వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఆగస్టు 7న ఎం.ఎస్. స్వామినాథన్ శతజయంతి అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
నిపుణులు, విధాన నిర్ణేతలు, ప్రముఖులందరినీ ఒక్కచోటకు చేర్చనున్న సదస్సు: ‘సతత హరిత విప్లవం’ సూత్రాన్ని ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
05 AUG 2025 4:55PM by PIB Hyderabad
వ్యవసాయ శాస్త్రంలో మహోన్నతుడు, ఆహార భద్రతకు మార్గదర్శకుడు ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ శతజయంతి సందర్భంగా.. ఎం.ఎస్. స్వామినాథన్ పరిశోధన సంస్థ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) ఆగస్టు 7 నుంచి 9 వరకు న్యూఢిల్లీలో ‘ఎం.ఎస్. స్వామినాథన్ శతజయంతి అంతర్జాతీయ సదస్సు’ను నిర్వహిస్తోంది. వ్యవసాయం- రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత వ్యవసాయ పరిశోధన మండలి, జాతీయ వ్యవసాయ శాస్త్రాల అకాడమీ సహకారంతో ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ‘‘సతత హరిత విప్లవం -జైవిక ఆనందానికి రహదారి (ఎవర్గ్రీన్ రివల్యూషన్ – ది పాత్ వే టు బయో హ్యాపీనెస్)’’ అంశాన్ని ఇతివృత్తంగా నిర్ణయించారు. సుస్థిర, సమాన అభివృద్ధి దిశగా ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ అందించిన జీవితకాల సేవలను ఈ సదస్సులో స్మరించుకుంటారు.
ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో డీఏఆర్ఈ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.ఎల్. జాట్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఆహార కొరత నుంచి ఆహార మిగులు దేశంగా భారత్ను నిలపడంలో ప్రొఫెసర్ స్వామినాథన్ ఎనలేని కృషి చేశారని ఆయన కొనియాడారు. “ప్రొఫెసర్ స్వామినాథన్ భారత ధీర పుత్రుడు. ఆయన విప్లవాత్మక నిర్దేశకత్వం దేశ వ్యవసాయ రంగం గతిని మార్చేసింది” అని ఆయన అన్నారు. ఈ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ.. భారతీయ వ్యవసాయానికి భవిష్యత్ ప్రణాళికను రూపొందించడం ద్వారా ప్రొఫెసర్ స్వామినాథన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు లక్ష్యమని డాక్టర్ జాట్ తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. దిగ్గజ శాస్త్రవేత్త గౌరవార్థం భారత ప్రభుత్వం జారీ చేసిన స్మారక నాణెం, స్టాంపును విడుదల చేస్తారు.
ఈ సదస్సు అంతర్జాతీయ ప్రాధాన్యాన్ని, ప్రపంచవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయం భవితను నిర్దేశిచడంలో దీని పాత్రను ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ చైర్పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వివరించారు. ఐసీఏఆర్-ఐఏఆర్ఐ సంయుక్త సంచాలకుడు (పరిశోధన) డాక్టర్ సి. విశ్వనాథన్ మాట్లాడుతూ.. భారతీయ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తేవడం ద్వారా ప్రొఫెసర్ స్వామినాథన్ చరిత్మాత్మకమైన కృషి చేశారన్నారు. ఆకలితో ఉన్నవారికి ఆహారమే దైవమనీ, ఆ విధంగా ప్రొఫెసర్ స్వామినాథన్ లక్షలాది మంది ప్రజలకు ఆయన దేవుడేనని జాతీయ వ్యవసాయ విజ్ఞాన శాస్త్రాల అకాడమీ (ఎన్ఏఏఎస్) కార్యదర్శి డాక్టర్ అశోక్ సింగ్ వ్యాఖ్యానించారు.
‘సతతహరిత విప్లవం’ సూత్రాలను ముందుకు తీసుకెళ్లడంలో.. శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, ఈ రంగంలో నిపుణులు, ప్రముఖులందరికీ అంతర్జాతీయ వేదికగా ఈ సదస్సు ఉపయోగపడుతుంది.
‘జీవవైవిధ్య పరిరక్షణ, సహజ వనరుల సుస్థిర వినియోగం’, ‘ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే, పోషకాహార సమృద్ధ వ్యవసాయం’, ‘సమ్మిళిత - సాంకేతికత ఆధారిత జీవనోపాధి మార్గాలు’, ‘అభివృద్ధిలో యువత, మహిళలు, సామాజిక భాగస్వామ్యం’ అన్నవి ఈ కార్యక్రమంలో ముఖ్యమైన ఇతివృత్తాలు. సతత హరిత విప్లవ సూత్రాలను ముందుకు తీసుకెళ్లేలా నిపుణులు, విధాన రూపకర్తలు, ఆ రంగంలో ప్రముఖులందరినీ ఈ అంతర్జాతీయ వేదిక ఒక్కచోటకు చేరుస్తుంది.
ప్రొఫెసర్ స్వామినాథన్ దార్శనిక దృక్పథాన్ని చాటే వేడుక ఇది. అందరూ ఆనందంగా ఉండే కాలం దిశగా... సుస్థిరమైన, సమానమైన, ఆకలి లేని ప్రపంచాన్ని సాకారం చేసుకోవాలన్న సమష్టి సంకల్పాన్ని ఈ సదస్సు పునరుద్ఘాటిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2152836)
సందర్శకుల సూచీ సంఖ్య : : 26