సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
డిజిటల్ హంగు సమకూర్చుకున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సత్వర నియామకాల కోసం ఇ-డాసియర్లు.. సమాచార భద్రత కూడా పటిష్ఠం
Posted On:
26 JUN 2025 3:30PM by PIB Hyderabad
మంత్రిత్వ శాఖలకు, విభాగాలకు ఎంపికైన అభ్యర్థుల డాక్యుమెంట్లను పంపడానికి కాగితాల రూపంలోని వివరణాత్మక ఫైళ్లకు బదులు ఎలక్ట్రానిక్ డాసియర్లను (ఇ-డాసియర్లు) ఉపయోగించే దిశగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ముందడుగు వేసింది. ఇది ‘డిజిటల్ ఇండియా’ దార్శనికతకు అనుగుణంగా కూడా ఉంది. మంత్రిత్వ శాఖలకు, విభాగాలకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు వివరణాత్మక ఫైళ్లను అందించే ప్రక్రియను ఎస్ఎస్సీ ‘ఇ-డాసియర్’ పోర్టల్ను ఉపయోగించుకొంటూ, పూర్తిగా డిజిటలీకరించింది. వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అభ్యర్థుల వివరణాత్మక ఫైళ్లను ఎస్ఎస్సీ ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా సంకలనపరుస్తోంది. వాటిని ఉద్యోగ నియామకానికి ముందస్తుగా ఉండే కొన్ని లాంఛనాలను వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల నోడల్ అధికారులు మొదలుపెట్టడానికి వీలుగా, వారు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇ-డాసియర్ పోర్టల్లో అందుబాటులో ఉంచుతోంది. కాగితం రూపేణా ఉండే ఫైళ్ల పద్ధతి నుంచి ఇ-డాసియర్ల పద్ధతికి మారడంలో ఈ కింద ప్రస్తావించిన ప్రయోజనాలు ఉన్నాయి:
1. సమాచార సమగ్రత పెరిగింది: నోడల్ అధికారులకు ఇచ్చిన లాగిన్ వివరాలతో మాత్రమే ఇ-డాసియర్లను పరిశీలించడానికి వీలుంది. ఈ పద్ధతిలో అనధికార మార్పుచేర్పుల బెడద తగ్గిపోయింది. దీంతో సమాచార సమగ్రత మరింత పెరిగింది. కాగిత రూపంలో ఉండే డాసియర్లను కోరుకొనే విధంగా మార్పుచేర్పులకు లోను చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు ఇ-డాసియర్లది డిజిటల్ స్వరూపం కాబట్టి, వీటి విషయంలో ఆ తరహా అవకాశాల ప్రసక్తే తలెత్తదు.
2. ఉన్నత స్థాయి భద్రత, నియంత్రణ: ఇ-డాసియర్ మాడ్యూల్ అందుబాటు లాగ్ ప్రక్రియ వల్ల సురక్షితంగా మారింది. ఇది ప్రామాణికత్వానికి, పోయిన ఫైళ్లను తిరిగి పొందడానికి ఇదివరకటి కంటే ఎక్కువ సౌలభ్యానికి మార్గాన్ని సుగమం చేసింది.
3. వేగవంతమైన మరింత సమర్థమైన కమ్యూనికేషన్: డాక్యుమెంట్లను చాలా తక్కువ సమయంలో పంపడానికి, ఉద్యోగ భర్తీ ప్రక్రియను సువ్యవస్థితంగా తీర్చిదిద్దడానికి ఇ-డాసియర్లు తోడ్పడతాయి.
4. తక్కువ ఖర్చుతో పాటు పర్యావరణ స్థిరత్వం: కాగితాలతో పనిచేయాల్సిన అవసరం లేకపోవడంతో ఖర్చులు తగ్గుతాయి. అంతేకాక, పర్యావరణానికీ హాని కలగదు.
ఇ-డాసియర్ వ్యవస్థను ఎస్ఎస్సీ తన ప్రధాన ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయవంతంగా అమలు చేసింది. ఈ సంస్థ గత సంవత్సరంలో నిర్వహించిన జూనియర్ ఇంజినీర్ పరీక్ష, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ స్థాయి పరీక్ష, మల్టి-టాస్కింగ్ స్టాఫ్ పరీక్షలతో పాటు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష వంటి ప్రధాన పరీక్షలకు ఈ పద్ధతిని అనుసరించింది. ఎస్ఎస్సీ అమలుచేస్తున్న ఈ కార్యక్రమం మంత్రిత్వ శాఖలు, విభాగాలకు, ఎస్ఎస్సీకి మధ్య సత్వర, సమర్థ కమ్యూనికేషన్కు మాత్రమే కాకుండా, ఉద్యోగ భర్తీ ప్రక్రియల్లో సమగ్రతను పరిరక్షించడానికి, దానిని బలోపేతం చేయడానికి కూడా తోడ్పడుతుంది. అంతేకాక, నియామకానికి సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయడానికి పడుతున్న కాలాన్ని చాలావరకు తగ్గించి, లక్షల మంది యువతీయువకులకు ప్రయోజనాన్ని అందించనుంది.
***
(Release ID: 2139871)