రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జీఎస్టీ హేతుబద్ధీకరణతో రోడ్డు రవాణా, వాహన రంగానికి భారీ ఊతం
అందుబాటు ధరల్లో వాహనాలు: ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులపై 18 శాతానికి.. ట్రాక్టర్లపై 5 శాతానికి తగ్గిన జీఎస్టీ
వాహన రంగానికి కలిగే ప్రయోజనాల వల్ల రవాణా వ్యవస్థ
ధృడంగా తయారవటంతో పాటు మరింత వృద్ధి చెందనున్న ఎంఎస్ఎంఈలు
Posted On:
12 SEP 2025 1:00PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక- కార్పొరేట్ వ్యవహారాల మంత్రి అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రోడ్డు రవాణా, వాహన రంగానికి సంబంధించిన జీఎస్టీ హేతుబద్ధీకరణకు ఆమోదం లభించింది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, బస్సులు, వాణిజ్య వాహనాలు, వాహన విడి భాగాలు పన్ను భారం నుంచి ఉపశమనం పొందాయి.
వాహన ధరలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు, పట్టణ- గ్రామీణ ప్రాంతాల్లో డిమాండును పెంచేందుకు ఈ పన్ను సంస్కరణలు ఉపయోగపడనున్నాయి. వాహనాలకు సంబంధించిన సరఫరా వ్యవస్థలో ఉన్న ఎంఎస్ఎస్ఈలను బలోపేతం చేయటంతో పాటు ఉపాధిని సృష్టిస్తుంది. మరింత సమర్థవంతమైన స్వచ్ఛ రవాణాను ఇది ప్రోత్సహించనుంది. పన్నులను సరళీకృతం చేయడం, స్థిరీకరించడం వల్ల తయారీ రంగంలో పోటీతత్వం పెరగనుంది. రైతులు, రవాణా రంగంలో ఉన్న నిర్వాహకులకు ఇది మద్దతునిస్తుంది. భారత్లో తయారీ, పీఎం గతి శక్తి వంటి జాతీయ కార్యక్రమాలను బలోపేతం చేయనుంది.
వాహన రంగంలో వృద్ధికి చోదక శక్తి
వాహనాలు, ఆటో విడిభాగాలపై జీఎస్టీ తగ్గించటాన్ని ఒక పరివర్తనాత్మక చర్యగా చెప్పుకోవచ్చు. దీనివల్ల తయారీదారులు, అనుబంధ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, రైతులు, రవాణా సంస్థల నిర్వాహకులు, అధికారిక-అనధికారిక రంగాలలోని లక్షలాది మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది.
సానుకూల ప్రభావాలు:
* తగ్గనున్న ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, ట్రాక్టర్లు, బస్సుల, ట్రక్కుల ధరలు.
* తయారీ, అమ్మకాలు, రవాణా, సేవలలో ఉద్యోగ కల్పనకు దారితీయనున్న అధిక డిమాండ్
* ఎన్బీఎఫ్సీ, బ్యాంకులు, ఫిన్టెక్ల ద్వారా క్రెడిట్ ఆధారిత వాహన కొనుగోళ్లకు ఊతం
* భారత్లో తయారీకి మరింత ప్రోత్సహం, మెరుగైన పోటీతత్వం, స్వచ్ఛ రవాణా
విభాగాల వారీగా జీఎస్టీ రేట్లలో మార్పులు
వాహనాల విభాగం
|
పాత జీఎస్టీ రేటు
|
కొత్త జీఎస్టీ రేటు
|
కీలక ప్రయోజనాలు
|
ద్విచక్ర వాహనాలు (350 సీసీ కంటే తక్కువ)
|
28 శాతం
|
18 శాతం
|
యువత, గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు, గిగ్ వర్కర్లకు మరింత అందుబాటు ధరల్లో రవాణా
|
చిన్న కార్లు
|
28 శాతం
|
18 శాతం
|
మొదటిసారి కొనుగోలు చేసేవారిని ప్రోత్సహిస్తుంది. చిన్న పట్టణాలలో అమ్మకాలను పెంచనుంది.
|
పెద్ద కార్లు
|
28 శాతంతో పాటు సెస్
|
40 శాతం
|
సరళీకృతమైన పన్నులు, ఐటీసీకి పూర్తి అర్హత, కొనుగోలు చేయాలనుకునే వారికి అందుబాటు ధరల్లో కార్ల లభ్యత
|
ట్రాక్టర్లు ( 1800 సీసీ కంటే తక్కువ)
|
12 శాతం
|
5 శాతం
|
ప్రపంచ ట్రాక్టర్ల కేంద్రంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది. వ్యవసాయ యాంత్రీకరణను పెంచనుంది.
|
బస్సులు (10 కంటే ఎక్కువ సీట్లు)
|
28 శాతం
|
18 శాతం
|
అందుబాటు ధరల్లో ప్రజా రవాణా.. వాహనాలను పెంచుకోవటాన్ని ప్రోత్సహిస్తుంది.
|
వస్తు రవాణాకు సంబంధించిన వాణిజ్య వాహనాలు
|
28 శాతం
|
18 శాతం
|
తగ్గనున్న సరుకు రవాణా ఖర్చు, ద్రవ్యోల్బణ ఒత్తిడిలో తగ్గుదల, ధృడమైన సరఫరా గొలుసు.
|
వాహన విడి భాగాలు
|
28 శాతం
|
18 శాతం
|
అనుబంధ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తుంది. దేశీయ తయారీని పెంచుతుంది.
|
వస్తు రవాణా బీమా
|
12 శాతం
|
5 శాతం (ఐటీసీతో పాటు)
|
సరుకు రవాణాకు మద్దతునిస్తుంది. రవాణాదారులకు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది.
|
వాహన రంగం అంతటా ప్రయోజనాలు
1. ఉపాధి, ఎంఎస్ఎంఈలు
* వాహన, దాని అనుబంధ రంగాలలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలకు మద్దతునిస్తుంది.
* టైర్లు, బ్యాటరీలు, గ్లాసు, ఉక్కు, ప్లాస్టిక్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చిన్న వ్యాపారాలను ఎన్నో రెట్లు పెంచే విధంగా ప్రభావం చూపించనుంది.
* డ్రైవర్లు, మెకానిక్లు, గిగ్ వర్కర్లు, సర్వీస్ ప్రొవైడర్లకు మరిన్ని అవకాశాలను అందిచనుంది.
2. స్వచ్ఛ, సురక్షితమైన రవాణా
* పాత, కాలుష్యాన్ని పెంచే వాహనాల స్థానంలో ఇంధనంపరంగా సమర్థవంతమైన వాహనాలను ఉపయోగించేందుకు ప్రోత్సహిస్తుంది.
* బస్సులు, ప్రజా రవాణాను వాడేందుకు ప్రోత్సహిస్తుంది. దీనితో పాటు రద్దీ, ఉద్గారాలను తగ్గిస్తుంది.
3. రవాణా, ఎగుమతులకు ప్రోత్సాహం
* తగ్గిన సరుకు రవాణా ధరలతో వ్యవసాయం, ఎఫ్ఎంసీజీ, ఈ-కామర్స్, పారిశ్రామిక సరఫరా గొలుసులను బలోపేతం కానున్నాయి.
* పీఎం గతి శక్తి, జాతీయ రవాణా(లాజిస్టిక్స్) విధానం కింద ఎగుమతుల విషయంలో భారతదేశ పోటీతత్వాన్ని మెరుగుపరుస్తుంది.
అందుబాటు ధరల్లో సమర్థవంతమైన, సుస్థిరమైన రవాణాను అందించే దిశగా సాగుతున్న భారతదేశ ప్రయాణంలో జీఎస్టీ హేతుబద్ధీకరణ ఒక కీలకమైన ఘట్టంగా నిలుస్తోంది. వాహనాలు, విడి భాగాలపై పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. వాహన రంగానికి సంబంధించిన వ్యవస్థను బలోపేతం చేయనుంది. ఎంఎస్ఎంఈలకు మద్దతుివ్వటంతో పాటు పట్టణ-గ్రామీణ భారతదేశంలో ఉపాధిని పెంచనుంది.
2025 సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చే జీఎస్టీ సంస్కరణలు.. ప్రజలకు జీవన సౌలభ్యాన్ని, సంస్థలకు వ్యాపార సౌలభ్యాన్ని అందించటంతో పాటు సరళమైన, పారదర్శకతో కూడిన వృద్ధి ఆధారిత జీఎస్టీ చట్రం ఉండాలన్న భారత్ నిబద్ధతను మరోసారి తెలియజేస్తున్నాయి.
***
(Release ID: 2166168)
Visitor Counter : 2