటి హిందూ దేవాలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశమూ నాకు లభించింది. రెండు-మూడు రోజుల క్రిందట ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో కల్కి ధామ్కు శంకుస్థాపన చేసే అవకాశమూ నాకు లభించింది. ఈ రోజు తారాభ్లోని ఈ అద్భుతమైన, దివ్యమైన ఆలయంలో ప్రతిష్ఠానంతర పూజా కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది.
మిత్రులారా,
దేశానికీ, ప్రపంచానికీ వాలినాథ్ శివధామ్ ఒక తీర్థయాత్ర స్థలం. కానీ రబారీ సమాజానికి ఇది 'గురుస్థానం'. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న రబారీ సమాజానికి చెందిన భక్తులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలూ నాకు కనిపిస్తున్నారు. మీ అందరికీ నా అభినందనలు.
మిత్రులారా,
భారత అభివృద్ధి ప్రయాణంలో ఇది ఒక అమృత కాలం. దైవిక పనులు.. దేశపు పనులు రెండూ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయం ఇది. దేవతల సేవ.. దేశ సేవ రెండూ కొనసాగుతున్నాయి. ఒక వైపు ఈ పవిత్ర కార్యం సాకారమవుతుండగా.. మరోవైపు 13,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలూ జరిగాయి. రైల్వేలు, రహదారులు, నౌకాశ్రయ రవాణా, నీరు, జాతీయ భద్రత, పట్టణాభివృద్ధి, పర్యాటకం వంటి అనేక రంగాల్లోని ముఖ్యమైన అభివృద్ధి పనులతో ఈ ప్రాజెక్టులు ముడిపడి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయి.. ఈ ప్రాంత యువతకు ఉపాధి, స్వయం ఉపాధి కోసం కొత్త అవకాశాలను సృష్టిస్తాయి.
నా కుటుంబ సభ్యులారా,
ఈ రోజు ఈ పవిత్ర భూమిపై నాకు ఒక దైవిక శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ శక్తి వేల సంవత్సరాలుగా ప్రవహిస్తున్న ఆధ్యాత్మిక చైతన్యంతో మనల్ని కలుపుతుంది. ఈ శక్తి శ్రీకృష్ణుడు, శివుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ శక్తి మొదటి గధిపతి మహంత్ వీరం-గిరి బాపు జీ ప్రారంభించిన ప్రయాణంతో కూడా మనల్ని కలుపుతుంది. నేను గధిపతి పూజ్య జయరాం గిరి బాపును కూడా సగౌరవంగా అభినందిస్తున్నాను. మీరు గధిపతి మహంత్ బలదేవ్ గిరి బాపు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లి దానిని సాకారం చేశారు. నాకు బలదేవ్ గిరి బాపుతో దాదాపు 3-4 దశాబ్దాలుగా అనుబంధం ఉందని మీలో చాలా మందికి తెలుసు. నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారిని అనేకసార్లు నా నివాసానికి స్వాగతించే అవకాశం నాకు లభించింది. దాదాపు 100 సంవత్సరాలుగా ఆయన మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొలిపి.. 2021లో మనల్ని విడిచి వెళ్లిన సమయంలోనూ నేను ఫోన్ ద్వారా నా భావాలను వ్యక్తపరిచాను. కానీ ఈ రోజు ఆయన కల నెరవేరడం చూసినప్పుడు నా మనసు ఇలా చెబుతోంది.. ఆయన ఈ రోజు ఎక్కడ ఉన్నా సంతోషంతో ఈ విజయాన్ని చూసి మనల్ని ఆశీర్వదిస్తారు. వందల సంవత్సరాల ఈ పురాతన ఆలయం ఇప్పుడు 21వ శతాబ్దపు వైభవం, పురాతన దైవత్వంతో నిర్మితమైంది. సంవత్సరాలుగా వందలాది మంది కళాకారులు, కార్మికుల అవిశ్రాంత కృషి ఫలితమే ఈ ఆలయం. ఈ కృషి కారణంగానే నేడు వాలినాథ్ మహాదేవ్, పరంబా శ్రీ హింగ్లాజ్ మాతాజీ, భగవాన్ దత్తాత్రేయ ఈ అద్భుతమైన ఆలయంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్న నా సహోద్యోగులందరికీ నేను నమస్కరిస్తున్నాను.
సోదరీ సోదరులారా,
మన దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు కాదు.. ఆచారాలకు నిలయాలు మాత్రమే కాదు.. ఇవి వేల సంవత్సరాల నాటి మన ప్రాచీన సంస్కృతీ, సంప్రదాయాల చిహ్నాలు. మన దేశంలోని దేవాలయాలు జ్ఞానం, విజ్ఞానశాస్త్ర కేంద్రాలుగా పనిచేస్తాయి.. దేశాన్నీ, సమాజాన్నీ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తాయి. శివ ధామ్ శ్రీ వాలినాథ్ అఖాడ ఈ పవిత్రమైన విద్య, సామాజిక సంస్కరణ సంప్రదాయాన్ని నమ్మకంగా ముందుకు తీసుకెళ్లింది. నేను పూజ్య బలదేవ్ గిరి మహారాజ్ జీతో మాట్లాడినప్పుడల్లా.. ఆయన ఆధ్యాత్మిక, ఆలయ విషయాల కంటే సమాజంలోని పిల్లల విద్యపై ఎక్కువ శ్రద్ధ చూపేవారని నాకు బాగా గుర్తుంది. పుస్తక ప్రదర్శనల నిర్వహణతో ప్రజల్లో అవగాహన పెరిగింది. పాఠశాలలు, వసతి గృహాల నిర్మాణం విద్యా స్థాయిని మెరుగుపరిచింది. నేడు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వందలాది మంది విద్యార్థులకు వసతి, లైబ్రరీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దైవిక సేవ, దేశ సేవ కలయికకు ఇంతకంటే మెరుగైన ఉదాహరణ ఇంకేముంటుంది? అటువంటి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు రబారీ సమాజం ప్రశంసలకు అర్హమైనది. దురదృష్టవశాత్తూ రబారీ సమాజానికి చాలా తక్కువ ప్రశంసలు దక్కాయి.
సోదరీ సోదరులారా,
నేడు దేశం 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' మంత్రంతో ముందుకు సాగుతోంది. ఈ మంత్రం స్ఫూర్తి మన దేశంలో ఎలా పాతుకుపోయిందో వాలినాథ్ ధామ్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు ఒక రబారీ గొర్రెల కాపరి సోదరుడిని తన అభివ్యక్తికి ఒక సాధనంగా చేసిన ప్రదేశం ఇది. ఇక్కడ పూజల బాధ్యత రబారీ సమాజానికి చెందినదే అయినా ఆ బాధ్యత యావత్ సమాజానిదీ అవుతుంది. సాధువుల అదే భావనతో మా ప్రభుత్వం సమాజంలోని ప్రతి వర్గం, తరగతి వారి జీవితాల్లోని ప్రతి అంశాన్ని మెరుగుపరచడానికి కట్టుబడి ఉంది. సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న పౌరుల జీవితాలను మార్చడమే మోదీ హామీ లక్ష్యం. అందువల్ల దేశంలో దేవాలయాలు నిర్మిస్తున్న సమయంలోనే.. లక్షలాది పక్కా ఇళ్ళు కూడా పేదల కోసం నిర్మిస్తున్నాం. కొద్ది రోజుల కిందట గుజరాత్లో పేదల కోసం 1.25 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి, పునాది రాయి వేసే అవకాశం నాకు లభించింది. ఈ పేద కుటుంబాల ఆశీర్వాదాలను ఊహించుకోండి! నేడు దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్ పొందుతున్నారు.. తద్వారా పేదింటి పొయ్యి కూడా మండుతూనే ఉంటుంది. ఒక విధంగా ఇది దేవుడిచ్చిన 'ప్రసాదం' (కానుక). నేడు దేశంలో 10 కోట్ల కొత్త కుటుంబాలు తొలిసారిగా కుళాయిల ద్వారా నీటిని పొందుతున్నాయి. నీటి కోసం చాలా దూరం వెళ్ళాల్సిన పేద కుటుంబాలకు ఇది 'అమృతం' కంటే తక్కువ కాదు. మన ఉత్తర గుజరాత్ ప్రజలు నీటి కోసం ఎంత ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. వారు రెండు నుంచి మూడు కిలోమీటర్లు తలపై కుండలు మోసుకెళ్లాల్సి వచ్చేది. నేను సుజలాం-సుఫలాం పథకాన్ని ప్రారంభించినప్పుడు.. ఉత్తర గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా "సార్, మీరు చేసిన పనిని ఎవరూ చేయలేరు. 100 సంవత్సరాలైనా దీనిని ప్రజలు మర్చిపోరు" అని నాతో చెప్పేవారు. దానికి సాక్షులు కూడా ఇక్కడ ఉన్నారు.
మిత్రులారా,
గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధితో పాటు, గుజరాత్లోని వారసత్వ ప్రదేశాల గొప్పతనాన్ని పెంపొందించడానికి కూడా మేం కృషి చేశాం. దురదృష్టవశాత్తూ స్వతంత్ర భారతంలో అభివృద్ధి, వారసత్వం మధ్య చాలా కాలం పాటు చీలిక ఏర్పడింది. దీనికి దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీనే కారణం. సోమనాథ్ వంటి పవిత్ర స్థలాలనూ వివాదాస్పదం చేసింది వారే. పావగఢ్లో ఆధ్యాత్మిక పతాకాన్ని ఎగురవేసేందుకూ వారు ఆసక్తి చూపలేదు. దశాబ్దాలుగా మోధేరాలోని సూర్య దేవాలయాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకున్నది వారే. శ్రీరాముడి ఉనికి గురించి ప్రశ్నలు లేవనెత్తి.. ఆయన ఆలయ నిర్మాణాన్ని అడ్డుకున్నది వారే. రాముడి జన్మస్థలంలో అద్భుతమైన ఆలయ నిర్మాణం పూర్తయి యావత్ దేశం ఆనందిస్తున్నప్పుడు కూడా వారు ద్వేష మార్గాన్ని వీడటం లేదు.
సోదరీ సోదరులారా,
ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా ఆ దేశపు వారసత్వ పరిరక్షణ చాలా ముఖ్యం. గుజరాత్లో కూడా భారత ప్రాచీన నాగరికతకు సంబంధించిన అనేక చిహ్నాలు ఉన్నాయి. ఈ చిహ్నాలు చరిత్రను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలను వారి మూలాలతో అనుసంధానించడానికి ముఖ్యమైనవి. ఈ చిహ్నాలను సంరక్షించడానికి, వాటిని ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఇప్పుడు వడ్నగర్లో తవ్వకాల ద్వారా చరిత్రలోని కొత్త అంశాలు ఎలా ఉద్భవిస్తున్నాయో పరిశీలించండి. 2800 సంవత్సరాల క్రితం ప్రజలు నివసించిన పురాతన స్థావరం జాడలు గత నెలలోనే ఇక్కడ కనుగొన్నారు. అదేవిధంగా ధోలావీరాలోనూ ప్రాచీన భారత దివ్య దృశ్యాలను మనం చూశాం. ఇది భారత గర్వం. మన సుసంపన్న వారసత్వం మనకు గర్వకారణం.
మిత్రులారా,
నేడు నవ భారతంలో జరుగుతున్న ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాలకు ఒక వారసత్వాన్ని సృష్టించే లక్ష్యం గలది. కొత్తగా నిర్మితమవుతున్న ఆధునిక రహదారులు, రైల్వే ట్రాక్లు 'వికసిత్ భారత్' కోసం సరైన మార్గాలు. నేడు మెహ్సానా రైల్వే కనెక్టివిటీ బలోపేతమైంది. రైల్వే లైన్ల రెట్టింపుతో బనస్కాంత, పటాన్ల నుంచి కాండ్లా, ట్యూనా, ముంద్రా ఓడరేవులకు కనెక్టివిటీ మెరుగైంది. ఇది కొత్త రైళ్లను నడిపేందుకు వీలు కల్పించింది.. సరుకు రవాణా రైళ్లకు సౌకర్యాలను కూడా అందించింది. నేడు దీసా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రన్వే కూడా ప్రారంభమైంది. ఈ వైమానిక దళ స్టేషన్ రన్వేలను కలిగి ఉండటమే కాకుండా భవిష్యత్తులో భారత్ భద్రతకు ముఖ్య కేంద్రంగా కూడా మారుతుంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్ట్ కోసం భారత ప్రభుత్వానికి అనేక లేఖలు రాశాను.. అనేక ప్రయత్నాలూ చేశాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ ప్రదేశం భారత్ భద్రతకు చాలా ముఖ్యమైనదని వైమానిక దళం అధికారులు చెప్పినా వారు ఏమీ చేయలేదు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నా ఫైళ్లను పక్కన పెట్టేసింది. నేను ఈ రన్వేకు ఒకటిన్నర సంవత్సరాల క్రితం పునాది రాయి వేశాను. మోదీ ఇచ్చిన వాగ్దానాలను కచ్చితంగా నెరవేరుస్తాడు. ఈరోజు దీసాలో రన్వే ప్రారంభోత్సవమే దానికి రుజువు. మోదీ హామీ ఇలా ఉంటుంది.
మిత్రులారా,
20-25 సంవత్సరాల కిందట ఉత్తర గుజరాత్లో అవకాశాలు చాలా పరిమితంగా ఉండేవి. అప్పట్లో రైతులకు పొలాల్లో నీరు లేదు.. పశువుల పెంపకందారులకూ చాలా సవాళ్లు ఎదురయ్యాయి.. పారిశ్రామికీకరణ పరిధి కూడా చాలా పరిమితంగా ఉండేది. నేడు బీజేపీ ప్రభుత్వంలో పరిస్థితి నిరంతరం మారుతోంది. ఇక్కడి రైతులు సంవత్సరానికి 2-3 పంటలు పండించడం ప్రారంభించారు. మొత్తం ప్రాంతంలో భూగర్భజల మట్టం కూడా పెరిగింది. నీటి సరఫరా, నీటి వనరులకు సంబంధించిన 8 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కార్యక్రమం జరిగింది. ఈ ప్రాజెక్టులపై రూ. 1500 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు. ఇది ఉత్తర గుజరాత్ నీటి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఉత్తర గుజరాత్ రైతులు బిందు సేద్యం వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించిన విధానం అద్భుతం. రసాయనాలు వాడకుండా సేంద్రీయ వ్యవసాయం చేసే ధోరణి పెరగడమూ నేను ఇక్కడ చూస్తున్నాను. మీ ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం పట్ల రైతుల ఉత్సాహాన్ని పెంచుతాయి.
సోదరీ సోదరులారా,
మనమంతా కలిసి మన వారసత్వాన్ని కాపాడుకుంటూ అభివృద్ధిని కొనసాగిద్దాం. ఈ దివ్యమైన అనుభవంలో నన్ను భాగస్వామిని చేసినందుకు మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ చాలా ధన్యవాదాలు! నాతో పాటు మీరూ చెప్పండి --
భారత్ మాతా కీ- జై!
భారత్ మాతా కీ- జై!
భారత్ మాతా కీ- జై!
ధన్యవాదాలు!
గమనిక: ఇది ప్రధానమంత్రి గుజరాతీ ప్రసంగానికి అనువాదం.
***
(Release ID: 2168844)
Visitor Counter : 6
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam