హోం మంత్రిత్వ శాఖ
మాదకద్రవ్య ముఠాలు ఎక్కడి నుంచి పనిచేస్తున్నా.. వాటిని నిర్మూలించి దేశ యువతను రక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
* అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠా గుట్టు రట్టు చేసిన ఎన్సీబీ, ఇతర సంస్థలకు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అభినందనలు
* వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయానికి ఉదాహరణగా నిలిచిన ఈ దర్యాప్తులో 8 మంది అరెస్టు, 5 పార్శిళ్ల స్వాధీనం: 4 ఖండాలు, 10 దేశాల్లో విస్తరించిన ఈ ముఠాపై అమెరికా, ఆస్ట్రేలియాల్లో చర్యలు
* టెలిగ్రాం, క్రిప్టో కరెన్సీ చెల్లింపులు, అజ్ఞాత డ్రాప్ షిప్పర్లను ఉపయోగించిన డ్రగ్ సిండికేట్
Posted On:
02 JUL 2025 5:34PM by PIB Hyderabad
అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాను చేధించిన ఎన్సీబీతో సహా ఇతర సంస్థలను కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా అభినందించారు. డ్రగ్ ముఠాలు ఎక్కడి నుంచి పనిచేస్తున్నా వాటిని నిర్మూటించి దేశ యువతను రక్షించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
‘‘అంతర్జాతీయ డ్రగ్ ముఠా గుట్టును రట్టు చేసిన ఎన్సీబీ, ఇతర ఏజెన్సీలకు శుభాకాంక్షలు. వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయానికి గొప్ప ఉదాహరణగా నిలిచిన ఈ దర్యాప్తులో 8 మందిని అరెస్టు చేశారు. 5 ప్యాకేజీలుగా ఉన్న సరుకును స్వాధీనం చేసుకున్నారు. 4 ఖండాలు,10కి పైగా దేశాల్లో విస్తరించిన ఈ ముఠాపై అమెరికా, ఆస్ట్రేలియాలో చర్యలు తీసుకున్నారు. క్రిప్టో చెల్లింపులు, అజ్ఞాత డ్రాప్ షిప్పర్లు వంటి ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్న ఈ ముఠాల కదలికలపై ఏజెన్సీలు నిఘా ఉంచాయి. మాదకద్రవ్య ముఠా ఎక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నా సరే దాన్ని నిర్మూలించడానికి, యువతను రక్షించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఆపరేషన్ - మెడ్ మ్యాక్స్
మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు చేపట్టిన సుదీర్ఘ ప్రయత్నాల్లో ఇది ఒకటి. దీనిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ప్రధాన కార్యాలయంలోని కార్యకలాపాల విభాగం అంతర్జాతీయంగా మాదక ద్రవ్యాలను రవాణా చేసే ముఠాను నిర్వీర్యం చేసింది. ఈ ముఠా రహస్య సందేశ మాధ్యమాలను, డ్రాప్ షిప్పింగ్ విధానాలను, క్రిప్టో కరెన్సీని ఉపయోగించి నియంత్రిత ఔషధాలను నాలుగు ఖండాల్లో అక్రమంగా రవాణా చేస్తోంది. ఈ రహస్య దాడి న్యూఢిల్లీలోని బెంగాలీ మార్కెట్ దగ్గరలో సాధారణంగా చేపట్టే వాహన తనిఖీలతో ప్రారంభమైంది. ఈ చర్య భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపాల్లో విస్తరించిన అధునాతన నేర వ్యవస్థను బయటపెట్టింది. అలాగే ప్రపంచమంతా విస్తరించిన చట్ట విరుద్ధమైన ఫార్మా వ్యవస్థ పరిధిని, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ చర్యలను చేపట్టడంలో ఎన్సీబీ సామర్థ్యాన్ని కూడా తెలియజేసింది. 4 ఖండాలు, 10 కి పైగా దేశాల్లో విస్తరించిన అక్రమ మాదక ద్రవ్యాల వ్యవస్థ గుట్టును రట్టు చేసింది.
దర్యాప్తు క్రమం: ఢిల్లీ నుంచి అలబామా వరకు
ఇంటిలిజెన్స్ నుంచి అందుకున్న సమాచారం ఆధారంగా 2025, మే 25న ఎన్సీబీ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక బృందం ఢిల్లీలోని మండీ హౌస్ వద్ద ఒక కారును తనిఖీ చేసింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తుల నుంచి 3.7 కిలోల ట్రామడోల్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరూ నోయిడాలోని ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో బీఫార్మా పూర్తి చేశారు.
ప్రముఖ భారతీయ బీ2బీ వేదికలో విక్రేత ప్రొఫైల్ నిర్వహిస్తున్నట్లుగా అరెస్టయిన వ్యక్తులు అంగీకరించారు. అక్కడి నుంచి అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాల్లో ఔషధ మాత్రలను అమ్ముతున్నట్లు వెల్లడించారు. విచారణలో సేకరించిన ఆధారాలు రూర్కీలో సరకు నిల్వ చేసే వ్యక్తి వద్దకు దారి తీశాయి. తర్వాత ఢిల్లీలోని మయూర్ విహార్లో ఓ కీలకమైన వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు అమెరికాకు పెద్ద మొత్తంలో ఆర్డర్లను పంపించే ఉడుపి (కర్ణాటక)కు చెందిన వ్యక్తితో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించాడు.
50 అంతర్జాతీయ రవాణా సరకునకు సంబంధించిన డేటాను ఉడిపిలో ఎన్సీబీ రికవర్ చేసింది: వాటిలో
-
అమెరికా నుంచి అమెరికాకు 29 ప్యాకేజీలు
-
ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియాకు 18
-
ఎస్టోనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్కు ఒక్కొక్కటి చొప్పున
పైన పేర్కొన్న సమాచారాన్ని అంతర్జాతీయ సంస్థలు, ఇంటర్పోల్తో పంచుకున్నారు. తద్వారా అమెరికాలోని అలబామాలో పెద్దమొత్తంలో నింయంత్రిత ఔషధాలతో సహా బల్క్ రీషిప్పింగ్, మనీ లాండరింగ్ చేస్తున్న వ్యక్తిని గుర్తించి యూఎస్ డీఈఏ అరెస్టు చేసింది.
గోప్యత కోసం అంతర్గత వ్యవస్థ నిర్మాణం
టెలిగ్రామ్ లాంటి ఎన్క్రిప్టెడ్ సమాచార వేదికలను ఉపయోగించుకుని ఈ సిండికేట్ పనిచేస్తోంది. గుర్తింపు తెలియకుండా ఉండటానికి క్రిప్టో కరెన్సీ చెల్లింపులు, పేపాల్, వెస్ట్రన్ యూనియన్, అజ్ఞాత డ్రాప్ షిప్పర్లపై ఆధారపడ్డారు. డిజిటల్ ఫోరెన్సిక్ దర్యాప్తులో న్యూఢిల్లీ, జైపూర్ నుంచి మరో ఇద్దరు భారత జాతీయులను అరెస్టు చేశారు. వీరు రవాణా, సరఫరా కార్యకలాపాలను నిర్వహిస్తారు. వీరు తమ స్వదేశాల్లో ఎప్పుడూ రవాణా చేయలేదు. చట్టపరమైన పరిణామాలను తప్పించుకోవడానికి ఇతర డ్రాప్ షిప్పర్లను ఉపయోగించుకున్నారు.
అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక కార్యకలాపాలను సమన్వయం చేసే ప్రధాన సూత్రధారి యూఏఈలో ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయంలో యూఏఈ అధికారుల సహకారంతో ఎన్సీబీ చురుగ్గా పనిచేస్తోంది.
ఆస్ట్రేలియాలో అక్రమ కర్మాగారంతో సంబంధాలు
ఆస్ట్రేలియాలో రహస్య మాత్రల తయారీ కేంద్రం ఉన్నట్టు విచారణల్లో తేలింది. దీనికి ఈ సిండికేట్తో నేరుగా సంబంధాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని భద్రతా సంస్థలు ఈ యూనిట్ను విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఇతర ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.
అమెరికాలో చర్యలు
భారత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పంచుకున్న నిఘా సమాచారం ఆధారంగా యునైటెడ్ స్టేట్స్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ డీఈఏ) అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా వ్యవస్థలో కీలకమైన వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. సమన్వయ ఆపరేషన్లో భాగంగా అలబామాలో ప్రధాన రీషిప్పర్ అయిన జోయల్ హాల్ను అరెస్టు చేశారు. నియంత్రిత ఔషధాలకు సంబంధించి 17,000కు పైగా మాత్రలను సీజ్ చేశారు.
ఈ ఆపరేషన్ సమయంలో సిండికేట్తో సంబంధాలున్న వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లు, పార్సిల్ సేవలను అధికారులు గుర్తించారు. అలాగే అక్రమ రవాణాకు ఆధునికమైన సాంకేతిక విధానాలను అనుసరిస్తున్నారని తేలింది. ఈ డిజిటల్ ఆస్తులు, పార్సిళ్లకు సంబంధించిన దర్యాప్తు, ఇతర చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి.
ఈ మనీలాండరింగ్ వ్యవస్థలో ఓ భారతీయ అమెరికన్ కీలకంగా వ్యవహరించిన భారతీయ అమెరికన్పై ఇప్పుడు అమెరికాలో చట్టపరమైన విచారణను ఎదుర్కొంటున్నాడు. ఇది ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించిన మూలాధారాన్ని ధ్వంసం చేసిన కీలకమైన చర్య.
అదే సమయంలో అమెరికా డీఈఏ అయిదు పార్సిళ్లను విజయవంతంగా అడ్డుకుంది. తద్వారా సుమారుగా 700 గ్రాములు జోల్పిడెం మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని మత్తు పదార్థంగా దుర్వినియోగం చేస్తున్నారు.
ఆపరేషన్ విధానం: ఆధునిక విధానాలు అనుసరిస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టు
ఈ ముఠా ప్రధాన సూత్రధారి యూఏఈ నుంచి ఈ మాదకద్రవ్యాలను ఈ అంతర్జాతీయ అక్రమ రవాణాను నిర్వహిస్తున్నాడని దర్యాప్తులో తేలింది. ఆర్డర్లు, సరఫరా వ్యవస్థలను అత్యంత గోప్యంగా నడుపుతున్నాడు.
ప్రధాన బీ2బీ వేదిక ద్వారా ఈ ఆర్డర్ల వ్యవస్థ పనిచేసింది. ఈ వేదికలో తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, కొనుగోలుదారులను ఆకర్షించడానికి ప్రీమియం విక్రేతల కేటగిరీలో హ్యాండ్లర్లు నమోదు చేసుకున్నారు. ఉడుపిలో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ అమ్మకాలకు సంబంధించిన సమాచారాన్ని నిర్వహిస్తుంది. ఇక్కడ 10 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో చాలా మందికి ఈ అక్రమ దందా గురించి తెలియదు.
ఒకసారి ఆర్డర్లు స్వీకరించిన తర్వాత అడ్వాన్స్ చెల్లింపులను క్రిప్టో కరెన్సీ రూపంలో స్వీకరిస్తారు. దానిలో 10 నుంచి 15 శాతం కమిషన్ తీసుకున్న అనంతరం మిగిలిన మొత్తాన్ని సరఫరాదారులకు పంపిస్తారు. సరఫరా వ్యవస్థలో మరో 10 శాతం తగ్గించి నిర్దిష్ట దేశాల్లో అక్రమ మాదక ద్రవ్యాలను తుది డెలివరీలు చేసే రీషిప్పర్లకు పంపిస్తారు.
ఈ కార్యకలాపాలను విస్తరించే ఉద్దేశంతో.. తరచూ కొనుగోళ్లు చేసే వారిని రీషిప్పర్లుగా, స్టాకిస్టులుగా మార్చారు. తద్వారా దేశవిదేశాల్లో వారి పరిధి విస్తరించింది. ఇలాంటి ఎంతో మంది స్టాకిస్టులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్సీబీ లాంటి ఏజెన్సీలు గుర్తించాయి. వారిపై చర్యలు తీసుకుంటున్నాయి.
ఆధునిక అక్రమ వ్యాపారంలో పెరుగుతున్న డిజిటల్ వేదికలు, క్రిప్టో కరెన్సీ, అంతర్జాతీయ రవాణా వ్యవస్థల భాగస్వామ్యాన్ని ఈ సంక్షిష్టమైన వ్యవస్థ తెలియజేస్తోంది. అలాగే ఇలాంటి అక్రమ వ్యాపారాలను అరికట్టడంలో అంతర్జాతీయ సహకారం, ఇంటిలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవాల్సిన ప్రాధాన్యతను కూడా వివరిస్తోంది.
కొనసాగుతున్న ఆర్థిక, సైబర్ దర్యాప్తులు
ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. క్రిప్టో వ్యాలెట్లు, హవాలా మార్గాలతో కూడిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది. నియంత్రిత ఔషధాల అమ్మకాలపై బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్న అక్రమ ఆన్లైన్ ఫార్మసీల విస్తరణను అరికట్టడానికి ప్రైవేటు రంగంలోని వ్యవస్థలతో కూడా ఎన్సీబీ సంప్రదింపులు నిర్వహిస్తోంది.
***
(Release ID: 2141786)