హోం మంత్రిత్వ శాఖ
తెలంగాణలోని నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలోని లక్షలాది మంది పసుపు రైతుల 40 ఏళ్ల డిమాండ్ నెరవేర్చిన ప్రధానమంత్రి
పసుపు ఎగుమతిని ప్రోత్సహించడానికి నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ (ఎన్సిఇఎల్), నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్ (ఎన్సిఒఎల్) ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి మోదీ
జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో వచ్చే 3-4 ఏళ్లలో నిజామాబాద్ నుంచి ప్రంచంలోని చాలా దేశాలకు ఎగుమతి కానున్న పసుపు
ఇకపై దళారుల ప్రభావం నుంచి పసుపు రైతులకు విముక్తి: ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, పసుపు ఎగుమతి కోసం పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపు బోర్డు
2030 నాటికి పసుపు ఎగుమతుల్లో బిలియన్ డాలర్ లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న మోదీ ప్రభుత్వం: తదనుగుణంగా కొనసాగుతున్న ఏర్పాట్లు
ఈ ఏడాది పసుపు క్వింటాలు రూ.18,000 నుంచి రూ.19,000 వచ్చింది: వచ్చే మూడు ఏళ్లలో క్వింటాలుకు అదనంగా మరో రూ.6,000 నుంచి రూ.7,000 అందించే దిశగా ప్రయత్నాలు
పసుపులో యాంటివైరల్, యాంటీక్యాన్సర్, కణజాల వాపును తగ్గించే గుణాలు ఉంటాయి: ఔషధ గుణాల కారణంగా గొప్ప ఔషధంగా ప్రసిద్ధి చెందిన పసుపు
Posted On:
29 JUN 2025 7:09PM by PIB Hyderabad
కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు తెలంగాణలోని నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణాలోని లక్షలాది మంది పసుపు రైతులు 40 ఏళ్లుగా చేస్తున్న డిమాండ్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెరవేర్చారని అన్నారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ, నిజామాబాద్ పసుపు రైతులకు ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు నెరవేరుతోందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ అనేక దశాబ్దాలుగా పసుపు రాజధానిగా ప్రసిద్ధి గాంచిందని, ఇక్కడి రైతులు శతాబ్దాలుగా పసుపును పండిస్తున్నారని తెలిపారు. అయితే దానికి ప్రపంచ స్థాయిలో మార్కెట్ లభించడం లేదని ఆయన తెలిపారు. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో 3-4 ఏళ్లలో ప్రపంచంలోని చాలా దేశాలకు నిజామాబాద్ నుంచి పసుపు చేరుకుంటుందని శ్రీ షా అన్నారు.
జాతీయ పసుపు బోర్డు అధికారికంగా పనిచేయడం ప్రారంభించిన తర్వాత, పసుపు రైతులకు దళారుల ప్రభావం నుంచి విముక్తి లభిస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. పసుపు ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతి కోసం జాతీయ పసుపు బోర్డు పూర్తి స్థాయిలో వ్యవస్థను సిద్ధం చేస్తుందని ఆయన తెలిపారు. పసుపు వైరస్ ను, క్యాన్సర్లను నిరోధిస్తుందనీ, అంతర్గత కణజాల వాపును తగ్గిస్తుందని పేర్కొన్నారు. దాని ఔషధ గుణాల కారణంగా, ఇది ఒక గొప్ప ఔషధంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిందని ఆయన అన్నారు. పసుపు ఒక అద్భుత ఔషధమని, దీనిని తక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మానవ శరీరం నుంచి అనేక వ్యాధులు తొలగిపోతాయని శ్రీ షా అన్నారు. ఇప్పుడు జీఐ ట్యాగ్ పొందిన సేంద్రీయ పసుపు ఉత్పత్తి, మార్కెటింగ్ కూడా ప్రారంభమైందని ఆయన తెలిపారు.

ఒక బిలియన్ డాలర్ల విలువ కలిగిన పసుపును 2030 కల్లా ఎగుమతి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొందని, దీనికి తగినన్ని సన్నాహక చర్యలను ఇప్పటికే తీసుకొన్నారని కేంద్ర హోం మంత్రి తెలిపారు. పసుపు రైతులకు గరిష్ఠ ధర అందేటట్లు తగిన చర్యలు తీసుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లలో పసుపు వినియోగం మరింత పెరిగేటట్లు చూడడం, భారత పసుపునకున్న ఔషధ గుణాలను సరికొత్త అవకాశాలు లభిస్తాయని అంచనా ఉన్న మార్కెట్లలో ప్రచారం చేయడం.. ఈ దిశగా జాతీయ పసుపు మండలి (ఎన్టీబీ) కృషిచేయనుందని ఆయన అన్నారు. మన దేశ పసుపు నాణ్య ప్రమాణాలు, సురక్ష ప్రమాణాలు ప్రపంచ గీటురాళ్లకు తుల తూగేటట్లు కూడా ఈ మండలి పాటుపడుతుందని, ప్యాకేజింగు సరి అయిన విధంగా ఉండేలా, ఎగుమతులకు సంబంధించిన ఎలాంటి అడ్డంకులూ ఎదురు కాకుండా పసుపు పంటను ఎలా పండించాలో రైతులకు శిక్షణనివ్వడంతో పాటు వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్దడానికి శ్రద్ధ తీసుకొంటుందన్నారు. పసుపు వాడకం వల్ల మనిషి ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు కలిగేదీ ప్రపంచానికి చాటిచెప్పడానికి ఈ విషయంపై పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కొనసాగిస్తారని శ్రీ షా చెప్పారు.

మన దేశంలో పసుపును పండిస్తున్న అగ్రగామి జిల్లాల్లో తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్లు కూడా ఉన్నాయని శ్రీ అమిత్ షా తెలిపారు. 2025లో పసుపు రైతులు ఒక్కో క్వింటాలుకు రూ.18,000 నుంచి రూ.19,000 వరకు ధర అందుకొన్నారని ఆయన చెబుతూ, రాబోయే మూడు సంవత్సరాల్లో వారు ఒక్కో క్వింటాలకు రూ.6,000-7,000 అదనంగా అందుకొనే దిశగా చర్యలు తీసుకొంటామన్నారు. 2023-24లో పసుపును భారత్లో 3 లక్షల హెక్టార్లలో సాగు చేశారని, దీంతో 10.74 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందని వివరించారు. ఎగుమతులు చేసే రైతులకు ప్రయోజనం కలిగేలా నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ను, సేంద్రియ వ్యవసాయ పద్ధతిని పాటిస్తున్న వ్యవసాయదారుల కోసం నేషనల్ కోపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏర్పాటు చేశారని మంత్రి గుర్తుచేశారు. ప్రధానమంత్రి శ్రీ మోదీ తాను చేసిన వాగ్దానాలను తన పదవీ కాలంలో నెరవేర్చే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని, 2023లో ఇచ్చిన వాగ్దానాన్ని ఈ రోజు నెరవేర్చారని శ్రీ షా ఉద్ఘాటించారు.
***
(Release ID: 2140675)