సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రపంచ స్థాయిలో భారత యానిమీ జైత్ర యాత్రలో అగ్రగామిగా ‘దేశీ ఊన్’
* ఫ్రాన్స్లోని ‘ఎనెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’లో జయపతాకనెగరేసిన ‘వేవ్స్-2025’ విజేత
* ఇతర అంతర్జాతీయ సత్కారాలతో పాటు, ‘కేన్స్ లయన్స్-2025’లో స్టూడియో ఈక్సారస్కు కూడా ఎంపిక
Posted On:
18 JUN 2025 5:28PM by PIB Hyderabad
‘వేవ్స్ - 2025’లో భాగంగా సమాచార, ప్రసార శాఖ ప్రారంభించిన ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’ భారత సృజనాత్మక ప్రతిభావంతులను ప్రపంచ స్థాయిలో గుర్తించడంతో పాటు వారిని ప్రోత్సహించడానికి ఒక మార్పు ప్రధాన వేదికలా మారింది. దీని అసాధారణ విజయ గాథల్లో ప్రసిద్ధ యానిమీ చిత్ర నిర్మాత శ్రీ సురేశ్ ఎరియాత్ రూపొందించిన చిత్రం ‘దేశీ ఊన్’ (ఈ హిందీ మాటలకు స్వదేశీ ఉన్ని అని అర్థం) కూడా ఒకటి. ఈ చిత్రం ఫ్రాన్స్ ‘ఎనెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ - 2025’లో ‘అత్యుత్తమ కమిషన్డ్ ఫిల్మ్కు ఇచ్చే న్యాయనిర్ణేతల పురస్కారా’న్ని గెలుచుకొని, భారతీయ యానిమీకి అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రతిష్ఠలను తీసుకువచ్చింది. యానిమీ రంగంలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక వేదికగా భావించే ఈ అరుదైన, ముఖ్య విజయం భారతీయ యానిమీ రంగానికి ప్రపంచ చిత్రపటంలో స్థానాన్ని ఇచ్చింది.
మన దేశ ఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమీ, వీఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ) అనుబంధ విస్తారిత వ్యవస్థను పెంచి పోషించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమమే ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’. ఇది 32 క్యూరేటెడ్ ఛాలెంజుల్లో 60కి పైగా దేశాల ఎంట్రీలను అందుకొంది. ఇవి భారతీయ సంస్కృతిలో వేళ్లూనుకున్న కథలను ఆధునిక సాంకేతికత దన్నుతో వినూత్నంగా ఆవిష్కరించే తీరుతెన్నులను వెలుగులోకి తెచ్చాయి. తుది పోటీకి ఎంపికైన 750 కన్నా ఎక్కువ ఎంట్రీలను ఈ ఏడాది మే 1 నుంచి 4 తేదీల మధ్య ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ‘వేవ్స్ - 2025’లో ఎంతో శ్రద్ధతో ఎంపిక చేసిన వేదికైన ‘క్రియేటోస్ఫియర్’లో ప్రదర్శించారు.
‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా భారత్లోని అగ్రగామి యానమీ, డిజైన్ గుర్తింపు కలిగిన వేదికైన ‘వేవ్స్ అవార్డ్స్ ఆఫ్ ఎక్స్లెన్స్-2025’లో అత్యుత్తమ చిత్రం పురస్కారాన్ని ‘దేశీ ఊన్’కు ఇటీవలే ప్రకటించారు. ఎనెసీ సత్కారానికి అదనంగా, ఈ చిత్రాన్ని ‘కేన్స్ లయన్స్-2025’లో కూడా ‘ఫిల్మ్ క్రాఫ్ట్ లయన్స్-2025’ కేటగిరీలో ఎంపిక చేశారు. దీంతో ఇది భారత్ యానిమీ పరిశ్రమకు లభించిన ఒక ప్రధాన గెలుపుగా తళుకులీనింది.
కథను చెప్పడంలో శ్రీ సురేశ్ ఎరియాత్కు ఉన్న ప్రతిభతో పాటు స్టూడియో ఈక్సారస్ పనితనం కూడా అనేక అంతర్జాతీయ పురస్కారాలను గెలుచుకొన్నాయి. వాటిలో కొన్ని...:
ఏఐసీపీ షో విన్నర్ - 2025: ఈ చిత్రాన్ని న్యూయార్క్లోని మ్యూజియం ఆఫ్ మాడర్న్ ఆర్ట్ (ఎంఓఎంఏ)లో సురక్షితంగా ఉంచుతారు. ఈ గౌరవం అమిత ప్రభావాన్ని ప్రసరించే ప్రపంచ స్థాయి కళారూపాలకే దక్కుతుంటుంది.
‘గుడ్ యాడ్స్ మ్యాటర్- 2025’లో 2 బంగారు పతకాలు: అత్యుత్తమ యానిమీ చిత్రంతో పాటు అత్యుత్తమ యానిమీ + సీజీఐ సంధానానికిచ్చే గౌరవాన్ని కూడా ఈ చిత్రం పొందింది.
‘బ్లూ ఎలీఫెంట్స్’ రెండింటితో పాటు ఒక ‘బేబీ బ్లాక్ ఎలీఫెంట్’: ప్రతిష్ఠాత్మక ‘క్యూరియస్ క్రియేటివ్ అవార్డుల్లో డీ అండ్ ఏడీ వుడెన్ పెన్సిల్’ విజేత.. ప్రపంచ ప్రకటనల కూర్పులో శ్రేష్ఠత్వానికి గుర్తింపుగా ఈ సత్కారాన్ని అందజేశారు.
‘దేశీ ఊన్’ ఒక చిత్రం మాత్రమే కాదు... అంతకు మించి...ఇది ఒక సాంస్కృతిక విజయం. భారతీయ నాగరికతలో లోతుగా వేళ్లూనుకోవడంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయే యానిమీ మాధ్యమం ద్వారా రూపురేఖలను దిద్దుకొన్న ఈ చిత్రం స్వదేశీ గాథలను మౌలికత, సాంకేతిక సూక్ష్మాలతో రంగరించి చెప్పవచ్చో, ఇదే జరిగితే అన్ని ఖండాల ప్రేక్షకుల మనసులనూ ఎలా గెలుచుకోవచ్చో అనే అంశాలకు ఒక నిదర్శనంగా నిలుస్తోంది.
‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్-2025’ను పర్యవేక్షిస్తున్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారి శ్రీ అనుభవ్ సింగ్ మాట్లాడుతూ, ‘‘ఏవీసీజీ-ఎక్స్ఆర్ రంగాన్ని తీర్చిదిద్దాలన్న నిబద్ధత భారత ప్రభుత్వానికి ఉంది. ‘వేవ్స్’ లాంటి వేదికలతో, ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’ లాంటి కార్యక్రమాలతో సృజనాత్మక శ్రేష్ఠత్వాన్ని జాగృతం చేయాలన్నదే మా లక్ష్యం. ఇది కంటెంటును సృజించడంలో ప్రపంచంలో ఓ మహాశక్తిగా భారత్ను నిలబెట్టాలన్న మా దృష్టికోణానికి అనుగుణంగా కూడా ఉంది’’ అన్నారు.
ఆసిఫా ఇండియా అధ్యక్షుడు శ్రీ సంజయ్ ఖిమేసరా మాట్లాడుతూ, ‘‘ ఈ విజయం సురేశ్ ఎరియాత్ది ఒక్కరిదే కాదు, ఇది భారత్ సాధించిన గెలుపు. ‘దేశీ ఊన్’ తన యాత్ర ప్రతి మజిలీలోనూ భారత్ ఆత్మకు అద్దం పడుతోంది. దీనిలో హాస్యం, భావోద్వేగం, కళాత్మకత పెనవేసుకొన్నాయి. ఇది కొత్త తరం భారతీయ సృజనకారులు భారీ ప్రణాళికల్ని ఆలోచించేలా, తమ మూలాలకు అంటిపెట్టుకొని ఉండేలా చేయడంతో పాటు వారు ప్రపంచ స్థాయి లక్ష్యాలను సాధించేలా వారికి ప్రేరణనిస్తుంది’’ అన్నారు.
‘వేవ్స్ శ్రేష్ఠత్వ పురస్కారాల’ గురించి:
‘వేవ్స్’ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏఎస్ఐఎఫ్ఏ (‘ఆసిఫా’) ఇండియా సహకారంతో నిర్వహిస్తోంది. యానిమీ, వీఎఫ్ఎక్స్, డిజైన్లతో పాటు సరికొత్తగా ఉనికిలోకి వస్తున్న ప్రసార మాధ్యమాల రంగాల్లో ఉత్తమ పనితీరును ‘వేవ్స్’ సన్మానిస్తుంది. అంతేకాకుండా, భారత్లో సృజనాత్మక రంగంలోని వైవిధ్యాన్ని, సామర్థ్యాన్ని పదుగురూ తెలుసుకొనేటట్లు ఉత్సవంలా నిర్వహిస్తుంది.
‘ఆసిఫా ఇండియా’ గురించి:
యునెస్కో మద్దతును పొందుతున్న ప్రపంచ స్థాయి సంస్థ ఆసిఫా ఇంటర్నేషనల్కు చెందిన భారత్ చాప్టర్ ‘ఆసిఫా ఇండియా’. ఇది యానిమీ కళకు అంకితం అయింది. ఉత్సవాలు, చర్చలు, మార్గదర్శకత్వం, పురస్కారాల ప్రదానం.. ఈ మార్గాల్లో సృజనాత్మక మార్పిడిని, సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తూ గుర్తింపును ఇనుమడింపచేస్తుంది.
***
(Release ID: 2138940)